కంసాలి రుద్రయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కంసాలి రుద్రయ్య[మార్చు]

కృష్ణదేవరాయనికాలములో గంసాలి భద్రయ్యయని యొకస్వర్ణకారకవి యుండెననియు, అతడు రాయలయాస్థానమునందుండిన అష్టదిగ్గజములలో నొకడనియు కొందఱు వ్రాసియున్నారు. అతడు సరస మనోరంజనమను ప్రబంధము రచియించెనని కొందఱు చెప్పుదురుగాని యాగ్రంథ మిప్పుడు అలభ్యము. సరసజనమనోరంజనము లోనిదని బ్రౌన్‌దొరవారి ఛందస్సునం దీక్రిందిపద్య ముదాహరింపబడి యున్నది -

ఉ. ఎన్నడు నేరిచెన్ బెళుకు లీచెలికన్నులు, కారుకమ్ముల
   న్నన్న కురుల్, పిఱుందు బటువై పటువైఖరి గై కొనెంగదే,
[ 223 ]

మొన్నగదమ్మ పిన్నమొనమొల్కలు నే డివె ముద్దులాడిలే
జన్నులు గొప్పలై పయిటసందున దాగుడుమూత లాడెడున్.

ఈపద్యమును రాయలవారియాస్థానములో జదివినప్పుడు రామకృష్ణకవి మొల్కయని ప్రయోగించినందు కాక్షేపించెననియు, అందు మీద నొకరు దానికి సమాధానముగా నీక్రిందిపద్యమును జెప్పిరనియు, బ్రౌన్ దొరవారు సంపాదించి చెన్నపురిరాజధానిలోని ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమున కిచ్చిన చాటుపద్యమంజరిలో వ్రాయబడియున్నది-

చ. వెలగకు వెల్గ యంచు సరవిన్ జఱికొండ నృసింహు డాడగా,
   మొలకకు మొల్క యంచు గవిముఖ్యుడు భద్రయపల్కదోసమా?
   బళిబళి: మంచిమాటయె ప్రబంధమునా జలరాశి దానిలో
   పల నెరసు ల్గణింతురె యపారములౌ మణు లెల్ల నుండగన్?

చలికొండనృసింహుడు వెలగకు వెల్గ యనియు, అగసాలె రుద్రయ యనునాతడు మొలకకు మొల్క యనియు, అపప్రయోగములు చేసిరని యప్పకవి చెప్పి యీపయిపద్యము వినకొండలో గుంటు పల్లెభాస్కరునివద్ద గందుకూరి రుద్రయ్యగారు చెప్పినట్లీక్రిందిపద్యములలో వ్రాసియున్నాడు-

చ. కొలదిగ మున్ను చెప్పె జలికొండ నృసింహుడు వెల్గయంచు నీ
   వల నగసాల రుద్రపనువాడును మొల్క లటంచు గూరిచెం
   దెలియక కొంద ఱిట్లు వికృతిం బదమధ్యమునన్ లకార రే
   ఫలతలపై యకారమును బాపుదు రార్యులు నవ్వునట్లుగన్.

వ. ఇందులకు వినకొండలో గుంటుపల్లె భాస్కరయ్యగారి సమ్ముఖ మందు గందుకూరి రుద్రయ్యగారు చెప్పినపద్యము.

చ. వెలగకు వెల్గ యంచు సరవిం జవికొండ నృసింహు డాడగా
   మొలకకు మొల్క యంచు గవిముఖ్యు డురుద్రయ పల్క దోసమే?

[ 224 ]

బళిబళి మంచిమాటయె ప్రబంధమునా జలరాశి యందులో
  పల నెరసు ల్గ్రహింతురె యపారములౌ మణు లెల్ల నుండగన్.[అప్పకవీయము.పంచమాశ్వాసము]

దీనినిబట్టి చూడగా సరసమనోరంజనములోని దన్న పయిపద్యము భద్రయ చెప్పినదిగాక రుద్రయ చెప్పినదనియు, అతడు కృష్ణదేవరాయలకాలములో గాక గుంటుపల్లె భాస్కరునికాలములో నుండెననియు స్పష్టబడుచున్నది. కాబట్టి కృష్ణదేవరాయని కాలములో భద్రయ్య యనుకవి యున్నాడో లేడో యనికూడ సంశయింపవలసి యున్నది. పయినిజెప్పిన లిఖితపుస్తక భాండాగారములోని చాటుపద్యములలోనే సరసమనోరంజనము లోని దయినట్లుగా నీక్రిందిపద్యముకూడ వ్రాయబడియున్నది-

సీ. కొప్పున జుట్టినగొజ్జంగివిరిదండ నటనతో వీపున నాట్యమాడ,
   బటువైనముత్యాలపాపట విరజాజితీరుగా జెంపల దిమురుగట్ట,
   ధగధగద్ధగలచే దనరుకెంపునతాళి సరులతో బెనగొని చౌకళింప,
   గబ్బిగుబ్బలమీది కస్తూరిచెమటల గరగివాసనలచే గ్రమ్ముకొనగ.

   వింతమాటల తేటల విభుని గూడి
   కాంత రతికేళి మిక్కిలి గారవింప
   దప్పి తీఱంగ నధరామృతము లొసంగి
   చంద్రబింబాస్య మగులాగు సలిపె నపుడు.

కవికాలము[మార్చు]

ఇతడు నిరంకుశోపాఖ్యాన మను నాలుగాశ్వాసముల ప్రబంధమును సుగ్రీవవిజయమను యక్షగానమును రచియించెను. ఈగ్రంథమును బట్టి చూడగా గృష్ణదేవరాయనికాలములో భద్రయ్య యనుకవి లేడనియు భద్రయ్య యనబడినకవి యప్పకవి చెప్పినట్లుగా గుంటుపల్లి భాస్కరునికాలములోనుండిన రుద్రయ్యయేయనియు స్పష్టపడుచున్నది. ఈగుంటుపల్లి భాస్కరుడు పదునేడవశతాబ్దారంభమునం దుండిన [ 225 ] వాడు. సునందాపరిణయమునందు గుంటుపల్లి భాస్కరు డిట్లు వర్ణింపబడి యున్నాడు.

సీ. స్థిరతరప్రజ్ఞావిశేషాతినిష్ఠాతిరస్కృతనిర్జరరాడ్గురుండు
   అసదృశమంత్రయోగాతివశీకృత సన్మంత్రదేవతాసముదయుండు
   నిరుపమశ్రుతిశూక్తనిర్ణీతసన్మార్గవర్ణోచితాచారవర్తనుండు
   ఘనతరపాణినీగ్రంథార్థశోధనసందర్భసన్మనీషాన్వితుండు

   సత్యభాషాహరిశ్చంద్రజనవిభుండు
   సలలితౌ దార్యనిర్జి తజలధరుండు
   ఎల్లమాంబాసతీప్రాణవల్ల భుండు
   గుంటుపల్లి భాస్కరుడు సత్కులవరుండు.

దీనినిబట్టి కంసాలిరుద్రయకవి కృష్ణదేవరాయనికాలములో లేక, 1620 వ సంవత్సరప్రాంతములయం దుండినట్లు తేలుచున్నది. నిరంకుశోపాఖ్యానములోని,

శా. శ్రీభాషారమణావిమృష్టపదరాజీవోత్తమాంగాగ్రు డా
   ర్యాభామాపరిణీత సర్వజగదారాధ్యుండు మూర్తిత్రయీ
   శోభాకందము కందుకూరినగరీసోమేశ్వరస్వామి లో
   కాభీష్టంబు లొసంగుగాత గరుణాయతైకచిత్తంబునన్.

గ్రంధాన్ని శివుని కంకితము చేసెదనని కవి చెప్పిన పద్యము[మార్చు]

ఈమొదటిపద్యమునుబట్టి కవి తనగ్రంథమును కందుకూరి సోమేశ్వరస్వామి కంకితముచేసినట్లు తెలిసికోవచ్చును. ఈకావ్యమును శివుని కంకితము చేసెదనని కవి యీక్రిందిపద్యములో మనోహరముగా జెప్పియున్నాడు-

ఉ. కోమలవర్ణదామయును గోవిదసం స్తవనీయలక్షణ
   స్తోమపదాభిరామయును శుంభదలంకరణప్రసాధన
   స్థేమయు నప్రతర్క్యగుణసీమయు నైనమదీయకావ్యక
   న్యామణి నిచ్చి మంచుమలయల్లుని నల్లునిగా నొనర్చెదన్.

[ 226 ] కవి కంసాలియగుటచే ననేకు లాక్షేపించుచువచ్చుటచేత గా బోలు రుద్రయ్య తనకృతిలో నీపద్యమును వేసియున్నాడు-

ఉ. శుష్కవచశ్శిలాతతుల సూటిగ జూచి మహాకవిశ్రవ
   శ్శష్కుళికావిదారణము సల్పగ నేర్చినజాణలార మీ
   ముష్కరతాసమున్నతికి మ్రొక్కెద నాయెడ జూపరాకుడీ
   దుష్కవులార సాధుజనదూషణభూషణభూషితాత్ములై.

ఈతని కవిత్వరచనాకౌశలమును జూపు పద్యములు[మార్చు]

ఈకవి స్వర్ణకారుడు; పెదలింగన్నపుత్రుడు. ఈకవిత్వము మృదుమధురపదభూయిష్టమై సలక్షణమయి వినువారివీనులకు విందు చేయునదిగా నున్నది. ఈతని కవిత్వరచనాకౌశలమును జూపుటకయి నిరంకుశోపాఖ్యానములోని కొన్నిపద్యముల నిందు బొందుపఱచు చున్నాను.

ఉ. అడిగిన నేమి దోషమె సమస్తధరాతలనాధ కోరికల్
   నుడువుల నున్నవే మనసులోపలగాక రతిప్రసంగముల్
   తడవని యంతమాత్రనె విదారితమోహుడె యీవిచారముల్
   విడుపుము వాగ్విశేషమును విశ్రుతవేషము మోక్షహేతువే. [ఆ.1]

ఉ. ఏమిజపంబు చేసి రొకొ యేమితపం బొనరించి రొక్కొ యే
   మేమిసవర్య లార్యతతి కిచ్చిరొకో జగదేకపూజ్యులై
   తాము దనూజరత్నములు దామరతంపరలై చెలంగువా
   రీమహి దొల్లి యంచు నుతియించి మహీసుర డాత్మలోపలన్. [ఆ.1]

ఉ. అత్తవు సర్వలక్షణసమగ్రగుణాడ్యవు నన్ను దిట్టనున్
   మొత్తనెకాని నీకొడుకుమూడత మానుప వేల వాడు గో
   తొత్తులమారియై గృహముత్రొక్కక యొక్కొకదాని బూనికన్
   గుత్తకు నంచు నుంచుకొని కోకలు రూకలు జోక నియ్యగన్. [ఆ.2]

[ 227 ]

మ. ధరణీనాధ దరిద్రతాపిశునవస్త్రస్ఫూర్తి నాభారతీ
    వరనంశోత్తమసూతి చింతిలగ నవ్వారాంగనామాత ని
    ర్భరపాండిత్యము జూపి దీనదశకున్ రాబోలు నీపాటి జే
    పరమేశా యనిపించగావలదె విప్రస్వామి నంచు న్మదిన్. [ఆ.2]

ఉ. ఓడకు మోయి భూసురకులోత్తమ నెత్త మకారణంబ నే
   నోడితి నీవు గెల్చితి సమున్నతి న న్నతిరోషవృత్తి నీ
   వాడినయంతనట్టు సహజార్థమ యర్థమహాభిలాషుడై
   యోడిన బన్నిదంబు పడకుండిన జండినకా దలంపరే. [ఆ.3]

మ. అపరాథంబులు పెక్కుచేసితి మహాహంకారకామిక్రియా
    విపులాంభోనిధి గ్రుంకువెట్టి జడతావేశంబున న్మిమ్ము ది
    వ్యసధోద్వృత్తిని గొల్వ నైతిని మనోవాక్కాయకర్మంబులన్
    జపలాత్ము న్నను బ్రోవుమీ దయయకా సాక్షాత్కటాక్షేపణా. [ఆ.3]

ఉ. ఎక్కడివాడవోయి యొకయింత యెఱుంగవు బుద్ధికౌశలం
   బెక్కడి కేగె నాలుకపయి న్నువుగింజయు నాననట్టిబల్
   తక్కరినారదుం డతడు దైవతమార్గమునందు నేగగా
   నక్కడ నన్ను బేర్కొనియె దాతడు విన్న ననర్థ మొందదే. [ఆ.4]

చ. నెఱయ విషాదహేతువుగ నీతెలిగన్నుల నశ్రుబిందువుల్
   దొరుగు టెఱుంగ మెన్నడు కుతూహలకారణబాష్పజాలముల్
   కురియుటెకాని నేడు కనుగొల్కులవెంబడి నశ్రుపూరముల్
   వరదలుగట్ట నేడ్చెదవు వారిజలోచన యేర్పరింపవే. [ఆ.4]

ఈకవిని గూర్చి మరికొంత సమాచార తెలుపు పద్యస్ములు[మార్చు]

సుగ్రీవవిజయములోని ఈకడపటిద్విపదమువలన గవినిగూర్చి కొంత తెలియవచ్చును.

ద్వి. అని కందుకూరి జనార్దనుపేర [ 228 ]
   నంకితంబుగ గాళికాంబాప్రసాద
   సంకల్పితకవిత్వచాతుర్యధుర్య
   యావీరపెదలింగనార్యతనూజ
   కోవిదస్తవనీయగుణ రుద్రధీర
   విరచితసుగ్రీవ విజయాభిధాన
   గరిమ భాసిలు యక్షగానప్రబంధ
   మాచక్రవాళశైలావనియందు
   నాచంద్రతారార్కమై యొప్పుగాత!

ఈ కవి కవితా విధానము[మార్చు]

ఈగ్రంథము కవియొక్క ప్రథమకవిత్వ మగుటచే నంతరసవంతముగా నుండకపోయినను, ఇందుండియు రెండుపద్యముల నుదాహరించుచున్నాను.

గీ. అనిన విని రాఘవేశ్వరుం డలరి నవ్వు
   మొలక మొగమున జిగు రొత్త నిలిచి పాద
   వనరుహాంగుష్ఠమున జిమ్మె దనుజవరుని
   సముదితాంగంబు పదియోజనములు పడగ.

క. తారాదిసతులశోకము
   వారిచి కుమారు దేర్చి వాలికి బరలో
   కారోహణాదిసత్ర్కియ
   లారవితనయుండు రామునానతి జేసెన్.

మూలాల జాబితా[మార్చు]

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు కంసాలి రుద్రయ్య