వాడుకరి:V Bhavya/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మా ఊరి గ్రామ దేవత- కొండలమ్మ తల్లి (కొండుభొట్లవారిపాలెం)[మార్చు]

మా ఊరి గ్రామ దేవత శ్రీ కొండలమ్మ తల్లి.గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదులనుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూతప్రేతాల నుండి రక్షిస్తూ, గ్రామ పొలిమేరలో ఎల్లప్పుడూ కావలి కాస్తూ ఉండే తల్లి కొండలమ్మ తల్లి. ఆ తల్లి చాలా మహిమ గల అమ్మవారు.మా ఊరి ప్రజలకు ఆ తల్లి అంటే చాలా భక్తి, నమ్మకం. ఎవరికి ఏ కోరికలు ఉన్నా కూడా ఆ తల్లి కి మొక్కుకుంటారు. అందరి కోరికలు తీర్చే తల్లి ఆ కొండలమ్మ తల్లి. ప్రతి సంవత్సరం ఊరి ప్రజలందరూ కలసి అమ్మ వారి జాతర చాలా బాగా జరుపుతారు. ఊరి ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా జాతర సమయానికి ఊరికి తప్పకుండా వస్తారు. కొండలమ్మ తల్లి జాతరను మూడు రోజులు జరుపుతారు. ఈ మూడు రోజులు అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కోవిధంగా కొలుస్తారు.మొదటి రోజు అమ్మవారికి సద్ది పెడతారు. రెండవ రోజు పొంగలి,పానకం, వడపప్పు,చలిమిడి నైవేద్యంగా పెడతారు. పసుపు నీళ్ళల్లో వేపాకు వేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు అందరూ వారి మొక్కులను చెల్లించుకుంటారు. మూడవ రోజు సిడిమాను ఊరేగింపు జరుపుతారు. ప్రభలను కూడా ఊరేగిస్తారు. ఈ మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ జాతరను "కొలుపులు" అని పిలుస్తారు. ఈ కొలుపులకి బంధువలని ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసి భోజనం పెడతారు. ఈ విధంగా అమ్మ వారి జాతరను చాలా బాగా జరుపుకుంటారు.

కొండలమ్మ తల్లి ప్రతిష్టాపన[మార్చు]

కొండుభొట్ల వారి పాలెం సమీపంలోని గుంటూరు గేటు దగ్గర అ ఒక దర్గా ఉంది, దానికి ఒక ఫర్లాంగు దూరంలో కోట బంగ్లా ఉంది. అక్కడ కొండలమ్మ తల్లి గుడి ఉండేది. మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో అమ్మవారి గుడి కూల్చడానికి ప్రయత్నించారు అప్పుడు కొండు భొట్ల వారి పాలెం గ్రామస్తులు  బండ్లు కట్టుకొని అక్కడకు వెళ్లి 3 కమ్మెలను  తీసుకొని గ్రామంలోనికి వచ్చారు గ్రామం ఎగువ భాగానికి  రాగానే బండ్లు ముందుకు కదల్లేదు.  అమ్మవారు అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు అని అనుకొని గ్రామ ప్రజలు 2 కమ్మెలను  అక్కడ  ప్రతిష్టించారు. ఇంకొక కమ్మిని  పక్క గ్రామమైన నందిరాజు తోట గ్రామస్తులు వారి ఊరిలో ప్రతిష్టించుకున్నారు. 

ఒకరోజు గాజులు అమ్మే వ్యక్తి అటు వైపు వెళ్తుండగా కొండలమ్మ తల్లి అతని వద్ద గాజులు వేయించుకుని డబ్బులు చట్రా కోటయ్య అనే వ్యక్తి వద్ద  ఎక్కడ ఉన్నాయో చెప్పి తీసుకొమ్మని చెప్పింది.  అతను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి డబ్బులు అడగగా అతను  తన దగ్గర లేవని చెప్పాడు కానీ ఆ గాజులు అమ్మే  వ్యక్తి  ఎక్కడ ఉన్నాయో చెప్పగా చూసి అతనికి ఇచ్చాడు అప్పటినుండి కొండలమ్మ తల్లిని చట్రా వారి ఆడపడుచుగా  పిలుస్తున్నారు. గ్రామ ప్రజలను చల్లగా చూస్తూ అంటు వ్యాదులనుండి రక్షిస్తూ పంటలు బాగా  పండేలా చేస్తూ గ్రామ ప్రజలను కాపాడుతుంది.  1941 వ సంవత్సరంలో పొన్నూరు నుంచి ఇటుక రాయి తెచ్చి అమ్మవారికి గుడి కట్టారు. అమ్మవారి గుడిలో కొండలమ్మ తల్లి  సోదరుడైన పోతురాజు కూడా ఉంటాడు.

జాతర[మార్చు]

కొండలమ్మ తల్లి జాతరని ఊరి ప్రజలందరూ కలసి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.పూర్వం  కొండలమ్మ తల్లి  కొలుపులను తొమ్మిది రోజులు జరుపుకునేవారు. కొండలమ్మ తల్లి అక్క చెల్లెళ్లు అయిన పోలేరమ్మ, అంకాలమ్మ, ఇలా అందరికీ మొక్కులు చెల్లించుకునేవారు. కానీ ఇప్పుడు  కొలుపులను మూడు రోజులు జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి కొలుపులు ఎంతో ఘనంగా జరుపుతారు. అందరూ కూడా వారి వారి మొక్కులని అమ్మవారికి చెల్లించుకుంటారు. పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారెలు  అమ్మవారికి చెల్లించి  మొక్కులు తీర్చుకుంటారు.ఆఖరి రోజు సిడిమాను ఊరేగింపు జరుపుతారు.ఒక మేకను తెచ్చి చిన్న బోనులో ఉంచి పూలతో అలంకరించి ఊరేగిస్తారు.గ్రామ ప్రజలు కర్రలతో బోనుని కొడుతూ, చిందులు వేస్తూ ఊరేగిస్తారు.తరువాత ఆ మేకని గ్రామంలో వదిలిపెడతారు.దానిని ఊరి ప్రజలు అమ్మవారిగా భావిస్తారు.

కొండలమ్మ తల్లి గుడి ఉన్న ప్రదేశం[మార్చు]

కొండలమ్మ తల్లి గుడి కొండుభొట్ల వారి పాలెం గ్రామంలో ఉంది. ఈ కొండు భొట్ల వారి పాలెం గ్రామం, బాపట్ల మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది.