పాముల

వికీపీడియా నుండి
(కనికట్టు వాళ్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దక్షిణ భారతదేశానికి చెందిన కులాలు, ఆదివాసీల గురించిన పుస్తకం

ఇది ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా లోని గ్రూపు కులం. పాముల కులం లో ఎవరైన తప్పు చేస్తే గడ్డపార కాల్చి పట్టుకోమంటారు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళ సందర్భంలో మొగపిల్లలే ఎదురు కట్నం ఓలి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. వీరి పూర్వీకులు పాముల బుసలతో వినోదాన్ని పంచేవారని, కాలక్రమేణ అది లేకుండా పోయిందని, నేరగాళ్ళుగా చిత్రీకరిస్తున్నారని వీరు అంటున్నారు. వీరు ప్రస్తుతం పందుల పెంపకం, పాములాట, కొద్దిపాటి చదువుకున్నవారు ఆటోలతో తమ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. పాముల జాతి అంటేనే బ్యాంకులు దొంగజాతిగా భావించి రుణాలు ఇవ్వటం లేదని, ఎక్కడ ఏ నేరం జరిగినా ముందుగా మావాళ్ళని తీసుకపోయి పోలీసోళ్ళు గదిలో వేస్తారు అని వాపోతున్నారు.. పామును చూస్తే చాలు ఎవరికైనా భయమే. అలా భయపడనివాళ్ళు పాములోళ్లు...అంటే పాముల్ని పట్టేవాళ్ళు. వీరినే పాములోళ్లు అని కూడా అంటారు. నాగుపాము, రక్తపింజరి, కట్లపాము, నల్ల తాచు... ఇలా విషపూరిత పాము లను వేళ్లమీద లెక్కించవచ్చు. ఇక జర్రిగొడ్డు తోకతో కొడితే ఆ వ్యక్తికి ఒళ్లంతా మంట పుడుతుందే తప్ప మరణించడు. పాములవాళ్లూ ఈ విషసర్పాలను పట్టే సమయంలో పాము కాటుకు గురవు తుంటారు. అప్పుడు తమకు తెలిసిన మందు రంగరించి పోస్తారు. బతికితే బతుకుతాడు లేదా దేవుడి దయ అనుకుని వైద్యం చేస్తారు. పాములవాళ్ల మహిళలు సైతం పాములను పడతారు. బుట్టలోని పాములు తప్పించుకునే ప్రయత్నంచేసి బయటకి వస్తే ఆడవాళ్లే వాటిని లాఘవంగా పట్టి బంధిస్తారు. గారడికి క్లైమాక్స్ పాము-ముంగిస పోరాటం. .వీరు గారడీ విద్యను ప్రదర్శించేవారు కనుక `గారడీ సాయిబు ' అనే పేరు కూడా వాడుకలో ఉంది. గ్రూపులోని గారడీ ముస్లిమ్, గారడీ సాయిబులు, పాముల వాళ్ళు, కనికట్టు వాళ్ళు, గారడోళ్లు, గారడిగ వారు కూడా ఈ వృత్తినే చేస్తున్నారు. పాములవాళ్ళు సంచార జీవులు అయినప్పటికీ ఆరోజుల్లో వీరికి కనీసం గాడిదలు కూడా ఉండేవి కావు. కనుకనే సామాను మొత్తం కావిళ్లలో సర్దుకుని మరో ఊరికి ప్రయాణమయ్యేవారు. చిన్న పిల్లలతోపాటు పాముల బుట్టలను కూడా ఒకే కావిడిలో తీసుకుపోయే వారు. గ్రామంలో ఏదో ఒక కూడలిని చూసుకుని డోలక్‌ వాయించేవారు. ఆ శబ్దం గ్రామస్థులకు చిరపరిచితం కనుకనే పిల్లాపెద్దా మొత్తం సంతోషంతో ఉరుకులు పరుగుల మీద వచ్చి గుమిగూడేవారు. ప్రేక్షకుల చప్పట్లతో గారడీ ప్రారంభమయ్యేది. గారడీ ప్రదర్శన చివరలో పాము-ముంగిస పోరాటం ఉండేది. దీనికోసమే అంతా ఆసక్తిగా ఎదురుచూసేవారు. నాదస్వరంతో పాము ఆట మొదలవుతుంది. పడగవిప్పి ఆడుతున్న పాముపైకి ముంగిసను ఉసిగొలిపేవారు. పామును కొరికి చంపాలని ముంగిస, ముంగిసను కాటేసి అంతం చేయాలని పాము ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఒకదానితో ఒకటి పోటీపడేవి. ఆట చివర్లో ముంగిస పామును నోట కరుచుకుంటే, పాము ముంగీసను తోకతో మెలిపెట్టి కాటు వేయాలని ప్రయత్నిస్తుంది. పతాక స్థాయికి చేరిన ఈ పోరులో పాము, ముంగిసల్లో ఏదీ చావకూడదనే మాట ప్రేక్షకుల ద్వారానే చెప్పించి, ప్రదర్శనను రక్తి కట్టిస్తారు గారడీవాళ్ళు. చుట్టూ చేరిన వారు ఇచ్చిన చిల్లర డబ్బులు తీసుకుని మరో గ్రామానికి వెడతారు. చిన్నపిల్లలకు పాలు లేకపోయినా బుట్ట లోని పాముకు మాత్రం కనీసం ఒక కోడి గుడ్డయినా పెడతారు. సినిమాలు, టీవీలు, కేబుల్‌ కనెక్షన్లు రావటంతో వీరి గారడీ విద్యను చూసేవారు కరువయ్యారు. గత్యంతరం లేని స్థితిలో వీరు రోజు కూలీలుగా మారారు. అయినా వీరు తమ పిల్లలకు పాములు పట్టటం, పెంచటం నేర్పిస్తున్నారు. కనుకనే నాగుల చవితి సందర్భంగా పాములోళ్లు పాముల్ని ప్రదర్శించడం మామూలే. అయితే నాగుల చవితి వచ్చిందంటే తెలంగాణ ప్రాంతంలోని పాముల వాళ్లకు మాత్రం గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. వీరు పాములను బుట్టలో తీసుకుపోయి ప్రతి ఇంటి ముందూ ప్రదర్శించి డబ్బులు అడుక్కుంటారు. వారి నుంచి అటవీశాఖ సిబ్బంది, జంతు సంరక్షణ సంఘాల సభ్యులు పాములను లాక్కు పోతారు. అందుకే ఆ రోజు పాముల వాళ్ళు భయపడుతుంటారు. సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ర్టపతి నిలయానికి ఏడాదికి ఒకసారి దక్షి ణాది రాష్ట్రాల విడిది పేరుతో రాష్ర్టపతి రావటం ఆనవాయితీ.ఈ ప్రాంతంలో పాములు ఎక్కువగా ఉన్నందువల్ల పాములు పట్టేవారిని అక్కడికి తీసుకుపోతారు. రాష్ర్టపతి రాకకు వారం రోజుల ముందే వీరు రంగంలోకి దిగుతారు. రాష్ర్టపతి ఉన్నన్ని రోజులూ అక్కడ ప్రతిరోజూ నలుగురు పాములు పట్టేవారు హాజరు కావాల్సిందే. కనుక రాష్ర్టపతి వస్తున్నారంటే వీరికి పండగే.

మూలాలు ఇంటి పేర్లు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=పాముల&oldid=3266231" నుండి వెలికితీశారు