వంఛినాథన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంచినాథన్
జననం
శంకరన్

1886 (1886)
మరణం1911 జూన్ 17(1911-06-17) (వయసు 24–25)
మణియాచి
మరణ కారణంఆత్మహత్య
జీవిత భాగస్వామిపొన్నామాళ్

వంచినాథన్ లేదా వాంచిగా ప్రసిద్ధి చెందిన వంచినాథ అయ్యర్ (1886 - 1911 జూన్ 17) భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు.తన 25వ యేట రాబర్ట్ ఆషేను హత్య చేసి, ఆపై తనను తాను కాల్చుకున్న వ్యక్తి.[1]

జీవిత చరిత్ర[మార్చు]

వంచినాథన్ 1886లో తిరునెల్వేలి జిల్లాలోని షెంకోట్టై (అప్పట్లో ట్రావెన్‌కోర్ రాజ్యంలో భాగం) లో రఘుపతి అయ్యర్, రుక్మిణి అమ్మాళ్ దంపతులకు జన్మించారు. అతని ఇంటిపేరు శంకరన్ అయితే వాంచి అని కూడా పిలిచేవారు.షెంకోట్టైలో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, అతను త్రివేండ్రంలోని తిరునాల్ మహారాజా కళాశాలలో BA చదివాడు. కాలేజీలో ఉండగానే మున్నీర్ పల్లం సీతారామయ్య పెద్ద కూతురు పొన్నమ్మలతో వివాహం జరిగింది. కళాశాల నుండి పట్టా పొందిన తరువాత, అతను పునలూర్ కేథడ్రల్‌లో పనిచేశాడు.[2] ట్రావెన్‌కోర్‌లో పనిచేస్తున్నప్పుడు, అతను VO చిదంబరం పిళ్లై, నీలకంఠ బ్రహ్మచారి, సుబ్రమణ్య శివ, సుబ్రమణ్య భారతి వంటి అనేక మంది జాతీయవాదుల ప్రభావానికి గురయ్యాడు.

స్వాతంత్ర ఉద్యమం[మార్చు]

ఫ్రెంచ్ ఆక్రమిత పాండిచ్చేరిలో, భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి సహాయం అందించబడినది, అక్కడి విప్లవ కారులతో వంచినాథన్ సంప్రదించాడు. కాలక్రమేణా ప్రభుత్వోద్యోగం నుంచి వైదొలిగి విప్లవ బాటలో చురుగ్గా సాగాడు. బ్రిటీష్ పాలనను పారద్రోలేందుకు స్నేహితులతో కలిసి రహస్య సమావేశాలు ఏర్పాటు చేశాడు. 1911 జూన్ 17న, మణియాచి స్టేషన్‌ నుంచి మద్రాస్‌ వైపు వెళ్తున్న తిరునల్వేలి జిల్లా కలెక్టర్ అయిన రాబర్ట్ విలియం డి స్కోర్ యాష్ ను అతి సమీపం నుంచి కాల్చిచంపాడు, వెంటనే అరెస్టు నుండి తప్పించుకోవడానికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను చనిపోయిన తరువాత జేబులో ఉన్న ఉత్తరంలో ఇలా రాసి ఉన్నది .

"ఇంగ్లండ్ మ్లేచ్ఛులు మన దేశాన్నే కైవసం చేసుకున్నారు, హిందువుల సనాతన ధర్మాన్ని తొక్కివేసి నాశనం చేశారు. ప్రతి భారతీయుడు ఇంగ్లీషువారిని పారదోలి స్వరాజ్యం పొందడానికి, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాడు. మన శ్రీరాముడు, శివాజీ, కృష్ణుడు, గురు గోవింద్, అర్జునుడు అన్ని ధర్మాలను కాపాడటానికి ఈ నేలను పాలించారు, ఈ పవిత్ర భూమిలో వీళ్లు, గోమాంస భక్షకుడైన మ్లేచ్చుడు జార్జ్ V పట్టాభిషేక ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. బ్రిటిష్ రాజు జార్జ్ V మన దేశంలోకి అడుగుపెట్టగానే చంపేందుకు మూడువేల మంది మద్రాసీలు ప్రతిజ్ఞ చేశారు. మా ఉద్దేశ్యాలను నలుగురికీ తెలుపడానికి, సంస్థలో అతి చిన్నవాడినైన నేను ఈ రోజు ఈ పని చేశాను. హిందూస్తాన్‌లోని ప్రతి ఒక్కరూ దీన్ని తన విధిగా భావించాలి. సంతకం/- R. వంఛి అయ్యర్, షెంకోట్టై"

ఈ ఉత్తరంలోని విషయాలు ఈ హత్య కేవలం రాజకీయపరమైనదని సూచించాయి, ఈ హత్యను ప్రజలు పూర్తిగా సమర్థించారు. ఆ కాలలో జరుగనున్న బ్రిటిష్ రాజు పట్టాభిషేకం పట్ల నిరసన తెలుపడానికి ఈ హత్యా పథకాన్ని రచించారు. వంచినాథన్ కు వరాహనేరి వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ (వి.వి.ఎస్ అయ్యర్) సన్నిహిత సహచరుడు, ఇతడు బ్రిటిష్ వారిని ఓడించడానికి ఆయుధాల కోసం ప్రయత్నిస్తున్న మరొక స్వాతంత్ర్య యోధుడు. పథకాన్ని పరిపూర్ణరీతిలో అమలు చేయడానికి ఇతడు వంఛినాథన్‌కి శిక్షణ ఇచ్చాడు.వీరు భారతమాత సమితికి చెందినవారు. ఈ అమరవీరుడి జన్మస్థలమైన షెంకోట్టైలో స్మారక చిహ్నం ఉన్నది[3].

మూలాలు[మార్చు]

  1. "Remembering Vanchinathan, a young martyr of India's freedom struggle". ETV Bharat News. Retrieved 2022-06-17.
  2. "Vanchinathan – Remembering the Great Hero on His 106th Death Anniversary". hindupost.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-06-18. Retrieved 2022-06-17.
  3. Nov 16, TNN /; 2009; Ist, 06:24. "Memorial to man shot by Vanchinathan lies dilapidated | Chennai News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-06-17. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)