వాడుకరి:Lvishnup08

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు విష్ణు పద్మిని. నేను కాకరపర్తి భావనారాయణ కళాశాలలో చదువుతున్నాను.

వికిపీడియా వ్యాసరచన పోటీ కోసం

జైన్ యార్ జంగ్[మార్చు]

జైన్ యార్ జంగ్ గురించి మేజర్ జనరల్ చౌదరీ తన ఆత్మకథలో ఈ విధంగా రాసుకున్నారు... "నాకు ముఖ్య సలహాదారు జైన్ యార్ జంగ్. ఆయన రత్నం లాంటి మనిషి. భారతప్రభుత్వానికి అనుకూలుడు. అతని సలహాలు హుందాగా, విజ్ఞతతో కూడుకుని ఉండేవి. అతని సలహాలే అవసరమైనప్పుడు తీసుకోమని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నాతో అంటూ ఉండేవారు." ఇంజనీర్లు రాజకీయాలలోకి వస్తే అభివృద్ధి పనులు త్వరితగతిన జరుగుతాయని నిరూపించిన వ్యక్తి నవాబు జైన్ యార్ జంగ్ బహద్దూర్.

తండ్రి[మార్చు]

హైదరాబాద్ సంస్థాన చరిత్రలో నవాబు ఇమాదుల్ ముల్క్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆయన వరుసగా 33సంవత్సరాలు రాష్ట్రవిద్యాశాఖాధికారిగా పనిచేశాడు. 1886 సం||లో నిజాం కళాశాలను స్థాపించాడు. బొంబాయిలోని ఎల్ఫ్హిస్టన్ కళాశాల పూనాలోని దక్కను కళాశాల స్థాయిని ఇది చాలా కాలం నిలబెట్టుకుంది. డాక్టర్ అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, డాక్టర్ హార్డీకర్, ప్రొఫెసర్ అలీ హైదర్ వంటి భారతదేశ ప్రసిద్ధ విద్యావేత్తలే కాకుండా హడ్సన్, సీటేన్, సబ్జ్ వంటి ఆంగ్లేయ విద్యావేత్తలు ఈ కళాశాలకు ప్రిన్సిపాల్లుగా ఉండేవారు. ఇమాదుల్ ముల్క్ కుమార్తె కుమారుడే జైన్ యార్ జంగ్.

అసలు పేరు[మార్చు]

జైన్ యార్ జంగ్ 1889లో హైదరాబాద్లో జన్మించారు. ఆయన అసలు పేరు జియాసుద్దియిన్. ఆయన సేవలకు మెచ్చి ఏడవ నిజాం ఆయనకు 'జైన్ యార్ జంగ్' అను బిరుదును ప్రసాదించారు.

విద్యాభ్యాసం[మార్చు]

జైన్ యార్జంగ్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి లండన్లోని క్రిస్టల్ కాలేజ్లో ఇంజనీరింగ్ శిక్షణ పొందారు. హైదరాబాద్కు రాగానే పబ్లిక్ వర్క్స్ శాఖలో అసిస్టెంటు ఇంజనీరుగా చేరారు.

ఉద్యోగం[మార్చు]

ఆనతి కాలంలోనే తన పత్రిభతో డివిజినల్ ఇంజనీర్ గా, రాజభవనాల పరిరక్షణాధికారిగా, ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల డీన్ గా, హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కమీషనరుగా, పబ్లిక్ వర్క్స్ శాఖామంత్రి గా అనేక ఉన్నత పదవులు నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపనలో ప్రధాన బాధ్యత వహించిన సర్ అక్బర్ హైదరి రాష్ట్ర ప్రధాన మంత్రి కాగానే ఉస్మానియాకు శాశ్వత భవనాల నిర్మాణ బాధ్యత జైన్ యార్ జంగ్ కు అప్పగించారు. జైన్ యార్ జంగ్ మరో ఇద్దరు నిపుణులు దేశదేశాలు పర్యటించి భవనాల నమూనాలను సేకరించారు. వైదికయుగం నుంచి మనదేశ వాస్తుశిల్ప కళ ఎంతో అభివృద్ధి చెంది ఎప్పటికప్పుడు నూతన పద్ధతులు సంతరించుకుని వారు గ్రహించారు. వైదిక, బౌద్ధ యుగాలనాటి శిల్పకళను, బహమనీ, కుతుబ్షాహి కళలతో మేళవించి ఆర్ట్స్ కళాశాల భవనాన్ని ఒక అద్భుత కళాఖండగా ఆయన రూపొందించారు. సైన్సు కళాశాలల భవనాలు, హాస్టల్ భవనాలు ఆయన రూప కల్పనే.

విశిష్ట పనులు[మార్చు]

ఆర్ట్స్ కళాశాల భావన నిర్మాణంతో జైన్ యార్ జంద్ పేరు దేశమంతా మారు మోగింది. ఆ తరువాత ఆయనకు మనదేశంలోని అనేక పనులకు ఆహ్వానాలు రావడం మొదలైంది. ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం భవనాల మరమ్మత్తు పనులు ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. తాజమహల్ పరిరక్షణ పనులకు, లాహోర్లోని ప్రసిద్ధమైన బాద్షాహీ మసీదు మరమ్మత్తు పనులకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఇంజనీర్ల బృందంలో ఆయన సభ్యుడు. పాటియాలా మహారాజు కోరికపై సిక్కుల గురుద్వారా పధకాలకు ఆయన ప్లాను ఇచ్చాడు. లండన్లోని నిజామీ మసీదు, ఢిల్లీ యూనివర్సిటీ కళాశాల భవనాలు, ఆంధ్రప్రదేశ్లో వికారాబాద్ టి.బి. శానిటోరియం భవనాలకు ఆయన పదకాను తయారు చేసాడు.

స్వాతంత్ర్యం మునుపు కార్యకలాపాలు[మార్చు]

మన దేశంలో పబ్లిక్ వర్క్స్ శాఖ చాలాకాలం కిందటే ఏర్పడినా బ్రిటిష్ ప్రభుత్వం రోడ్లు, భవనాల శాఖల పనులకే ఎక్కువ శ్రద్ధచూపేది. నీటి పారుదలకు ప్రత్యెకశాఖ ఆ రోజుల్లో లేదు. దేశంలో నీటి పారుదలకు ప్రత్యెకశాఖ మొదట ఏర్పాటుచేసింది హైదరాబాద్ ప్రభుత్వమే. రాష్ట్రంలోని ఎన్నో చిన్నా పెద్దా ప్రాజెక్టుల పనులు జైన్ యార్ జంగ్ నేతృత్వంలోనే పూర్తి అయ్యాయి. హైదరాబాద్ – మద్ర్తాస్ ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపట్టిన తుంగభద్ర ప్రాజెక్టు విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య తగాదా ఏర్పడినప్పుడు ప్రాంతీయ దృక్పథంతో కాక, సాంకేతిక నైపుణ్యంతో ఈ సమస్యను పరిష్కారానికి జైన్ యార్ జంగ్ కృషి ప్రధానమైంది. నిజాం ప్రభుత్వకాలంలో రోడ్ల ఇరువైపులా పబ్లిక్ వర్క్స్ శాఖ నాటిన ఫలవ్రుక్షాలను ప్రజలు యధేచ్చగా అనుభవించారు. వాటిని వేలం పాడితే తమ శాఖకు ఆర్ధికంగా కొంత లాభం కలుగుతుందని ఆ శాఖకు చెందిన అధికారులు కొందరు మంత్రికి సిఫారసు చేసారు. మామిడిపళ్ళు బీద ప్రజల ఆహారమని, అది కూడా వారికి లభించకుండా చేయడం తన అభిమతం కాదని జైన్ యార్ జంగ్ అన్నారు. ఆయన మొదటిసారి 1944లొ మంత్రి అయ్యారు.

హైదరాబాద్ లోని రొడ్లు[మార్చు]

హైదరాబాద్ చరిత్రలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. 19౩8లో భారతదేశ రోడ్డు కాంగ్రెస్ సభ్యులు హైదరాబాద్ పర్యటించారు. ఇక్కడి విశాలమైన రోడ్లు చూసి హర్షించారు. ఇలాంటివి ఏ రాష్టంలో లేవన్నారు. రవాణాశాఖను జాతీయం చేసిన ప్రభుత్వాలలో నిజాం ప్రభుత్వమే మొదటిది. 1954లో భారత ఇంజనీర్ల సంస్థకు ఆయన అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. లండన్లో జరిగిన కామన్వెల్త్ స్టాండర్డ్ కాన్ఫరెన్స్కు భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు.

స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఆయన కృషి[మార్చు]

1947లో నిజాం ప్రభుత్వం జైన్ యార్ జంగ్ ను తన ఏజంట్ గా జనరల్ గా నియమించింది. కేంద్రంలో ఎంతటి ఉదార ప్రభుత్వమున్నా మీకు స్వాతంత్ర్యం లభించడం కల్ల అని ఆయన నిజాంకు నచ్చచెప్పాడు. బ్రిటిష్ ప్రభుత్వం నాటి సంబంధాలను, స్వాతంత్ర్య భారత ప్రభుత్వంలో కొనసాగేటట్లు నిజాం, కేంద్రప్రభుత్వాల మధ్య ఒక తాత్కాలిక ఒప్పందం కుదరడానికి ఆయన చేసిన కృషి అపారం. పోలీసు చర్య అనంతరం జైన్ యార్ జంగ్ రాష్ట్రమంత్రి అయి మొదటి సాధారణ ఎన్నికలవరకు ఆ పదవిలో కొనసాగారు.

పద్మభూషణ్[మార్చు]

కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను ప్రశంసిస్తూ ‘పద్మభూషణ్’ బిరుదుతో సత్కరించింది. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా పనిచేశారు.

మరణం[మార్చు]

జైన్ యార్ జంగ్ 1961లో మరణించారు. జైన్ యార్ జంగ్ మరణవార్త వినగానే స్వయం గా నిజాం ఆయన ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. ఇరాక్ లో భారత రాయబారిగా పనిచేసిన సాదత్ ఆలీఖాన్ ఇతని కుమారుడు.