శ్రీకృష్ణకవి చరిత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకృష్ణకవి చరిత్రము
కృతికర్త: అనంతపంతుల రామలింగస్వామి
అంకితం: ఆంధ్రభారతి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: జీవితచరిత్ర
ప్రచురణ: నెల్లూర్ ప్రోగ్రెసివ్ యూనియన్, నెల్లూరు
విడుదల: 1933
పేజీలు: 166

ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, బహుగ్రంథకర్త, గ్రాంథికవాది శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్రమిది. కృష్ణమూర్తిశాస్త్రి తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి అనంతపంతుల రామలింగస్వామి ఈ గ్రంథాన్ని రచించారు. కవి ఈ కృతిని ఆంధ్రభారతికి అంకితమిచ్చారు.

ఇది మొదట వజ్రాయుధపత్రికలో ప్రకటింపబడి 1933 సంవత్సరంలో పుస్తకరూపంలో వెలువడింది. దీనిని నెల్లూరు ప్రోగ్రెసివ్ యూనియన్‌వారు ప్రచురించారు. లలితాముద్రాక్షరశాలలో ముద్రించబడింది.

విషయ సంగ్రహము[మార్చు]

ఈ పుస్తకంలో పదకొండు ప్రకరణాలలో రచయిత శాస్త్రిగారి జీవితాన్ని వర్ణించాడు. ప్రథమప్రకరణములో వంశాదికథనము, తల్లిదండ్రుల వృత్తాంతము ఉన్నాయి. ద్వితీయ ప్రకరణములో జన్మాదికము, విద్యాభ్యాసము అనే శీర్షికలున్నాయి. తృతీయ ప్రకరణములో ఉపనయనము - ప్రథమ వివాహము, సంతానము అనే అంశాలు వ్రాయబడ్డాయి. చతుర్థ ప్రకరణములో వర్తకము, వ్యవసాయము, ఋణబాధ, ఉద్యోగము అనే విభాగాలున్నాయి. పంచమ ప్రకరణములో తీర్థాటనము, ప్రభుదర్శనము మొదలైన విషయాలున్నాయి. షష్ఠ ప్రకరణములో మాయావులు, ఉర్లాము ఎస్టేటు, శ్రీకృష్ణ ప్రసాదము అనే విభాగాలున్నాయి. సప్తమ ప్రకరణములో ఉర్లాము మాహాత్మ్యము, ముక్త్యాల సంస్థానాశ్రయము, ధైర్యసాహసములు, మంత్రశాస్త్రము వంటి శీర్షికలున్నాయి. అష్టమ ప్రకరణములో చెడ్డకాలము, పాలకొల్లు సత్కారము, పెండ్యాలాభియోగము, మరియొక కేసు, వ్యాజ్యములు, నీలాపనింద, జటప్రోలు సంస్థానము, ముక్త్యాలరాజాగారి పునస్సమావేశము తదితర విషయాలున్నాయి. నవమప్రకరణములో కవిగండపెండేరము, జయపుర సంస్థానము, స్వభావగుణవిశేషములున్నాయి. దశమ ప్రకరణములో గ్రంథవిమర్శనము శీర్షిక క్రింద కవిగారి కొన్ని గ్రంథాల పరామర్శ ఉంది. చివరి ప్రకరణములో కవిగారి గ్రాంథిక భాషాభిమానము, పండిత వివాదము అనే రెండు విషయాలను రచయిత పేర్కొన్నాడు.

మూలాలు[మార్చు]