స్పిరిటెడ్ అవే (జపనీస్ సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్పిరిటెడ్ అవే
జపనీస్ ఫిల్మ్ పోస్టర్
దర్శకత్వంహయావో మియాజాకి
రచనహయాయో మియజాకి
నిర్మాతతొషియో సుజుకి
తారాగణంరూమి హిరాగి మియు ఇరినో మారి నత్సుకు
ఛాయాగ్రహణంఅత్సుషి ఒకుయి
కూర్పుతకెషి షేయమా
సంగీతంజో ఇసైహి
నిర్మాణ
సంస్థ
స్టూడియో గిబ్లి
పంపిణీదార్లుజపాన్ (తొహొ) అమెరికా (వాల్ట్ డిస్ని)
విడుదల తేదీ
జూలై20, 2001
సినిమా నిడివి
124 నిమిషాలు.
దేశాలుజపాన్, అమెరికా.
భాషలుజపనీస్, ఇంగ్లీష్
బడ్జెట్¥1.9 billion (US$19 million)
బాక్సాఫీసు¥22,391,683,900 (US$274,925,095)

స్పిరిటెడ్ అవే (జపనీస్: 千と千尋の神隠し) 2001లో వచ్చిన ఈ జపనీస్ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు హయావో మియాజాకి దర్శకత్వం వహించారు. ఈ చిత కథ చిహిరో అనే పదేళ్ళ బాలిక తన తల్లిదండ్రులతో కొత్తఇంటికి వెళ్ళే దారిలో అనుకోకుండా ఆత్మలు, రాక్షసులు ఉండే లోకంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ పంది రూపంలోకి మారిపోయిన తన తల్లిదండ్రులను రక్షించి తానూ ఎలా బయట పడిందనేదే కథాంశం.

ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఎన్నో పురస్కారాలు గెలుచుకుంది. ఆస్కార్ ఉత్తమ యానిమేషన్ చిత్ర విభాగంలో గెలుపొందిన మొదటి జపనీస్ చిత్రంగా కీర్తికెక్కింది. జపాన్లో అప్పటివరకూ అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రం టైటానిక్‌ని అధిగమించి అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.

కథ[మార్చు]

10 ఏళ్ళ వయసున్న చిహిరో తన తల్లిదండ్రులతో కలిసి తమ కొత్తింటికి కారులో బయలుదేరుతుంది. మధ్యలో ఒక అడ్డదారి కనిపించగా వాళ్ళ నాన్న కారును అటువైపు పోనిస్తాడు. అక్కడ ఒక సొరంగం కనిపిస్తుంది. దాన్ని దాటగానే ఒక ఎండిపోయిన నది, దానికి ఆవల జనావాసం లేని ఊరులా కనిపించే పాడుబడ్డ ఒక ఉద్యానవనం వుంటుంది. అందులో ఏముందో అనే ఉత్సాహం వాళ్ళ నాన్నకు కలుగుతుంది. చిహిరో తల్లిదండ్రులిద్దరినీ లోనికి వెళ్ళవద్దని వారిస్తుంది. వారిద్దరూ లోపలికి వెళ్ళగా తనుకూడా లోపలికి వెళ్తుంది. అక్కడేదో ఘుమఘుమలాడే సువాసన రావడంతో తల్లిదండ్రులిద్దరూ అటువైపు వెళ్తారు. అక్కడి భోజనశాలలో అరుదైన వంటకాలు కనబడతాయి. అక్కడెవరూ కనిపించకపోయేసరికి వాటిని తింటుంటారు. చిహిరోని కూడా తినమని వాళ్ళ అమ్మ చెప్పగా తనకు ఆకలిలేదనీ ఇంకొంచంసేపుంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తుందనీ వారిద్దరినీ వారిస్తుంది. వారిద్దరూ తింటుండగా ఆ ప్రాంతాన్ని చూడ్డానికి వెళ్తుంది. అక్కడ “హాకు” అనే పేరుగల ఒక బాలుడు కనిపిస్తాడు. హాకు కు ఇంతకుముందే చిహిరోను కలిసినట్టు అనిపిస్తుంది. అతను చిహిరోతో తన తల్లిదండ్రులను తీసుకుని త్వరగా వెళ్ళిపోమని లేకపోతే ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని చెబుతాడు. చిహిరో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళగా వారు పంది రూపంలోకి మారిపోయి ఉంటారు. భయానికి లోనైన చిహిరో అక్కడినుండి పారిపోదామనుకుంటుంది. తిరిగి వెళ్ళిపోతుండగా మధ్యదారిలో ఒక నది కనబడుతుంది. అప్పుడు ఆత్మలు ప్రత్యక్షమవుతాయి. ఆ ఆత్మలన్నీ ఆ ఉద్యానవనం లోకి ప్రవేశిస్తుంటాయి. హాకు అక్కడికి వచ్చి చిహిరోను ఆత్మలకు కనబడకుండా అక్కడుండే స్నానపు గదిలోకి తీసుకువెళతాడు. చిహీరోతో అక్కడ స్నానానికి వేడి నళ్ళను కాచే వ్యక్తి “కమాజి” దగ్గర పని సంపాదించమని, కొంతవ్యవధి తరువాత తననూ తన తల్లిదండ్రులనూ అక్కడినుండి బయటకు వెళ్ళడానికి తాను సహాయం చేస్తానని తనతో చెప్తాడు.

చిహిరో స్నానానికి నీళ్ళను కాచే వ్యక్తి కమాజి (ఆరుచేతులతో సాలెపురుగులా వుంటాడు) వద్దకు వెళ్ళి ఏదైనా పనివ్వమని కోరుతుంది. అతను తన సహాయకురాలు లిన్ తో ఆమెను “యుబాబా” (వయసుమీద పడ్డ మంత్రగత్తె, ఆ స్నానశాల యజమాని) దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. యుబాబా చిహిరో కి పని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. చిహిరో పేరును ఆమె దొంగిలించి, ఆమె పేరును సెన్ గా మారుస్తుంది. ఎందుకంటే తనవద్ద పని చేస్తున్న వ్యక్తులు వారి అసలు పేరు తెలుసుకోనంత కాలం వారి అసలు జీవితాన్ని వారు జీవించలేరు. చిహిరోను లిన్ వద్ద సహాయకురాలిగా నియమిస్తుంది. అక్కడికి వచ్చే ఆత్మలకు సాన్నం చేయటంలో వీరిద్దరూ సహాయం చేస్తారు. ఒకసారి అక్కడ ఎంతో దుర్వాసనతో కూడిన ఆత్మ వస్తుంది. (అది ఒక నది యొక్క ఆత్మ. నీటి కాలుష్యం ద్వారా ఆ స్థితికి చేరుకుంటుంది.) యుబాబా ఆ ఆత్మకు స్నానం చేయడానికి సహకరించమని చిహిరోకు చెబుతుంది. చిహిరో సహకారంతో స్నానం చేసిన ఆ ఆత్మ చిహిరోకు ఒక ఔషధాన్ని బహుకరిస్తుంది. హాకు అప్పుడప్పుడు డ్రాగన్ రూపంలోకి మారిపోతుంటాడని ఒకసారి చిహిరో గమనిస్తుంది. ఒక సారి డ్రాగన్‌ని షికిగామి రూపంలో వున్న కాగితంతో తయారు చేసిన పక్షులు దాడి చేస్తాయి వాటిని జెనీబా, (యుబాబా చెల్లెలు. ఇద్దరూ కవలులు) పంపిస్తుంది. హాకు యుబాబా ఆదేశాల మీద జెనీబా దగ్గరున్న ఓ విలువైన వస్తువును దొంగిలిస్తాడు. డ్రాగన్ రూపం లో వున్న హాకు దానిని మింగడం వలన అతని నోట్లో తీవ్రంగా రక్తస్రావం జరుగుతుంది. చిహిరో హాకుకు నది ఆత్మ తనకు ఇచ్చిన ఔషధాన్ని తినిపిస్తుంది. అప్పుడు హాకు ఆ సీలును బయటకు కక్కేస్తాడు. ఆ సీలుతో పాటు వున్న ఒక పురుగు వంటి ప్రాణిని చిహిరో కాలితో నలిపేస్తుంది. చిహిరో జెనీబా వద్దకు వెళ్ళి ఆ సీలును తిరిగి ఇచ్చి హాకును క్షమించమనీ అడగటానికి బయలుదేరుతుంది. బయలుదేరేముందు ఒక సారి స్నానపు గదిలో తీవ్ర అలజడి సృష్టిస్తున్న ముఖములేని ఆత్మ వద్దకు వెళ్ళి అతడిని బయటకు తీసుకువెళ్తుంది. ఆ ఆత్మ స్నానపుగదిని మొత్తం వాంతులు చేసుకుంటూ అపరిశుభ్రం చేస్తుంది. యుబాబా ఆ ఆత్మను అక్కడికి ఆహ్వానించినందుకు చిహిరోతో పందుల రూపం లోకి మారిపోయిన తన తల్లిదండ్రులను చంపి ఆహారంగా చేస్తామని చెబుతుంది.

చిహిరో ముఖములేని ఆత్మతో కలిసి జెనీబాను కలవడానికి రైలులో ప్రయాణమవుతుంది. కనబడకుండాపోయిన తన కొడుకు తన సేవకురాలిని జెనీబా రూపం మార్చివేసిందని హాకు ద్వారా యుబాబా తెలుసుకుంటుంది. వారిని మాములు రూపం లోకి మార్చి తనకప్పగిస్తానని అందుకు ప్రతిఫలంగా చిహిరోను, ఆమె తల్లిదండ్రులను విడుదల చెయమని కోరతాడు. చిహిరో జెనీబా వద్దకు వెళ్ళగా చిహిరోను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. చిహిరో హాకూ ప్రాణాలు కాపాడటానికి పడిన శ్రమను చూసి తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. యుబాబా హాకును తన ఆధీనం లో ఉంచుకోవడానికి పురుగు వంటి ప్రాణిని డ్రాగన్ లోపల ఉంచుతుందని చిహిరోకు జెనీబా చెబుతుంది. కొద్దిసేపటి తరువాత ఎంతో ఆరోగ్యవంతంగా వున్న హాకు (డ్రాగన్) అక్కడికి వస్తుంది. చిహిరో హాకూతో కలిసి బయలుదేరుతుంది. ముఖములేని ఆత్మను తన వద్ద ఉండమని జెనీబా కోరగా ఆ ఆత్మ అందుకు అంగీకరిస్తుంది. తిరుగు ప్రయాణంలో చిహిరో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటుంది. తన చిన్నతనంలో ఒకసారి నదిలో పడికొట్టుకు పోతుండగా ఒక అలద్వారా తను కాపాడబడినట్టు హాకుతో చెబుతుంది. ఆ నది పేర్ కొహాకు నది అని, హాకు అసలు పేరు కోహాకు అని చిహిరో వివరిస్తుండగా డ్రాగన్ రూపంలో వున్న హాకు పూర్తిగా మాములు మనిషిగా మారిపోతాడు. తన అసలు పేరు నిహియమాని కోహాకు నది అని, కాలుష్యం వల్ల నది పూర్తిగా అంతరించిందని, అటువంటి పరిస్థితులలో ఇక్కడికి వచ్చానని యుబాబా వద్ద మంత్రవిద్య నేర్చుకునేందుకు తన పేరును దొంగిలించిందని, ఇప్పుడు తను కూడా యుబాబా నుండి స్వాతంత్ర్యం పొందినట్లు చెబుతాడు. ఇద్దరూ కలిసి స్నానపు శాల వద్దకు వెళ్ళగా అక్కడ యుబాబా చిహిరోను తన తల్లిదండ్రులను విడుదల చేయడానికి ఒక చివరి పరీక్ష ఉందని ఇందులో నెగ్గితే తమను విడుదల చేస్తామని జెనీబా చెబుతుంది. అందుకు చిహిరో ఒప్పుకుంటుంది. అక్కడవున్న పందుల గుంపులో తమ తల్లిదండ్రులను గుర్తుపట్టమని చెబుతుంది. పందులను పరిశీలించిన చిహిరో అందులో తన తల్లిదండ్రులు లేరని చెబుతుంది. ఆ పరీక్షలో నెగ్గినందుకు చిహిరోను తల్లిదండ్రులను విడుదల చేస్తూ ఒప్పంద పత్రాన్ని చింపేస్తుంది. చిహిరోను హాకు అక్కడినుండి బయటకు తీసుకువెళ్తాడు. చిహిరో హాకూను తమతోపాటే రమ్మని కోరుతుంది. తను తరువాత వస్తానని ఏదోఒక రోజు మనమిద్దరం కలుసుకుంటామని చెబుతాడు. కొద్దిదూరం వెళ్ళిన తరువాత మనుషులుగా మారిపోయిన తన తల్లిదండ్రులు కనిపిస్తారు. వారికి ఏదీ జ్ఞాపకం వుండదు. ముగ్గురూ కలిసి తమ కారువద్దకు వెళ్ళడంతో కథ ముగుస్తుంది.

బాహ్య లింకులు[మార్చు]