వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 10వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మచిలీపట్నం ముట్టడి

బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న మచిలీపట్నం పట్నాన్ని ముట్టడించి ఆక్రమించుకోవడాన్ని మచిలీపట్నం ముట్టడి అంటారు. 1759 మార్చి 6 న మొదలైన ముట్టడి ఏప్రిల్ 7 న బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విజయంతో ముగిసింది. దీంతో ఉత్తర సర్కారుల నుండి ఫ్రెంచి వారి నిష్క్రమణ సంపూర్ణమైంది. బ్రిటిషు సైన్యానికి కలనల్ ఫ్రాన్సిస్ ఫోర్డు నాయకత్వం వహించగా, ఫ్రెంచి వారి తరపున కాన్‌ఫ్లాన్స్ వారిని ఎదుర్కొన్నాడు. మచిలీపట్నం ముట్టడి నాటికి బ్రిటిషు సైన్యాలు విజయోత్సాహంలో ఉన్నాయి. క్లైవు ఆదేశాలతో ఉత్తర సర్కారులపై దండయాత్ర చేసి ఫ్రెంచి వారి ప్రాబల్యానికి గండి కొట్టేందుకు కలకత్తా నుండి కలనల్ ఫోర్డు వచ్చాడు. విజయనగర రాజు ఆనందరాజు (పూసపాటి ఆనంద గజపతి రాజు)తో ఒప్పందం కుదుర్చుకుని ఫోర్డు, ఫ్రెంచి వారిపై దాడి చేసాడు. చెందుర్తి యుద్ధంలో ఫోర్డు ఫ్రెంచి వారిని ఓడించాక, ఫ్రెంచి సైన్యం పారిపోయి, రాజమండ్రి చేరుకుంది. బ్రిటిషు సైన్యం వారిని అక్కడినుండి కూడా పారద్రోలింది. కాన్‌ఫ్లాన్స్ తన సైన్యాన్ని తీసుకుని మచిలీపట్నంలోని తమ స్థావరానికి పారిపోయాడు. ఈలోగా బ్రిటిషువారికీ, ఆనందరాజుకూ మధ్య అంతంత మాత్రంగా ఉన్న మైత్రి మరింత చెడింది. బ్రిటిషు వారి తరపున ఆండ్రూస్ కలగజేసుకుని తిరిగి మైత్రిని నెలకొల్పాక, ఇరు సైన్యాలూ మచిలీపట్నం ముట్టడికి సిద్ధమయ్యాయి. ఫ్రెంచి వారు మచిలీపట్నంలోని తమ స్థావరాన్ని బలోపేతం చేసుకుని, యుద్ధ నష్టాల నుండి కొంత తేరుకున్నారు.

(ఇంకా…)