చెన్నుపాటి లక్ష్మయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెన్నుపాటి లక్ష్యయ్య
చెన్నుపాటి లక్ష్యయ్య
జననంచెన్నుపాటి లక్ష్మయ్య
జూలై 1 1912
వేలూరు
మరణండిసెంబరు 9 , 1968
ఇతర పేర్లుచెన్నుపాటి లక్ష్యయ్య
వృత్తిఉపాధ్యాయుడు,
ప్రసిద్ధిఉపాధ్యాయ ఉద్యమ రథసారధి

చెన్నుపాటి లక్ష్మయ్య ఉపాధ్యాయ నేత. అతను తన జీవిత పర్యంతం ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడిన యోధుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

చిలకలూరిపేటకు సమీపంలోని వేలూరులో వీరయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు 1912 జూలై 1న లక్ష్మయ్య జన్మించారు. స్వగ్రామంలోనే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించిన లక్ష్మయ్య ఉపాధ్యాయుల హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అప్పటికీ నామ మాత్రంగా ఉన్న జిల్లా బోర్డు ఉపాధ్యాయ సంఘానికి జవసత్వాలను కలిగించారు. రెండో ప్రపంచ యుద్ద కాలంలో ఉపాధ్యా యులకు కూడా రేషన్ కారులను మంజూరు చేయించడానికి కృషి చేశారు. రాష్రవ్యాప్తంగా ఉన్న మేనేజ్మెంట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఒకే యూనియన్‌గా మార్చడంలో అతను కృషి చిరస్మరణీయం. 1947లో రాష్ర మహాసభలను నిర్వహించి ఆంధ్ర ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ ను ఏర్పాటుచేశారు ఈ సంస్థకు లక్ష్మయ్య అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ పత్రికను ప్రారంభించి ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. ఉపాధ్యాయులకు సంఘ స్వాతంత్ర్యం లేదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు లను ఉపసంహరించుకునేంత వరకు లక్ష్మయ్య పోరాటం చేశారు. 1962లో లక్ష్మయ్య గుంటూరు జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1968లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఎలిమెంటరీ, సెకండరీ ఉపాధ్యాయుల వేతనాల పెంపునకు కృషి చేశారు. అఖిల భారత ఉపాధ్యాయ సమాఖ్య సభ్యుడైన లక్ష్మయ్య రాష్ర అధ్యాపకుల సమస్యలను జాతీయస్థాయిలో వినిపించారు. ఉపాధ్యాయ ఉద్యమంలో పాదం మోపిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. జీవిత భాగస్వామి హనుమాయమ్మ మరణించిన మరుసటి రోజు కూడా శాసనమండలికి హాజరై ఉపాధ్యాయుల సమస్యలను చర్చించారు. 1968 డిసెంబరు 9న చెన్నుపాటి అస్తమించారు.[2]

ఉద్యమ విస్తరణ[మార్చు]

ఆ రోజుల్లో ఒక్కొక్క మేనేజి మెంటుకు ఒక్కొక్క ఉపాధ్యాయ సంఘం ఉండేది. ఒకే వృత్తి నవలంబించి, ఒకే రకమైన సమస్యలతో సతమతమయ్యే ఉపాధ్యాయులు అలా వివిధ సంఘాలుగా చీలి ఉండటం ఉద్యమవ్యాప్తికి ప్రధానాటంకం అని అతను గ్రహించారు. వారి నందరిని ఒకే సంఘంలోకి తెచ్చి, ఒకే బాటలో నడిపించి ఐక్యోద్యమం నిర్మించాలని అతను ప్రయత్నాలు ప్రారంభించారు. 1944లో నర్సరావుపేట తాలూకాబోర్డు ఉపాధ్యాయ సంఘాన్ని పునర్మించి దాని నాయకత్వాన్ని స్వీకరించారు. 1946లో రాష్ట్రస్థాయిలో వివిధ సంఘాల కార్యకర్తల సంయుక్త సమావేశం గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే వివిధ మేనేజిమెంట్ల క్రిందనున్న ప్రాథమికోపాధ్యాయు లందరినీ ఒకే సంఘంగా ఏర్పాటు చేయాలనే చరిత్రాత్మక నిర్ణయం జరిగింది. దానిలో సమైక్యతకు దృఢమైన ప్రాతిపదిక ఏర్పడింది.

1947లో రాష్ట్ర మహాసభ జరగటం, దానిలో ఆంధ్ర ప్రాధమికోపాధ్యాయ పెడరేషన్‌ అవతరించటం, దీనకి లక్ష్మయ్య అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టాలు. లక్ష్మయ్య అంతటితో ఆగలేదు. సంఘాన్ని ఇంకా విస్తృత పరచి పటిష్ఠత చేకూర్చటానికి శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా రాష్ట్రమంతటా విరామం లేకుండా పర్యటించారు. ఎందరో కార్యకర్తల్ని ప్రోత్సహించి రంగంలోకి తెచ్చారు. సమస్యలపై నిత్యం సంఘటిత పోరాటాలు నడిపి చైతన్య పూరితుల్ని చేశారు. ఆ సమైక్యఉద్యమాన్ని సమన్వయ పరచటానికి సంఘవాణిగా ఉపాధ్యాయ పత్రికను ప్రారంభించారు. 1948 నుండి 1955 దాకా దానికి ప్రధాన సంపాదకుడుగా ఉంటూ దానిని ఉపాధ్యాయవాణిగా, ఉద్మమ ప్రతిబింబంగా తీర్చిదిద్దారు.

బాలారిష్టాలు - ప్రతిఘటనలు[మార్చు]

ప్రజలు చైతన్య పూరితులవుతుంటే దోపిడీ ప్రభుత్వం ఊరుకోదు. నిరంకుశాధికారులు సహించరు. అడుగడుగునా ఆంటంకాలు కల్పించి, ఉద్యమాన్ని నిర్వీర్యపరచటానికి భయభీతులు వ్యాపింపజేయటానికి ప్రత్నిస్తారు. ఉపాధ్యాయులకు సంఘ స్వాతంత్ర్యంలేదని ఓ విపరీత ఉత్తర్వు జారీచేసింది ప్రభుత్వం. దాన్ని ప్రతిఘటించి. హైకోర్టుదాకా వెళ్ళి సంఘ స్వాతంత్ర్య నిషేధపుటుత్తర్వును రద్దు చేయించారు లక్ష్మయ్య.

శాసనసభా రంగం - సెకండరీ స్థాయి ఉద్యమవ్యాప్తి విచిత్ర మేమిటంటేె పేరుకు ఉపాధ్యాయ నియోజక వర్గాలైనా వాటిలో వేలాది ప్రాథమికోపాధ్యాయులకు ఓటింగు హక్కులేదు. రాజ్యాంగంలో సెంకడరీ ఉపాధ్యాయులకు మాత్రమే ఆ హక్కు కల్పింపబడింది ప్రాథమికోపాధ్యాయులకు కూడా ఓటింగు హక్కు ఉండాలని తీవ్రాందోళన చేస్తూనే ఉన్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పాల్గొని ఫెడరేషన్‌ తమ అభ్యర్థిని గెల్పించటం జరిగింది. దానితో ఉద్యమం సెకండరీ రంగానికి క్రమక్రమంగా వ్యాపించింది. మరో మలుపు తిరిగి నూతన స్థాయినందుకున్నది.

1962లో లక్ష్మయ్య గుంటూరు జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిల్చి సెకండరీ టీచర్ల ఓట్లతో ఎన్నికయ్యారు. ఆ పరిచయాల్ని ఆధారంగా చేసుకొని ఎందరో సెకండరీ కార్యకర్తల్ని అతను తయారు చేశారు. ఆనాటి అతను అనుచరులైన సెకండరీ కార్యకర్తల్లో గణనీయ భాగం అతను నెలకొల్పిన సంప్రదాయాల్ని కాపాటడం కోసం నేడు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌లో ప్రధాన భాగస్వాములుగా వుండి కృషి సాగిస్తున్నారు. ప్రాంతీయ కేటగీరీ, మేనేజిమెంటు అవధుల్ని దాటి అతను లక్ష్యమైన విశాల సమైక్యతను ముందుకు తీసుకు పోతున్నారు.

1968లో గుంటూరు నియోజక వర్గంలో తిరిగి అయనే అభ్యర్థిగా నిల్చారు. కాని విచ్ఛిన్న శక్తుల సైంధవ పాత్రతో అతను ఓడిపోయారు. అయినా అతను మరింత దృఢదీక్షతో ముందుకు సాగారు.

'పోరాటరంగంలో జయాపజయాలు సర్వసామాన్యాలు. జయం పొందినపుడు పొంగిపోవటం, అపజయం ఎదురైనపుడు కృంగిపోవటం కూడనిపని. గుణపాఠాలు నేర్చుకొని ముందుకు సాగడమే మన కర్తవ్యం' అంటూ అతను కార్యకర్తల్ని ప్రోత్సహించి నైరాశ్యం తొలగించి ఉత్సాహపరిచారు.

పదవులూ - సేవా[మార్చు]

ఉపాధ్యాయుల వేతనాల సవరణకై వివిధ సంఘాల ఐక్య కార్యాచరణ బాధ్యులుగా ఎలిమెంటరీ, సెకండరీ ఉపాధ్యాయుల వేతనాల పెంపుకు అతను తీవ్రంగా కృషి చేశారు. అఖిల భారత ఉపాధ్యాయ సమాఖ్య సభ్యుడుగా వుంటూ ఆంధ్ర రాష్ట్ర ఆధ్యాపకుల సమస్యల్ని అఖిల భారత దృష్టికి తెచ్చేందుకు అతను పాటుబడ్డారు. ఉపాధ్యాయ ప్రతినిధిగా శాసన మండలిలో నిర్వరామ కృషి చేశారు. 1947 నుండి చనిపోయేవరకు దాదాపు 21 సంవత్సరాలు రాష్ట్ర సంఘానికి తిరుగులేని నాయకుడుగా వుండి. అధ్యక్షుడుగా ఎన్నికవుతూ అమోఘ సేవ చేశారు.

ఆదర్శ నాయకుడు[మార్చు]

సంఘ నిర్మాణంలో, కార్యకర్తల్ని తయారు చేసుకోవటంలో, నాయకత్వం వహించటంలో అతను ఎన్నో సుసంప్రదాయాల్ని నెలకొల్పారు. సమైక్య ప్రజాసంఘంగా వివిధాభిప్రాయాలు గల వారిని ఇముడ్చుకొని, వన్నెలూ, చిన్నెలూ దిద్దుకొని అతను ఆధ్వర్యాన మూడు పూలూ ఆరుకాయలుగా వర్థిల్లింది ఫెడరేషన్‌. పర్యటనకు వెళ్ళినా, ఆఫీసులోవున్నా వారికి విశ్రాంతి వుండేదికాదు. ఆఫీసుకు వచ్చిన టీచర్లతో వారి వారి సమస్యలు చర్చించటం, సలహాలివ్వటం, డ్రాప్టులు వ్రాసి యివ్వటం, కరస్పాండెన్స్‌ జరపటం నిర్విరామంగా కొనసాగించే వారు. ఇక పర్యటనకు బయలు దేరితే సభల్లో మాట్లడటం, ఉపాధ్యాయుల్ని సమైక్యపరచి చైతన్య పూరితుల్ని చేయటం, ఆర్థిక వనరుల్ని సమకూర్చటం, పత్రికా వ్యాప్తికి పాటుబడటం, కార్యకర్తల మంచి చెడులు తెలుసుకొని సాయపడటం ఇలా ఊపిరి సలపని కార్యక్రమాల్లో మునిగితేలేవారు.

నిస్వార్థ త్యాగజీవితం[మార్చు]

అతను ఉపాధ్యాయ ఉద్యమంలో చేరిన తర్వాత ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని పూర్తి కాలం కార్యకర్తగా ముందుకు వచ్చారు. పిత్రార్జితంగా ఉన్న కొద్ది ఆస్తి కూడా ఉద్యమంలో హారతి కర్పూరమయినా అతను దీక్ష విడువలేదు. కష్టాలను నష్టాలను మేరువులా ఎదుర్కొని సేవాధర్మమే సర్వంగా రాటుదేలారాయన. బిడ్డలు కల్పన, సీతారామయ్యలు కూడా కష్టాల పాలయ్యారు. చివరికి తన జీవిత భాగస్వామి హనుమాయమ్మ జబ్బుపడితే ఆమెకు మందులిప్పించే తాహతులేక ఆమెను కూడా కోల్పోయారు. ఆమె మరణించిన రోజే జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌లో ఏమాత్రం చలించకుండా యధాప్రకారం పాల్గొన్నారంటే, అతను మనస్థైర్యం ఎటువంటిదో మనకర్థం అవుతుంది. అలా అతను జీవితం ఉద్యమంతో పెనువేసుకొని అదే సర్వం అయింది.

సమైక్య ఉద్యమాన్ని కాపాడటానికి అతను అన్ని విధాలా ప్రయత్నం చేశారు. సంఘ సమావేశాల్లో ఉత్పన్నమైన ఎంతటి జటిల సమస్యనైనా పరిష్కరించటానికి అతను సూచించే సూచనలు అందరి అమోదాన్ని పొందుతూ వుండేవి. ఉద్యమం స్తబ్దతలో ఉన్పప్పుడు కార్యకర్తల్ని ఉత్సాహపరస్తూ, స్వయంగా వారిని కలుసుకొంటూ, ఆర్థిక పరిస్థితుల్ని పరామర్శిస్తూ, వారి కుటుంబాల్లో కలిసిపోయి వారిని ప్రాణాధికంగా కాపాడుకొనేవారు. ఉద్యమం సజీవశక్తిగా పనిచేయటానికి అన్ని జాగ్రత్తలూ తీసుకొనేవారు. శాసన మండలి సభ్యుడిగా తనకు వచ్చే జీతాన్నీ, అలవెన్సులనూ సంఘ నిధికే జమ కట్టేవారు. అత్యవసరమైన ఖర్చులకు సంఘం నుండి వాడుకొనేవారు. ఎప్పటికప్పుడు జమాఖర్చులు చెప్తూ, ఆడిట్‌ చేయిస్తూ ఆర్థిక విషయాలలో నిక్కచ్చిగా ఉండేవారు.

అంతిమ దినాలు[మార్చు]

ఎన్నికల అనంతరం జలోదర వ్యాధి కారణంగా అతను ఆరోగ్యం మరింత క్షీణించింది. విజయవాడ ప్రజావైద్యశాలలో దాదాపు రెండు మాసాలు అతను మృత్యువుతో పోరాడారు. మృత్యు వాసన్నమయిందని తెలియగానే తాను పెంచి పెద్ద జేసిన సంఘ కార్యాలయంలోనే ప్రాణాలను విడవటానికి అతను నిశ్చయించుకొన్నారు.

చివరికి 1968 డిసెంబరు 9న సంఘ ప్రధాన కార్యాలయంలో సహచరుల అశృతర్పణాల మధ్య అతను కన్ను మూశారు. అతను భౌతికకాయాన్ని విచార నిమగ్నులైన వందలాది ఉపాధ్యాయులు శ్మశానానికి ఊరేగింపుగా పూలమాలతో ముంచి తీసుకువెళ్ళారు. చిరస్మరణీయమైన అతను గంభీర భౌతిక విగ్రహం చితిలోకాలి భస్మమైనా వేలాది ఉపాధ్యాయుల హృదయాల్లో నిల్చి శాశ్వతత్వాన్ని కల్పించింది.

చెన్నుపాటి ఏ సమైక్యతకై తన జీవితాన్ని అర్పించాడో ఆ సమైక్యతను కాపాడి, ప్రాంతీయ భేదాలను అధిగమించి అన్ని కేటగిరీల, మేనేజిమెంట్ల ఉపాధ్యాయుల్ని ఒకే వేదికమీదికి తేవటానికి ఆంధ్రప్రదేశ్‌ అంతటికీ చెందిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ స్థాపింపబడింది. కొద్ది నెలల్లోనే తెలంగాణా జిల్లాలకు కూడా విస్తరించింది. ఉపాధ్యాయుల హక్కులకు, సంక్షేమానికి, వృత్తి భద్రతకు, విద్యారంగాభివృద్ధికి నిత్యపోరాటాలు జరుపుతూ సమరశీల పోరాట సంస్థగా, చెన్నుపాటి ఆశయాన్ని వుణికి పుచ్చుకొని నిత్య నూతనంగా దినదినాభివృద్ధి నొందుతూ నేడు రాష్ట్రంలోనే అతి పెద్ద సంఘంగా ఎదిగింది.[3]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]