లేపాక్షి ఉత్సవాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఒక చారిత్రక ప్రదేశంగా పేరొందింది."లేపాక్షి ఉత్సవాలు" రాష్ట్ర పర్యాటకంగా అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి.ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ,మార్చి నెలలో అనుకూలమైన ఏవైనా రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ఈ రెండు రోజులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి ప్రదర్శన కన్నులకు కట్టేది గా ఉంటుంది . లేపాక్షి ఆలయాలకు సంబంధించిన యక్ష, హరికథా గానాలు ప్రదర్శిస్తారు.లేపాక్షి చరిత్ర సంస్కృతులను తెలియచెప్పే నృత్య , గాన,సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను ఆనందింపజేస్తాయి.లేపాక్షి , చారిత్రక కట్టడాలను ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరిస్తారు. విజయనగర రాజులు తమ పరిపాలనా కాలంలో ఇక్కడ ఎన్నో ఆలయాలు, కట్టడాలు నిర్మించారు.లేపాక్షి పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం చూడవచ్చు. ఇది ఠీవిగా పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది[1].దీనినే లేపాక్షి బసవయ్య అంటారు. ఇది 8.1 మీటర్ల పొడవు,4.5 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది.ఈ బసవయ్య మెడలో పూసలు హారాలు, గంటలు ఉంటాయి.బసవయ్య విగ్రహం రిక్కించిన చెవులతో లేచి ఉరకబోడానికి కాళ్ళను సరిచేసుకుంటున్న భంగిమతో ఉంటుంది.మెడలో గల హారంలో వేలాడే రెండు గరుడ పక్షులు ,వాటి ముక్కున వ్రేలాడే ఏనుగులు ఉంటాయి.ఇది ఆనాటి శిల్పుల అద్భుత శిల్పకళాసౌందర్యానికి ప్రతీక అని చెప్పవచ్చు.ప్రముఖ కవి అడవి బాపిరాజు లేపాక్షి బసవన్నను ఉద్దేశించి రాసిన గేయం... 'లేపాక్షి బసవయ్య-లేచి రావయ్య కైలాస శిఖరిలా - కదిలి రావయ్య... చాలా ప్రసిద్ధి చెందింది.ఈ విగ్రహానికి సమీపం లోనే మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన వీరభద్ర స్వామి ఆలయం ఉంది.దీనినే లేపాక్షి ఆలయం అంటారు. ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది[2]. శివకేశవులకు భేదం లేదని చెబుతూ శివకేశవులను ఎదురుగా ప్రతిష్టించారు.ఇక్కడ వెలసిన మూలవిరాట్టు వీరభద్రుడు.ఇదే ఆలయంలో స్తంభం పై దుర్గాదేవి విగ్రహం ఉంటుంది.గణపతి, నాగేంద్రుని పెద్ద రాతి విగ్రహాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.లేపాక్షి ఆలయంలో రాతి పలకలు , స్తంభాలు , రాతి దూలాలు , ఒకటి ఏమిటి ప్రతి అణువు అత్యద్భుతంగా నాటి శిల్పులు తీర్చిదిద్దారు.గోడలు, పైకప్పుల పై చిత్రించిన వర్ణ చిత్రాలు అప్పటి చిత్రకారుల కళా నైపుణ్యానికి దర్పణం పడతాయి. ఆలయంలో చిత్రించిన రామాయణం,మహాభారతం,శివపురాణం, శివపార్వతుల కళ్యాణం దశావతారాలు మొదలైన చిత్రాలు చూసి తీర వలసిందే.ఇక్కడ ప్రతి నిర్మాణం రాతితో నిర్మించినదే. వ్రేలాడే రాతి స్తంభం ఎక్కడ మరో ప్రత్యేకత.లేపాక్షి చూడదగిన చారిత్రక ప్రదేశం అనడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తోంది[3].

మూలాలు[మార్చు]

  1. Correspondent, Special (2020-02-21). "Arrangements afoot for two-day Lepakshi festival from Feb. 29". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-09-10.
  2. "Lepakshi festival to be held in Hindupur on February 29". The New Indian Express. Retrieved 2023-09-10.
  3. "Lepakshi Utsavalu 2018 concluded in Anantapur". Eenaduvasundhara (in ఇంగ్లీష్). 2018-04-03. Retrieved 2023-09-10.