భారతదేశం కోసం ప్రత్యేక కార్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1943 నవంబరు 18 న హోటల్ కైసెర్‌హోఫ్‌లో జరిగిన కార్యక్రమంలో "స్పెషల్ బ్యూరో ఫర్ ఇండియా డైరెక్టర్, విదేశాంగ కార్యదర్శి విల్హెల్మ్ కెప్లర్" జర్మనీ విదేశాంగ మంత్రి జోచిమ్ రిబ్బెంట్రాప్ తరపున శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతకు ఆరు నెలల ముందు జర్మనీ నుండి వెళ్ళిన సుభాష్ చంద్రబోస్, సింగపూర్‌లో స్వేచ్ఛా భారతదేశపు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరచిన సందర్భంగా ఈ వేడుక జరిగింది.

భారత దేశపు ప్రత్యేక కార్యాలయం (స్పెషల్ బ్యూరో ఫర్ ఇండియా) 1941 వసంత ఋతువు చివరిలో నాజీ జర్మనీ విదేశాంగ శాఖ లోని సమాచార విభాగంలో ఏర్పరచిన విభాగం. ఆ సంవత్సరం ఏప్రిల్ ప్రారంభంలో జర్మనీ వచ్చిన భారతీయ జాతీయవాది సుభాస్ చంద్రబోస్ రాసిన ప్రతిపాదన లేదా మెమోరాండంకు ప్రతిస్పందనగా దీన్ని ఏర్పాటు చేసారు. [1] జర్మను భాషలో దీన్ని సోండర్రెఫరెట్ ఇండియెన్ అనే పేరుతో దీన్ని ఏర్పరచారు. [2] [3] [1] బోస్‌కు అతని పనిలో సహాయం చేయడం, [2] బోస్‌తో సంబంధాలు పెట్టుకోవడం, [3] ఎర్విన్ రోమ్మెల్ నేతృత్వం లోని ఆఫ్రికా కోర్ పట్టుకున్న భారతీయ యుద్ధ ఖైదీలతో ఒక ఇండియన్ లీజియన్‌ను ఏర్పాటు చెయ్యడం ఈ బ్యూరో ప్రధాన విధులు. ఈ లీజియన్ భవిష్యత్తులో భారతదేశంపై జర్మన్ మిలిటరీ చేసే భూ దండయాత్రలో పాల్గొంటుంది. [2] బోస్ ప్రతిపాదనలోని రెండు ప్రధాన అంశాలలో ఒకటైన భారతదేశంలో సైనిక జోక్యం కు మొదట్లో జర్మనీ విదేశాంగ మంత్రి జోచిమ్ వాన్ రిబ్బెంట్రాప్ ప్రతిస్పందన ఒక మోస్తరుగా ఉంది. అయితే కొద్దికాలం తర్వాత దానికి అడాల్ఫ్ హిట్లర్ నుండి ఊహించని మద్దతు లభించింది. రష్యాపై విజయవంతమైన జర్మన్ దండయాత్ర పర్యవసానంగా బ్రిటిషు సామ్రాజ్యానికి అంతిమ దెబ్బ తీసే అవకాశమే ఈ భారతదేశం యుద్ధమని అతడు భావించాడు. [4]

రిబ్బన్‌ట్రాప్‌తో నేరుగా మాట్లాడే చొరవ కలిగి, జర్మన్ విదేశాంగ కార్యాలయంలో అండర్-సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఉన్న విల్హెల్మ్ కెప్లర్ ఈ బ్యూరో డైరెక్టరుగా నియమితుడయ్యాడు. [3] అయితే రోజువారీ పనిలో ఎక్కువ భాగం భారతదేశం గురించి కొంత అవగాహన ఉన్న నాజీ వ్యతిరేక అధికారి అయిన ఆడమ్ వాన్ ట్రాట్ జు సోల్జ్‌ చేసేవాడు [3] వాన్ ట్రాట్ కింద అతని చిరకాల మిత్రుడు అలెగ్జాండర్ వెర్త్ ఉండేవాడు. అతన్ని అంతకుముందు కొన్ని సంవత్సరాల పాటు నాజీలు ఖైదు చేసారు. [3] బ్యూరోలోని మిగిలిన సిబ్బందిలో FJ ఫుర్ట్‌వాంగ్లర్, AF రిక్టర్, HT లీపోల్ట్ట్, ప్రొఫెసర్ డాక్టర్ అల్స్‌డోర్ఫ్ (ఇండాలజిస్టు), శ్రీమతి క్రూస్, డా. క్రెట్‌ష్మెర్, బారన్ వాన్ జిట్జెవిట్జ్, బారన్ వాన్ లెవిన్స్‌కి, మిస్టర్ అస్మాన్, మిస్టర్ ట్రంప్ ఉన్నారు. [3] విదేశాంగ కార్యాలయంలోని సీనియర్ అధికారుల ఆదేశం మేరకు బోస్‌ను "హిస్ ఎక్సలెన్సీ" అని సంబోధించవలసి ఉండేది. [5]

కాలక్రమేణా, బ్యూరో నాజీ-వ్యతిరేక వ్యక్తులకు ఆశ్రయంగా మారింది. ముఖ్యంగా వాన్ ట్రాట్ స్వయంగా, అతను తన "విదేశాలలో రహస్య కార్యకలాపాలకు" తన స్థానాన్ని కవర్‌గా ఉపయోగించుకున్నాడు. [6] [3] వాన్ ట్రాట్ స్పెషల్ బ్యూరో వ్యాపారంలో "స్విట్జర్లాండ్, టర్కీ, స్కాండినేవియా, నాజీ-ఆక్రమిత యూరప్ అంతటా" ప్రయాణించాడు. కానీ వాస్తవానికి నాజీ విధానాలను వ్యతిరేకిస్తున్న జర్మన్ సైనిక అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించాడు. ఈ ప్రక్రియలో తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. [7] వాన్ ట్రాట్‌ను 1944లో నాజీలు ఉరితీసారు. వాన్ ట్రాట్ చేసిన నాజీ-వ్యతిరేక పనుల గురించి బోస్‌కు బహుశా తెలిసి ఉండకపోవచ్చు, [7] ఎందుకంటే బోస్, వాన్ ట్రాట్‌లు వ్యక్తిగత స్నేహాన్నీ, పరస్పర విశ్వాసాన్నీ పెంచుకోలేదు. [7] తరువాతి కాలంలో కొంతమంది పండితులు వీరి మధ్య స్నేహం ఉందని సూచిస్తూ, బోస్‌ను నాజీ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. [8] చరిత్రకారుడు లియోనార్డ్ ఎ. గోర్డాన్, ప్రకారం వాన్ ట్రాట్, "... నాజీ దౌర్జన్యాన్నీ, జర్మన్ సంప్రదాయంలో ఉత్తమమైన వాటిని ఎలా నాశనం చేస్తోందో బోస్ అర్థం చేసుకోలేదనీ, ... బోస్‌తో అతడు లోతైన సానుభూతిని, సాన్నిహిత్యాన్నీ పెంచుకోలేదు" [7]

మూలాలు[మార్చు]

 

  1. 1.0 1.1 Kuhlmann 2003, p. 158.
  2. 2.0 2.1 2.2 Klemperer 1994, p. 275.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 Gordon 1990, p. 445.
  4. Hayes 2011, pp. 38–39.
  5. Klemperer 1994, p. 276.
  6. Klemperer 1994, pp. 275–276.
  7. 7.0 7.1 7.2 7.3 Gordon 1990, p. 446.
  8. Hayes 2011, p. 210.