2005 మహారాష్ట్ర వరదలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరద సమయంలో పొవాయ్ చెరువు

2005 లో మహారాష్ట్రలో సంభవించిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. భారత పశ్చిమ తీరాన అరేబియన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ముంబై నగరం,, ఇతర ప్రాంతాలు జలమయ్యాయి. దాదాపు 1,094 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. జూన్ 2005 లో గుజరాత్లో సంభవించిన రెండు నెలలకే ఇక్కడ కూడా వరదలు రావడం గమనార్హం. ఇప్పటికీ చాలామందికి జులై 26 అనగానే ముంబై నగరం జల దిగ్భందంలో చిక్కుకున్న రోజే గుర్తుకు వస్తుంది.

చాలామంది ప్రజలు రోడ్లలోనే చిక్కుకు పోయారు. పలువురు తమ ఇళ్ళు కోల్పోయారు. కార్యాలయాల్లో పనిచేసే చాలామంది చాలాదూరం నడుచుకుంటూనే తమ ఇళ్ళు చేరుకున్నారు. 2005 జూలై 26 న ఒక్క రోజులోనే 944 మి.మీ (37.17 అంగుళాలు) వర్షపాతం నమోదయింది. ఒక్క రోజులనే నమోదయిన వర్షపాతాలలో ఇది ఎనిమిదో అత్యధికం. కేవలం ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 గంటల వ్యవధిలో 644మి.మీ (25.35 అంగుళాలు) వర్షం పడింది. ఇదే వర్షం మరుసటి వారం కూడా కొనసాగింది.

భారతదేశంలో ఒక్కరోజులో అత్యధిక వర్షపాతం 2004 మే 6 న లక్షద్వీప్ లోని అమినిదీవిలో 1,168 మిమీ (46.0 అంగుళాలు) గా నమోదయ్యింది. ముంబైలో అంతకుముందు ఒక్క రోజులో 1974 లో నమోదయిన అత్యధిక వర్షపాతం 575 మి.మీ (22.6 అంగుళాలు).

ఈ వర్షాల వల్ల ప్రభావితమైన మరికొన్ని ప్రాంతాలు మహారాష్ట్రలోనే రాయగఢ్, చిప్లున్, కల్యాణ్, ఖేడ్, రత్నగిరి,, గోవా రాష్ట్రం కూడా. జూలై 28 - 30 మధ్యలో వర్షం కొద్దిగా మందగించింది కానీ మళ్ళీ 31 కి తీవ్రత పెరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం జూలై 27, 28 తేదీలను ప్రభావిత ప్రాంతాలలో సెలవు దినంగా ప్రకటించింది. ఆగస్టు 1, 2 తేదీల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు. ముంబై పోలీసు కమీషనరు అనామి నారాయణ రాయ్ జూలై 31న వర్షం ఎక్కువవడంతో ప్రజలను ఇళ్ళలోనే ఉండమని విజ్ఞప్తి చేసాడు. విమానాలు కూడా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.