కొలనుపాక జాగీరు రైతాంగ పోరాటం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ సాయుధ పోరాటం లో రైతాంగ పోరాటం చాలా ముఖ్యపోరాటం. తెలంగాణ లోని ప్రతి పల్లెలో రైతాంగ పోరాటం జరిగాయి. గ్రామగ్రామాన రైతులంతా ఏకమై ఈ పోరాటాన్ని సాగించారు. అందులో కొలనుపాక జాగీరు రైతాంగ పోరాటం ఒకటి.

ఆలేరుకు 6 కిలోమీటర్ల దూరంలో కొలనుపాక గ్రామం ఉంది.[1] ఈ గ్రామం చాలా ప్రాచీనమైనది, ఇక్కడ జైనుల పుణ్యక్షేత్రమైన పెద్ద జైన దేవాలయం ఉంది. కొలనుపాక చుట్టూ ఉన్న మరికొన్ని గ్రామాలు కూడా ఈ జాగీరు ప్రాంతానికి చెందినవే. ఈ గ్రామాలన్నిటికీ అధిపతిగా నవాబు తురాబుయార్ జంగ్ ఉండేవాడు. ఇక్కడ ఉన్న పెద్ద భూస్వాములూ చిన్న భూస్వాములూ అంతా ఆంధ్రులు, అందులో కొంతమందికి ఆంధోద్య మంతో సంబంధం ఉండేది. ఆరుట్ల సోదరులు ఈ గ్రామానికి చెందినవారే. జాగీర్ధారు, జాగీరు ఉద్యోగులు ప్రజలతో వెట్టిచాకిరీ చేయించేవారు. రైతుల నుంచి ఆక్రమ శిస్తులు వసూలు చేసేవారు. ఇక్కడి పెద్దలకు ఆంధ్రోద్యమంతో సంబంధం ఉన్నప్పటికీ, భూస్వాములూ, రైతులూ చాలాకాలందాకా అక్రమ శిస్తులు చెల్లించారు.

ఇదంతా భరిస్తున్న సందర్భంలో ఒక సంఘటన వారిని తిరుబాటు చేసే విధంగా పురిగొలిపింది. అదే మతం మార్పిడి సంఘటన. జాగీర్థారు మద్దతుతో అధికారులు మాదిగ, మాలవారిని ఇస్లాం మతంలోకి మార్చారు. ఈ పద్దతిని ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మినరసింహారెడ్డి మరికొందరు కలిసి వ్యతిరేకించారు. ఆర్య సమాజీయులను పిలిచి వారిని తిరిగి హిందూ మతంలోకి మార్పించి, వెట్టిచాకిరిని మాన్పించారు. అక్రమ పన్నులను చెల్లించడానికి నిరాకరించి, ఖాల్సా గ్రామాల పన్నులనే చెల్లించసాగారు. ఈ పోరాటంలో వారంతా నిర్భంధానికి గురై, జైళ్ళకు వెళ్ళారు. తర్వాతికాలంలో గ్రామ యువకులు స్టేటు కాంగ్రెసు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ పోరాటంలో కొన్ని బలహీనతలుండడంతో ఇది స్టేటు కాంగ్రెసు ఉద్యమంలో కలిసిపోయింది.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-51), మొదటి భాగము, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ప్రొలిటేరియన్ లైన్ ప్రచురణలు, హైదరాబాద్, ప్రథమ ముద్రణ, జూలై 1988, పుట.83