స్కందమాతా దుర్గా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్కందమాత దుర్గా, నవదుర్గల్లో ఐదో అమ్మవారైన స్కంధమాత దుర్గాదేవి అవతారాలలో 5వ అవతారం. కార్తికేయుని మరో పేరు స్కంధ నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. నవరాత్రులలో ఐదవరోజైన ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.

రూపం[మార్చు]

నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది. చేతిలో కమలం, జలకలశం, ఘంటా ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా, స్కందుడు(కుమారస్వామి) ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతా దేవి.

విశిష్టత[మార్చు]

ఈ అమ్మవారు మోక్ష, శక్తి, ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు. స్కందమాతాను ఉపాసించేవాడు నిరక్షరాస్యుడైనా జ్ఞానం ప్రాసాదిస్తుందని పురాణోక్తి. తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈమె. నిస్వార్ధ భక్తి చూపేవారికి జీవితంలో ఇహ, పర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసం. ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం, మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని దేవీ పురాణం చెబుతుంది. ఈ అమ్మవారిని పూజించినప్పుడు, ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తునిచేత పూజింపబడతాడు. దాంతో ఆ ఇద్దరి ఆశీస్సులూ భక్తునికి వస్తాయని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారి ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తుంటారట. స్కందమాతా దుర్గా దేవిని పూజిస్తే జీవితం చివర్లో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి. ఈ దేవి అగ్నికి అధిదేవత కూడా.

కథ[మార్చు]

దస్త్రం:5-Maa Skandamata (Vaishno Devi Maa Chhatikra-Vrindaban).png
తన కుమారుడు స్కంద/కార్తికేయ/కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకున్న స్కందమాతా దుర్గాదేవి.

స్కందపురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివ, పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల(కొన్ని కోట్ల సంవత్సరాలు) కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తరువాత, వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశ్యంతో ఇంద్రుడు, ఇతర దేవతలు కలసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈ లోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లుపొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు పోషించగా, కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు, ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండతూ ఉండమని, ఇది మంచి, ఇది చెడూ అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమనీ శాపం ఇచ్చింది. ఇంతలో అక్కడకు వచ్చిన శివుడు ఆమెను శాంతించమనీ, కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చినా, ఆ తేజస్సు తనది కాబట్టీ ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాశానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టీ కార్తికేయుడనీ, రెల్లు పొద(శరవణాలు)లో ఉన్నాడు కాబట్టీ శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివ, పార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకుని, అతనిపై యుద్ధం ప్రకటించి, దేవతల సేనకు అధ్యక్షుడై అతణ్ణి సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవ సేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభు, నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాతా దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది.

ధ్యాన శ్లోకం[మార్చు]

"సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ"

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]