వాడుకరి:Bharadwajiiit/పదవ తరగతి తర్వాత ఎందులో చేరాలి?

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పదోతరగతి అనంతరం వేయబోయే ప్రతీ అడుగు విద్యార్థుల జీవితంలో కీలక మెట్టు. పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయికి వెళుతున్న ప్రతి విద్యార్థీ సెలవుదినాలను వృధా చేయకుండా పదవ తరగతి తర్వాత చేయదగిన కోర్సుల గురించి తెలుసుకోవాలి. భవిష్యత్‌ను నిర్థేశించుకొని జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడాలి. దీనికోసం విద్యార్థి ఈ స్థాయి నుండే పక్కా ప్రణాళికతో ముందుకుపోవలసిన అవసరం ఉంటుంది. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం ప్రధానమైంది. పిల్లల అనుభవాలు లక్ష్యాలకనుగుణంగా వారిని తీర్ఛిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది.పది తర్వాత కొందరు తమ పిల్లలకు ఇష్టం లేకపోయినా మూస పద్ధతిలోనే వెళ్ళడానికి ప్రయత్నిస్తే మరికొందరు మాత్రం తమ పిల్లల అభిరుచికి అనుగుణంగా అడుగులు వేయిస్తారు. ఇక్కడ నుంచి జరిగే విద్యాప్రయాణంలో ఏమాత్రం తడబడినా అది కెరీర్‌కు భంగం కలిగిస్తుంది. అసలు పదో తరగతి పూర్తి అయిన తర్వాత విద్యార్థులు ఎలాంటి కోర్సుల్లో చేరాలి అని కూడా చాలామంది డోలాయమానంలో పడుతుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ ఆసక్తితో పాటు సామర్థ్యాన్ని గుర్తెరిగి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గనిర్దేశనంలో కోర్సులు ఎంచుకుంటే అది వారికి ముళ్ళబాట కాకుండా ఉంటుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యావ్యవస్థలో కూడా నూతన కోర్సులు ఆవిష్కృతమవుతున్నాయి. అయితే, జాబ్ ఓరియెంటెడ్ కోర్సులపై ఇటీవలి కాలంలో విద్యార్థులు అధిక ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్, ఐటిఐ, ఒకేషనల్ కోర్సులు, ఐఐఐటీలు, పారామెడికల్ కోర్సుల్లో విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు అవకాశం ఉంది.
పదో తరగతి తరువాత పయనం ఎటు ?
పదో తరగతి ఫలితాలు వెలువడక ముందే అన్ని కార్పొరేట్ విద్యాలయాలు ప్రచార మోత మోగిస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఒక విధమైన మానసిక సంఘర్షణకు గురిచేస్తున్నాయి. చాలా మంది విద్యార్థులను ఇష్టం లేకున్నా సైన్స్ కోర్సుల్లో చేర్పిస్తున్నారనే వాదన ఉంది. ఒకరిని చూసి మరొకరు తమ పిల్లలపై బలవంతంగా విద్యను రుద్దడానికి ప్రయత్నిస్తే అదే వారి కెరీర్ పాలిట శాపంగా మారే ప్రమాదముందని గుర్తుంచుకోవాలి. పదో తరగతి తర్వాత చేరే కోర్సుల్లో విద్యార్థులు ఇష్టపూర్తిగా చేరితే వారి కెరీర్‌ను చక్కగా మలచుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో వారికి స్వేచ్ఛనివ్వడం ఎంతైనా అవసరమంటున్నారు మానసిక రంగ నిపుణులు. ఒకవేళ విద్యార్థికి సామర్థ్యముండి అతడు సాధారణ కోర్సులో చేరాలని సంకల్పిస్తే అతడికి కౌన్సెలింగ్ చేసి మనసు మార్చాలని వారు సూచిస్తున్నారు. పది తర్వాత కెరీర్‌కు మార్గదర్శిగా ఉండే రెండు/మూడేళ్ళ కాలం మాత్రం అతి విలువైనది, కీలకమైనదిగా అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు భావించి తాము చేరే కోర్సులపై స్పష్టమైన అవగాహనతో నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో చిక్కులు ఉండవని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇంటర్మీడియెట్‌[మార్చు]

సాధారణంగా విద్యార్థులు పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌లో చేరడానికి ఉత్సాహం చూపుతారు. ఇప్పటి వరకు ప్రతి విద్యాసంవత్సరం ఎంపిసి కోర్సులో చేరే విద్యార్థులే అధికంగా ఉంటున్నారు. ఇంజనీరింగ్ విద్యలో సులభంగా ప్రవేశాలు లభిస్తుండడంతో ఎంపిసికి అధికంగా డిమాండ్ ఉంది. తర్వాతి స్థానాలను బైపిసి, సిఈసి ఆక్రమిస్తున్నాయి. వీటితో పాటు ఎంఈసీ, హెచ్‌ఈసీ వంటి సంప్రదాయిక కోర్సులతో పాటు తెలుగు సాహిత్యం, సంగీతం తదితర సబ్జెక్టులతో దాదాపు 30 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐఐటీల్లోనూ పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు.ఇంటర్మీడియెట్‌లో చేరే సమయంలోనే కెరీర్ విషయంలో ఆచూతూచి వ్యవహరించాలి. మన తోటి మిత్రులు చేరుతున్నారనో, కష్టం లేకుండా చదవాలన్న తపన కారణంగానో భవిష్యత్తును పాడు చేసుకోకుండా విద్యార్థులు తమలో నిబిడీకృతమైన సామర్థ్యాలను తట్టిలేపి జీవితంలో స్థిరపడే విధంగా కెరీర్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ ఇలా చేరే కోర్సులు ఏదైనప్పటికీ ముందే నిర్ణయించుకుంటే మేలు.రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలో ప్రధానంగా ఐదు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
అవి:
  • ఎంపీసీ
  • బైపీసీ
  • సీఈసీ
  • హెచ్‌ఈసీ
  • ఎంఈసీ

ఎం.పి.సి[మార్చు]

దాదాపు 60-70 శాతం మంది విద్యార్దుల యం.పి.సి గ్రూపు వైపు మొగ్గు చూపుతున్నారు. యం.పి.సి చదవటం వల్ల భవిష్యత్‌లో వరించే అవకాశాలు విస్తృతంగా ఉండటమే ఇందుకు కారణం.మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలను మెయిన్ సబ్జెక్టులుగా చదవాలన్న ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులో చేరవచ్చు.ఈ మూడు సబెక్టులూ వేటికవే ప్రాముఖ్యం కలిగినవే. నిత్య జీవితంతో ముడిపడి, దాదాపు అన్ని రంగాలతో సంబంధం ఉన్న సబ్జెక్టు మేథమెటిక్స్‌ అయితే విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ / టెలికమ్యూనికేషన్‌ వంటి రంగాలకు సుశిక్షుతులను అందించేది ఫిజిక్స్‌, మందులు, రసాయన పరిశ్రమలు వంటి ఎన్నిటిలోనో ఉపాధి / ఉద్యోగం పొందేలా విద్యార్ధులను తీర్చిదిద్దేది కెమిస్ట్రీ. ఎంపిసితో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు భవిష్యత్తులో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, సివిల్, మెకానికల్, మెటలర్జీ తదితర విభాగాల్లో ఇంజనీరింగ్ కోర్సును చేయవచ్చు. మన రాష్ట్రంలో ఇందుకోసం ఏటా ఎంసెట్‌ను నిర్వహిస్తున్నారు. వీటికి ఎంసెట్ మెరిట్‌తో పాటు ఇంటర్ మార్కులకు కూడా వెయిటేజీ కల్పిస్తుండడం విశేషం. ఇక ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో నిర్వహించే జేఈఈ, ఏఐఈఈఈ పరీక్షలతో పాటు బిట్స్ పిలానీ వంటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా ఎంపిసి పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశం ఉంటుంది. జాతీయ డిఫెన్స్ అకాడమీలో కూడా చేరడానికి ఎంపిసి విద్యార్థులు అర్హులు. సాధారణంగా క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఇంజనీరింగ్ పూర్తయ్యే లోగానే చక్కటి జీతంతో బహుళజాతి కంపెనీలు ప్రతిభగల విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. మరోవైపు, ఇంజనీరింగ్ తర్వాత గేట్ రాసి ఎంటెక్, క్యాట్ ద్వారా ఎంబిఏ వంటి కోర్సుల్లో కూడా ప్రవేశం పొంది ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఇంజనీరింగ్‌పై ఆసక్తి లేనివారు ఎంపిసి తర్వాత బిఎస్‌సిలో తమకిష్టమైన కాంబినేషన్లతో చేరి డిగ్రీ చేయవచ్చు. అనంతరం బిఈడి వంటి వృత్తివిద్యా కోర్సులు/ఎంఎస్సీ కోర్సుల వైపు వెళ్ళవచ్చు. తద్వారా పి.హెచ్‌డి సైతం పూర్తి చేసుకుని రీసెర్చి స్కాలర్‌గా అధ్యాపక వృత్తిలో సెటిల్ కావచ్చు. ఇంటర్ ఎంపిసి తర్వాత ఐదేళ్ళ ఇంటిగ్రేట్ ఎంఎస్సీ కూడా చేసే అవకాశాన్ని పలు విశ్వవిద్యాలయాలు కల్పిస్తున్నాయి. ఇవే కాకుండా ఫ్యాషన్ టెక్నాలజీ, లా, సీఏ, ఐసిడబ్ల్యుఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

ఎంపీసీ విద్యార్థులకు అర్హత ఉన్న కోర్సులు[మార్చు]

  • 1.ఇంజనీరింగ్(ఎంసెట్, ఐఐటీ - జేఈఈ , ఏఐఈఈఈ , బిట్ శాట్...)
  • 2.ఎంసీఏ
  • 3.ఎన్.డీ.ఎ
  • 4.3.ఎన్.డీ.ఎ ద్వారా లభించే నేవీ,ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు
  • 5.త్రివిధ దళాల్లో టెక్నికల్ ఉద్యోగాలు
  • 6.ఎస్.సీ.ఆర్.ఏ (రైల్వేలో మెకానికల్ ఇంజనీరింగ్)

బై.పి.సి[మార్చు]

కేవలం సైన్స్ అంటే ఇష్టం ఉండి వైద్యవృత్తి, అగ్రికల్చర్ సైన్సెస్ ను కెరీర్ ఆప్షన్లుగా భావించే విద్యార్థులు ఎక్కువ మంది ఇంటర్మీడియట్‌లో బై.పి.సి గ్రూపు తీసుకోనేందుకు ఆసక్తి చూపిస్తారు. బైపిసి గ్రూపుతో ఎం.సెట్‌ ద్వారా మెడిసిన్‌ మాత్రమే కాకుండా బి.ఎస్‌.సి అగ్రికల్చరల్‌, వెటర్నరీ సైన్స్‌, హార్టీకల్చర్‌, ఫిషరీస్‌, బి.హెచ్‌.యం.ఎస్‌. బి.డి.యస్‌. బి.ఫార్మసీలో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్మీడియెట్ బైపిసి కోర్సులో చేరతారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఈ కోర్సు ఉంటుంది. మెడిసిన్‌లో చేరడం సాధ్యం కాకపోతే సంప్రదాయ బిఎస్సీ కోర్సుల్లో చేరి అనంతరం ఎమ్మెస్సీ, పి.హెచ్‌డి వంటి ఉన్నత చదువులు చదివి అధ్యాపక వృత్తిలో సెటిల్ కావచ్చు. పరిశ్రమల్లో కూడా ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది. బైపిసి పూర్తి చేసిన విద్యార్థులు డీఫార్మసీ, బిఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ పారామెడికల్ కోర్సులు చేసి చక్కటి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ వంటి అడ్వాన్స్‌డ్ కోర్సులకు కూడా మంచి డిమాండ్ ఉంది.

బై.పి.సీ విద్యార్థులకు అర్హత ఉన్న కోర్సులు[మార్చు]

  • 1.మెడిసిన్ (అల్లోపతి , ఆయుర్వేద , హోమియో , డెంటిస్ట్రీ)
  • 2.అగ్రికల్చర్ కోర్సులు
  • 3.బీఎస్సీ నర్సింగ్ , పారా మెడికల్ కోర్సులు
  • 4.ఫిజియోథెరపీ
  • 5.మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎం.ఎల్.టీ)

సిఈసీ/ఎంఈసీ[మార్చు]

సిఏ, ఐసిడబ్ల్యుఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేయాలనుకునేవారు ఇంటర్‌లో సిఈసీ, ఎంఈసీల్లో చేరాల్సి ఉంటుంది. గణితంపై ఆసక్తి లేని వారు సిఈసీలో చేరొచ్చు. ఇటీవలి కాలంలో ఈ రెండు కోర్సులకు కూడా విపరీతమైన ఆదరణ పెరిగింది. కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాల్లోనే కాకుండా కామర్స్ రంగంలో కూడా ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందని ఈ కోర్సుల్లో చేరి ప్రొఫెషనల్స్‌గా ఎదిగిన విద్యార్థులు నిరూపించారు. ఎంఈసీలో చేరిన వారికి అటు గణితం, ఇటు కామర్స్ రెండింటిపై పట్టు సాధించే అవకాశం ఉండి క్యాలిక్యులేషన్ ఓరియెంటెడ్ ప్రొఫెసషనల్ కోర్సులను త్వరితగతిన పూర్తిచేయడానికి దోహదపడుతుంది. డిగ్రీలో బి.కాం, పిజిలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్‌డి వంటి కోర్సులు చేసి అధ్యాపక వృత్తి వైపు కూడా వెళ్ళే వెసులుబాటు ఉంటుంది.

సిఈసీ/ఎంఈసీ విద్యార్థులకు అర్హత ఉన్న కోర్సులు[మార్చు]

  • 1.అకౌంటెంట్,బ్యాంకింగ్
  • 2.క్లరికల్,స్టాక్ మార్కెట్ జాబ్స్
  • 3.సివిల్స్,గ్రూప్స్ ఛార్టెడ్ అకౌంటెంట్
  • 4.ఇన్స్యూరెన్స్,ఎగ్జిక్యూటివ్స్,సేల్స్ ఎండ్ మార్కెటింగ్

హెచ్‌ఈసీ[మార్చు]

సంప్రదాయిక కోర్సుల్లో ప్రముఖంగా చెప్పుకోదగింది, ఎక్కువగా నిరాదరణకు గురవుతోంది హెచ్‌ఈసీ అనేది నిర్వివాదాంశం. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా సాగే ఈ కోర్సులో చేరేవారంతా మందబుద్ధులే అని గట్టిగా విశ్వసించేవారు ఈ కాలంలోనూ ఉండడం విచారకరమే. పలు కళాశాలల్లో విద్యార్థులు లేక ఈ కోర్సుకే మంగళం పాడేశారు. ఈ విషయం పక్కనపెడితే, ఎంత ప్రతిష్ఠాత్మక సంస్థలో కోర్సులు పూర్తి చేసినా ప్రతి ఒక్కరి డ్రీమ్ ఐఏఎస్, ఐపిఎస్ వంటి కోర్సులపై ఉండడం మనం చూస్తుంటాం. డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబిఏ గ్రాడ్యుయేట్లు కూడా ఈరోజుల్లో సివిల్స్‌వైపు దృష్టి సారిస్తున్నారు. కానీ, వారు సివిల్స్‌లో అర్హత సాధించడానికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. వీటిని హెచ్‌ఈసీ కోర్సు పూర్తి చేసిన వారు సులభంగా ఆకళింపు చేసుకోవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. హెచ్‌ఈసీతో ఇంటర్ పూర్తి చేసిన వారు బిఏ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్‌డి వంటి కోర్సులు పూర్తి చేసి అధ్యాపక వృత్తిని సైతం చేపట్టవచ్చు.

హెచ్‌ఈసీ విద్యార్థులకు అర్హత ఉన్న కోర్సులు[మార్చు]

  • 1.గ్రాఫిక్ డిజైన్(డిజైనర్,విజువలైజర్,ఆర్ట్ డైరక్టర్)
  • 2.జ్యుయలరీ డిజైన్(ఎక్స్ పోర్ట్ హౌస్ డిజైనర్,జ్యుయలరీ డిజైనర్)
  • 3.ఆఫీస్ అద్మినిస్ట్రేషన్(అకౌంటెంట్స్/ఆఫీస్ అసిస్టెంట్స్,మేనేజర్,ఎగ్జిక్యూటివ్)
  • 4.ఫారిన్ లాంగ్వేజెస్(ట్రాన్స్ లేటర్,ట్రావెల్ గైడ్,ఇంటర్ లొకేటర్)
  • 5.సోషల్ వర్క్ (సోషల్ వర్కర్,రీసెర్చర్,ప్రోజెక్ట్ ఆఫీసర్,హెల్త్ కేర్ సోషల్ వర్కర్)

పాలిటెక్నిక్‌[మార్చు]

పదోతరగతి తర్వాత సాంకేతిక విద్య పట్ల ఆసక్తి ఉన్న వారు పాలిటెక్నిక్‌, ఐటిఐ ఎటిఐల నుండి కోర్సులను ఎంచుకోవచ్చు. మన రాష్ట్రంలో కొన్ని పాలిటెక్నిక్‌లు, ప్రింటింగ్‌ టెక్నాలజీ, లెథర్‌ టెక్నాలజి, టెక్స్‌టైల్‌ టెక్నాలజి, షుగర్‌ టెక్నలజీ లాంటి అరుదైన కోర్సులను నిర్వహిస్తున్నాయి. పదో తరగతి తర్వాత ఇటీవల కాలంలో ఎక్కువ మంది పాలిటెక్నిక్‌ కోర్సువైపు మొగ్గు చూపుతున్నారు. ఆ కోర్సుకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటమే దీనికి కారణం. లేదా నేరుగా పాలిటెక్నిక్‌ తర్వాత ఇ-సెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌లో చేరవచ్చు.పది తర్వాత ఇంజనీరింగ్ డిప్లొమా చేరడానికి ప్రభుత్వం పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష (సీప్‌) నిర్వహిస్తోంది. రాష్టవ్య్రాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ వంటి విభాగాల్లో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.ఇవి పూర్తయితే ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశించవచ్చు.మూడేళ్ళ కాలవ్యవధి ఉండే ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత అప్రెంటిష్‌షిప్ పూర్తి చేస్తే ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా, బిటెక్/బిఈలో చేరే విద్యార్థులకు మూడేళ్ళలోనే కోర్సు పూర్తి చేసే లేటరల్ ఎంట్రీ స్కీంలో కూడా అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం వీరు ఈసెట్ రాయాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు : apceep.nic.in

ఒకేషనల్ కోర్సులు[మార్చు]

వృత్తివిద్య నేటి పోటీ ప్రపంచములో నిరుద్యోగ నిర్మూలనకు,స్వయం ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది.పదో తరగతి తర్వాత ఒకేషనల్ కోర్సుల ద్వారా స్వల్ప కాలంలోనే ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు.మరోవైపు ఉన్నత విద్యకూ ఒకేషనల్ కోర్సులు అవకాశం కల్పిస్తున్నాయి.మన రాష్ట్రములో ఇంటర్మీడియట్ బోర్డు పదోతరగతి పాసైన విద్యార్ధులకోసం అనేక ఒకేషనల్ కోర్సులను అందుబాటులోనికి తెచ్చింది.వీటిలో చేరడం ద్వారా తక్కువ వ్యయంతోనే సాంకేతిక విద్యకు,ఉపాధికి మార్గం సుగమం చేసుకోవచ్చు.అగ్రికల్చర్,బిజినెస్ అండ్ కామర్స్,కంప్యూటర్ అండ్ హ్యుమానిటీస్,ఇంజినీరింగ్ అండ్ టెక్నికల్,హెల్త్ అండ్ పారామెడికల్,హోంసైన్స్ వంటి విభాగాల్లో అనేకమైన రెండేళ్ళ కోర్సులు ఉన్నాయి.వీటన్నింటికీ అర్హత పదో తరగతి.
మరిన్ని వివరాలకు : 1) after10thwhat.com 2) study.taaza.com

ఐటీఐ కోర్సులు[మార్చు]

వృత్తి నైపుణ్యాలకు వేదిక 'ఐటీఐ'.పదో తరగతి తర్వాత ముందుగా చిన్నపాటి ఉద్యోగంలో స్థిరపడాలనుకునేవారు ఐటీఐ కోర్సులను ఎంచుకుంటారు. ఇందులో టర్నర్‌, ఫిట్టర్‌, మెషినిస్టు, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌, రిఫ్రిజిరేటర్‌, ఏసీ, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ వీటిలో రెండేళ్ల, సంవత్సరకాల పరిమితితో కూడిన కోర్సులు ఉన్నాయి.
మరిన్ని వివరాలకు : after10thwhat.com

రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయము[మార్చు]

పదవ తరగతి తర్వాత ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయదల్చుకున్న అభ్యర్తుల కోసం ఆర్జీయూకేటి ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లోని పేద విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలలో విద్య అందించు నిమిత్తం నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ పాఠశాలల్లోచదివిన విద్యార్థులకు వారి పదవ తరగతి స్కోర్‌కు 0.4% కలిపి ఎక్కువ అవకాశం వచ్చేలా చేస్తారు.రాష్ట్రంలోని ఇతర కాలేజీలు, యూనివర్శిటీలతో పోలిస్తే ఇక్కడి విద్యావిధానం పూర్తిగా భిన్నం. అందుకే ఇంటర్మీడియట్ నుండి కాకుండా పదవ తరగతి తర్వాత నుంచే విద్యార్థులను చేర్చుకుంటారు. సిలబస్ ఐఐటీల స్థాయిలో ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పేద పిల్లలకు విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యం. కాకపోతే ఇతరత్రా అగ్రకులాల వారికి నామమాత్రపు ఫీజు ఉంటుంది. రెసిడెన్షియల్ కాబట్టి విద్యార్థి ఖచ్చితంగా క్యాంపస్‌లోనే ఉండి చదువుకోవాలి. ఫుడ్, అకామడేషన్, యూనిఫార్మ్, షూస్, బుక్స్, ల్యాప్ టాప్ తదితర అన్నీ కూడా కాలేజ్ ప్రతీ స్టూడెంట్‌కూ ఫ్రీగా ఇస్తుంది.
మరిన్ని వివరాలకు : rgukt.in

ఎ.పి.ఆర్.జె.సి/ఎ.పి.ఆర్.డి.సి[మార్చు]

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలకు మరియు డిగ్రీ కళాశాలలో చేరడానికి ప్రవేశపరీక్ష(ఎ.పి.ఆర్.జె.సి. మరియు డిసి-సెట్) ఉంటుది . ఎ.పి.ఆర్.జె.సి. మరియు డి.సి, ప్రవేశపరీక్షకు ఏటా లక్షకు పైగా విద్యార్థినీ, విద్యార్థులు పోటీపడుతున్నారు. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రవేశపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా, జూనియర్ కళాశాలలో ప్రాంతీయ ప్రాతిపదికపై, డిగ్రీ కళాశాలలో యూనివర్శిటీ ప్రాంతాన్ని అనుసరించి ప్రవేశం కల్పిస్తారు.ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలు రెండు రకాలు. 1) సాధారణ గురుకుల జూనియర్ కళాశాలలు 2) ముస్లిం మైనారిటీ జూనియర్ కళాశాలలు.ఎ.పి.ఆర్.జె.సి. మరియు డి.సి ప్రవేశపరీక్ష పూర్తిగా మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఎ.పి.ఆర్.జెసి. ప్రవేశపరీక్ష 10వ తరగతి సిలబస్ ఆధారంగా, ఎ.పి.ఆర్.డి.సి. ప్రవేశపరీక్ష ఇంటర్ సిలబస్ ఆధారం ప్రవేశపత్రం రూపొందిస్తారు. ప్రశ్నాపత్రంలో 150 ప్రశ్నలు వుంటాయి. వ్యవధి గం.2.30 ని.లు ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
మరిన్ని వివరాలకు : apresidential.gov.in

జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు[మార్చు]

పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్‌కు ప్రత్యామ్నాయంగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఏవియేషన్ వంటి కోర్సులు కాస్త ఖరీదైనప్పటికీ సృజనాత్మకత ఉన్న విద్యార్థులకు ఆయా రంగాల్లో చక్కటి అవకాశాలు కలిగిస్తున్నాయి. అయితే, ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు తాము చేరుతున్న విద్యాసంస్థలకు అఫిలియేషన్ ఉందా, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి నిపుణుల సలహా తీసుకుని చేరడం మంచిది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్‌ల్లో(ఐటిఐ) కూడా డీజిల్ మెకానిక్, ఫిట్టర్ వంటి స్వల్పకాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐటిఐ కోర్సులతో పాటు అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వారికి రైల్వే, ఆర్టీసీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
మరిన్ని వివరాలకు : 1) creepindia.com 2) acclm.in 3) after10thwhat.com

ఉద్యోగావకాశాలు[మార్చు]

పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కూడా భారీగానే ఉన్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, స్ట్ఫా సెలక్షన్ కమిషన్, ఐబిపిఎస్(బ్యాంకుల్లో క్లర్కు పోస్టులకు పరీక్ష నిర్వహించే సంస్థ), కానిస్టేబుల్స్, క్లర్కులు ఇలా ఎన్నో పోస్టులకు పదవ తరగతి ప్రాథమిక విద్యార్హతగా పేర్కొంటున్నారు. సాధారణంగా పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు 16 సంవత్సరాలు నిండి ఉంటాయి. కానీ, చాలా ఉద్యోగాలకు పదవ తరగతి పూర్తి చేసి 18 ఏళ్ళు నిండి ఉండాలనే నిబంధన ఉంది. పదో తరగతి పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడాలనుకునేవారు తరచూ ఇంటర్నెట్ వాడడం, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ వంటి పత్రికలు చదవడం వంటివి ఇప్పటి నుంచే అలవరచుకుంటే మంచిది.
మరిన్ని వివరాలకు : after10thwhat.com