దొమ్మరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1860లో దొమ్మరి కులానికి చెందిన వ్యక్తి- ఉత్తర బంగ్లాదేశ్ (అప్పట్లో పాకిస్తాన్)

దొమ్మరి (दोम्बा : मराठी) ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఒడిషా, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాలలో కనిపించే ఒక సంచార జాతి. వీరు పాకిస్తాన్ లో కూడా కనిపిస్తారు. వీళ్ళది మన రాష్ట్రంలో బి.సి.ఏ గ్రూపు కులం. మన రాష్ట్రంలోని నల్లగొండ, గుంటూరు జిల్లాలలో వీరు వ్యభిచారం చేస్తారు. కర్నాటక, ఒడిషా, మహారాష్ట్రలలోని దొమ్మరి వారు వ్యభిచారం చెయ్యరు. వీరిని ఒడిషాలో దోంబో అని అంటారు. ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్, కాశ్మీర్ రాష్ట్రాలలో వీరు షెడ్యూల్డ్ కులంగా గుర్తుంపు పొందారు. వీరిని కర్నాటకలో దొంబర అనీ, తమిళ నాడులో తొంబర అనీ, మహారాష్ట్రలో దోంబా అనీ అంటారు.

సామాజిక జీవనం, వృత్తి[మార్చు]

వీరిలో కొందరు వీధిలో సర్కస్ ప్రదర్శనలు ఇచ్చి సంపాదించేవారు. ఒకనాడు పడుపు వృత్తే వీరి జీవనాధారం. దొమ్మర కులంలో పుట్టిన పాపానికి... మనసు మాట వినకపోయినా మానసిక క్షోభతో గతంలో పడుపు వృత్తి నిర్వహించేవారు. ఆ సందర్భంగా పుట్టినదే ఈ సామెత: " చెప్పేది సారంగ నీతులు, దూరేది దొమ్మరి గుడిసెలు" నాటి కులవృత్తి తాలూకు వెక్కిరింపులతో ఆ కులం పేరుతో నేటి సమాజంలో బతికే మనోధైర్యం కొరవడి నరకయాతన అనుభవిస్తున్నారు. బిడ్డలను చదివించాలన్న ఆరాటం ఉన్నా ఆ కులం పేరుచెప్పుకోలేక, పాఠశాల విద్యకు కూడా వెళ్ళటం లేదు. కనిగిరి పట్టణ శివారు ప్రాంతంలో దాదాపు వంద కుటుంబాల దొమ్మరులు నివసిస్తున్నారు. ఆడవారు ఇళ్ళల్లో పాచి పనులు, మగవారు చెక్క దువ్వెనలు, ఈరిబానులు అమ్ముకోవడం, గేదెల కొమ్ములు కోయడం, పండ్ల బండ్లు వేసుకొని కాయలు అమ్ముకుంటున్నారు. అడవి ప్రాంతంలో తెచ్చుకున్న కరల్రతో చెక్క దువ్వెనలు, ఈరిబానులు తయారు చేసుకొని వాటిని ఊరూర తిరిగి అమ్ముకొని జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. దువ్వెనల తయారీ పందుల పెంపకం వీరి కుటీర పరిశ్రమలు. వారు ఒళ్లు గగుర్పొడిచే విద్యలు ప్రదర్శిస్తారు. సన్నటి తాడుపై నడచి అబ్బు రపరుస్తారు. బిందె మీద బిందెలు పెట్టి వాటిపైన సాహసాలు చేస్తారు. గడ ఎక్కి ఊరికి శుభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈనాటి జిమ్నాౙియంకు తీసిపోని విన్యాసాలు చేస్తారు దొమ్మరులు. దారిన వెళ్లేవారు కూడా కాసేపు నిలబడి వీరి ప్రదర్శన చూసి సంతోషంగా తమకు తోచినంత ఇచ్చి వెళ్లేవారు. సినిమాలూ, టీవీల రాకతో... వినోదం పంచే వీరి జీవితాల్లో విషాదం ఆవరించింది. దొమ్మర కులస్థులు నిత్యసంచారులు. చివరికి...వారుండే గుడిసెలను కూడా గాడిదలపై వేనుకుని ఊరూరా తిరుగుతారు. వీరు ఇంట్లో వస్తువులతో పాటు మేకలు, కుక్కలను కూడా తమ వెంట తీసుకెళ్లి ముందుగా ఊరి చివర దిగుతారు. తర్వాత ఊరి పెద్ద వద్దకు పోయి ఆ గ్రామంలో ప్రదర్శన ఇస్తామని చెబుతారు. దొమ్మరులు గ్రామంలో అడుగుపెడితే శుభసూచకమనే భావన ఉండేది. ఎవ్వరూ అడ్డు చెప్పేవారు కాదు. గ్రామంలోకి రావటానికి ఒకవేళ ఏ గ్రామ పెద్దయినా అంగీకరించకపోతే మరో ఊరు ఎంచుకునేవారు. గ్రామంలోకి ప్రవేశించేటప్పుడు వీరి దగ్గరున్న కత్తులు, డోలు, ఇనుప రింగులు, గడలు, తాళ్లు, ఇతర వస్తువులు, జంతువులు, చెంబు తపేళాతో సహా లెక్కలు చెప్పాల్సిందే. వెదురు బద్దలను వంచి, వాటిపైన కాసెగడ్డి పరిచి క్షణాల్లో గుడిసెలు వేస్తారు. వర్షాకాలం కూడా చుక్కనీరు కారదు. ప్రతి కుటుంబానికి ఇలాంటి గుడిసె ఉంటుంది. వీరు ఉదయాన్నే తమ ఆట (తమ విద్యను ప్రదర్శించేందుకు వినియోగించే వస్తువులు) సామానుకు మొక్కితే కాని బయటకు రారు. పదేళ్లు వచ్చేసరికి వీరు తమ పిల్లలకు శిక్షణ ఇస్తారు. గడ ఎక్కడం, దూకటం, పల్టీలు కొట్టటం, బిందెల మీద బిందెలు పెట్టి దానిమీద మనిషిని నిలబెట్టటం వంటివి సాధన చేయిస్తారు. విన్యాసాలు ప్రదర్శించే ఒక బృందం తయారు కావాలంటే కనీసం ఎనిమిది మంది ఉండాలి. వీరంతా గ్రామ కూడలిలోనో, చావిడి దగ్గరో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. దొమ్మరులు గ్రామానికి వస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం కనుక వర్షాలు కురవకపోయినా, పంటలు పండక పోయినా దొమ్మరవాళ్లను ఆ గ్రామా నికి ప్రత్యేకంగా పిలిపించుకుంటారు. దొమ్మర ఆడపడుచుతో వ్యవసాయ భూముల్లో ప్రదర్శన ఏర్పాటు చేయిస్తారు. వేపాకు, పసుపు, బియ్యం కలిపిన మూటను నడుముకు కట్టుకున్న దొమ్మర మహిళ గడ ఎక్కుతుంది. దాదాపు 40 అడుగుల ఎత్తున్న ఈ గడపై ఆమె విన్యాసాలు చేస్తూ వడిలో ఉన్న బియ్యాన్ని వ్యవసాయ భూములపై విసురుతుంది. బావుల దగ్గర కూడా ఆమె ఓడు బియ్యాన్ని చల్లుతుంది. ఈ తంతు ముగిశాక వర్షాలు కురిసి గ్రామం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. విన్యాసాలు చేసే సమయంలో ప్రమాదవశాత్తు జారిపడితే వెంట తెచ్చుకున్న చెట్ల పసర్లతో వైద్యం చేసుకునేవారు. వీరు వైద్యంకోసం డాక్టర్ల దగ్గరకు వెళ్లడం చాలా అరుదు. ఈతాకులు దొరకడం కరవైంది. పైగా ఈత చాపలు కొనుక్కునేవారి సంఖ్య తగ్గటంతో కొందరు పందులు, మేకల పెంపకాన్ని చేపట్టారు. ఈ కులస్థులు ఎస్టీ జాబితాలో ఉండేవారు. తర్వాత వీరిని బీసీ-ఎ లోకి మార్చారు. నిజానికి వీరు గిరిజనుల కిందికే వస్తారు.

చరిత్ర[మార్చు]

వీరు రాజ వంశీకులుగా, సైన్యంలో క్షత్రియ విద్యల్లో ఆరి తేరి ముఖ్యమైన స్థానాలలో పనిచేశారు. యుద్ధాలలో పురుషులను చంపి, రాణివాసంలో ఉన్న మహిళలను తీసుకుపోయి తమ అవసరాలు తీర్చుకుని వదిలేస్తే వారి సంతతే ఈ దొమ్మరులయ్యారని చరిత్ర . దొమ్మర కులం అంటే సమాజంలో హీనభావం ఉంది. కనుక ఈ కులం పేరు చెప్పుకోవటానికి ఇప్పటివారు ఇష్టపడడం లేదు. దొమ్మర కులాన్ని బీసీ ఎ జాబితాలో నుండి ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు.

ఇతర పఠనాలు[మార్చు]

  • ఎ.అయ్యప్పన్ (1944). మానుషశాస్త్రం - ఆదిమ నివాసులు.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దొమ్మరి&oldid=3788284" నుండి వెలికితీశారు