త్రైలింగ స్వామి

వికీపీడియా నుండి
(త్రైలింగస్వామి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
త్రైలింగ స్వామి

త్రైలింగ స్వామి (తైలంగ స్వామి, తైలంగ, తైలంగ్ స్వామి, తెలంగ్ స్వామి వంటి పేర్లతోనూ సుప్రసిద్ధులు) ([nb 1] 1607[1] – 1887[1][2] అని నివేదించబడింది) వారణాసిలో సుదీర్ఘకాలంలో జీవించిన హిందూ యోగి, మార్మిక ఆధ్యాత్మిక శక్తులకు సుప్రసిద్ధి పొందినవారు.[1] భారతదేశంలో మరీ ప్రత్యేకించి బెంగాల్లో ఆయన చిరస్మరణీయునిగా నిలిచారు, ఆయన సుదీర్ఘ జీవితాన్ని గురించి, ఆధ్యాత్మిక శక్తుల గురించి పలు కథలు ఉన్నాయి. కొన్ని ఆధారాల ప్రకారం త్రైలింగ స్వామి 280 సంవత్సరాల సుదీర్ఘకాలం జీవించారు.[1][3] వారణాసిలో 1737-1887 మధ్య కాలం నివసించారు.[2] ఆయనను అనుచరులు శివుని అవతారంగా పరిగణిస్తారు. రామకృష్ణ పరమహంస త్రైలింగస్వామిని వారణాసిలోని నడిచే శివుడని ప్రస్తుతించారు.[4]

తొలినాళ్ళు[మార్చు]

ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతంలోని కుంబిలపురం (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలానికి చెందిన కుమిలి గ్రామం)లో శివరాముడన్న పేరుతో జన్మించారు. ఆయన జీవితచరిత్రకారులు, భక్తులు జన్మించిన సంవత్సరం, జీవిత కాలంపై విభేదిస్తున్నారు. భక్తుడైన జీవితచరిత్రకారుని ప్రకారం 1529లో జన్మించారు, మరో జీవితచరిత్రకారుడు 1607గా ప్రతిపాదించారు.[5]

ఆయన తల్లిదండ్రులు నరసింగరావు, విద్యావతీ దేవి శివభక్తులు. 1647లో శివరాముని 40వ యేట తండ్రి మరణించాకా, కుటుంబ సంపద, బాధ్యతలు తన సోదరుని వరసయ్యే శ్రీధరునికి అప్పగించారు. శివరాముని తల్లి యొక్క తండ్రి కాళీ ఉపాసకులు. ఆయన తన కూతురు కడుపునే జన్మించి తన కాళీ సాధనను కొనసాగిస్తూ, లోకోపకారం చేస్తానని ఆమెకు చెప్పారు. శివరాముని తల్లి ఆయనతో తన స్వంత తాతయ్య (ఆమె తండ్రి) ఇలా శివరాముని రూపంలో పునర్జన్మ పొందినట్టుగా చెప్పి, కాళీ సాధన స్వీకరించమని సూచించారు. తల్లి నుంచి కాళీ మంత్రాన్ని స్వీకరించి, దగ్గరలోని కాళికాలయంలోనూ, తల్లి నుంచి మరీ దూరం కాని దాపుల్లోని పుణ్యక్షేత్రాల్లోనూ ప్రయాణాలు చేస్తూ కాళికా సాధన కొనసాగించారు. 1669లో ఆయన తల్లి మరణించారు, ఆ తర్వాత ఆమె చితా భస్మాన్ని దాచిపెట్టి ఆమె చితాభస్మాన్ని శరీరంపై ధరించి అహోరాత్రాలు తీవ్రమైన కాళికా సాధన సాగించారు. తల్లి అంత్యక్రియలు చేసిన శ్మశానానికి సమీపంలోనే తన సోదరుడు నిర్మించి ఇచ్చిన ఆశ్రమంలో ఆయన జీవించేవారు. 20 సంవత్సరాల ఆధ్యాత్మిక సాధన తర్వాత తన గురువైన భగీరథానంద సరస్వతిని 1679లో పంజాబ్ ప్రాంతంలో కలిశారు. భగీరథానంద 1685లో శివరామునికి సన్యాసమిచ్చి, స్వామి గణపతి సరస్వతిగా దీక్షానామమిచ్చారు. గణపతి స్వామి తీవ్రమైన తపస్సు చేసి, తీర్థయాత్ర ప్రారంభించి 1733 నాటికి ప్రయాగ చేరుకున్నారు. 1737కు వారణాసి వెళ్ళి అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. [5]

స్వామి తన జీవితంలో ప్రధానమైన భాగాన్ని గడిపిన వారణాసి (1922 నాటి చిత్రం)

వారణాసి జీవనం[మార్చు]

దశనామీ సాంప్రదాయంకు చెంది సన్యాస జీవితాన్ని గడుపుతున్న ఆయనను వారణాసిలో నివాసం ఏర్పరుచుకున్నాకా త్రైలింగ స్వామి అని పిలువనారంభించారు. త్రిలింగ ప్రాంతంగా పిలిచే తెలుగు ప్రాంతం నుంచి వచ్చినవారు కనుక త్రైలింగ స్వామి అని పిలిచారు.

1887లో ఆయన పరమపదించేవరకూ వారణాసిలోని అసి ఘాట్, హనుమాన్ ఘాట్, వేదవ్యాస ఆశ్రమం, దశాశ్వమేధ్ ఘాట్ వంటి ప్రాంతాల్లో జీవించారు. ఆయన తరచుగా ఘాట్లు, రోడ్లపై నగ్నంగా, పసిపిల్లాడికి ఉండే నిర్లక్ష్యంతో సంచరిస్తూ కనిపించేవారు.[6] గంగా నదిపై గంటల పాటు తేలుతూనో, ఈదుతూనో కనిపించేవారని చెప్తారు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు, కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు మాట్లాడేవారే కారు. తమ బాధలను ఉపశమింపజేయగల, నివారించగల యోగశక్తి ఆయనకుంది అని తెలుసుకుని చాలామంది ఆకర్షితులయ్యేవారు.[6] ఆయన వారణాసిలో నివసిస్తున్నప్పుడు వారి సమకాలికులు, జన్మత: బెంగాలీలైన పలువురు సాధువులు ఆయనను కలిసి, ఆయనను విశేషాలను అభివర్ణించారు. అటువంటివారిలో లోకనాథ్ బ్రహ్మచారి, బెనమాధవ బ్రహ్మచారి, భగబాన్ గంగూలీ, రామకృష్ణ పరమహంస,[7] వివేకానంద,[8] మహేంద్రనాథ్ గుప్త,[9] లాహిరి మహాశయులు,[3] స్వామి అభేదానంద,[10] భాస్కరానంద, విశుద్ధానంద, విజయకృష్ణ మొదలైనవారు ఉన్నారు.[11]

త్రైలింగుని చూశాకా రామకృష్ణ పరమహంస, "తన శరీరాన్ని అభివ్యక్తికి వాహకంగా ఉపయోగించుకుంటూ పరమేశ్వరుడు తానే స్వయంగా వాడుకోవడం చూశాను. ఆయన జ్ఞానంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ఆయనకు శరీర స్పృహ లేదు. అక్కడి ఇసక సూర్యుని వేడిమికి చాలా వేడెక్కిపోయి ఎవరూ పాదం కూడా మోపేలా లేదు. కానీ ఆయన హాయిగా దానిపై పడుకున్నారు" అన్నారు.[1][12] అలానే త్రిలింగ స్వామి నిజమైన పరమహంస అని రామకృష్ణ పరమహంస వ్యాఖ్యానిస్తూ[9] ఆయన నివసించినందువల్ల మొత్తం కాశీ వెలుగుతోందని అన్నారు."[1]

త్రిలింగ స్వామి ఎవరినీ ఏమీ అడగరాదన్న అయాచక దీక్ష స్వీకరించారు— అడగకున్నా లభించినది ఏదైనా దానితోనే సంతృప్తి పడేవారు.[6] ఆయన ప్రఖ్యాతి వ్యాపించి ఎందరో తీర్థయాత్రికులు, భక్తులు గుంపులుగా సందర్శించడం ప్రారంభించారు. చివరి రోజుల్లో అజాగరవృత్తి అని పిలిచే ఓ పద్ధతిని అనుసరించి కొండచిలువలాగా ఏ కదలిక లేకుండా ఉండిపోయేవారు. అలాంటి స్థితిలోని ఆయనపై భక్తులు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకూ శివుని ప్రత్యక్షావతారంగా భావించి అభిషేకం చేశారు.[6]

మరణం[మార్చు]

డిసెంబర్ 26, 1887 సోమవారం సాయంత్రం ఆయన పరమపదించారు. దశనామి సంప్రదాయానికి చెందిన సాధువుల అంత్యక్రియలు చేసే విధానం ప్రకారం ఎందరో భక్తులు ఘాట్లలో హాజరై ఉండగా ఆయన శరీరాన్ని గంగానదిలో సలిలసమాధి (సలిలం అంటే నీరు) [6]

జీవిత గాథలు[మార్చు]

తెలంగ్ స్వామి గురించి, ఆయన ఆధ్యాత్మిక శక్తుల గురించి అనేక కథలు గాథలు ఉండేవి, ఆ కథలు దేశమంతటా వ్యాపించి ఆయన భారతదేశంలో మార్మిక, ఆధ్యాత్మిక వ్యక్తిగా ప్రఖ్యాతులయ్యారు. రాబర్ట్ ఆర్నెట్ ప్రకారం ఆయన చేసిన అద్భుత చర్యలన్నీ చక్కగా నమోదయ్యాయి, పుక్కిటి పురాణాలని కొట్టిపారేయలేని మార్మిక, అద్భుత శక్తులను ప్రదర్శించారు, స్వయంగా ఆ చర్యలను దర్శించిన సజీవ సాక్షుల నుంచి సమచారం నమోదైందని చెప్పారు.[13] ఆయన 280 ఏళ్ళ పాటు జీవించినట్టు రికార్డులు చెప్తూండగా, అతితక్కువ ఆహారం తీసుకునే ఆయన శరీరం 140 కేజీలు బరువు ఉండేది.[13] ప్రజల ఇంగితాన్ని పుస్తకం చదివినట్టు చదివేసేవారట.[1]

భయంకరమైన కాలకూట విషాలను ఏ దుష్ప్రభావం లేకుండా స్వీకరించేవారు. ఆయన మహిమలు మోసంగా భావించన ఒక వ్యక్తి మోసగాడని నిరూపించదలుచుకుని వచ్చారు. సాధువు మజ్జిక స్వీకరించి తన ఉపవాస దీక్ష ముగించేవారు, దాంతో ఆ వచ్చిన వ్యక్తి సున్నం తీసుకువచ్చి ఇచ్చారు. స్వామి దాన్ని ఏ చెడు ప్రభావం లేకుండా మొత్తం బకెట్ అంతా తాగేశారు. అయితే ఆ ఇచ్చిన వ్యక్తి మాత్రం కడుపునొప్పితో గిలగిలలాడారు. తన మౌన దీక్షను భగ్నం చేస్తూ ఆయన కర్మ సిద్ధాంతాన్ని, కార్య కారణ ఫలితాలను వివరిస్తూ ప్రసంగించారు.[3][13]

మరో గాథ ప్రకారం సాధువు నగ్నంగా జీవించేవారు. వారణాసి పోలీసులు ఆయన ప్రవర్తన మర్యాదకరంగా లేదంటూ జైల్లో పెట్టారు. కానీ ఆ జైలర్ చూస్తూండగానే, మాయమై జైలు పైకప్పుపైకి చేరారు. పోలీసులు మళ్ళీ ఆయన మహిమ చూసేందుకు నిర్బంధించారు. తిరిగి అలానే మాయమై పైకప్పుపైన ప్రత్యక్షమయ్యారు. కొద్దిసేపటికి మహిమ తెలుసుకుని వారణాసి వీధుల్లో తిరిగేందుకు వదిలివేశారు.[1][3]

గంగానదిపై రోజులపాటు వాయుస్తంభనం చేసి కూర్చుని వుండడం వేలాదిమంది ప్రజలు చూసినట్టు నమోదైవుంది. కెరటాల కిందకు మాయమై, ఏ ఇబ్బందీ లేకుండా మళ్ళీ కొన్నాళ్ళకు ప్రత్యక్షమయ్యారు.[3][13] స్వామి శివానంద సరస్వతి మాట్లాడుతూ పంచభూతాలు ఆయనను ఏమీ చేయలేని భూతజయ సిద్ధి పొందారని, అగ్ని ఆయనను తగలబెట్టలేదు, నీరు ముంచలేదు అన్నారు.[14][self-published source?]

మేధసాధన అనే రచయిత త్రైలింగ స్వామి జీవితంలో కనబరిచిన యోగశక్తులు, సుదీర్ఘ జీవితం యోగ శాస్త్రం ప్రకారం సాధించడానికి అసాధ్యమేమీ కాదు.[15]

బోధనలు[మార్చు]

ఆయన భక్తుల్లో ఒకరైన ఉమాచరణ్ ముఖోపాధ్యాయ్ రాసిన జీవితచరిత్రలో ఆయన బోధనలు లభిస్తున్నాయి. బంధాన్ని ప్రపంచంతో సంబంధంగా, విముక్తిని ప్రపంచంతో అనంగీకారం, భగవంతునిలో లీనంగా పేర్కొనేవారు.[16] కోరిక లేని స్థితిని సాధించడంతోనే ప్రపంచం స్వర్గంగా మారిపోతుందని, ఆధ్యాత్మిక జ్ఞానంతో సంసార చక్రం నుంచి విముక్తి పొందవచ్చని చెప్పేవారు. అశాశ్వతమైన ప్రపంచంతో సంబంధం మన భయంకరమైన వ్యాధి అనీ, దానికి మందు అది అశాశ్వతమని గ్రహించడమనీ పేర్కొనేవారు.[16]

మనిషికి పంచేంద్రియాలు శత్రువులని, ఇంద్రియ నిగ్రహం స్నేహితులనీ వర్ణించేవారు. అసూయపరుడే పేదవాడని, ఎప్పుడూ ఒకేలా ఉండగల స్థితప్రజ్ఞుడు అత్యంత సంపన్నుడని చెప్పేవారు.[16] మన స్వచ్ఛమైన మనస్సు అతి గొప్ప పుణ్యక్షేత్రమని, వేదాంత సత్యాన్ని గురువునుంచి పొందమని సూచించేవారు. బంధాల భ్రమల నుంచి విముక్తి పొందినవాడు సాధువని పేర్కొనేవారు.[16] అహమన్న దాన్ని జయించినవాడే నిజమైన ఋషి అనేవారు.

నోట్స్[మార్చు]


మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Varishthananda 2007
  2. 2.0 2.1 McDermott, Rachel Fell (2001).
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Yogananda, Paramhansa (1948).
  4. Rao 2004, p. xii
  5. 5.0 5.1 Medhasananda 2003, p. 218
  6. 6.0 6.1 6.2 6.3 6.4 Medhasananda 2003, p. 219
  7. Gupta, chapter 7 Archived 2017-12-21 at the Wayback Machine.
  8. Noble, Margaret E. (August 2005).
  9. 9.0 9.1 Gupta, Mahendranath (1942).
  10. Page, Mary Le (1947).
  11. Medhasananda 2003, p. 220
  12. Isherwood, Christopher (1980).
  13. 13.0 13.1 13.2 13.3 Arnett 2006, p. 23
  14. Sivananda.
  15. Medhesananda 2003, p. 219
  16. 16.0 16.1 16.2 16.3 Medhasananda 2003, p. 221

ఇవి కూడా చదవండి[మార్చు]

  • Arnett, Robert (2006). "Introduction". India Unveiled. Atman Press. ISBN 978-0-9652900-4-3.
  • Medhasananda (2003). Varanasi At the Crossroads. Ramakrishna Mission Institute of Culture. p. 1042. ISBN 81-87332-18-2.
  • Rao, V.V.B. Rama (2004). The walking Shiva of Varanasi: life, legends & teachings of Trailingaswami. Richa Prakashan. pp. 177. ISBN 81-901200-8-5.
  • Varishthananda, Swami (November 2007). "Varanasi: The City of Saints, Sages, and Savants" (PDF). Prabuddha Bharata. 112 (11): 632–633. 
  • Chattopadhyay, Apurba (2015). Trailanga Swami Samagra [Bengali]. Patra Bharati. ISBN 978-8183743600.
  • Saraswati, Paramanand (3 Jun 2014). Trailanga Swami and Shankari Mataji. CreateSpace Independent Publishing Platform. p. 176. ISBN 978-1499166583.
  • Tattwananda, Swami (28 Jul 2008). The Saints of India. Nirmalendu Bikash Sen Gupta. p. 288.

బయటి లంకెలు[మార్చు]