చర్చ:భువనగిరి కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


భువనగిరి కోట[మార్చు]

బోనగిరి ఖిలాః జానపదుల పేరుమీద ఒక దుర్గం, ఒక నగరం ఏర్పడ్డది చరిత్రలో ఎక్కడైనా వుందో లేదో కాని మా బోనగిరిఖిలా వుంది. అనగనగా ఒక రాజు. ఆ రాజు ఇప్పటి రాయగిరి రైల్వేస్టేషన్ ( ఒకప్పటి తిరుమలగిరి తండా) దగ్గరి మల్లన్నగుట్ట మీద కోట కట్టబోతుంటే బోనయ్యనే గొల్లాయన ‘ ఈడ కోటేం కడ్తరుగని మీకు మంచి జాగ జూపిస్త రమ్మ’ని తీసుకపోయి బోనగిరిగుట్టను చూపెట్టిండంట.దాని మీది కప్పివున్న తీగెలపొద మొదలు హనుమపురం దాకుండెనట. దాన్ని నరికి రాజుకు గుట్ట చూపెడితే రాజు రాయిగిరిలో కోటకట్టుడాపి బోనగిరిగుట్ట మీద ఖిల్లా కట్టిండట. రాజు ఇనామిస్తనంటే బోనయ్య తనపేరు, తనభార్యపేరు గిరమ్మ కలిసొచ్చేటట్ల ఊరు కట్టియ్యమన్నడంట. రాజు తథాస్తన్నడు. బోనయ్య, గిరమ్మల పేరుమీద ‘బోనగిరి’ని కట్టించిండు రాజు. ఆ బోనగిరే సంస్కృతీకరించబడి ఇపుడు భువనగిరిగా పిలువబడుతున్నది. ఇది జానపదుల కథే. దీనికి చారిత్రకసాక్ష్యం లేదు. కాని, భువనగిరికోటే చరిత్రకు సాక్ష్యం. నల్గొండ జిల్లా కేంద్రానికి 71 కి.మీ. దూరంలో, హైద్రాబాద్ కు 47 కి.మీ.ల దూరంలో భౌగోళికంగా 17.0523 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79.2671 డిగ్రీల తూర్పు రేఖాంశంపై వుంది భువనగిరి పట్టణం. భువనగిరికొండ ఎత్తు 610 మీటర్లు. అండాకారపు ఏకశిలాపర్వతం ఈ కొండ. దీన్ని దక్షిణం నుండి చూస్తే తాబేలులాగా, పడమటి నుండి చూస్తే పడుకున్న ఏనుగులాగా అగుపిస్తుంది. ఈ కొండ బాలాఘాట్ పర్వతపంక్తులలోని అనంతగిరి వరుసల లోనిది. ఈ కొండమీదనే భువనగిరిదుర్గమున్నది. ఇది తెలంగాణాలోని ఉండ్రుకొండ, ఉర్లుకొండ, అనంతగిరుల కంటె ఎత్తైనది. ఈ కోటకు నైరుతి, ఆగ్నేయ దిశల నుండి పైకి వెళ్ళే మార్గాలున్నాయి. ప్రస్తుతమార్గం నైరుతి నుండే ప్రారంభమవుతుంది. భువనగిరి పరిసరాల్లోని తుమ్మలగూడెం, వలిగొండ,రాయగిరి వంటి చోట్ల మధ్యపాతరాతియుగం (క్రీ.పూ. 50000-10000)నాటి మానవ ఆవాస చిహ్నా లున్నాయి. రాతిగొడ్డళ్ళు, కత్తులు, బొరిగెలు,బాణాలు వంటి రాతిపనిముట్లు లభించాయి. సమాధులు కూడా కనుగొనబడ్డాయి. భువనగిరిలో మధ్యరాతియుగం (క్రీ.పూ. 10,000- 2000) నాటి మానవనివాసజాడలు లభించాయి. నవీనశిలాయుగం (క్రీ.పూ.2500-1000) నాటి మానవ ఆవాసాలు భువనగిరికొండ కింద చాలా వున్నాయి. భువనగిరిలో రైలుకట్ట వెంట దిగువకు రాయగిరి దాకా, పైకి బీబీనగర్ పై వరకు అక్కడక్కడ సిస్తులు, కైరన్లు అగుపిస్తున్నవి. వీటిని పరిశోధిస్తే ఇంకా కొత్త చారిత్రక విషయాలు బహిర్గతమయే అవకాశముంది. భువనగిరికి దగ్గరగా ఆలేరునది(భిక్కేరు), మూసీనదులున్నాయి. భువనగిరికి వాయవ్యాన భువనగిరి చెరువుంది. చెరువుకు బీబీనగర్ చెరువు గొలుసుకట్టు చెరువు. అక్కడనుండి కట్టుకాలువ వుంది. కీ.శే. ఆదిరాజు వీరభద్రరావుగారు రాసిన ‘ప్రాచీనాంధ్రనగరాలు’ లో భువనగిరి దుర్గం 3వేల ఏళ్ళ క్రితం నుండి వున్నదని ఒకపారశీకప్రతిలో రాసున్నదని తెలిపారు. 1898లో అచ్చయిన ‘Glimpses of the Nizam’s Dominions లో CampBell భువనగిరికోట గూర్చి రాసాడని నిఖిలేశ్వర్ గారొక వ్యాసంలో పేర్కొన్నారు.భువనగిరి నగరానికి చుట్టూ మట్టిగోడలు,3ద్వారాలుండేవట. ఇపుడు మట్టిదిబ్బలే ఆనవాళ్ళుగా మిగిలివున్నాయి. భువనగిరికోట మొదటిద్వారాన్ని ‘ఉక్కుద్వార’మంటారు.ఈ ద్వారాన్ని నిజాం తన సొంతఖర్చుతో నిర్మించినట్లు ప్రతీతి.అందువల్ల ఇది కొత్తద్వారమై వుంటుంది. క్రీ.శ.1900ల ప్రాంతంలో ప్రతి ఉదయం ముగ్గురు వాద్యగాళ్ళు తమవాద్యాలను వినిపించేవారట. ఈ ప్రవేశద్వారం గోల్కొండకోటలోని ‘బాలాహిస్సార్’ మొదటిద్వారం ఫతేదర్వాజా లాగే వుంటుంది.తలుపులు వెడల్పైన చెక్కలతో, ఇనుపగుబ్బలతో గజంపొడుగు బేడాలతో నిర్మించబడినది. రెండోద్వారం గుళ్ళోని చౌకోటులెక్క వుంటుంది.పనితనం కనిపిస్తుంది. మూడోద్వారం సాధారణం. అక్కడే వెనకటి మసీదుండేదని కాంప్ బెల్ రాసాడు. నాలుగోద్వారం కూడా సామాన్యంగానే వుంది.బేడాలరంధ్రాలు గోడల్లోకి వున్నాయి.ఈ ద్వారం దాటి పైకిళ్ళితే ఒక కొలను కనపడుతుంది. నీళ్ళున్నపుడు అందులో తెల్లకలువలు విరబూసి కనపడుతుంటాయి. పై ఎత్తుకి శిఖరానికి చేరినపుడు అక్కడ రాజభవనాలు, అంతఃపురం(బారాదరి) కనిపిస్తాయి. అంతఃపురంలోనికి మెట్లు లేవు. ఎత్తైనగోడలు, విశాలమైన గదులు, ఇస్లాం సంస్కృతి నిర్మాణశైలిలో వున్నాయి. పైన గచ్చు నమాజుకు వీలుగా మసీదులాగా కనిపిస్తుంది. ఈ అంతఃపురం గోల్కొండ బారాదరిని పోలివుంటుంది. బారాదరికి పడమట లోతుతెలియని ‘ఏనుగుల మోటబాయి’ (గుండం) వుంది. తోడిన నీళ్ళు నిలువచేసుకోవడానికి బారాదరికానుకుని 9తొట్లు (హౌసులు) కట్టివున్నాయి. పరిసరాలను పరిశీలిస్తే బారాదరికి ఉత్తరాన ఒక నల్లని నంది విగ్రహం వుంది.శివలింగం, గుడిలేవు. అంతదూరాన ఆంజనేయుని శిల్పం వుంది. రాజప్రాసాదాల వద్ద చాళుక్యులశిల్పరీతిని ప్రతిబింబించే నాలుగురేకుల పుష్పాలంకారాలు, ఏనుగుముఖాల్లోంచి సర్పాకారాలు, కాకతీయశైలిలో మకరతోరణాలు, ద్వారపాలకులు, గజలక్ష్మి చెక్కబడివున్నాయి. బోనయ్య కథ లోని బోనమ్మ(భువనేశ్వరీదేవి) గుడి కనిపించదు. కాని గుట్టకింద లోయల్లో పడివున్న దేవాలయశిథిలాలు కొండపైన ఒక అపురూపమైన దేవాలయం వుండి వుంటుందని సాక్ష్యమిస్తున్నాయి. కోటలోపల ప్రాకారాల్లో ధాన్యాగారాలు, సైనికాగారాలు, గుర్రపుకొట్టా లున్నాయి. రాజప్రాసాదాల కింద ఎన్నో అంతుతెలియని రహస్య శిలాగర్భ మార్గాలున్నాయి.ఈ సొరంగాల తొవ్వలు ఎక్కడికి తీసుకెళ్తాయో ఎవరు కనుక్కోలేకపోయారు. కోటలో పడివున్న ఫిరంగులు ఎనిమిది. మరికొన్ని కొండకిందలోయల్లో పడిపోయివుంటాయని స్థానికులు చెప్పారు.అందులో ఒకటి కుతుబ్షాహీలతో షితాబుఖాన్ (సీతాపతి) చేసిన యుద్ధంలో వాడిన ఫిరంగియని డి.సూర్యకుమార్ (చారిత్రకపరిశోధకులు) గారు రాసారు. చరిత్రలో తెలంగాణాను ఏలిన అందరి ఏలుబడిలో భువనగిరిప్రాంతం వుంది. మూసీనది ప్రాంతాన్ని జయించిన మహాపద్మనందులు, ఆ తర్వాత మౌర్యులు, పిదప మహిషకుడు ఖారవేలుడి ఏలుబడిలో వుండి వుంటుంది భువనగిరి. శాతవాహనుల నుండి ఆసఫ్జాహీల దాకా వివిధరాజుల, రాజ్యాలలో భువనగిరి భాగమై వుంది. శాసనాల దాఖలా ప్రకారం క్రీ.శ. 1100 లకు ముందునుండే భువనగిరిదుర్గం కళ్యాణీచాళుక్యుల పాలనలో వుంది.అపుడిది కొలనుపాకకు రక్షణ, సైనికదుర్గంగా వుండేది. శాసనాధారాలుః • నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 26వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం- క్రీ.శ.1105 ఏప్రిల్ 6వ తేది కొలనుపాక-7000నాడును మహామండలేశ్వరుడుగా పాలిస్తున్న పారమార జగద్దేవుడు భువనగిరిదుర్గ దండనాయకుడు ధక్కననాయకుని కొడుకు బమ్మదేవనాయకునిచేత నిర్మించబడ్డ మఠానికి, సోమేశ్వరదేవునికి అక్షయతృతీయ సందర్భంగా అంగరంగభోగాలకింద ఆలేరు కంపణంలోని ‘గోష్టీపాళు’ గ్రామాన్ని కానుకగా యిచ్చాడు. • నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 34వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం-క్రీ.శ. 1111 భువనగిరిలో దొరికిన శాసనంలో భువనగిరి దండనాయకుడైన లక్ష్మిదేవుడు (క్రీ.శ. 1111) పచ్చలకట్ట సోమేశ్వరదేవునికి నందాదీపం కానుకగా ఇచ్చాడు. • నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 38వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం- క్రీ.శ. 1123 సం. శాసన వివరాల్లేవు. • నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 39వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం భువనగిరికోట ద్వారం వద్ద రాతిమీద వున్నక్రీ.శ.1123, శోభకృతు వైశాఖ అక్షయతృతీయ నాడు భువనగిరితీర్థంలోని సోమేశ్వరదేవునికి నూనెగానుగలవారు ఇవ్వవలసిన కానుకలను సుంక,సాహనవెగ్గడ, దేహారదాధినాయక వంటి బిరుదాంకితుడు సర్వాధ్యక్ష, దండనాయకుడైన కేశియరసరు ఇప్పించాడు. • నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 41వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం క్రోధన సం. ఎవరో మహామండలేశ్వరుడు.. వివరాలు లేవు. • నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 43వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం చందుపట్ల శాసనంలో చందుపట్ల(చంద్రపట్టణం)లోని విద్దేశ్వర దేవునికి విద్ధమయ్య దండనాయకుడు చేసిన భూదానాల గ్రామాలలో భువనగిరి పేర్కొనబడింది. • నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 46వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- త్రిభువనమల్లదేవుని కాలం- సం.లేదు భువనగిరిలోని భీమనారాయణదేవునికి భువనగిరికి అధిపతిగా వున్న దండనాయకుడు శోద్దాలయ్య ఏదో కానుక ఇచ్చినట్లు శాసనంలో చెప్పబడింది. • నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 43వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- ప్రతాపచక్రవర్తి- జగదేకమల్లుడు కళ్యాణి నుండి పాలిస్తున్న కాలం క్రీ.శ.1146 సం.ఏప్రిల్ 15న భువనగిరిపాలకుడు సంధి,విగ్రహ సేనాధిపతి దేవుడి(పేరు లేదు) పూజాదికాలకు 4చిన్నాలు,2 ద్రమ్మాలు, కొంతభూమి కానుకగా యిచ్చినట్లున్నది. • నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 50వ శాసనం... పశ్చిమ చాళుక్యులు- ప్రతాపచక్రవర్తి క్రీ.శ. 1147లో వేయబడిన బొల్లెపల్లి శాసనంలో భువనగిరి ‘ప్రతిబద్ధం’గా ప్రభువు మేడియభట్టు బొల్లెపల్లిలో మైలారదేవుని ప్రతిష్టించారు. • నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 114వ శాసనం... భువనగిరిలో ఖాజీ ఇంటిముందరి రాయిపై వుంది. రేచెర్ల పద్మనాయక రాజైన అనపోతానాయకుని కుమారుడు భుజబలభీమ, సోమకుల పరశురామ, ఖడ్గనారాయణ బిరుదాంకితుడు సింగమనాయకుని పేరున్నది. క్రీ.శ.1369ని ఐనవోలు శాసనం ప్రకారం అనపోతానాయడు భువనగిరి దుర్గాధిపతి అని తెలుస్తున్నది.పద్మనాయకరాజులు భువనగిరిదుర్గాన్ని బాగుచేయించారు. • నల్గొండ జిల్లా శాసనాలు- మొదటి సంపుటం- 129వ శాసనం.. కాలంలేదు. భువనగిరిలోని పీనుగుల దిబ్బ దగ్గర పడివున్న రాతిమీద శాసనం. ఎవరో ‘బాటరాజు’ పేరున్నది. పై శాసనాలను బట్టి కళ్యాణీచాళుక్యులకాలంలో కొలిపాక-7000నాడు లోని ఆలేరు కంపణం-40కి చెందినదే భువనగిరి. దీనిని కొలనుపాక ప్రభువుల దండనాయకులు లక్ష్మీదేవులు, కేశియరసరు, విద్ధమయ్య, శోద్దాలయ్య, బమ్మదేవనాయకుడు, పేరుతెలియని మరికొందరు పాలించినట్లు తెలుస్తున్నది. కాకతీయుల కాలంలో గణపతిదేవ చక్రవర్తి రుద్రమదేవి భర్త వీరభద్రునికి అరణంగా యిచ్చిన కొలనుపాకసీమలోనిదే భువనగిరి దుర్గం. కాకతీయుల సామంతుడైన గోనబుద్ధారెడ్డి ఏలిన మానువనాటిసీమలో భువనగిరి అంతర్భాగంగా వుండేది. కందూరిచోడుల పాలనలో భువనగిరి సైనికశిబిరంగా వుండేదని, వారే ఇక్కడ ఆలయాలు, చెరువులు, ఇతర కట్టడాలు నిర్మింర్చారని, భువనగిరిని విస్తరింపజేసారని ప్రముఖకవి, విమర్శకులు డా. లింగంపల్లి రామచంద్రగారు అభిప్రాయపడ్డారు. రేచెర్ల సింగభూపాలుని కాలంలో క్రీ.శ.1427లో బహమనీ సుల్తాన్ 2వ అహమద్షా ఓరుగల్లు ముట్టడి పిదప దారిలోని భువనగిరిని స్వాధీనపరచుకొని ‘సంజర్ ఖాన్’ను దుర్గపాలకునిగా నియమించాడు. భువనగిరికోట కుతుబ్ షాహీల పాలనలో చాలా యేండ్లున్నది. తర్వాత 1687లో మొగలులు గోల్కొండను ఆక్రమించినపుడు వారి యేలుబడిలోనికి పోయింది. సర్వాయి పాపడు 1708లో ఓరుగల్లును గెలుచుకుని తర్వాత భువనగిరిని తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు. అతని వీరమరణం అనంతరం మొగలులు, వారినుండి ఆసఫ్ జాహీల పాలనకిందకు వచ్చింది భువనగిరి దుర్గం. (అసంపూర్ణం) ≥Sreeramoju haragopal (చర్చ) 07:49, 28 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]