వాడుకరి:Saatyaki/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

seshendrasharma.weebly.com

గుంటూరు శేషేంద శర్మ


ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్‌, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ..........

- ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,

(21 ఆగస్టు, 2000)

* * *

పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు.

భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు.

గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మున్సిపల్‌ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.

నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్‌ ప్రధాన రచనలు.

కవిత్వంలో, సాహిత్య విమర్శలో విలక్షుణులు.

ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.

సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు,

వచన కవిత్వం, పద్యరచన - రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.

వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.

బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.

ఒకానొక శైలీ నిర్మాత.

- యువ నుంచి యువ దాకా (కవితాసంకలనం)

అ.జో. - వి. భొ. ప్రచురణలు 1999

Seshendra : Visionary Poet of the Millennium

seshendrasharma.weebly.com

            --------

https://www.youtube.com/watch?v=K91NMuJw9uY

-----------------

For further information

please contact : Saatyaki S/o Seshendra Sharma ,

saatyaki@gmail.com , 9441070985 , 7702964402

బ్రతుకు తోటలో బంగారు పాట


కర్మశేషం ముగిసి, కర్తవ్యాలు నెరవేరి, జీవాత్మ పరమాత్మను చేరుకొన్న రోజున గాజుపేటికలో శాశ్వతనిద్రలో ఉన్నప్పుడు అంజలి ఘటించడానికి వెళ్ళి ఆయనను చివరిసారిగా చూసిన దృశ్యం నాకిప్పటికీ కన్నులలో మెదులుతున్నది. మంగళస్నానం చేసి, పసిమి పట్టువస్త్రాలు ధరించి, పుష్పమాలాలంకృతుడైన కొత్త పెళ్ళికొడుకు ఉత్సవసంరంభానికి సొమ్మసిల్లి విరిపాన్పుమీద మేను అరవాల్చినట్లుగా అనిపించింది. శతాబ్దాల లోతులను తరచి చూసిన ఆ విశాలనేత్రాలు వెలుగులీనుతున్నట్లే అగుపించాయి. ముఖంలో ఏదో జన్మాంతరసమీక్షారేఖ తళతళలాడుతున్నది. పెదవులపై చిరునవ్వు చెక్కుచెదరలేదు. వయోభారం వల్ల శరీరం ఒక్కింత నలుపుతేరింది. ఆవేశం కమ్మినపుడు ఆ సమున్నతనాసావంశం ఎలా నెత్తురులు చిమ్మేదో జ్ఞాపకానికి వచ్చింది. తెల్లని చేమంతి పువ్వురేకలు దిక్కుల నుంచి చుక్కలు నేలపైకి రాలినట్లు చుట్టూ చెల్లాచెదరుగా పడివున్నాయి. ద్రోణపర్వంలో తిక్కనగారు "ఆ కుమారోత్తముఁ డందు చంద్రు క్రియ నొప్పె; సితాయుధఖండభూషణో, దాత్తమణిప్రతానములు తారల చందము నొంది యందమై, యత్తఱి నుల్లసిల్లె వసుధాధిప! చూపఱపిండు చూడ్కికిన్" అని వర్ణించినట్లే ఉన్నదా పార్థివదేహం.


మృత్యువులోనూ ఎంత అందం! చేతులు జోడించి నమస్కరించాను.


అందం నిండిన చందం


జీవితాన్ని సౌందర్యకలశరత్నాకరపు సారనవనీతంగా పూర్ణాస్వాదించిన గుంటూరు శేషేంద్రశర్మ గారు నిజంగా సాహిత్యవిద్యాధరులు. తండ్రిగారి సన్నిధిలో నేర్చి ఉపనిషత్తులను, వాల్మీకి రామాయణాన్ని, కాళిదాసు కృతులలోని అందాలను గుండెలలో నింపుకొన్నారు. నైషధీయ సౌందర్యరహస్యాలను హృదయోల్లాసంగా మథించిన మేధావి. ఆనందవర్ధనుని నుంచి ఆర్చిబాల్డ్ మెక్లీష్ దాకా ఆలంకారికులందరూ ప్రాణస్నేహితులే మరి. ఆంధ్రకవితావ్యాహారం ఆయన గళసీమలో సువర్ణమణిహారమై ప్రకాశించింది. పాశ్చాత్యసాహిత్యికులందరినీ ఆత్మీయం చేసుకొన్నారు. సంస్కృతాంగ్లాలలో పారంగతులు. ఆధ్యాత్మిక కవిత్వాభిమానం వల్ల పారశీక భాషాకుటుంబంతో చుట్టరికం తప్పలేదు. ఇన్ని సంస్కారాలను ప్రోదిచేసుకొని రచనావ్యాసంగానికి ఉపక్రమించారు. ఆ అందచందాలు అందరికీ అందవు.


అందమే అలంకారమని నమ్మిన వామన మతానుయాయులలో త్రివిక్రము డాయన. ఆ సౌందర్యాన్వేషణమే జీవితంలోనూ కవిత్వంలోనూ ఆయనకు సరికొత్త లోకాలను పరిచయం చేసింది. ఆ సౌందర్యబంధం వల్లనే కావ్యజీవితం రసాత్మకం కాగలిగింది. ఆయన కవితాదర్శం సమస్యల మంచుపొరలను తొలగించి విశ్వమానవునికోసం వెలుగులు నింపిన మండే సూర్యుడా? జీవితంకంటె విలువైన జీవితసందేశాన్నిచ్చిన అఖండ కాలాతీతపురుషుడా? భామహుడా? ఆయన భావవిప్లవభాషావిధాతా? సోషలిస్టా? సోక్రటీసా?  అనిపిస్తుంది.


సౌందర్యమే ఆయనకు అలంకారం, సౌందర్యమే ఆయనకు జీవితం.


విమర్శకుడు : కవి


శేషేంద్ర నాకెప్పుడూ ఒక ప్రాచ్య మహావిమర్శకునిగా, ఆ తర్వాత అంతటి అభిరూపుడైన గొప్ప కవిగా భాసిస్తారు. విమర్శవ్యాసం అనేసరికి ఆయన వ్యాఖ్యాతృశిరోమణి జయరథునిలా అనిపిస్తారు నాకు. ఆ రచనలో ఎన్ని విన్యాసాలని!

సృజనాత్మకవిమర్శలో అందాలు


"సాహిత్యకౌముది" శర్మగారి విమర్శసరళికి ఆద్యప్రకృతి. కవిత్వంలోని అందాలను

ఆ కళ్ళతోనే చూడాలి. అందులో  శ్రీనాథుని కవితాజగన్మోహనరీతిని నిరూపించిన తీరు, శ్రీనాథ పినవీరన జక్కనలు రెండవ కవిత్రయమన్న కొత్త ఊహ, కళా-విజ్ఞానశాస్త్రాల లక్ష్యలక్షణాలను సమన్వయించటం - ఎప్పటికీ నిలిచే వ్యాసాలవి. "స్వర్ణ హంస " నైషధీయచరితంలోని మంత్రశాస్త్రవిశేషాలను వెలికితీసిన మరో సంజీవని. మల్లినాథుణ్ణి చదువుకోలేదని శ్రీనాథుణ్ణి గౌణీకరించారని కొందరికి కోపం వచ్చి కరపత్రాలు అచ్చువేశారు ఆ రోజుల్లో. నిజం నిష్ఠూరంగా ఉండకుంటుందా?


రామాయణ రహస్యాలను వివరించే "షోడశి" నిజంగా ఆయన జన్మాంతర సంస్కారసారమే. వాల్మీకీయ హనుమత్సందేశం కాళిదాసు మేఘదూతానికి ఎంత అందంగా నిరూపించారని! త్రిజటాస్వప్నం మాటేమిటి?


విమర్శ శబ్దశాసనం


కావ్యవిమర్శలో శేషేంద్రశర్మగారు సౌందర్యశిల్పశాస్త్రానికి శబ్దశాసనం చెయ్యాలని ఉద్యమించారు. కుంతకుని వక్రోక్తినీ, మయకోవ్‌స్కీ ఆలంకారికతను, మెఝెలైతిస్ సంప్రదాయనిష్ఠను, కాళిదాస వాల్మీకుల రూపణకౌశలాన్ని ఆధునికపరిభాషలోకి అనువదించే ప్రయత్నం చేశారు.


హైదరాబాదుకు వచ్చిన తర్వాత అక్కడి విరుద్ధశక్తుల త్రివేణీసంగమంగా ఆయన వైమర్శికప్రయోగం "కవిసేన మేనిఫెస్టో" అవతరించింది. దాని హృదయం మంచిది. ఆ తర్వాత జరిగిన అనుయాయుల ఆర్భాటం వల్ల అనుకూల ప్రతికూల విమర్శలు చాలానే వెలువడ్డాయి. దాని ప్రతిపాదనలోని కొత్తదనాన్ని అధ్యయన చేయవలసిన ఆవశ్యకత

ఇంకా మిగిలే ఉన్నది. దానికి కాలదోషమంటూ ఉండదు.


"రక్తరేఖ"లో అడిగే ప్రశ్నలన్నీ విద్యార్థులు మననం చేయదగినంత మౌలికమైనవి. అందుకు అలంకారప్రస్థానాన్ని పునరుజ్జీవింపజేసే ఆయన సమాధానాలన్నీ మౌలికమైనవే.


ఆయన "కాలరేఖ" అంతే. తెలుగు సాహిత్యవిమర్శకు శిఖరకేతనం. అందులో స్వర్ణహంసిలోని మార్మికభాషను విడిచి, వర్తమాన భావుకులకు భావభావనను నేర్పారు.


అనల్పమైన కల్పనాశిల్పం


తొలిరోజులలో మిత్రులతో ఆశుకవిత్వాభ్యాసం ఉండేది. అవధానాల స్వర్ణయుగం ప్రభావం తప్పుతుందా? "ఏమయ్యా! పదియైన, దింక పడుకో!" అంటే, "ఏడ్చావులే ఊరుకో!" అనటం; శార్దూలాన్ని ముందుకు దూకించటం.


ఆ ఆశుధారాప్రణయనం ఆయన పద్యశిల్పంలో సమాధిగుణానికి భంగకరం కాలేదు. యౌవనంలో ఉన్నప్పుడు మేథ్యూ ఆర్నాల్డ్ రచన ఆలంబనగా 'సొరాబు' కావ్యం చెప్పారు. అది పఠితలను ఆవేశోద్వేగాలలో ముంచెత్తివేసే ధీరోదాత్తసన్నివేశకల్పనలతో వీరరసోల్బణంగా దువ్వూరి రామిరెడ్డి, ఉమ్రాలీషా కవుల సమ్మోహకమైన శైలిలో పారశీక రూపకోత్ప్రేక్షలతో రమణీయంగా సాగింది. ఇప్పటికీ ఆయన రచనలలో నాకిష్టమైన కావ్యం అది. మధురిమకు మారుపేరు.


ఆ తర్వాత వెలసిన "పక్షులు", "మండే సూర్యుడు" అభ్యుదయభావనలో వ్యక్తీకరించిన చిరంజీవికావ్యాలు. "జనవంశం"లో శేషేంద్ర అంతరంగవేదన ధ్వనిస్తుంది. మళ్ళీ మళ్ళీ చదువుతుంటాను - నా గుండె చప్పుళ్ళ కోసం.


బ్రతుకు తోటలో బంగారు పాట


అర్ధశతాబ్ది శేషేంద్ర కవితల మైమరపించే ద్రాక్షతోటలో నిలిచి, ఏవేవో తీయని పలుకులలో పరిమళించే జ్ఞాపకాల బరువుతో  కన్నులు మూసుకొన్నప్పుడు నా స్మృతిపథంలో రెండే – ‘ముత్యాలముగ్గు’లో "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది, కొమ్మల్లో పక్షుల్లారా! గగనంలో మబ్బుల్లారా!, నది దోచుకుపోతున్న నావను ఆపండి, రేవు బావురుమంటోందని నావకు చెప్పండి" అన్న గీతికామధుకోశం ఒకటీ, అంతకు ముందు "చెట్టునై పుట్టివుంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది, మనిషినై పుట్టి అదీ కోల్పోయాను" అన్న ముక్తక ముక్తాఫలం ఒకటీ గుప్పున గుబాళించి, విరికన్నెల చిరునవ్వుల వెన్నెల వెలుగులను వెలార్చే ఆ వినిర్మలత్వం నిండునూరేండ్లు చల్లగా వర్ధిల్లాలని మనస్సులోనే ముడుపులు కడతాను.

-     డా .ఏల్చూరి మురళీధర రావు 


('నిదురోయిన పాట' అన్న శీర్షికతో ఒకప్పుడు 'సాక్షి' దినపత్రికలో అచ్చయిన వ్యాసం లిఖితప్రతి.)

-      గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప కవి అయినా సినిమాలకు పాటలు రాయరు. కాని ముత్యాల ముగ్గు కోసం మొదటి, చివరి పాట రాశారు. అదే అద్భుతమైన  ‘నిదురించే తోట లోకి పాట ఒకటి వచ్చింది’. అందులో తరలి వెళ్లిపోయిన భర్తను నావతో పోల్చి ‘రేవు బావురుమంటున్నదని నావకు చెప్పండి’ అని కథానాయిక చేత అనిపించడం శేషేంద్రశర్మ కవితాగాఢతకు నిదర్శనం.

-      https://www.youtube.com/watch?v=fgmx0Q887RI


నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది

కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది

కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది


రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది

దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది

దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది

శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది

శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది

ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది

కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది


విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో

ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో

ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి

కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా

నది దోచుకుపోతున్న నావను ఆపండి

రేవు బావురుమంటోందని నావకు చెప్పండి

నావకు చెప్పండి...

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది

కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది


చిత్రం : ముత్యాలముగ్గు

రచన : గుంటూరు శేషేంద్ర శర్మ

గానం : పి.సుశీల

సంగీతం : కె.వి.మహదేవన్ : 1975

దస్త్రం:SeshPP.jpg

https://www.youtube.com/watch?v=fgmx0Q887RI