శివ డోలోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శివడోలోత్సవము చైత్ర శుద్ధ తృతీయ రోజు జరుపుకొనే పండుగ.[1] వసంత నవరాత్రులు తొమ్మిది రోజులలో ఇది మూడోరోజు.

మన పంచాంగకర్తలు దీనినే సౌభాగ్యగౌరీ వ్రతం, సౌభాగ్యశయన వ్రతం, మాసగౌరీ వ్రతం, ఉత్తమ మన్వాది అని కూడా పేర్కొన్నారు.

శివడోలోత్సవమునాడు ఉమా శివులను దమనముతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. దీనిని ఆందోలన వ్రతమంటారు. ఈ వ్రతానికి విదియతో కూడిన తదియ పనికిరాదని, చవితితో కూడిన తృతీయ ముహూర్త మాత్రం ఉన్నా గ్రాహ్యమని స్మృతి కౌస్తుభం.

ఈ డోలోత్సవ పర్వం హిందూదేశంలో పలుప్రాంతాల్లో పలురీతుల ఆచరింపబడుతూ ఉంది. ఆ ఆచరణ ఆయా ప్రాంతాల్లో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంతేగాక ఇది ప్రత్యేకం స్త్రీ దేవతపేర సౌభాగ్య గౌరీవ్రతం మున్నగు నామాలతో వ్యవహరింపబడుతూ ఉంది.

ఈ పర్వం గౌరీ నామంతో చెలామణీ కావడానికి కారణం ఉంది. దాక్షాయణి అగ్నికి ఆహుతి అయి చనిపోయి హిమవత్పర్వతానికి కూతురుగా పుట్టింది. పర్వతునికి పుత్రికగా పుట్టింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు పార్వతి అనే పేరువచ్చింది. పార్వతి పర్యాయనామాల్లో గౌరి అనేది ప్రసిద్ధమైనది. ఆమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి తపస్సు చేసింది. ఆమె తపస్సు చైత్రమాసంలో శుక్ల తదియనాడు ఫలించింది. అందుచేత ఆనాడు గౌరి పేరున జరిగే ఒక పర్వమైంది.

మూలాలు[మార్చు]

  1. చైత్ర శుక్ల తదియ, పండుగలు : పరమార్థములు, రచయిత ఆండ్ర శేషగిరిరావు, 2000. పేజీ: 25.