శివశ్రీ శాతకర్ణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శివశ్రీ శాతకర్ణి పులమాయి అనంతరము రాజ్యభారమును వహించి సా.శ.170 నుండి 177 వరకు ఏడేండ్లు పాలన చేశాడు. ఇతడును గౌతమీ పుత్రశాతకర్ణి పుత్రునకు వాసిష్ఠీ రాణికి జన్మించాడు. అందుచేత అతడు పులమాయి సోదరుడు కావలయును. వాసిష్ఠీ పుత్రకుడును శాతకర్ణి నామధారుడును అగుట చేత ఇతడే మహాక్షేత్రప రుద్రదమనుని అల్లుడు కావచ్చును..రుద్రదమనునిచే రెండుసార్లు ఓడింపబడినవాడు ఇతడే అయియుండవలెను. గుజరాతులోని జునారులో రుద్రదమనుని శాసనము ననుసరించి ఆతడు దక్షిణాపథ రాజగు శాతకర్ణిని రెండుమారులు జయించి, అకరావంతి, అపరాంత, అనూప, సూరాష్ట్ర దేశములను లాగికొని మాహాక్షేత్రప బిరుదము వహించినట్లును, తిరిగి స్వతంత్ర రాజ్యము ప్రతిష్ఠించినట్లును తెలియుచున్నది.

ఇతని కాలమునాటి శాసనములు కన్హేరి, అమరావతి ప్రాంతములందు కనబడుచున్నవి. కన్హేరి శాసనములలో ఒకటి ఈతని రాణిదిగా నున్నది. శ్రీశివమాకశాత అను అమరావతి శాసన మీశివశ్రీదైయుండవచ్చును. ఇతనికి వేదశ్రియను మరియొక పేరుండినట్లును, వేదశ్రీ అనువాడు పవత్రములైన ఆహుతులను సమర్పించిననెడు నానాఘట్ట శాసన మాతనిదై యుండునట్లును తెలియుచున్నది. శివశ్రీ వేద సంపత్తుగలవాడై యుండిన కారణమున వేదశ్రీ అను పేరు వచ్చినట్లు ఆంధ్రచరిత్రకారుల అభిప్రాయము. నానా ఘట్ట శాసనములో ఈ వేదశ్రీ తన తండ్రిని అంగీయకులవర్ధనుడని పేర్కొనినాడు.

ఈశివశ్రీ శైవమతాధిక్యమును కలిగియుండిన బ్రాహ్మణమతమున అవలంబించిన వాడైనని బౌద్ధులను, మిగతా బ్రాహ్మణులను తండ్రికివలెనే సమానదృష్టితో చూచినవాడు.ఈ ఆంధ్రరాజులు తల్లులు బ్రాహ్మణమత అవలంబించిన శకరాజులయు, పహ్లవరాజులయు పుత్రికలగుటచె ఆంధ్రరాజులు కూడా కడపటివారు బ్రాహ్మణ మతాభిమానులగుటచే వచ్చినట్లు కనపడుచున్నది.

ఈతని తరువాతి వాడు శివస్కంధ శాతకర్ణి . రాజై క్రీ. శ. 177 మొదలు 185 వరకు పాలించెను.

మూలాములు[మార్చు]

  • 1926 భారతి మాసపత్రిక.