మాఘ స్నానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్నానం ఒక ఔషధం లాంటిది. ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వం స్నానం చేయడం వల్ల శరీరం మనస్సు పరిశుద్ధం అవుతాయి. ఉత్సాహం చురుకుదనం కలుగుతుంది. ప్రకృతిలో జరిగే అనేక రసాయనిక క్రియల వల్ల శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది. సూర్య కిరణాలలో కొన్ని రకాల రుగ్మతలను నివారించగల శక్తి ఉండటంతో ఆ కిరణాలు శోకిన నదులు, బావులు, చెరువులు మొదలైన జలాలకు కూడా ఆ శక్తి లభిస్తుంది. అందువల్ల ప్రకృతిలో జీవించి పరిశోధించి తపశ్శక్తితో అతీంద్రియ రహస్యాలు తెలుసుకున్న మహారుషులు భావితరం వారు ప్రయోజనాలు పొందడం కోసం కొన్ని నియమ నిబంధనలను విధించారు. వాటిలో మాఘ స్నానం ఒకటి.

ఈ స్నానం ప్రయోజనం[మార్చు]

ఈ మాఘ స్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుర్ధాయంతో పాటు మంచితనం, ఉత్తమ శీలం లభిస్తాయని పద్మ పురాణంలో ఉంది. ఇటువంటి ప్రభావాలకి ముఖ్య కారణం సూర్యుడు మకర రాసిలో ప్రవేశించడమే. ఈ సమయంలో శివకేశవులు ఇరువురినీ పూజించాలనీ, దాన ధర్మాలు చేయాలనీ సాధ్యమైనంత వరకు దైవచింతనతో గడపాలని, ఈ మాసమంతా నదీ స్నానం చేయలేకపోయినా కనీసం మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి మొదలైన రోజులలో అయినా చేస్తే మంచిదని. ఎందుకంటే ఎక్కడెక్కడి నీళ్ళలోనైనా గంగ ప్రవేశించి ఉంటుందన్న నమ్మకం. వాటిలో ముఖ్యంగా ప్రత్యేకించి మాఘ శుద్ధ ఏకాదశి మరింత పవిత్రమైన రోజు. ఆ రోజు విష్ణుమూర్తికి ప్రియమైన రోజే గాక పుష్యమీ నక్షత్రం కుడా కలిస్తే మరింత పర్వదినంగా భావిస్తారు. ఆ పుణ్యం మహత్తరమైనది. అంతేకాదు మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం చేసినంత ఫలితం లభిస్తుందట.

ఇక ఇదే మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశి శివునికి ప్రీతిపాత్రమైనది. ఆ రోజే శివరాత్రి. అందుకే శివకేశవులు ఇరువురికీ ఇష్టమైన మాసం ఈ మాఘమాసం. అయితే కేవలం పుణ్యఫలం మోక్షదాయకం అనేకాదు హేతువాద దృష్టితో యోచిస్తే స్నానాలకీ, దానాలకీ మోక్షం లభిస్తుందా? అనుకుంటే లభిస్తుందనే చెప్పుకోవాలి. సూర్యోదయానికి ముందుగా స్నాన, ధ్యాన, జప, తపాదులు దాన, ధర్మాలు చేసుకుంటే శరీరంతో పాటు మనసు కూడా పరిణతి చెంది పరిశుద్ధమైన ఆత్మజ్ఞానానికి అనువుగా మారుతుంది. అందువల్ల కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉత్తమ శీలం, కార్యదీక్ష, భగవత్ చింతన, మనస్సుద్ధి లాంటి లక్షణాలు కలుగుతాయని ఒక నమ్మకం. కార్తీకం, మాఘం మొదలైన మాసాలలో విధించిన ఈ పద్ధతులు అన్నీ మోక్షమార్గాలేనట.

దానం చేయవలసినవి[మార్చు]

ముఖ్యంగా ఈమాఘమాసంలో ేగుపళ్ళు, అరటి, ఉసిరి, నిమ్మ, దబ్బ, పాలు, పెరుగు, ఉప్పు, చక్కెర, తేనె, బెల్లం, జాజికాయ, పిప్పళ్ళు, పత్తి, శొంఠి, జీలకర్ర, యజ్ఞోపవీతం, కంబళి వంటి వస్త్రాలు, అన్నంతో బాటు కంచు పళ్ళెం, పువ్వులు, గోపీ చందనం, శంఖం లాంటివీ, పూజా సామాగ్రి, నల్లని సాలగ్రామం, స్పటిక లింగం, వినాయక ప్రతిమ, దుర్గా ప్రతిమ మొదలైనవి దానం చేయడం వలన మోక్షం లభిస్తుందని మాఘమాస మహిమల గురించి పద్మ పురాణంలో విశదీకరించి ఉంది.

ఇతర విశేషాలు[మార్చు]

ఇక ప్రవాహ జలంలో స్నానం అత్యుత్తమం. సమీపంలో నది, కాలువ, చెరువు లాంటివి ఉంటే ఆరోగ్యవంతులు ఇంటి వద్ద స్నానం చేయకూడదు. నూతి వద్ద, చెరువులోను చేసే స్నానం మధ్యమం. స్నానానంతరం పసిపిల్లలు, రోగులు, పెద్దలు తప్ప చలిమంటలు వేసుకోరాదు. దగ్గరలో నదులు, చెరువులు లేనివారు -

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు

అనే శ్లోకాన్ని పఠించి ఆవాహన చేసుకుని స్నానం చేయవచ్చు.

వెలుపలి లింకులు[మార్చు]