గణేష్ మండపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008లో ఖైరతాబాద్ వినాయకుడు (హైదరాబాద్, తెలంగాణ)

వినాయక చవితి ఉత్సవాలు అనగానే కొద్ది రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అంతా కలసికట్టుగా జరుపుకునే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కారణం ఇళ్లల్లోనే కాకుండా సామూహికంగా వినాయకున్ని మండపాలలో ప్రతిష్ఠించి పూజించడం, నవరాత్రులు నిర్వహించి ఆ తర్వాత దేవతా మూర్తులను నిమజ్జనం చేయడం.

స్వాతంత్ర్య ఉద్యమంలో[మార్చు]

1893కు ముందు వినాయక చవితిని ఇళ్ళలోనే జరుపుకునేవారు. వినాయకుని విగ్రహాలు పెట్టడం, నిమజ్జనం చేయడం ఉండేవి కావు. పైగా బ్రిటీష్ పాలకుల కాలంలో సామూహికంగా ఎటువంటి కార్యక్రమాలు జరపడానికి అవకాశం ఉండేది కాదు. దేశ స్వతంత్య్రకాంక్షను రగిలించడంకోసం, యువతను ఏకం చేసేందుకు వినాయ‌క చవితి వేడుక‌లే స‌రైన మార్గమ‌ని ఆలోచించి, బాలగంగాధర తిలక్ వినాయక విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించ‌డం, భ‌జ‌న‌లు, పూజ‌లు చేయ‌డం లాంటి కార్య‌క్ర‌మాల‌కు తెరతీశారు.[1] 1894లో మహారాష్ట్రలోని పుణె కేంద్రంగా సార్వజనిక్‌ గణేశ్‌ ఉత్సవ్‌ పేరిట గణేశ్ ఉత్సవాలకు నాంది పలికింది. అప్పటి నుంచి గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న రావడం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులను ఆంగ్లేయులు నిర్బంధించలేకపోవడంతో వినాయకుని సాక్షిగా స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకుంది.

పూజాకార్యక్రమాలు, ఆ త‌ర్వాత జాతీయోద్యమానికి సంబంధించిన పాటలు, ఉపన్యాసాలు ఈ నవరాత్రుల్లో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు తిలక్‌. జాతీయోద్యమ నాయకులకు కూడా ప్రజల్ని చైతన్య వంతులను చేయటానికి ఈ మండపాలు మంచి వేదికగా నిలిచాయి. తరువాతి సంవత్సరం నుంచి ఈ ఉత్సవాలు ఏ ఒక్కచోటక పరిమితం కాకుండా యావత్‌ భారతావనికి పాకాయి. కులమతాలకు అతీతంగా ఏకం అయి ఈ కార్య‌క్ర‌మాల‌కు ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేవారు. దేవాలయాల్లో కన్పించే అంటరానితనం కూడా ఈ మండపాల కారణంగా కనుమరుగవటం ఆరంభమైంది.

1908లో తిలక్‌ జైల్లో ఉన్నప్పుడు ఈ ఉత్సవాలను కట్టడి చేయటానికి బ్రిటిష్‌ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. మేళాలు, భజనలు, కీర్తనలు, ప్రసంగాలపై నిర్బంధం విధించింది. కానీ అవేమీ పనిచేయలేదు. అప్పటికే భారతీయ ఐక్యతకు ప్రతీకగా రూపాంతరం చెందింది గణేశ్‌ ఉత్సవం.

తెలంగాణ రాష్ట్రంలో[మార్చు]

హైదరాబాద్‌ లోని పాతబస్తీలో మహారాష్ట్రీయులు బాలచంద్ర దీక్షిత, వక్రతుండ దీక్షిత, నారాయణరావు పిల్‌ఖానె, లక్ష్మణరావు సదావర్తె, దాదాచారి కాలెమిత్ర తదితరులు 1895లో గుణవర్థక్‌ సంస్థను ఏర్పాటుచేసి తిలక్ స్ఫూర్తితో ఈ ప్రాంగణంలో వినాయకచవితి వేడుకలను ప్రారంభించింది.[2]

కరీంనగర్‌ జిల్లా మంథనిలో కూడా తిలక్ పిలుపుతో 1916లోనే గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌ నుంచి మట్టి విగ్రహాన్ని రహస్యంగా తీసుకొచ్చారు. మంథని ప్రాంత స్వాతంత్ర్య సమరయోధులు సువర్ణ రఘురామయ్య, మార్పాక శేషయ్య, మంథని లింగన్న, లోకే పెద్దరామన్న మొన్నగువారు సర్వజన గజాణన మండలిని ఏర్పాటు చేసి వినాయక నవరాత్రోత్సవాలను మొదలుపెట్టారు. ఇక్కడ ప్రజల్లో చైతన్యాన్ని నింపి, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని రగిలించారు. [3]

మూలాలు[మార్చు]

  1. DelhiSeptember 5, India Today Web Desk New; September 5, 2016UPDATED:; Ist, 2016 13:21. "Lokamanya Bal Gangadhar Tilak, the architect of present day Ganesh Chathurthi celebrations". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-09-11. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. telugu, 10tv (2019-08-30). "నాంది పలికింది ఎవరు? :వీధుల్లో వినాయకుడి ఉత్సవాలకు అసలు కారణం తెలుసా?". 10TV (in telugu). Retrieved 2021-09-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Rajashekhar (2016-09-06). "మంథని గణేష్ ఉత్సవాలకు వందేళ్లు: నాగపూర్ తర్వాత ఇక్కడే!". telugu.oneindia.com. Retrieved 2021-09-11.