కమ్యూనిస్టు పత్రికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం కోసం మన దేశ ప్రజలు సాగించిన సుదీర్ఘ పోరాటంలో శత్రువులకు వ్యతిరేకంగా, బలమైన ఆయుధంగా పత్రికలు ఘనమైన పాత్రను నిర్వహించాయి. ముఖ్యంగా కమ్యూనిస్టు పత్రికలు ప్రజల పక్షాన నిలిచి పోరాటం సాగించాయి. కమ్యూనిస్టు ఉద్యమంతో, కమ్యూనిస్టు పత్రికల చరిత్ర ముడిపడి ఉంది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పత్రికలు వీరోచిత, రాజీలేని పోరాటం సాగించాయి. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పత్రికలు పాలకుల అణచివేత విధానాలకు గురయ్యాయి. చరిత్రను తిరగవేస్తే, కమ్యూనిస్టు పత్రికలు ఎంతటి పాశవిక అణచివేతకు గురయ్యాయో, కోర్టు కేసులను ఎదుర్కొన్నాయో తెలుస్తుంది. దేశంలో జరిగిన వీరోచిత పోరాటాలన్నింటిలో ఈ పత్రికల పాత్ర శ్లాఘనీయమైంది.

మొట్టమొదటి కమ్యూనిస్టు పత్రిక 'సోషలిస్టు' 1922లో ఎస్‌.ఎ.డాంగే సంపాదకత్వాన ప్రారంభమైంది. తొలుత ఆంగ్ల వారపత్రికగా వచ్చిన 'సోషలిస్టు' ఆ తర్వాత మాసపత్రికగా మారింది. గాంధీయిజం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆ కాలంలో భారతదేశంలో సామ్యవాదం, సామ్యవాద సిద్ధాంతం అంతగా ప్రాచుర్యంలో లేదు. ఆర్థిక సమస్యల కారణంగా పత్రిక మూతపడినప్పటికీ అది చూపిన వెలుగురేఖలు దేశమంతా దారి చూపాయి. దేశంలోని అనేకమంది యువకులు గాంధీ అహింసా సిద్ధాంతం నచ్చక, మిలిటెంట్‌ బాటపట్టారు. వారిలో అనేక మంది కమ్యూనిస్టు సిద్ధాంతాలపట్ల ఆకర్షితులయ్యారు. ఆ సమయంలో లేబర్‌ సమాజ్‌పార్టీ నాయకత్వాన బెంగాల్‌లో 'లంగల్‌' (నాగలి) అనే వారపత్రిక ప్రారంభమైంది. ప్రముఖ విప్లవ కవి ఖాజీ నస్రుల్‌ ఇస్లాం మార్గదర్శకత్వంలో ఈ పత్రిక బయటకు వచ్చింది. మొదటి సంచికలో నస్రూల్‌ ఇస్లాం కవిత సామ్యవాది (కమ్యూనిస్టు) అచ్చయింది. ఈ పత్రిక మార్క్స్‌, ఎంగిల్స్‌ సిద్ధాంతాలను బాగా ప్రాచుర్యం లోకి తెచ్చింది. గతి తార్కిక భౌతికవాదం కూడా పత్రిక వ్యాసాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఆ తర్వాత బెంగాల్‌ పేజెంట్స్‌, వర్కర్స్‌ పార్టీ ఆధ్వర్యంలో 'జనవాణి' వారపత్రిక ప్రారంభమైంది. దీనికి ముజఫర్‌ అహ్మద్‌ సంపాదకత్వం వహించారు. బొంబాయి కార్మిక లోకంలోకి 1927 నాటికి కమ్యూనిస్టు ఉద్యమం బాగా చొచ్చుకు పోయింది. ప్రపంచంలోనే అత్యధిక కాలం సాగిన రెండు లక్షలమంది జౌళి కార్మికుల 8 నెలల సమ్మె బొంబాయిలో సాగింది. ఈ సమయంలో మరాఠాలో 'క్రాంతి' (విప్లవం) అనే వారపత్రిక మొదలైంది. బొంబాయి కార్మికలోకానికి ఆ కాలంలో ఇది ఒక ప్రధాన ఆయుధంగా ఉండేది. 1928లో బొంబాయి నుంచే ఉర్దూలో పైగామ్‌-ఎ- మజ్దూర్‌ (కార్మికవాణి) ప్రారంభమైంది. పంజాబ్‌ నుంచి 1928లో 'మెహనత్‌ ఖాస్‌' ఉర్దూ వారపత్రిక, 1929లో 'కీర్తి' అనే పంజాబీ వారపత్రిక ప్రారంభమయ్యాయి. బెంగాల్‌లో 1928లో హేమంతకుమార్‌ సర్కార్‌ సంపాదక త్వాన 'జాగరణ్‌' వెలువడింది. ఇదే సమయంలో స్పార్క్‌, న్యూస్పార్క్‌ అనే ఆంగ్ల వారపత్రికలు కూడా ప్రారంభ మయ్యాయి. దేశంలో నానాటికీ కమ్యూనిస్టుల ప్రభావం పెరిగిపోవడం గమనించిన సామ్రాజ్యవాదులు తొలితరం కమ్యూనిస్టు నాయకులపై మీరట్‌ కుట్ర కేసు బనాయించింది. అనేక పత్రికలు వీరి సంపాదకత్వంలోనే వెలువడేవి. ఈ నిర్బంధకాండలో నాయకులు జైళ్ళపాలు కావడంతో అనేక పత్రికలు కూడా మూతపడ్డాయి. కమ్యూనిస్టు ఉద్యమం ఊపందుకున్న 1931 ప్రాంతంలో బెంగాల్‌ నుంచి అబ్దుల్‌ హలీమ్‌ నాయకత్వాన 'చాసి మజూర్‌' వారపత్రిక, 'దిన్‌ మజూర్‌' దినపత్రిక ప్రారంభమయ్యాయి. అయితే కొద్ది నెలల్లోనే బ్రిటీష్‌ పాలకులు ఈ పత్రికలపై నిషేధం విధించారు. సామ్రాజ్యవాదుల నిర్బంధకాండ కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తిని అందుకోలేకపోయింది. 1935-40వ దశకంలో అనేక కొత్త ప్రావిన్స్‌లకు ఉద్యమం వ్యాపిం చింది. 1935లో బెంగాల్‌లో 'మార్క్స్‌ పంథి' మాసపత్రిక ప్రారంభమైంది. దీన్నికూడా పాలకులు నిషేధించారు. మల యాళంలో 'ప్రభాతం', బెంగాల్‌లో 'గణశక్తి' ప్రారంభ మయ్యాయి. బొంబాయిలో 1937లో ప్రారంభమైన 'నేషనల్‌ ఫ్రంట్‌' ఆంగ్లవారపత్రిక కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి బాగా తోడ్పడింది. ఆంధ్రలో 'నవశక్తి' వారపత్రిక, తమిళనాడులో 'జనశక్తి' 1937లో ప్రారంభమయ్యాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం కమ్యూనిస్టుపార్టీపై నిషేధం విధించిన కాలంలోనే ఈ పత్రికలన్నీ ప్రారంభమయ్యాయి. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా కమ్యూనిస్టులపై నిర్బంధకాండ తీవ్రమైంది. ఆ సమయంలో ఈ పత్రికలన్నీ నిలిచిపోయాయి. కమ్యూనిస్టు పార్టీపై 1942లో నిషేధం తొలగిన అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. బొంబాయి నుంచి పీపుల్స్ వార్, జనయుద్ధ్‌, లోక్‌యుద్ధ్‌, క్వామిజంగ్‌ పత్రికలు పార్టీ ఆధ్వర్యంలో ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, ఉర్దూభాషలలో వెలువడ్డాయి. బెంగాల్‌, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక, ఒరిస్సాలలో జనయుద్ధ్‌, ప్రజాశక్తి, జనశక్తి, దేశాభిమాని, జనశక్తి ముక్తి యుద్ధ్‌ వారపత్రికలు ప్రచురితమయ్యాయి. 1945లో 'ప్రజా శక్తి' దినపత్రికగా మారింది. మలయాళంలో 'దేశాభిమాని', బెంగాల్‌లో స్వాధీనత దినపత్రికలు ఆరంభమ య్యాయి. యుద్ధానంతరం కేంద్రం నుండి వెలువడే పత్రికల పేర్లు పీపుల్స్‌ఏజ్‌, లోక్‌ యుగ్‌, జనయుగ్‌, నయా జమానాగా మారాయి.

1947లో అధికారమార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్‌ పాలకులు కూడా బ్రిటీష్‌ వారి మాదిరిగానే కమ్యూనిస్టు ఉద్యమంపై అణచివేత చర్యలు చేపట్టారు. 1948-51 మధ్యకాలంలో తీవ్ర నిర్బంధకాండ కొనసాగింది. కేంద్రం నుంచి వెలువడే పత్రికలు మినహా అన్ని పత్రికలు మూతపడ్డాయి. 1949లో కేంద్ర పత్రికలు కూడా మూతపడ్డాయి. పార్టీపై నిషేధం, నాయకులు అనేకమంది జైలు పాలయ్యారు. పత్రికల కోసం పెద్ద పోరాటమే కొనసాగింది. దానితో, కొత్త పత్రికలు వెలుగు చూశాయి. అయినా మళ్ళీ నిషేధానికి గురికాకతప్పలేదు. కేంద్రంలో 'పీపుల్స్‌ హెరాల్డ్‌' ప్రారంభించగా మొదటి సంచికతోనే నిషేధానికి గురైంది. ఆ తర్వాత 'కరెంట్‌ అఫైర్స్‌' రెండు సంచికలు మాత్రమే వచ్చాయి. తమిళంలో మున్నని, పొరణి ఉల్గ అరసియల్‌ పత్రికలు వరుసగా ప్రారంభమ య్యాయి. బెంగాల్‌లో మాత్రం పార్టీ పత్రికలపై తీవ్ర దమనకాండ కొనసాగింది. 'క్రాస్‌ రోడ్స్‌' అనే పత్రికను ప్రభుత్వం మూడు మాసాల్లోనే నిషేధించింది. తిరిగి ఇది ప్రారంభమైనప్పటికీ, మద్రాస్‌, హైదరాబాదు‌ స్టేట్స్‌లో దాన్ని నిషేధించారు. కమ్యూనిస్టు పత్రికలు నిషేధంపై కోర్టులలో, అసెంబ్లీలలో పోరాటం చేశాయి. పత్రికా స్వేచ్ఛ గురించి మహాపోరాటమే జరిగింది. సామ్రాజ్యవాదులు, కాంగ్రెస్‌ వాదులు కమ్యూనిస్టు ఉద్యమంపై నిర్బంధకాండ కొనసాగించినప్పటికీ, ఉద్యమం ఉవ్వెత్తిన ముందుకే సాగింది. కమ్యూనిస్టులు ప్రజలతో మమేకం కాగా, కాంగ్రెస్‌ వారు ప్రజలకు దూరమయ్యారు.

ఈరోజు కమ్యూనిస్టు పత్రికలు బలంగా తమ వాణిని వినిపిస్తున్నాయి. గతంలో కన్నా పత్రికలు ఇపుడు బాగా బలపడ్డాయి. పార్టీ కేంద్ర కమిటీ తరఫున 'న్యూయేజ్‌' వార, మాస పత్రికలు వెలువడుతున్నాయి. స్వాధీనత (బెంగాలీ), ప్రజాసాహితి, జనశక్తి(CLASS STRUGGLE), ప్రజాశక్తి, విశాలాంధ్ర దినపత్రిక (తెలుగు), దేశాభిమాని, నవలోకం (మలయాళం), నయా జమానా (ఉర్దూ) దినపత్రికలు పార్టీ పక్షాన వెలువడుతున్నాయి. వివిధ భాషల్లో వారపత్రికలు కూడా వస్తున్నాయి. నయా దునియా (ఉర్దూ) జనయుగ్‌ (హిందీ), జనశక్తి (తమిళం), నవయుగం (మలయాళం), జనశక్తి, అరుణ (కన్నడం) నవీదునియా (ఒరియా), జనశక్తి (హిందీ-బీహార్‌), మటామట్‌ (బెంగాలీ), వారపత్రికలు పార్టీ తరఫున వెలువడుతున్నాయి. మనం ప్రజల పక్షాన 'ప్రజావాణి'ని వినిపిస్తున్నందున మన శత్రువులు ఎన్ని ఎత్తుగడలు వేసినా విజయం సాధించలేకపోయారు. ప్రజాపోరాటాలకు మన పత్రికలు అండగా నిలుస్తు న్నాయి. తుపాకుల నీడన, తెల్లవారి దమనకాండ మధ్యన కమ్యూనిస్టు పత్రికలు వెలువడ్డాయి. ప్రజాకంటకుల చర్యలను ఎండగట్టడంలో మనం ఎపుడూ ముందు వరుసనేఉన్నాం. ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం ప్రజాస్వామ్యం, శాంతి పరిరక్షణ కోసం నిలబడే కమ్యూ నిస్టు పత్రికలు రోజురోజుకు బలపడుతూనే ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  • 1953, అక్టోబర్‌ 4వ తేదీ, న్యూయేజ్‌ తొలి సంచిక నుంచి.