పతిభక్తి (1958 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పతిభక్తి
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.భీంసింగ్
సంగీతం టి. చలపతిరావు
గీతరచన శ్రీశ్రీ
భాష తెలుగు

పతిభక్తి 1958లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. తమిళంలో అదే పేరుతో విజయవంతంగా నడిచిన సినిమా దీనికి మూలం.

సాంకేతికవర్గం[మార్చు]

  • నిర్మాత: కె.వి. చౌదరి
  • దర్శకత్వం: ఎ. భీంసింగ్
  • సంగీతం: టి. చలపతిరావు
  • కూర్పు: ఎ.భీంసింగ్

తారాగణం[మార్చు]

  • శివాజీ గణేశన్
  • సావిత్రి
  • మాలతి
  • జెమినీ గణేశన్
  • నాగయ్య
  • ఎం.ఎన్.రాజం
  • బాలయ్య
  • తంగవేలు
  • చంద్రబాబు

కథలు[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికునిగా చేరిన పార్థసారథి అనే యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా తన దగ్గర ఉన్న డబ్బు, కొన్ని కానుకలు ఒక పెట్టెలో పెట్టి దానిని తన అక్కగారికి అందజేయమని సాటి సైనికోద్యోగి రాజాని కోరతాడు. రాజా ఆ పెట్టె పట్టుకుని స్వగ్రామం వస్తూ, పార్థసారథి ఇచ్చిన చిరునామా ఎక్కడో పోగొట్టుకుంటాడు. ఎలాగైనా ఆ పెట్టెను స్వంతదారుకు చేర్చాలన్న సంకల్పంతో ఊరూరా తిరుగుతూ ఒక చోట రాజేశ్వరి అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె తల్లే పార్థసారథి అక్క అయినా ఆ సంగతి రాజాకి తెలియదు. ఆమె అప్పుల బాధలో కృంగికృశించి మంచానపడి మరణిస్తుంది. ఆ స్థితిలో రాజా అనాథ బాలిక రాజేశ్వరిని పెళ్లాడుతాడు. ఇది సహజంగానే రాజా తండ్రికి గిట్టదు. ఎలాగైనా ఆ పెళ్ళి చెడగొట్టి, రాజా మేనకోడలును తన కోడలుగా తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు. దానితో రాజా తండ్రి నుండి వేరైపోయి తన భార్యతో వేరు కాపురం పెడతాడు. ఆమె గర్భవతిగా ఉండగా రాజాకు సైన్యం నుండి తిరిగి పిలుపు వస్తుంది. ఈ అదను చూసుకుని రాజా తండ్రి తన కార్యదర్శి సన్యాసి ద్వారా రాజేశ్వరిని నానా అవస్థలు పెట్టి, భర్త పంపే డబ్బు అందకుండా చేసి ఊళ్ళో నుండి వెళ్ళగొట్టిస్తాడు. అప్పుడే సైన్యం నుండి తిరిగి వచ్చిన పార్థసారథి తన అక్కను, మేనకోడలును వెతుకుతూ వచ్చి, అక్కగారు చనిపోయిందనీ, తాను పంపిన డబ్బును రాజా ఆమెకు అందజేయకుండా మోసగించాడనీ భావించి అతనిమీద కసితీర్చుకోవాలను కుంటాడు. యాదృచ్చికంగా రాజేశ్వరి అతని పంచనే చేరి ఉంటుంది. సైన్యం నుండి రాజా తిరిగి వచ్చే సరికి అతని తండ్రి ఎదురై, రాజేశ్వరి చనిపోయిందని చెప్పి అతను మళ్ళీ పెళ్ళిచేసుకోవాలని బలవంతం చేస్తాడు. బాధతో ఉన్న రాజా అన్యమనస్కంగా అంగీకరిస్తాడు. ఆ స్థితిలో రాజేశ్వరి అక్కడికి వచ్చి తనవల్ల పెళ్ళి చెడిపోయి, భర్త అవమానం పాలవుతాడని గ్రహించి తిరిగి వెళ్ళిపోతుంది. పార్థసారథికి అప్పుడు రాజేశ్వరి తన మేనకోడలనీ, తాను పంపిన డబ్బును అపహరించిన రాజా ఊళ్ళోనే ఉన్నాడని తెలుస్తుంది. అతడు రాజామీద పగతీర్చుకోవడానికి పరిగెడతాడు. రాజా ఆస్తి కోసం కుట్రచేసిన అతని రెండో భార్యా, ఆమె తండ్రీ కారు ప్రమాదంలో చనిపోతారు. రాజా తండ్రి పిచ్చివాడై వీధిన పడతాడు. రాజా, పార్థసారథి ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడతారు. పతాక సన్నివేశంలో పార్థసారథికి నిజం తెలియడంతో కథ ముగుస్తుంది[1].

పాటలు[మార్చు]

  1. అంబికయే తల్లి మరియమ్మ కోరి నమ్మితమే మారియమ్మ - పిఠాపురం,సుశీల బృందం
  2. ఈ నీతులు పలికే పెద్దలను ఒక కన్నంటి కనవోయి - ఘంటసాల, అప్పారావు బృందం - రచన: శ్రీశ్రీ
  3. కొసరి కొసరి నాతో సరసములాడకు కృష్ణా - చంద్రబాబు
  4. చిని చిని కన్నుల వెలువగు వెన్నెల చిందెము మదన - పి.సుశీల
  5. చెడిపోవు మనుజులకే కనికారమే లేదే ఇలలోన - పి.సుశీల
  6. బీడులేని గూడులేని దాసరి నీడలేకయే చరించు దిమ్మరి - ఘంటసాల -రచన: శ్రీశ్రీ
  7. బీడులేని గూడులేని చిన్నది నీడలేకయే చరించు - మాధవపెద్ది బృందం
  8. రాక్ రాక్ రాక్ రాక్ అండ్ రోల్ షేక్ షేక్ షేక్ అండ్ రోల్ - చంద్రబాబు, వి. ఎన్. సుందరం

మూలాలు[మార్చు]

  1. సంపాదకుడు (5 October 1958). "'పతిభక్తి '". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 29 January 2020.[permanent dead link]