మర్రీ బీ. ఎమెనో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Murray Barnson Emeneau/ మర్రి ఎమినో
Murray Emeneau / మర్రి ఎమినో
జననం(1904-02-28)1904 ఫిబ్రవరి 28
Lunenburg, Nova Scotia
మరణం2005 ఆగస్టు 29(2005-08-29) (వయసు 101)
Berkeley, CA, United States బెర్లెలీ సి.ఎ. అమెరికా
పౌరసత్వంUnited States American అమెరికా
రంగములుLinguistics, Dravidian studies, Sanskrit studies, Indology
వృత్తిసంస్థలుYale University
University of California, Berkeleyయేల్ యూనివెర్సిటి/ యూనివెర్సిటి ఆఫ్ కొలంబియా
చదువుకున్న సంస్థలుYale University, Dalhousie Universityడెల్హౌసి యూనివర్సిటి/ యేల్ యూనివెర్సిటి
పరిశోధనా సలహాదారుడు(లు)Franklin Edgerton
డాక్టొరల్ విద్యార్థులుWilliam Bright, Ram Karan Sharma, Bh. Krishnamurti/ రాం కరణ్ శర్మ/భద్రిరాజు కృష్ణమూర్తి
ప్రసిద్ధిDravidian linguistics, linguistic areas దక్షిణ భారత దేశం లోని మౌఖిక భాషలపై పరిశోధన.

ఎక్కడో కెనడాలో పుట్టి, ఇంగ్లాండూ అమెరికాలలో చదువుకుని, అమెరికాలో పనిచేస్తూ… భాషా పరిశోధన కోసం భారతదేశం వచ్చి, ఇక్కడి జన జీవన స్రవంతిలో కలిసిపోయి, దక్షిణ భారతీయ భాషలూ, శబ్దాలూ, శబ్ద వ్యుత్పత్తులపై (Linguistics, phonetics and Etymology) పరిశోధన చేసి, వాటిని వెలుగు లోకి తెచ్చిన భాషాభిమాని మర్రీ బి. ఎమెనో. పదవీ విరమణ తర్వాత కూడ అకుంఠిత దీక్షతో భారతీయ భాషాశబ్దశాస్త్ర రహస్యాల్ని అయన తన జీవితాంతం విశ్లేషిస్తూనే ఉన్నారు.[1]

మర్రీ బి. ఎమెనో (Murray Barnson Emeneau) 1904 ఫిబ్రవరి 28 లో, కెనడా దేశపు నోవాస్కోషియా ప్రాంతపు లునెన్బర్గ్‌ అనే ఒక రేవు పట్టణంలో జన్మించారు. వీరి పూర్వీకులు ఫ్రాన్స్‌ నుంచి వలస వచ్చిన రైతు కుటుంబీకులు. వీరి తండ్రి ఒక ఓడకు తాలీముగా పనిచేసేవారు. ఆయన ఓ సముద్ర ప్రమాదంలో ఎమెనో చిన్నబాలుడుగా వుండగానే మరణించారు. తల్లి కుట్టుపని చేస్తూ, చాలా కష్టాలు పడుతూ సంతానాన్ని చదివించింది. ఆ పట్టణ జనాభా అంతా ఫ్రాన్సూ, జర్మనీ దేశాలనుంచి వలస వచ్చిన వారే. అందువల్ల వాళ్ళ వాడుక భాష అయన ఆంగ్లం, ఆపట్టణానికే చెందిన ఒక ప్రత్యేకమైన ఏస తో ఉండేది. ఎమెనోకి బాల్యం నుంచీ భాషా వ్యత్యాసాలలో కుతూహలం రేకెత్తడానికి అది కూడ ఒక కారణమైంది. చిన్నప్పటి నుంచీ ఆయన చదువుల్లో ప్రతిభావంతుడుగా రాణించారు. పుస్తకాలు చదవడమంటే చాల ఇష్టం. ప్రథమశ్రేణిలో ఉన్నత పాఠశాల చదువు పూర్తి కాగానే, భాషలపై ఉన్న మక్కువతో డల్హౌసీ విశ్వవిద్యాలయంలో చదివి లాటిన్‌ గ్రీక్‌ భాషలలో బి.ఏ పట్టా పుచ్చుకున్నారు. అప్పుడాయనకు బంగారు పతకమూ, రోడ్స్‌ స్కాలర్‌షిప్పూ లభించాయి. దాంతో ఇంగ్లాండ్‌ దేశపు ఆక్స్ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువు కొనసాగించారు. తరువాత అమెరికా దేశపు యేల్‌ విశ్వవిద్యాలయంలో లాటిన్‌ భాషోపాధ్యాయుడుగా చేరి, అదేసమయంలో సంస్కృతమూ, ఇండోయూరోపియన్‌ భాషల వ్యాకరణమూ నేర్చుకొన్నారు. తాళపత్ర గ్రంథాల ఆధారంగా సంస్కృత జానపద వాఙ్మయం ‘బేతాళ పంచ వింశతి’ని ఆంగ్లంలో ప్రచురించినందుకు ఆయనకు యేల్‌ విశ్వవిద్యాలయం 1931లో డాక్టరేట్‌ పట్టాను ప్రదానం చేసింది. ఆ తరువాత 1935-38 మధ్యకాలంలో భారతదేశంలో స్వయంగా నివసించి, లిపిలేని (కేవలం మౌఖికమైన) ద్రావిడ భాషలపై పరిశోధనలు చేసారు. అమెరికా లోని బర్కిలీ విశ్వవిద్యాలయంలో 1940 నుండి అధ్యాపకులుగా ఉన్నకాలంలోనూ, పదవీ విరమణ తర్వాత కూడ అకుంఠిత దీక్షతో భారతీయ భాషాశబ్దశాస్త్ర రహస్యాల్ని అయన విశ్లేషిస్తూనే ఉన్నారు.

ప్రచురణలు[మార్చు]

ఎమెనో ప్రచురించిన అసంఖ్యాకమైన వ్యాసాలూ, పుస్తకాలూ, ఆయన విజ్ఞానానికీ, భాషల పుట్టు పూర్వోత్తరాలపై ఆయనకి గల ఆసక్తికీ నిదర్శనాలు. ఆయన ఆక్స్ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో పనిచేసిన కీ.శే. బర్రోతో కలిసి ప్రచురించిన ‘ద్రావిడ భాషావ్యుత్పత్తి విశేష నిఘంటువు (Dravidian Etymological Dictionary,aka. DED)’ తరతరాలకూ నిలిచిపోయే ఉత్తమ గ్రంథం. అనేక భాషలుండి, ఆ భాషలన్నీ స్వతంత్ర ప్రతిపత్తిని కలిగివున్న ప్రదేశాన్ని ‘భాషా ప్రదేశం (Linguistic Area)’ అని శాస్త్రజ్ఞులు పిలుస్తారు. భారతదేశం కూడా అలాంటి ఒక భాషా ప్రదేశం (ఆర్యావర్త, ద్రావిడ, మండా భాషల కుటుంబాల ద్వారా) అని ఆయన కనుక్కోవడం భారతీయ భాషలకు ఒక కొత్త వెలుగు ప్రసాదించింది. అంతేకాక, మనకు తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోతున్న అనేక భారతీయ భాషల్ని కాపాడుకోవాల్సిన తక్షణ కర్తవ్యాన్ని మనకి గుర్తు చేసింది. శ్రీ ఎమెనో ప్రియ శిష్యుడు, ఆంధ్రులు గర్వించదగ్గ భాషాశాస్త్రజ్ఞుడు, శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి మాటల్లో చెప్పాలంటే “ఎమెనో కేవలం ఒక విశిష్ట శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు., ఒక మహామనీషి కూడానూ. ఆయన మంచితనం, ఏమాత్రమూ గర్వం లేని ప్రవర్తన, శాస్త్రీయ పరిశోధనలో ఆయన చూపించే ఏకాగ్రత, శ్రద్ధాసక్తులు ఆయన శిష్యులందర్నీ ఎంతగానో ప్రభావితంచేశాయి. ఆయన శిష్యులందరికీ ఆయన ఒక గొప్ప స్ఫూర్తీ, మార్గదర్శీ”నూ.

భారత్ పర్యటన[మార్చు]

ఎమెనో యేల్‌ లోనే ఉంటూ, అక్కడి భాషాశాస్త్ర విభాగంలో తన గురువుల దగ్గిర సహాయకుడిగా పని చేస్తూండేవాడు. అప్పుడే, సంస్కృతంలోనూ, ఆశు పద్య రీతుల్లోనూ అతనికి మంచి శిక్షణ లభించింది. ఆ సమయంలో యేల్‌ విశ్వవిద్యాలయానికి ఎడ్వర్డ్‌ శపీర్‌ రాక ఎమెనో జీవితంలో మరొక మైలురాయి. ఆయన శబ్దశాస్త్రజ్ఞుడు (Phonetician) . ఆయన వద్దనుంచి శబ్దశాస్త్రమూ, వాక్యనిర్మాణ విశ్లేషణ, ధాతు పరివర్తనం ఇత్యాది విషయాల్లో బోధన లభించింది. అదే సమయంలో హిందూ సంస్కృతి, సమాజ వ్యవస్థ, దైనందిక జీవన విధానమూ, ఆచారాలూ కూడా చదివి ఆకళింపు చేసుకున్నాడు. ఆర్ధిక మాంద్యత కొనసాగుతూ ఉన్న కారణంగా, 1935లో గురువులు ఎమెనోను భారతదేశం పంపించడానికి నిశ్చయంచుకున్నారు. శపీర్‌ ఎమెనోను ద్రావిడ భాషలనూ, ప్రత్యేకించి తోడా భాషనూ పరిశోధించమన్నారు. అలా ఎమెనో 1935లో భారతదేశం చేరాను.

భారతదేశంలోచేసిన పరిశోధనల[మార్చు]

ఎమినో ప్రధానంగా మౌఖిక భాషలైన తోడా, కోటా, కొడగు, బడగాలపై పనిచేసి అపారమైన సమాచారాన్ని కూడపెట్టారు. మౌఖికం అంటే లిఖిత సాహిత్యం లేనిది అని అర్థం. అలా మౌఖికమైన భాషల శబ్దాలను లిఖితపూర్వకంగా నమోదు చేసుకోడానికి ఎమినో కనిపెట్టిన పద్ధతి ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. తోడా, కోటా భాషలు సుమారు 2000 సం.రాల క్రితం, ఆ తెగలు నీలగిరి అడవుల్లోకి వలస పోవడం ద్వారా, తమిళం నుంచి వేరు పడ్డాయి. అందువల్ల తమిళంలో జరిగిన మార్పులూ చేర్పుల ప్రభావం ఆ భాషలపై పడలేదు. ఆ భాషలు ఇంకా ఇప్పటి, అంటే 2000 సం.రాల నాటి పదాలతోనే నిండివుండేవి. తోడా తెగ పరిణామ క్రమం గురించి అప్పటికే తెలుసు కానీ వారి భాష, ఆశుకవిత్వ ధారణల గురించి ఎవరికీ తెలియదు.

తోడా తెగవారు[మార్చు]

తోడా తెగవారు ప్రధానంగా పశువుల కాపరులు. నీలగిరి కొండల్లో వలస తిరిగేవారు. గొప్ప ఆశుకవులు. ప్రతీ సందర్భానికీ పాటలు కట్టేవారు. ఆ పాటలన్నీ వారి జీవితం గురించీ, ఆ కొండలూ, పచ్చికబయళ్ళ గురించీ ఉండేవి. ఎమెనో ‘తోడా పాటలు’ అన్న పుస్తకంలో 250కి పైగా పాటల్ని నమోదు చేశారు.. ఒకసారి నేనొక పాటను సరిగ్గా నమోదు చేసుకోలేక పోయారు ఎమెనో. అది వివాహసందర్భంలో పాడే పాట. చాలా జటిలమైన పదాలున్న పాట. దానికి మగవారందరూ గుమిగూడి చేసే నృత్యం కూడా కష్టమైనదే. ఆ పాటను సరిగా వ్రాసుకోలేదనే సంగతి తెలిసి కొంతమంది తోడావారు మరుసటిరోజు పొద్దున్నే అమెనో వద్దకు వచ్చి, ఆ పాటను ఏ తప్పులూ లేకుండా వ్రాసుకొనేవరకూ మరీ మరీ పాడి సరిగా వ్రాసుకున్నాక తిరిగివెళ్లారు.

ఇది ఒక రకంగా పద్య శతకాల్లో కనిపించే మకుటం వంటిది. అనేక వేల సూత్రాల ఆధారంగా చెప్పిన పదాల్ని తిరిగి చెపుతూ పాట కడతారు వీరు. లిఖిత సాహిత్యం కల భాషల్లో కూడా ఈ ప్రక్రియ కనిపిస్తుంది. కవి హోమర్‌ వ్రాసిన మహా కావ్యాలనుండి, హిందూ వేదాలనుండి, ఇప్పటి వరకూ చాలా పద్యసాహిత్యం సూత్రబద్ధమైనదే. కానీ తోడా వారు ఈ కళను ఒక అనితరసాధ్యమైన స్థాయికి చేర్చారు. అదేరకంగా యుగొస్లావియా, అల్బేనియా తదితర దేశాల్లో ఇలా మౌఖికంగా, పాటల రూపంలో భాషను తరతరాలుగా కాపాడుకొనే జాతులున్నాయి. ఆఫ్రికాలో ఇప్పటికీ అనేక తెగలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి.

ఈ సంస్కృతులన్నీ అర్వాచీన నాగరికతా ప్రభావానికి బలికావడంలేదా? అన్న ప్రశ్నకు సమాదానంగా ఎమెనో సమాదానము. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సాంఘిక సంక్షేమ పథకాలూ, ఉచిత వైద్య వసతుల వల్ల ఈ తెగలు అంతరించి పోకుండా ఉన్నాయి. కానీ ఈ తెగలవారి పిల్లలు అందరిలానే నూతన విద్యావిధానాలలో ప్రవేశించడంతో, వారి సొంత భాషల్ని క్రమేణా కోల్పోతున్నారు. ఎవరూ వాటి రక్షణ గురించి శ్రద్ధ చూపలేదు. ఈ మధ్యనే శ్రీ పేరి భాస్కరరావు చాలా శ్రమతో ఈ భాషల్ని కంప్యూటరైజ్‌ చేస్తున్నారని విన్నాను.. అని అన్నారు. ఎవరూ మాట్లాడక పోయినా సంస్కృతం మూడువేల ఏండ్లగా బ్రతికేవుంది. కానీ ఈ మౌఖిక భాషలు అలా ఉండలేవు. అని కూడా అన్నారు.

మౌఖిక భాషల సంరక్షణ[మార్చు]

మౌఖిక భాషల సంరక్షణ గురించి చెప్తూ........ ఈ భాషల్ని విశ్లేషించి, కాలానుగుణ్యంగా జరిగిన మార్పులన్నీ ఇవి అంతరించక ముందే ఒక నిర్దిష్ట క్రమానుసారంగా గ్రంథస్తం చేయాలి. అభివృద్ధి చెందిన సంస్కృతులు తొందరగా అంతరించవు. కానీ బడుగు ప్రజల సంస్కృతి ఆర్ధిక, సాంఘిక కారణాలవల్ల చాలా త్వరగా ఉనికి కోల్పోతుంది. సంస్కృతం ఇంకా బ్రతికి ఉండటానికి కారణం జన బాహుళ్యానికి అది ఇంకా కావలసి రావడమే. వాటికన్‌ ఎప్పుడైతే దైవ ప్రార్ధన వాడుక భాషలో చేయవచ్చని చెప్పిందో యూరోపులో లాటిన్‌ అప్పుడే అంతరించింది. హిందువులు ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదు. “The culture of India is not the culture of west. What gets lost is different in these two worlds” గత శతాబ్దంలో ఈ భాషల రక్షణకై చాలా కృషి జరిగింది. కానీ ఇంకా చాలా జరగాల్సి ఉంది. ముఖ్యంగా మధ్య భారతం, నర్మదా, గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో ఇంకా అనేక భాషలు ఈనాటికీ పరిశోధింప బడలేదు. అని అన్నారు.

భారతదేశం ఒక బహుళభాషా ప్రాంతం కదా. ఇది ఈ దేశపు ఏకత్వంపై ఎటువంటి ప్రభావాన్ని కలిగివుంది? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా... ఎమెనీ నేను మొదట్లో అలానే అనుకున్నాను. కానీ చాలా కొద్ది కాలంలోనే నా అభిప్రాయం మార్చుకున్నాను. భారత దేశం అంతటా అంతర్లీనంగా ఒక ఏకత్వం ఉంది. ఈ ఏకత్వం భాషల హద్దుల్ని దాటి ఉంది. అందుకనే భారత దేశం అఖండంగా ఉండగల్గింది. ఇక్కడ భారతదేశం అంటే ప్రధానంగా హిందూ సాంస్కృతిక వ్యవస్థాపక ప్రాంతం, నైసర్గిక సరిహద్దుల మధ్యనున్న దేశమని కాదు. ఉదాహరణకి “ప్రతిధ్వన్య ధాతువు (Echo-Word Motif)” అనేక భారతీయ భాషల్లో కనిపిస్తుంది. దీనివల్ల ఏం తెలుస్తోందంటే ...... భాషలు వేరైనా భారతీయత ఒక్కటే అని. ఇది ఎలా అంటే, ఒకే మనిషి వేరు వేరు దుస్తుల్లో ప్రత్యక్షం అయినట్లన్నమాట. ఈ ధాతువుకి ఉదాహరణలుగా తెలుగులో పులీ గిలీ, గుర్రం గిర్రం, కన్నడంలో కుదురే గిదురే, తమిళంలో తన్నీర్‌ కన్నీర్‌ , మొదలైనవి చెప్పచ్చు. ఇలాంటి శబ్దప్రయోగాలు కేవలం వాడుక భాషలోనే అని గమనించాలి. వీటికి నిఘంటువుల్లో, వ్యాకరణ గ్రంధాల్లో చోటు లేదు. ఆని ఆన్నారు.

తన గ్రంథం ద్రావిడ భాషావ్యుత్పత్తి విశేష నిఘంటువు (D.E.D)’ గురించి [మార్చు]

ఎమెనో 1938లో అమెరికా తిరిగి వచ్చేటప్పటికి తనదగ్గర మూడేళ్ళ కృషి ఫలితంగా అపారమైన సమాచారం ప్రోగయ్యింది. అప్పటికే కీ. శే. బర్రో ఆక్స్ఫర్డ్‌ నుంచి భారతీయ భాషలపై కొన్ని వ్యాసాలు ప్రచురించి ఉన్నారు. ఆ కాలంలో పరిశోధకులు అందరూ ఎవరికివారే వారికి కావలిసిన శబ్దవ్యుత్పత్తులు సమకూర్చుకునేవారు. ఇందుకోసం చాలా సమయం వెచ్చించాల్సొచ్చేది. అందువల్ల తనూ, బర్రో పరస్పర సహకారాలతో అప్పటిదాకా లభ్యమైన అన్ని వ్యుత్పత్తులనూ క్రోడీకరించి ఒక గ్రంథంగా వెలుపర్చారు. మొదటి ప్రచురణ అలా 1961లో వెలుగు చూసింది. ఆ తరువాత బర్రో, కీ.శే. సుధీభూషన్‌ భట్టాచార్యతో కలిసి చాలా కృషి చేశారు. వారు అడవుల్లోకి వెళ్ళి వారాల తరబడి కాలి నడకన తిరుగుతూ అనేక భాషల శబ్దాల్నీ, వాటి వ్యుత్పత్తుల్నీ సేకరించి రెండవ ప్రచురణలో పొందుపరచారు. ఈ ప్రచురణలు ఇప్పుడు దొరకటం లేదు.

ప్రియ శిష్యుడు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గురించి ఎమెనో....[మార్చు]

కృష్ణమూర్తి తెలుగు భాషపై పరిశోధన చేయడానికై పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ అక్కడ ద్రవిడ భాషలు తెలిసినవారు ఎవరూ లేకపోవడంచేత అతని సిద్ధాంత వ్యాసానికి పర్యవేక్షకుడిగా ఉండమని ఎమెనోని కోరారు. కాణీ ఎమెనోకి భాషాశాస్త్రం తెలిసినా తెలుగు అంతగా రాదు, కృష్ణమూర్తి తెలుగులో ఉద్దండుడు. అలా ఆ ఇద్దరి జంట సరిగ్గా కలిసింది. చాల మంచి పరిశోధనలు ఇద్దరూ కలిసి చేసారు. కృష్ణమూర్తి గురించి చెపుతూ...... అతను, చాలా మంచి మనిషి. గొప్ప శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు, గొప్ప అధ్యాపకుడూ, పరిపాలనాదక్షుడు కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర విభాగాన్ని ఎంత వృద్ధిలోకి తెచ్చాడో! అతను హైదరాబాదు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడుగా ఉన్నప్పుడు, నాకొక గౌరవ డాక్టరేటు ఇచ్చారు. నాకు చేయబడిన అన్ని సన్మానాల్లోనూ ఇదంటే నాకు చాలా గర్వమూ, మక్కువానూ. నా ప్రియ శిష్యుడిచ్చింది కదా! అని అంటూ గర్వంగా అ పట్టాని చూపించారు. అది, వారు ఎక్కువ సమయం గడిపే ముందుగదిలో కొట్టవచ్చినట్లుగా కనబడేటట్టు అలంకరించారు.

భారతదేశం గురించి మీ అభిప్రాయం[మార్చు]

భారతదేశం గురించి ఎమెనో తన ఆభిప్రాయం చెప్పుతూ....... “Ex Oriente Lux”! కాంతి తూరుపు నుండి వస్తుంది. భాషాశాస్త్రంలో వెలుగు భారతదేశం నుంచి వచ్చింది. పాశ్చాత్య ప్రపంచ నాగరికతలన్నీ చీకటిలో ఉన్నప్పుడే భారతీయులు భాషకు శబ్దప్రమాణాల్ని నిర్ణయించి ఎంతో ముందంజ వేశారు. భాషాశాస్త్రానికి ఎనలేని మేలు చేశారు. పాణిని వ్యాకరణం చదివారా? ఒక వాక్యాన్ని ఎలా వ్రాయాలీ అనే కాకుండా ఎలా ఉచ్చరించాలీ అనేది కూడా బోధిస్తుంది. అందువల్లనే ఇన్ని శతసహస్రాబ్దాల తరువాత కూడా సంస్కృత ఉచ్చారణలో మార్పు లేదు. గ్రీక్‌ లాటిన్లు ఈ విషయంలో చాలా వెనుకబడినవి. మిగతా భాషల గురించి ఇక చెప్పనవసరమే లేదు. 1955లో అమెరికన్‌ ఓరియెంటల్‌ సొసైటీకి ఇచ్చిన ఉపన్యాసంలో ఈ విషయాలన్నీ విపులంగా చర్చించాను. అన్నారు.

అంతే గాక మరలా తన అభిప్రాయాన్ని ఇలా వ్వక్త పరిచారు. వ్యక్తిగతంగా నా భారతదేశానుభవం ఒక మరపురాని సంఘటన. అది ఒక అద్భుతమైన వరం. నేను అక్కడ ఉన్నప్పుడు, తమిళనాడూ ఒరిస్సాలలోని దేవాలయాలూ, తాజ్‌ మహల్‌ దర్శించాను. కలకత్తా, కాశీ, బొంబాయి నగరాలు తిరిగాను. బడగా తెగ వారు మంటలతో చేసే వీధి గారడీలనుంచి మొదలుకొని అనేక వింతలూ చూశాను. వంగ దేశీయుల చేపల కూరలూ, దాక్షిణాత్యుల పిండివంటకాలు, చాలా కారమైన కూరలూ, పచ్చళ్ళూ తిన్నాను. ప్రతి అనుభవం ఒక మరపురాని అనుభూతి. ఒక్క మాటలో చెప్పాలంటే, భారతీయ సంస్కృతీ జీవనదిలో మునకలేసి తడిసిపోయాను. ఒక అలౌకికమైన ఆనందం నాకు ఆ అనుభవస్రవంతిలో లభించింది. ఈ అనుభవాలన్నీ భారతీయ సంస్కృతి అన్న వర్ణ చిత్రంలో మిళితమైన రంగుల్లాంటివి. గత శతాబ్దంలో భారతీయ భాషాశాస్త్రం చాలా వృద్ధి చెందింది. అందుకు నా చిన్నపాటి కృషి కొంత దోహదం చేసినట్టు అనిపిస్తే, అది నాకు చాలా గర్వ కారణం. అని తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు.

ఆ విధంగా పర దేశీయుడు, పర భాషీయుడు అయిన ఎమెనీ భారతదేశ భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసి, కాలగర్భంలో కలిసిపోతున్న మన భాషాసంస్కృతిని రక్షించుకోవాల్సిన అత్యవసరాన్ని గుర్తుచేసి, మన సంస్కృతీ పురోగమనానికి ఎంతో మేలు చేసిన మహామనీషికి శతకోటి నీరాజనాలు.

మూలాలు[మార్చు]

  1. మాధవ్ మాచవరం. "దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో". ఈమాట. Retrieved 28 May 2016.