భారత స్వాతంత్య్ర సమరోజ్వల చరిత్రలో ముస్లిం మహిళలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యోద్యమం మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాటపటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశభక్తికి ఈ ఉద్యమం ఒక నిలువుటద్దం. ఈ పోరాటాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల, ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకోన్ముఖంగా ఆత్మార్పణలకు పోటీపడటం అపూర్వం. ఒకే నినాదం, ఒకే లక్ష్యంతో ఒకే మాటగా ఒకేబాటగా కోట్లాది ప్రజానీకం ముందుకు సాగడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన మహత్తర సంఘటన. ఈ పోరాటానికి భారతదేశపు అతిపెద్ద అల్పసంఖ్యాకవర్గమైన ముస్లిం సమాజం తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. ముస్లిమేతర సాంఘిక జనసమూహాలతో మమేకమై ఆది నుండి స్వాతంత్ర్యసమరంలో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించింది. అపూర్వ త్యాగాలతో, అసమాన బలిదానాలతో భారతీయ ముస్లింలు మాతృభూమి విముక్తి పోరాటంలో పునీతులయ్యారు.

ఆ మహోజ్వల త్యాగమయ చరిత్ర పలు కారణాల మూలంగా మరుగున పడిపోయింది. బ్రిటీష్‌ పాలకులు తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకు 'విభజించు-పాలించు' కుటిల నీతిని అమలుపర్చి భారతీయులను మతం పేరుతో హిందువులు- ముస్లింలుగా విభజించడంలో కృతకృత్యులయ్యారు. ఆ తరువాత భారత విభజనకు దారితీసిన పరిస్థితులు, ఆ సందర్భంగా జరిగిన దారుణాలు, పొరుగుదేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌తో జరిగిన కయ్యాలు, యుద్ధాలు, వివాదాలు స్వాతంత్ర్యోద్యమ కాలంనాటి హిందూ-ముస్లింల ఐక్యతకు చిచ్చుపెట్టాయి. భారత విభజనానంతర పరిణామాల వలన అపరాధ భావనకు గురిచేయబడిన ముస్లిం సమాజం సుషుప్తావస్థలోకి నిష్క్రమించింది. ఆ తరువాత వివిధ కారణాలు, వివిధ శక్తుల స్వార్థపరరాజకీయ దుశ్ఛర్యల మూలంగా మనగడ్డ విూద సాగిన మత కలహాలు, అసత్యాలు, అర్థసత్యాల ఆధారంగా సృష్టించి పెంచి పోషించబడిన మత విద్వేషాలు ప్రజల మధ్య మానసిక విభజనకు ప్రధాన కారణమయ్యాయి. ఈ వాతావరణంలో ప్రజల మత మనోభావాలను రెచ్చగొట్టి మతం పేరుతో మనుషులను చీల్చి, రాజకీయ ప్రయోజనాలను సాధించదలచిన మతోన్మాద రాజకీయశక్తులు, వ్యక్తులు ఈ చీలికను అగాధంగా మార్చాయి.

ప్రజలకు చేరువకాని సమాచారం[మార్చు]

ఆ కారణంగా బ్రిటీషర్ల బానిసత్వం నుండి మాతృభూమిని విముక్తం చేసేందుకు సాగిన సుదీర్ఘ పోరాటచరిత్రలో ముస్లిం సమాజం త్యాగాలు మరుగున పడిపోయాయి. చరిత్ర గ్రంథాలలో ముస్లిం యోధులు చాలా వరకు కన్పించరు. అక్కడక్కడా ఒకరిద్దరు కన్పించినా అనన్య సామాన్యమైన వారి త్యాగాలు, అతి సాధారణ స్థాయి వివరణలతో వర్ణనలతో సరిపెట్టబడ్డాయి. ప్రాచుర్యంలో ఉన్న చరిత్ర గ్రంథాలలో ముస్లింల వీరోచిత గాథలు సరైన స్థానం పొందలేకపోయాయి. ఆయా కథనాలు సామాన్య చరిత్ర గ్రంథాలలోగాని, పాఠ్య పుస్తకాలలోగాని చోటు చేసుకోలేదు. ఫలితంగా భవిష్యత్తు తరాలకు అమూల్య సమాచారం అందకుండా పోయింది. సామాన్య చరిత్ర గ్రంథాల ద్వారా తేలిగ్గా సమాచారం లభించే అవకాశం లేనందున, కళా రూపాలకు, సాహిత్య ప్రక్రియలకు, ప్రచార మాధ్యమాలకు ముస్లింల శ్లాఘనీయ త్యాగ చరితలు కథా వస్తువు కాలేకపోయాయి. అందువలన ముస్లింల త్యాగాలు, ఆనాటి వీరోచిత పోరాట ఘట్టాలు జనబాహుళ్యంలోకి వెళ్ళకపోవడంతో ఆయా చారిత్రక విశేషాలు, విశిష్ట సంఘటనలు, ఉత్తేజపూరిత కథనాలు, వ్యక్తిగత-సమష్టిగత త్యాగాలు ఆ తరువాతి తరాలకు అందలేదు. ఈ పరిణామాలే భారతదేశంలోని హిందూ-ముస్లిం జనసమూహాల మధ్య సద్భావనకు, సదవగాహనకు అటంకంగా మారి క్రమక్రమంగా ఆయా జనసముదాయాల మధ్యన మానసిక ఎడం మరింతగా ఏర్పడటానికి ప్రధాన కారణమయ్యాయి. ఈ అగాధాన్ని మరింత పెంచి ఒక సాంఘిక జనసమూహానికి తామే ఏకైక ప్రతినిధులుగా ప్రకటించుకుని రాజ్యమేలాలని ఆశిస్తున్న మతోన్మాద రాజకీయ స్వార్థపర శక్తులు-వ్యక్తులు ఈ అవాంఛనీయ వాతావరణాన్ని వినియోగించుకుంటున్నాయి. పురుషులకు దీటుగా మహిళలు భారత స్వాతంత్ర్య సమరోజ్వల చరిత్రలో ముస్లిం మహిళలు కూడా పురుషులతో దీటుగా తమదైన వీరోచిత పాత్ర నిర్వహించారు. ఆ త్యాగాలు కూడా పలు కారణాల మూలంగా మరుగున పడిపోయాయి. మతపరమైన ఆచార సంప్రదాయాల పట్ల ముస్లిం మహిళలలో ఉన్న కట్టుబాటు, ముస్లిం మహిళలు అనుసరించే పర్దా పద్ధతి వారిని గడప దాటనివ్వవన్న సాధారణ అపోహల కారణంగా ముస్లిం మహిళల త్యాగమయ చరిత్ర వైపు అటు చరిత్రకారులు గాని ఇటు సామాన్య ప్రజానీకంగాని దృష్టి సారించటమే గగనమైపోయింది. అందువలన చరిత్రకారుల అన్వేషణకు 'స్వాతంత్ర్యోద్యమంలో ముస్లిం మహిళల పాత్ర' చాలా వరకు వస్తువు కాలేకపోయింది. ఈ మేరకు థాబ్దాలుగా సాగిన విస్మరణ ఫలితంగా విముక్తి పోరాటంలో ముస్లిం మహిళల అరుదైన పాత్ర చరిత్ర పుటలలో బందీగా మిగిలిపోయింది.

మాతృభూమి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ముస్లిం మహిళలు ఆత్మబలిదానానికి సిద్ధపడిన దృష్టాంతరాలున్నాయి. విముక్తి పోరాట మైదానంలో శత్రువును సవాల్‌ చేసిన వీర వనితల చరిత్రలున్నాయి. పురుషులకు దీటుగా వనితలు సాగించిన సాహసోపేత సంఘటనలున్నాయి. ఆ చారత్రిక ఘట్టాలన్నిటిని ఈనాడు బహిర్గతం చేయాల్సి ఉంది. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రథమ స్వాతంత్ర్యసమరంలో ప్రధాన పాత్ర వహించిన ముస్లిం సమాజానికి చెందిన స్త్రీలు తమ అపూర్వ త్యాగాలతో, ఆత్మార్పణలతో చరిత్ర పుటలను ఎరుపెక్కించారు. అటువంటి వారిలో అవధ్‌రాణి బేగం హజరత్‌ మహల్‌ అగ్రగామి. బ్రిటీష్‌ పాలకులు కుయుక్తులతో ఆమె భర్త నవాబ్‌ వాజిద్‌ అలీషాను అరెస్టు చేసి అవధ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాతృభూమి పరుల పాలవడంతో ఆగ్రహించిన ఆమె ప్రజల అండదండలతో బ్రిటీష్‌ సైన్యంపై విరుచుకుపడి తిరిగి తన రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. పదమూడు సంవత్సరాల తన బిడ్డడు బిర్జిస్‌ ఖదీర్‌ను నవాబుగా ప్రకటించి అతని సంరక్షకురాలిగా బాధ్యతలు చేపట్టారు. స్వదేశీ పాలకులను, ప్రముఖులను, ప్రజలను ఐక్యపర్చారు. పరిపాలనలో శక్తిసామమర్థ్యాలను బట్టి హిందూ-ముస్లింలకు స్థాయి కల్పించారు.

బ్రిటీష్‌ సైనికదళాల పడగ నీడలో కూడా సాహసంతో 14 మాసాల పాటు వలస పాలకుల ఎత్తులను చిత్తుచేస్తూ, సమర్థ్ధవంతమైన పాలన సాగించారు. బేగంపై కత్తి గట్టిన బ్రిటీష్‌ పాలకులు అవధ్‌ను అపార సైనిక బలగాలతో ముట్టడించినా, ఏమాత్రం అధైర్యపడక స్వయంగా రణరంగ ప్రవేశం చేసి, తన సైనిక దళాలను ముందుకు నడిపి వీరోచితంగా ఆమె పోరాడారు. భారీ సంఖ్యతో, ఉన్నత సైనికాధికారుల బృందంలో లక్నోను చుట్టుముట్టిన ఈస్ట్‌ ఇండియా సైనికమూకలను ఎదుర్కొనటం కష్టతరమైన తరుణంలో, తిరిగి దాడి చేసేందుకు తాత్కాలికంగా యుద్ధరంగం నుండి వైదొలిగిన ఆమె తన సహచరులు-అనుచరులతో నేపాల్‌ పర్వతాల్లోకి నిష్క్రమించారు. ఆ అడవుల్లో కాన్పూరు ప్రభువు నానాసాహెబ్‌, మొగల్‌ రాకుమారుడు ఫిరోజ్‌ షా లాంటి యోధులను కలసి ఆంగ్లేయుల విూద పోరు సాగించేందుకు తన బలగాలను మళ్ళీ సమీకరిస్తూ, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ చివరకు 1879లో నేపాల్‌ అడవుల్లో సామాన్య మహిళగా బేగం హజరత్‌ మహల్‌ కన్నుమూశారు.

ప్రథమ స్వాతంత్ర్య సమరంలో బేగం హజరత్‌ మహల్‌ చూపిన సాహసోపేత బాటన నడిచిన మహిళలు పలువురున్నారు. ఆనాటి పోరాటంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువును మట్టు పెట్టేందుకు కదనరంగానికి కదలిన వారిలో బేగం అజీజున్‌ ఒకరు. మాతృభూమి పట్ల అపార ప్రేమాభిమానాలు గల ఆమె ప్రభుభక్తి పరాయణురాలు. కాన్పూరు అధినేత నానాసాహెబ్‌ తిరుగుబాటు శంఖారావాన్ని పూరించగానే నానాసాహెబ్‌ పక్షాన ఆమె కూడా యుద్ధరంగ ప్రవేశం చేశారు. స్వయంగా శత్రుసైన్యాలను ఎదుర్కొన్నారు. సైనిక పటాలాలను, గూఢచారి దళాలను, ఆయుధాలు, ఆహారం అందించే బృందాలను నేర్పుతో ఏర్పాటుచేసి నానాసాహెబ్‌ సాగించిన పోరుకు తోడ్పడ్డారు. చివరి వరకు పోరాడుతూ యుద్ధభూమిలో గాయపడి శత్రువు చేత చిక్కారు. శత్రువు క్షమాభిక్ష ప్రకటించినా, తనకు ప్రాణం కంటే మాతృభూమి విముక్తికై సాగుతున్న పోరాటం ప్రధానమని ప్రకటిస్తూ, ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక దళాల తుపాకి గుండ్లకు ఎదురు నిలిచి వీరమరణం పొందారు.

అజీజున్‌ మార్గాన సాగిన మరొకరు 60 సంవత్సరాల అనామిక. ఆమె పేరేమిటో తెలియదు. ఆమె ఎల్లవేళల ధరించే పచ్చరంగు దుస్తుల వలన ఆమె పచ్చరంగు దుస్తుల మహిళగా ఖ్యాతిగాంచారు. గెరిల్లా పోరాటం సాగించిన ఆమె బ్రిటీష్‌ సైనికదళాలలో భయోత్పాతం సృష్టించారు. పలు మెరుపు దాడులతో ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక స్థావరాలలో ఆమె కలకలం సృస్టించారు. ఆ క్రమంలో చివరి వరకు సాగిన ఆమె గాయపడిన తరువాత గాని పట్టుబడలేదు. ఆమెను భారీ బందోబస్తుతో అంబాలాలో గల బ్రిటీషు సైనిక స్థావరానికి పంపారు. ఆమెను అంబాల పంపుతూ, ఈ వృద్ధురాలు బహు ప్రమాదకారి...జాగ్రత్త, అంటూ అక్కడి అధికారులను హెచ్చరిస్తూ ప్రత్యేకంగా లేఖ రాసి, ముందు జాగ్రత్తల గురించి ఆంబాలలోని సైనికాధికారులను హెచ్చరించారంటే ఆ పచ్చదుస్తుల మహిళ ఎంతటి ఘటికురాలో ఊహించవచ్చు.

ఈ విధంగా శత్రువును సాయుధంగా ఎదుర్కొన్న మహిళలు, సాయుధ తిరుగుబాటు దళాలను ప్రోత్సహించిన వారు, ఆశ్రయం కల్పించి ఆదుకున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఈ కోవలో మాతృదేశ విముక్తి కోసం ఉరిని కూడా లెక్కచేయని సాహసి హబీబా బేగం, ఝూన్సీ రాణి వెన్నంటి నిలచి పోరాడి ప్రాణాలర్పించిన ముందర్‌, బ్రిటీషు సైనిక మూకలను సాయుధంగా ఎదుర్కొన్న ధైర్యశాలి బేగం రహిమా, తిరుగుబాటు యోధుల క్ష్షేమం కోరుతూ సజీవదహనమైన అస్గరి బేగం, సాయుధంగా ఆంగ్ల సైన్యాలను నిలువరించిన బేగం జవిూలా, కత్తిపట్టి కదనరంగాన శతృవును సవాల్‌ చేసిన సాహసి బేగం ఉమ్‌ద్దా తదితరులు ఎందరో ఉన్నారు. చరిత్ర నమోదు ప్రకారం ఆనాడు ఇతర సాంఘిక జనసముదాల తోపాటుగా వందలాది ముస్లిం మహిళలు కాల్చి వేయబడ్డారు. సజీవ దహనమాయ్యారు. ఉరితీయబడ్డారు. అవమానాలకు, అత్యాచారాలకు గురయ్యారు. ఈ మేరకు అలనాటి మహిళామనుల త్యామయ పోరాట చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని బ్రిటీష్‌ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే, ఆ వీరనారీమణుల త్యాగాలు ఎంతటి మహత్తరమైనవో అర్థ్ధం చేసుకోవచ్చు. జాతీయోద్యమంలో ప్రథమ స్వాతంత్ర్యసమరం రగిల్చిన స్వాతంత్ర్య కాంక్ష లక్షలాది మహిళలను స్వాతంత్ర్యోద్యమం వైపు నడిపింది. పూర్వీకుల అసమాన పోరాటాలను వారసత్వంగా స్వీకరించిన ముస్లిం మహిళలు ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేంకంగా పోరుబాటన సాగారు. 1906 నాటి స్వదేశీ ఉద్యమంతో ఆరంభమై ఖిలాఫత్‌ ఉద్యమం ద్వారా పెద్ద సంఖ్యలో జాతీయోద్యమంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఖిలాఫత్‌ కమిటీ, జాతీయ కాంగ్రెస్‌ నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమం, విదేశీవస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం లాంటి పలు కార్యక్రమాలతోపాటుగా చివరకు బ్రిటీష్‌ పాలకులను మనగడ్డ విూద నుండి తరిమివేసే వరకు సాగిని ప్రతి పోరాట రూపంలో కూడా తమదైన బృహత్తర పాత్ర నిర్వహించి, తమ అపూర్వమైన త్యాగాలతో మాతృభూమి రునం తీర్చుకున్నారు. బ్రిటీష్‌ పాలకుల దమననీతి, నిర్బంధాలకు భీతిల్లకుండా జాతీయోద్యమబాటలో నడిచిన స్త్రీలలో బీబి అమ్మకు తొలి స్థానం లభించగలదు. బీబి అమ్మ అసలు పేరు ఆబాదీ బానో బేగం కాగా బీబి అమ్మగా జాతీయోద్యమంలో చిరస్మరణీయ ఖ్యాతి గడించారు. అనితర సాధ్యమైన సాహసంతో, అద్భుతమైన ప్రసంగాలతో, ఆదర్శవంతమైన నేతృత్వంతో ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమం కోసం దేశమంతా తిరిగి ఆమె నిధులను సమకూర్చారు. ఈ నిధులే ఆనాడు భారత పర్యటన గావించిన గాంధీజీకి ఉపయోగపడ్డాయి. 'ఈ దేశపు కుక్కలు పిల్లులు కూడా బ్రిటీష్‌ బానిస బంధనాలలో ఉండడానికి వీలులేదు' అని గర్జించిన ఆమె హిందూ-ముస్లింల ఐక్యతకు చివరి వరకు కృషి సల్పారు. జాతీయోద్యమకారులంతా తనను 'అమ్మ' అని పిలుస్తూ గౌరవిస్తున్నందున తన బిడ్డల ఎదుట తనకు పర్దా అక్కరలేదని ప్రకటించి, పర్దాలేకుండా బహిరంగ సభలలో ప్రసంగించిన సాహసి ఆబాది బానో బేగం. పండు వమస్సులో కూడా పోరుబాట వీడని ఆమె జాతీయోద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుని కన్నుమూశారు.

ఆబాది బానో బేగం బాటలో నడిచిన మరొక చిచ్చర పిడుగు నిషాతున్నీసా బేగం. ఆమె జాతీయోద్యమంలో ఫైర్‌ బ్రాండ్‌గా పిలువబడిన మౌలానా హస్రత్‌ మొహాని భార్య. భర్త పలుమార్లు జైలుకు వెళ్ళినా అధైర్యపడకుండా ఉద్యమబాటన చివరికంటా నడిచిన మహనీయురాలు. జాతీయోద్యమ ప్రధాన ఘట్టాలన్నిటిలో ఆమె ప్రముఖ పాత్ర వహించి సాహస మహిళగా ఖ్యాతిగాంచిన నిర్మొహమాటి బ్రిటీష్‌ ప్రభుత్వ దాస్టీకాలను ఎదుర్కొంటూ కూడా పోరుబాట వీడని ఆమె జైలు జీవితాన్ని రుచిచూశారు. భర్త మౌలానా హస్రత్‌ మొహాని సంపూర్ణ స్వరాజ్యం తీర్మానాన్ని ప్రతిపాదించగా దానిని గాంధీజీ తిరస్కరించినందుకు ఆగ్రహించిన ఆమె గాంధీజీ వైఖరిని నిశితంగా విమర్శించి, చివరకు గాంధీజీచే శభాష్‌ అన్పించుకున్న ప్రతిభాశీలి. మంచి రచయిత్రి. ఈ వరుసలో అలీ సోదరులలోని షౌకత్‌ అలీ భార్య అంజాదీ బేగం, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు స్ఫూర్తిగా నిల్చిన జులేఖా బేగం, స్వాతంత్ర్యేచ్ఛను రగిల్చే సాహిత్యాన్ని సృష్టించిన కవయిత్రి జాహిదా ఖాతూన్‌, ఆలోచనాత్మక ప్రసంగాలకు పెట్టింది పేరైన అక్బరీ బేగంలను పేర్కొనవచ్చును. బ్రిటీష్‌ పోలీసులు గుర్రాలచేత తొక్కించినా, లాఠీలతో రక్తసిక్తం చేసినా పోరుబాట వీడని హవిూదా తయ్యాబ్జీ, గాంధీజీచే మద్యపాన నిషేధ ఉద్యమనేతగా నియుక్తురాలైన అవిూనా తయ్యాబ్జీ, బ్రిటీష్‌ పోలీసు మూకల దాష్టీకాన్ని ఎదుర్కొన్న షఫాతున్నిసా బేగం, ఆదర్శ జాతీయవాదిగా ఖ్యాతిగాంచిన మజీదా బాను, జలియన్‌వాలా బాగ్‌లో జనరల్‌ డయ్యర్‌ ఘాతుకానికి బలైన 55 సంవత్సరాల ఉమర్‌ బీబి గౌరవప్రథమైన మరణం బానిస బతుకుకంటే మేలైనదని చాటిన బేగం మహమ్మద్‌ ఆలాలు జాతీయోద్యమంలో ప్రముఖపాత్ర వహించారు.

ఈ క్రమంలో జాతీయ కాంగ్రెస్‌ జనచైతన్య కార్యక్రమాలలో ప్రముఖపాత్ర నిర్వహించారు ఫాతిమా బేగం. జాతి ప్రయోజనాలకు తమ సంపద ఉపయోగపడకపోతే అది ఎంత ఉన్నా వ్యర్థమంటూ షంషున్నీసా అన్సారీ తమ యావదాస్తిని జాతీయోద్యమానికి ధారపోశారు. భర్త పాలకుల కిరాతకానికి గురైనప్పటికీి ఆయన బాధ్యతలను స్వీకరించి ఉత్తేజపర్చే ఉత్తరాలతో స్వాతంత్ర్య సమరయోధులలో ఉత్సాహాన్ని నింపారు బేగం జాఫర్‌ అలీఖాన్‌. గాంధీజీ కోరిక మేరకు క్రమం తప్పక ఆయనకు లేఖలు రాస్తూ, ఆయన ఉర్దూభాషను బేగం జోహరా అన్సారి తీర్చిదిద్దారు. ఈ మహిళలంతా తాము కలలుగన్న 'స్వతంత్ర భారతాన్ని' కళ్ళారా చూడకుండానే పరలోకగతులయ్యారు. సాయుధ పోరాటమార్గంలో అహింసా మార్గాన్నే కాకుండా ప్రమాదభరితమైన సాయుధపోరాట మార్గాన కూడా పలువురు ముస్లిం మహిళలు ఉద్యమించారు. ఖుదీరాంకి దీదిగా ఖ్యాతిగాంచిన విప్లవ వీరుడు మౌల్వీ అబ్దుల్‌ హదీమ్‌ సోదరి వీరిలో ఒకరు. ఆమె అసలు పేరు తెలియదు. విప్లవకారుల విూద, వారి సన్నిహితుల విూద, సానుభూతిపరుల విూద బ్రిటీష్‌ ప్రభుత్వం విరుచుకుపడుతున్న భయానక వాతావరణంలో విప్లవ వీరుడు ఖుదీరాంను రక్షించుకునేందుకు విఫల ప్రయత్నం చేశారామె. బ్రిటీష్‌ గూఢచారి వర్గాల కళ్ళుగప్పి జాతీయ ఉద్యమకారులకు సమాచారాన్ని చేరవేసే కొరియర్‌గా సఫియా వాజిద్‌ చురుకైన పాత్ర నిర్వహించారు. ఈ వరుసలో కంటక ప్రాయమైన విప్లవబాటను ఎంచుకుని ఆత్మార్పణకు సిద్ధపడిన రజియా ఖాతూన్‌ లాంటి మహిళలు ఎందరో ఉన్నారు. జాతీయోద్యమంలో పాల్గొనటమేకాక, జవిూందార్ల జులుంను సాయుధంగా ఎదుర్కొన్న వారిలో కూడా ముస్లిం మహిళలున్నారు. సింధ్‌ ప్రాంతానికి చెందిన మాయి భక్తావర్‌ ఆ కోవకు చెందినవారు. తన గ్రామానికి చెందిన రైతుల కష్టార్జితాన్ని దోచుకో చూసిన జవిూందారు గూండాలను, జవిూందారుకు వత్తాసుగా వచ్చిన పోలీసులను సాయుధంగా ఎదుర్కొని ఆ పోరులో వీరమరణం పొందిందామె. ఈ విధంగా పోరాడిన వీరవనితలు ఎందరో ఉన్నా ప్రచారం లభించినవారు చాలా తక్కువ.

స్వతంత్ర భారతంలో అలనాటి త్యాగమయ స్ఫూర్తి[మార్చు]

స్వాతంత్ర్యోద్యమం వేగం అందుకుని లక్ష్యసాధన దిశగా పరుగులిడుతున్న థలో ఉద్యమంలో భాగస్వాములైన ఆనాటి మహిళలంతా అదృష్టవంతులు. ఆ తల్లులంతా తాము కలలుగన్న స్వతంత్ర భారతావనిని కళ్ళారాగాంచడమేగాక, కొందరు నవభారత నిర్మాణంలో బృహత్తరమైన బాధ్యతలు నిర్వహించారు.

ఈ తరంలోని ముఖ్యలలో ఒకరు జుబేదా బేగం. చిన్ననాటనే స్వాతంత్ర్యోద్యమ బాటన నడక ప్రారంభించిన ఆమె అద్భుత వక్త. సుసంపన్న కుటుంబంలో జన్మించిన ఆమె తమ సర్వస్వం జాతీయోద్యమానికి సమర్పించారు. చివరి థలో కటిక పేదరికం అనుభవిస్తూ కూడా స్వతంత్ర భారత ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్‌ను స్వీకరించ నిరాకరించారు. పెన్షన్‌ స్వీకరించటమంటే తన మాతృదేశ సేవకు ఖరీదు కట్టడమేనంటూ, ఎటువంటి ఆర్థిక సహాయం స్వీకరించకుండా పేదరికంలో గడిపారు. ఈవిధంగా భారత ప్రభుత్వం ఇవ్వజూపిన పలు రకాల ఆర్థిక సహాయాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించిన వారెందరో ఉన్నారు. ఈ మేరకు ఉద్యమంలో భాగంగా గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన ప్రముఖుల్లో అముతుస్సలాం ఒకరు. చిన్నతనంలోనే గాంధీ బాటను ఎన్నుకుని గాంధీజీ ప్రియపుత్రికగా జాతీయోద్యమంలో ఆమె పాల్గొన్నారు. నౌఖాళి మతకలహాల నివారణకు గాంధీజీ ఆమెను పంపారు. కలహాల నివారణకు గ్రావిూణులు సహకరించకుండా మంకుపట్టు పట్టడంతో 22 రోజులపాటు నిరాహారదీక్ష పూని ఆ ప్రాంతంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పిన ఆమె గాంధీజీ ప్రశంసలందుకున్న ఆమె చివరి వరకు మాతృభూమి సేవలో గడిపారు. బేగం రెహనా తయ్యబ్జీ గాంధీజీకి ఉర్దూ భాషను నేర్పిన గురువయ్యారు. పండు వయస్సులో కూడా బేగం లుక్మాని పోరాట పటిమ చూపారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో బేగం ఫాతిమా ఇస్మాయిల్‌ చురుగ్గా వ్యవహరించారు. బొంబాయి నగరంలో 30 సంవత్సరాలపాటు అవిశ్రాంతంగా శ్రమించి ఐదు లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దటంలో అనితర సాధ్యమైన విజయాన్ని బేగం కుల్సుం సయాని సొంతం చేసుకున్నారు. ఆమె వయోజన విద్యావ్యాప్తి కోసం ప్రత్యేకంగా పలు భాషలలో రహబర్‌ అను పత్రికను కూడా నడిపారు.

స్వాతంత్ర్య ఉద్యమకారులచే హాజఁరా ఆపాగా (హాజఁరా అక్కయ్య) హాజఁరా అహమ్మద్‌ పిలిపించుకున్నారు. రష్యాను సందర్శించిన తొలి భారతీయ మహిళగా ఆమె ఖ్యాతిగాంచారు. ఆంధ్ర రాష్ట్రంలోని మంతెనవారి పాలెంలో జరిగిన రాజకీయ శిక్షణా తరగతులలో ఆమె భర్త జడ్‌.ఎ. అహమ్మద్‌తో కలసి పాల్గొన్నారు. ఈవిధంగా అంకిత భావంతో మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిలో ఆదర్శవంతమైన సేవలకు అంకితమైన బేగం సుఫియా సోం, ఆత్మరక్షణకు ఆయుధం ధరించిన బేగం సుల్తానా హయాత్‌, గాంధీజీ నేతృత్వంలో ఆదర్శ వివాహం చేసుకున్న బేగం ఆమనా ఖురేషి, పోరుబాటలో నడిచినందుకు అరెస్టయిన ఢిల్లీలోని తొలి మహిళా కార్యకర్తగా ఖ్యాతి గడించిన బేగం మహబూబ్‌ ఫాతిమా లాంటి మహిళామనులు ఎందరో ఉన్నారు. తెలుగింటి ఆడపడుచులు ఈ కోవకు చెందిన వారిలో తెలుగింటి ఆడపడుచులూ ఉన్నారు. అటువంటివారిలో మహమ్మద్‌ గౌస్‌ ఖాతూన్‌, హజఁరా బీబీ ఇస్మాయిల్‌, నఫీస్‌ ఆయేషా బేగం, రబియాబీ, ఫక్రుల్‌ హాజియా తదితరులను పేర్కోనవచ్చు. చీరాల-పేరాల ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గౌస్‌ మెహిద్దీన్‌ భార్య ఖాతూన్‌, భర్తతోపాటుగా జైలుకు వెళ్ళకపోయినా, ఉద్యమకారులకు ఆశ్రయం కల్పిస్తూ, ఆతిథ్యమిస్తూ, తన కుటుంబానికి చెందిన సర్వం ఉద్యమం కోసం వ్యయం చేసిన త్యాగశీలి. గాంధీజీ అనుచరుడుగా రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన ఖద్దర్‌ ఇస్మాయిల్‌ భార్య హాజఁరా బీబి గాంధీజీ బాటన నడిచినందుకు ఆమె కుటుంబాన్ని వెలివేసినా వెరవని ధీమంతురాలు. భారత జాతీయ సైన్యంలో చేరి నేతాజి వెంట నడిచిన అబిద్‌ హసన్‌ సఫ్రాని, నిజాం సంస్థానంలో తొలుతగా ఖద్దరు ప్రచారం ఆరంభించిన బద్రుల్‌ హసన్‌ లాంటి బిడ్డలను కన్న ఫక్రుల్‌ హాజియా విదేశీ వస్త్రాలను నిజాం గడ్డ విూద తగులబెట్టి అందరికి ఆదర్శమయ్యారు. పలు భాషలను నేర్చుకుని ప్రజల పక్షంగా జాతీయోద్యమంలో ఆమె బహుముఖ పాత్ర నిర్వహించారు. అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామానికి చెందిన రబియాబీ భర్త మొహిద్దీన్‌ సాహెబ్‌తో కలసి సత్యాగ్రహంలో పాల్గొని చరిత్ర సృష్టించారు. ఆంధ్రావనిలో ఒక ముస్లిం మహిళ వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో బహిరంగంగా పాల్గొనటం ఇదే ప్రథమమని ఆనాడు పలువురు శ్లాఘించారు. జాతీయోద్యమకారుడైన భర్త, ఆమెను పర్దాపద్ధతి నుండి విముక్తి చేయడంతో, రబియాబీ మరింత ఉత్సాహంతో స్వాతంత్ర్యోద్యమంలోని ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాడు సాగిన యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలో స్వయంగా పాల్గొనటమేకాక యుద్ధ వ్యతిరేక నినాదాలిచ్చి పలువుర్ని ఆశ్చర్యచకితులను చేశారు. ఆనాడు మహిళలకు జైళ్ళల్లో ప్రత్యేక ఏర్పాట్లు లేనందున అరెస్టులు కాకుండా తప్పించుకున్నారు. సాహసోపేత చర్యల వలన స్వజనుల చేత పలు విమర్శలకు గురైనప్పటికీ ఖాతరు చేయకుండా, చివరి శ్వాస వరకు జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొనటం ఆమె మానలేదు. జాతీయోద్యమంలో ప్రేరణపోంది విముక్తిపోరాటంలో తమదైన భాగస్వామ్యం అందించటమేకాకుండా, స్వాతంత్ర్యం సిద్ధించాక కూడా అదే స్ఫూర్తితో సాగిన పలు పోరాటాలలో తమదైన పాత్ర వహించిన వారిలో బేగం రజియా, జమాలున్నీసా బాజి అను సోరదరీమణుల పాత్ర ఎంతో త్యాగపూరితమైంది. చిన్ననాటనే భారత స్వాతంత్ర్యోమంలో పాల్గొనటం మాత్రమే కాకుండా ఆ తరువాత సాగిన కమ్యూనిస్టు ఉద్యమంలో, తెలంగాణా రైతాంగ పోరాటంలో ఈ ఇరువురు పాల్గొన్నారు. నైజాం విలీనోద్యమంలో స్వాతంత్ర్యం సాధించాక, ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనమవ్వాలన్న డిమాండ్‌తో సాగిన పోరులో కూడా రాష్ట్రానికి చెందిన పలువురు ముస్లిం మహిళలు పాల్గొన్న దాఖలాలున్నాయి. ముస్లిం మహిళలకు ఉన్న మత, సామాజిక బంధనాల మూలంగా పెద్ద సంఖ్యలో ఉద్యమ బాటన నడవలేకపోయినప్పటికీ, ఉద్యమకారులైన తమ బిడ్డలను, భర్తలను ఎంతగానో ప్రోత్సహించారు. పరోక్షంగా సహకరించారు. ఈ విధంగా పరోక్ష సహాయం అందచేసిన వారెందరో ఉన్నప్పటికీ అందరి వివరాలు తెలియరాలేదు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వాతంత్ర్య సమరయోధుల గ్రంథంలో ఒకే ఒక ముస్లిం మహిళ పేరుంది. ఆ అదృష్టవంతురాలు నఫీస్‌ ఆయేషా బేగం. ఆమె హైదరాబాద్‌ నివాసి. ఆమె తండ్రి పేరు హామీద్‌ ఆలీఖాన్‌. ఆమె 16-9-1948 నుండి 17-9-1948 వరకు రెండురోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు. నైజాం విలీనం కోరుతూ ఉద్యమించినందున ఆమె నిర్బంధానికి గురయ్యారు. ఆమె పేరు తప్ప మరే ముస్లిం మహిళ పేరు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన గ్రంథాలలో కన్పించపోవటం ఆశ్చర్యం కల్గించే అంశం. తెలంగాణ పోరాటంలో ఆనాడు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ముస్లింలు తమ భాగస్వామ్యాన్ని అందించారు. స్త్రీ, పురుష భేదం లేకుండా ఆ పోరులో పాల్గొన్నారు. అటువంటి వారిలో రాజారాం గ్రామానికి చెందిన జైనాబి ఒకరు. పేద రైతు కుటుంబానికి చెందిన ఆమె పోరాట నాయకులకు తన ఇంట రక్షణ కల్పించారు. పోలీసుల నుండి కాపాడారు. చివరివరకు ఆమె ఉద్యమకారులకు చేయూత నిచ్చారు. వయస్సుతో నిమిత్తం లేకుండా, శరీరం సహకరించని వృద్ధ్దాప్యంలో కూడా పోరాటయోధులను అటు రజకార్ల నుండి, భూస్వాముల స్వంత సాయుధ బలగాల నుండి, ఇటు మిలటరీ దాడులు, సోదాల నుండి రక్షించుకునేందుకు ప్రాణాంతక సాహసాన్ని ప్రదర్శించిన మహిళలు మనకు తారసపడతారు. ఇండియన్‌ యూనియన్‌లో నైజాం సంస్థానం విలీనం కోసం సాగిన పోరు, ఆ తరువాత అటు తెలంగాణా రైతాంగ పోరాటంలో కూడా తమ త్యాగపూరిత భాగస్వామ్యాన్ని అందించిన మహిళలలో బేగం రజియా, జమాలున్నీసా బాజీ లాంటి వారున్నారు.

నైజాం వ్యతిరేకపోరాటం నుండి తెలంగాణా రైతాంగ పోరాటం వరకు ముస్లిం కుటుంబాలు ఉద్యమకారులను తమ కడుపులో పెట్టుకుని కాపాడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయుధాలు చేతపూని రణం చేసిన సాహసులైన వీరవనితలూ ఉన్నారు. వడిసెల గిరగిరా తిప్పుతూ శత్రువు విూద దాడి జరిపిన సమశీల మహిళలు ఉన్నారు. ఆనాడు సామాజిక జీవన బంధనాలలో ఉంటూ కూడా బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న మహిళలు చరిత్ర గ్రంథాలలో తమదైన స్థానాన్ని సంపాదించుకోలేక పోయారు. అందువలన ఆ తల్లుల గురించి ప్రజలకు అతి తక్కువ మాత్రమే తెలిసింది. ప్రభుత్వం ప్రచురించిన గ్రంథాలలో కూడా ఆ మహిళామణులకు స్థానం లభించకపోవడం విచారకరం.

ఈ విధంగా పేర్కొంటూ పోతే మణిపూసల్లాంటి మహిళలు పలువుర్ని ప్రస్తావించవచ్చు. ఈ మహిళల చరిత్రలు అక్కడక్కడా ఆయా ప్రాంతాలలో స్థానిక భాషలలో, స్థానిక చరిత్ర గ్రంథాలలో మాత్రమే ఉన్నాయి. ఆనాటి వారి త్యాగాల గురించి అందరికి తెలియాలంటే జాతీయ స్థాయి ప్రామాణిక చరిత్ర గ్రంథాలలో అన్ని సాంఘిక జనసముదాయాలకు చెందిన స్వాతంత్ర్యసమరయోధులందరికి తగిన స్థానం కల్పించాలి. ఆ లక్ష్యంగా చరిత్ర గర్భంలో దాగిన మరెందరి చరిత్రలనో పరిశోధకులు వెలికి తీయాలి. ఆ చరిత్రలను ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రచురించాలి. ఆ చరిత్రలను విద్యార్థులకు పాఠ్యగ్రంథాలలో పొందుపర్చాలి. ఆచరిత్రలకు కళారూపాల సుగంధాన్ని అద్దాలి. ఈ మేరకు అన్ని సాహిత్య ప్రక్రియల ద్వారా ఆ చరితలు ప్రజలకు అందుబాటులోరావాలి. ఆనాటి మన పూర్వీకుల త్యాగాల పరంపరకు భవిష్యత్తరాలను వారసులను చేయాలి.

ప్రస్తుతం భారతీయ ప్రధాన జన సముదాయాల మధ్య మానసిక అంతరాలు, అపోహలు, అనుమానాలకు ప్రధాన కారణం ఆయా సాంఘిక జన సముదాయాల త్యాగమయ చరిత్రలను విస్మరించటమే. ఈ అవకాశాన్ని మతోన్మాద స్వార్ధపర రాజకీయ శక్తులు, వ్యక్తులు ఉపయోగించుకుంటున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితికి ప్రతిగా, ఆ త్యాగాల స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ భారతదేశ బంగారు భవితకై నడుం కట్టేలా ప్రోత్సహించాలి. అందుకు ప్రజలు, ప్రభుత్వాలు సహకరించాలి. అప్పుడు మాత్రమే త్యాగసంపన్నులైన మన పూర్వీకులకు మనం ఘనమైన నివాళి అర్పించినవారం కాగలుగుతాం.

త్యాగాల చరిత్ర అందరికీ తెలియాలి[మార్చు]

ప్రజలకు అన్ని సాంఘిక జనసముదాయాల త్యాగాలు తెలియాల్సి ఉంది. విభిన్న సాంఘిక జనసముదాయాలు కలసిమెలసి సహజీవం సాగిస్తున్న గడ్డ అయినటువంటి భరతభూమిలో ఆయా జనసముదాయాల మధ్యన సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి ఒకరి త్యాగపూరిత చరిత్రలు మరొకరికి తెలియాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది. మాతృభూమి సేవలో పునీతమైన ప్రజలందరి చరిత్ర ఆన్ని సాంఘిక జనసముదాయాలకు తెలిసినప్పుడు మాత్రమే ఆయా జనసముదాయాల మధ్యన పరస్పర గౌరవం ఏర్పడుతుంది. ఆ గౌరవం సదవగాహనకు కారణమౌతుంది. ఆ సదవగాహన నుండి సధ్భావన, సహిష్ణుత ఉత్పన్నమౌతాయి. ఆ సహిష్ణుత, సామరస్యం, శాంతి-స్నేహాలకు బలమైన పునాది అవుతాయి. చరిత్ర మంచి చెడుల సమాహారం. చెడు సంఘటనలను గుర్తుచేస్తూ జనసముహాల మధ్య వైషమ్యాలకు కారణమయ్యేకంటే, మంచి సంఘటనలను మళ్ళీ మళ్ళీ స్మరిచుకుంటూ భిన్నత్వంలో ఏకత్వంలో ఎకత్వంలో భిన్నత్వం సంఘ జీవనానికి భూమికగా బహుళ సంస్కతిృ-సభ్యతలతో సహజీవనం సాగిస్తున్న ప్రజల మధ్య స్నేహాన్ని, సోదరభావాన్ని, సామరస్యవాతావరణాన్ని మరింతగా పటిష్ఠం చేయయటం మంచిది. ఈ వాతావరణంలో భారతీయ లౌకిక వ్యవస్థ పరిఢవిల్లుతుంది. సృష్టించడుతున్న, రగిలించబడుతున్న, పెంచి పోసించబడుతున్న మత విద్వేషాలు మట్టిలో కలసిపోయి మతసామరస్యం మరింతగా సుదృఢమౌవుతుంది. మతోన్మాద రాజకీయ శక్తుల కుట్రలు, కుయుక్తులకు అడ్డుకట్ట పడుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా సామాన్య ప్రజలకు చేరువకాని ముస్లింల, ప్రధానంగా ముస్లిం మహిళల త్యాగమయ చరిత్రను ప్రజల చెంతకు చేర్చేందుకు సాగుతున్న కృషిలో అతి చిన్న ప్రయత్నమిది.