బండ్ల మాధవరావు
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరచవలసిన అంశాల గురించి చర్చపేజీలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు. (అక్టోబరు 2016) |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
బండ్ల మాధవరావు పుట్టింది - గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం , అనంతవరం.( అమరావతి ) తల్లిదండ్రులు - వేంకటపతిరావు, సామ్రాజ్యమ్మ. సహచరి - డా. ఉమారాణి. ప్రాధమిక విద్యాభ్యాసం - అనంతవరం. హైస్కూల్ విద్య - కె.వి.ఆర్ . జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, తుళ్లూరు. ఇంటర్ - బి.ఎస్.ఎస్.బి.జూనియర్ కళాశాల, తాడికొండ. బి.ఏ - జె.కె.సి కళాశాల, గుంటూరు. ఎం.ఏ తెలుగు - బనారస్ హిందూ యూనివర్శిటీ. ఎం.ఏ ఇంగ్లీష్ - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. వృత్తి - డైరెక్టర్, శిఖర స్కూల్, రిజోనెన్స్ జూనియర్ కాలేజ్.
ప్రచురణలు
[మార్చు]కవితాసంపుటులు 1.చెమట చిత్తడినేల 1998 2.స్పర్శ 2005 3.అనుపమ 2014 4.ఊరి కల (దీర్ఘకవిత) 2017 5.మాఊరు మాఇల్లు ( పాపినేని గారితో కలిసి కథా కవితా సంకలనం) 2017 6.దృశ్య రహస్యాల వెనుక 2021
సంపాదకత్వం
[మార్చు]1.కవితా! మాసపత్రిక, సాహితీమిత్రులు ప్రచురణ. 2.అన్వేషణ - పాపినేని అభినందన సంచిక. 3.బహుముఖ - దేవిప్రియ అభినందన సంచిక. 4.రైతుకవిత 5.కవిత వార్షిక సంచికలు 6.అమరావతి పోయిటిక్ ప్రిజమ్ 7.దేవిప్రియ సాహిత్య సర్వస్వం 8.దేవిప్రియ కవితా స్రవంతి అరసం ప్రచురణ
పురస్కారాలు
[మార్చు]1.సృజన సాహితీ పురస్కారం, పలమనేరు 2.గుంటూరు జిల్లా రచయితల సంఘం పురస్కారం , గుంటూరు 3.సహృదయ సాహితి పురస్కారం, కాకినాడ 4.ఎక్సరే సాహితి పురస్కారం, విజయవాడ 5.రోటరీ భాషా పురస్కారం, ఉయ్యురు 6.రోటరీ సాహితి పురస్కారం, విజయవాడ 7.తానా ఉత్తమ కవిత పురస్కారం, అమెరికా 8.టెల్సా ఉత్తమ కవితా పురస్కారం, అమెరికా 9.ఆలూరి బైరాగి పురస్కారం
పాల్గొన్న సభలు
[మార్చు]1.బొంబాయి ఆంధ్ర మహాసభ, ముంబయి 2.కేంద్ర సాహిత్య అకాడమీ, దక్షిణ, ఈశాన్య భాషా సమ్మేళనం, తిరువనంతపురం 3.కావ్యహోత్ర, రాష్ట్రీయ కవిసమ్మేళన్, గోవా 4.ప్రపంచ తెలుగు మహాసభలు, ఒంగోలు 5.కేంద్ర సాహిత్య అకాడమీ, దక్షిణ, ఈశాన్య భాషా సమ్మేళనం, విజయవాడ 6.అమరావతి పోయిటిక్ ప్రిజమ్ అంతర్జాతీయ కవిసమ్మేళనం, విజయవాడ 7.కేంద్ర సాహిత్య అకాడమీ,కవిసమ్మేళనం, కలకత్తా 8.మనోరమ ఇంటర్నేషనల్ పొయిట్రీ పెస్టివల్, గ్రీస్ 9. కేంద్ర సాహిత్య అకాడమీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సమ్మేళనం, విజయవాడ
చెమట చిత్తడి నేల కవితా సంపుటి ముందుమాట నుండి
- "మట్టిని నమ్ముకున్న శరీరాలకు
- ప్రతిఫలం ఎప్పుదూ మోసమే"
అని అవగాహన చేసుకున్న కవి బండ్ల మాధవరావు. ఇతని తొలి కవితా సంపుటి చెమట చిత్తడి నేల. నేలా, పొలాలూ, చేలూ, రై తులూ, శ్రామికులూ, సాదారణ జన జీవితాలూ ఇతని కవిత్వ పాదాలు. అటు బురద పట్టిన పాదాలో, ఇటు వేదనతో చేలిన పాదాలో, ఆగిన పాదాలో కాదు. కదుల్తున్న పాదాలు. ఆ పాదాల వెంట మనం కదిలి వెళ్తే మట్టిని నమ్ముకున్న వాళ్ళు ప్రస్తుత వ్యవస్థలో మేసపోతున్న తీరు కళ్ళకందుతుంది.
- "రక్తపు చెమటల్ని పవిత్ర విశ్వాసాల్ని
- తాకట్టు పెట్టి తెచ్చి చల్లిన మందులు
- పురుగుల్ని చంపవుకాక చంపవు."
- "నీటి ఊసుల వాగ్దానాలు
- నీటిమీద రాతల్లా కలవరపెడుతుండగా
- నమ్మకంగా పురుగుల్ని చంపాల్సిన మందులు
- నమ్ముకున్నవార్ని అంతం చేస్తున్నాయి"
- "పీకిన వేరుశనగ మట్టలకి
- ఎండిన తాలుగుండెలు వేలాడున్నాయి"
- "పొలేలుగా అని ఎత్తిన చేటకింద
- పొల్లు తప్ప మరేం మిగలటం లేదు"
మంచి వెత్తనం దొరకదు. నేరుండదు. విద్యుత్ కొరత. పురుగు మందుల కల్తీ. ఆఖరికి ఎంతో కొంత పంట దక్కితే, గిట్టుబాటు ధర దక్కదు. ఇదీ ఇవాల్టి వ్యవసాయ పరిస్థితి. దీన్ని పట్టించుకొంటున్న కవి బండ్ల మాధవరావు. ఒక కవితో రెండు కవితలో కాదు. "అన్నం మొలకెత్తడమంటే", "పత్తి చేలో దిష్టి బొమ్మ జీవితం", "చాటెడు మబ్బు కోసం", "మట్టిని మోసం చేస్తున్నారు", "హింసాత్మక దృశ్యం", - ఈ కవితల నిండా అతలాకుతలమవుతున్న రైతాంగ జీవితమే. మాయామర్మాలు తెలియని జీవితం కవిత్వ వస్తువైనప్పుడు, కవి నిజాయితీని అతని శిల్పం ప్రతిబింబిస్తుంది. మాధవరావు సాదాసీదా పదాల్తో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. మాటల్లో గారడీ లేదు. వినిర్మాణాలు లేవు. అన్వయ క్లిష్టతా లేదు. వస్తువుకి భాషకీ నడుమ సజాతీయ సంబంధం ఉంది. వస్తువుకి తగిన ఆత్మీయభాషను వాడడం ఇతని కవిత్వంలో సుగుణం. ఒక్క రైతు సమస్యలే కాదు, చుట్టూరా ఏ సామాజిక ఘర్షణ తలెత్తినా పట్టుకుంటున్నాడీ కవి. చేనేత కార్మికుల ఆత్మహత్యలూ, గాట్ ఒప్పద దురాక్రమణలూ గోడలమీదికెగబాకుతున్న అశ్లీల సంస్కృతి రేఖలూ, రోడ్లమీద పడ్డ శిథిల బాల్యాలూ, భావరాహిత్యపు చిర్నవ్వుల అందాలపోటిలూ - అన్నింటినీ రికార్డ్ చేస్తున్నాడు. ఎందుకు? జీవిత శిథిలమవుతుందని చెప్పేందుకే. వాస్తవికతను కళ్ళముందు పరిచి ఆలోచింప జేసేందుకే. వర్తమాన చరిత్రకు కవితాత్మక ప్రతిఫలనం.
- దర్భశయనం శ్రీనివాసాచార్య
అనుపమ కు
దేవిప్రియ ముందుమాట
అనంతారం: మాధవ్: ఒక అనుపమ ధార.. దేవిప్రియ “కూర్చున్న వాడిని కూర్చున్నట్లే వుంటాను దేహం రంగువెలుస్తూ వుంటుంది, చుట్టూ పరకాయించి చూస్తాను కొండలూ మట్టీ నీళ్ళూ సమస్తమూ రంగుతగ్గుతూ వుంటాయి నా లోలోపల కురుస్తున్న దిగులువర్షాన్ని చేతులు చాచి తాకుతుంటాను” (దిగులు/ అనుపమ) మాధవ్ 2009లో రాసిన ఇరవైయేడు పంక్తుల ఈ పద్యం చదివిన తరువాత నేను భారంగా, దిగులుగా, సాలోచనగా, మౌనంగా వుండిపోయాను. మైనస్ అయిదు డిగ్రీల సెల్సియస్ చలిలో నా చుట్టూ ఎవరో వంద డిగ్రీల మంటని రాజేసి, నన్ను మరిగించి, కరిగించి వేస్తున్నట్టు, అయినా వేదనలో కేక వేయడానికి కూడా నా నోరు పెగలనట్టు...! నిజమే; వెండీముల్ఫోర్డ్ అన్నట్టు అత్యుత్తమమైన, సాంద్రమైన కవిత్వం చదివిన తరువాత మనం వెంటనే మాట్లాడలేము. కాసేపు మౌనంగా వుండిపోతాము. అది ఉన్నత దశకి చేరిన కవిత్వానికి ఒక గీటురాయి.
ముందుమాటకి ముందుమాట మాధవ్; బండ్ల మాధవరావుని, తన చిన్ననాటి మిత్రుల లాగా, నేను కూడా ఇట్లాగే పిలుస్తుంటాను. శివశంకర్ తన మేస్టారు కనకనేమో, మాధవిని 'మాధవా' అని నోరారా పిలుస్తూ వుంటాడు. తన మూడో పుస్తకానికి నేను ముందుమాట - పీఠిక అనేది యేమిటో భారీగా, భారంగా అనిపిస్తోంది ఈ సందర్భంలో రాయాలనే మాధవ్ కాకతాళీయంగా, ఇరుగుపొరుగుగా వుంటున్నాం కనుక దాదాపు ప్రతిరోజూ ప్రతిపాదన ఇంత సుదీర్ఘకాలిక ప్రణాళికగా మారుతుందని తను వూహించివుండడు. పలకరించుకోడం, అప్పుడప్పుడయినా, గంటా రెండు గంటలు కూర్చుని మాట్లాడుకోడం, వీలు చిక్కినప్పుడు తన కారులోనో, నా కారులోనో కాసేపు తిరిగిరావడం... జరుగుతూనే వుంది. కానీ ఈ చిన్న ముందుమాట మాత్రం ముందుకుపోలేదు. సంవత్సరానికి పైనే గడిచిపోయింది. ఈలోపు నేనేమీ రాయలేదా అంటే, అక్షరాలని అమ్ముకుంటూ బతికేవాడికి అదెలా కుదురుతుంది? అది అంతా అధికంగా అసాహిత్యం, అకవిత్వం... పేజీలకి పేజీలు. పుంఖానుపుంఖం. - ఇలాగ కాదని, ఒకటి రెండు రోజులు మాధవిని వెంటబెట్టుకుని మాధవ్ తిరుగాడిన గాలిలో, ఆ నేలమీద, ఆ గుంటూరుజిల్లా కృష్ణా తీర సమీపంలోని గ్రామాలలో తిరిగిరావాలని అనుకున్నాను. అనుకున్న తరువాత ఒక నెలరోజులలోనే ఇది ముడిపడేట్టు చేయగలిగాను. గుంటూరుజిల్లా లోపలి లోకాన్ని చూపిస్తారమ్మని శ్రీధర్ని పసునూరి శ్రీధర్ బాబు - మురిపించి వెంట తీసుకుపోయాను. అంటే ఇది కవిత్రయయాత్ర అన్నమాట. నిజం చెప్పాలంటే ఇది ఒక వంక. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, ముంబై వంటి మహానగరాలకి కాకిలా తిరిగే ఈ తిరగలి బతుకునుంచి రెండు మూడు రోజుల వెసులుబాటు కోసం, మళ్ళీ ఒకసారి నా బాల్యపు, యవ్వనపు మట్టినీ, ఆకాశాన్నీ, చెరువులనీ, కొండలనీ, పైరుపచ్చటి పొలాల మీది నుంచి వచ్చే గాలినీ చూసుకుందామని లోపల యెక్కడో ఆశపడి వుంటాను. గోదావరి తీరాన, ఆది అనువాదకవి ఒక రాజకీయనాయకుడి తాజా వ్యాఖ్యానం ప్రకారం - నివసించిన పుష్కరపట్నంలో జరిగిన ఎండ్లూరి సుధాకర్ కూతురి పెళ్ళి చూసుకుని, అదే రాత్రి కృష్ణా తీరానికి తిరిగివచ్చాము. మరునాటి పొద్దున ప్రకాశం బ్యారేజి దాటి, ఉండవల్లి దగ్గర కుడిమలుపు తిరిగి కృష్ణ ఒడ్డు వెంట, మాధవ్ కవనభూమి అనంతారం దారి పట్టాము. ఉండవల్లి గుహల మీదుగా, సన్నటిరోడ్డు వెంట, పదుల సంఖ్యలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలు, ఒకటీ అరా గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ ఎన్.టి.ఆర్ విగ్రహాలూ, ఒకానొక ఊళ్ళో పరిటాల రవి నిలువెత్తు విగ్రహమూ... తెలుగు నేల ఇప్పుడు గమిస్తున్న రాజకీయ, ఆర్ధిక, సామాజిక దశని ఈ విగ్రహాలు ప్రతిబింబిస్తున్నట్టని పించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, గడిచిన పాతిక ముప్పయి సంవత్సరాలలో వచ్చిన మార్పులు, జరిగిన సామాజిక విచ్ఛిన్నతను ఆయా నాయకుల విగ్రహాల స్థితినీ, దుస్థితిని చూసి అర్ధం చేసుకోవచ్చు. ఒకచోట పచ్చగా పండిన వరి. ఒకచోట సగం పెరిగిన జొన్నచేను, ఇంకొక చోట విశాలమైన చెరుకుతోట, మరొకచోట పచ్చదనం బొత్తిగా లేని బీడు. మాధవ్ కవిత్వానికి అతిసారవంతమైన, పుష్కలమైన ముడి సరుకు సమకూరింది ఇక్కడే. బీడైపోతున్న శరీరాల్ని నాగళ్ళతో దమ్ము చేయాలి శుద్ధిచేసిన విత్తనాలతో మరో కొత్తపంటను పండించాలి! (9-9-1998 - స్పర్శ) ఇంక అనంతారం-అనంతవరం కంటే ఇదే బాగుంది - అయిదు నిముషాలలో చేరబోతున్నామనగా, మాధవ్ ముఖంలో, తరచూ వెళుతున్నప్పటికీ, పాతికేళ్ళ తరువాత ఊళ్లోకొస్తున్న వాడిలా, ఊరువిడిచి వెళ్ళి తిరిగి వస్తున్న ఒక బాలుడిలో కనిపించే ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఒక తన్మయత్వం! నేనీ మధ్య పదేపదే ఉటంకిస్తున్న డేవిడ్ ఇవాన్స్ సువర్ణవాక్యం 'you can take a boy out of Texas but you cannot take Texas out of the boy' - ఇటువంటి సందర్భాలలోనే అద్భుతం అనిపిస్తూ వుంటుంది. అల్లంతదూరం నుంచే, అనంతారం కొండ కనిపించీ కనిపించకముందు నుంచే, మాధవ్ నాకు సజీవ జటాజూట శివుడితో సహా కైలాస పర్వతం యేదో చూపించబోతున్నట్టు, పొంగిపోతూ మాట్లాడుతున్నాడు. ఊళ్ళో ప్రవేశించడానికి ముందు, కొత్తగా వేసిన తారురోడ్డు పక్కనే బోసిపోయి కనిపిస్తున్న గుట్ట దగ్గర కారులోంచి దింపి గుట్టచుట్టూ నడిపించాడు. చిన్న కొండ. గ్రానైట్చిప్స్ కోసం సగానికి పైగా తొలచివేశారు. గుట్టపాదాల దగ్గర యేర్పడిన గుంటనిండా నీళ్ళున్నాయి. దాని కన్నీళ్ళున్నాయనాలా? ఇక్కడిదాకా మమ్మల్ని తీసుకువచ్చిన కొత్తతారు రోడ్డు కింద పరిచింది బహుశా ఈ గుట్టరాళ్ళనే అయివుండాలి.
అనివార్య విషాదం. మాధవ్ 'ముచ్చబోడు' అని 2013 అక్టోబరులో రాసిన పద్యం ఈ పరిసర పర్యావరణ విధ్వంసాన్ని గురించే. ఈ చిన్నకొండ పేరు మాధవ్ పద్యం వల్ల ఇప్పుడు పలువురికి గుర్తుండిపోయింది. ఆ పక్కనే మాధవ్ వాళ్ళ పొలాలు కొన్ని వున్నాయని చూపించాడు. ఊరికి ఇంకొకవైపు మరి కొంత భూమి వుందన్నాడు కానీ, ఈ చేలకీ, ఆస్తులకీ అంతటి ప్రాధాన్యత లేదనుకున్నట్టున్నాడు, వివరం చెప్పలేదు. అనంతారంలో మాధవ్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ నాన్నగారు బండ్ల వెంకటపతి రావు కట్టించిందే. దిట్టమైన . వసారాలో, తెలిమబ్బు తునకలను తెంపుకొచ్చి కుప్పబోసినట్టు పత్తి, ఒక సూక్ష్మ ధవళగిరి లాగ తళతళ లాడుతూ, పైకప్పుని తాకుతోంది. 'అమ్మా' అనగానే ప్రత్యక్షమైంది మాధవ్ని కన్న బంగారుతల్లి సామ్రాజ్యం. చిట్టెమ్మ అంటారంట. మక్కడున్న ఆ అరగంటసేపూ ఆమె, వానాకాలం కోసం యెదురు చూడకుండా యెల్లప్పుడూ ఉరకలెత్తుతూ వుండే కొండవాగులాగ గలగలగలగల మాట్లాడుతూ నే వుంది. డెబ్బయి అయిదేళ్ళు చూసి వుండవచ్చు. అచంచలమైన ఆత్మవిశ్వాసం. అనంతారంలో లేనిది హైదరాబాదులో యేముంది గొప్ప, అనే ధిక్కారం, తిరస్కారం. తన చిన్న ఊరు. తన చిన్న ఇల్లు. తన స్నేహితురాళ్ళు. తన కుటుంబం. తన ప్రపంచం. ఎంత ధీమా! అటువంటి తల్లివుండగా మాధవ్ కవిత్వం మరొకలాగ యెలా వుంటుంది...! కొబ్బరి బూరెలూ, కారంపూస తిని స్వయంగా తానే పెట్టి గాజుకప్పులో తెచ్చి యిచ్చిన కాఫీ తాగి, చిట్టెమ్మతల్లికి నమస్కరించి, బయటకి వచ్చి చిట్టెమ్మ గారబ్బాయి చిటికెన వేలు పట్టుకుని అనంతారం కొండవైపు చూస్తూ ఊళ్ళోకి బయలుదేరాను. వీధుల్లో పోతూవుంటే అనంతారమంతా నాకు తెలిసిందే, నేను చూసిందే అనిపించింది. మాధవ్ మొదటి పుస్తకం 'చెమట చిత్తడినేల' (1998) నిండా పరుచుకుని వున్నది ఈ అనంతారమే. 'స్పర్శ' (2005) పంక్తి పంక్తిలో నేరుగానో, మాటుగానో తొంగిచూస్తున్నది ఈ అనంతారమే. పాపినేని శివశంకర్. శివశంకర్ పుట్టి పెరిగింది కూడా ఈ దగ్గరే. నెక్కల్లు. ఈ మధ్యనే అనంతారం కొండమీదికి, యెప్పుడు లెక్క పెట్టాడోకానీ, 361 మెట్లున్నాయని రా కొండమీదికి మంచి రోడ్డు వేశారు, నాకోసమే అన్నట్టు. కొండపైనుంచి చూస్తే పొలాలు..... మట్టి రంగు, పచ్చరంగు చీరలు రెండుమూడు ఉతికి నేలమీద ఆరేసినట్టు విగ్రహానికి నూనూగు మీసాల నూత్నయవ్వనంలో వున్న పూజారి మంత్ర సేవ చేస్తున్నాడు. కనిపించాయి. పైన చిన్న గుహాలయంలో వున్న చిన్న వేంకటేశ్వర గుడిముందు ఏపుగా, ఎత్తుగా పెరిగిన చిటికేసర చెట్టు కొమ్మల్లోంచి పైకి పొడుచుకు వచ్చినట్టు ఒక చతుర్ముఖ ధ్వజస్తంభం నిలిచివుంది. దానికి వేలాడుతున్న చిరుగంటలు గాలి కాస్త గట్టిగా తోలినప్పుడు, చిన్న శబ్దం చేస్తున్నాయి. అనంతారానికి తిరుగు లేని భద్రత ఉంది. రెండు పెద్ద పెద్ద కొండలు, వెంకటేశ్వరస్వామి కొండ, చెన్నకేశవస్వామి కొండ. ఈ రెండవకొండకి గట్టి దేవుడున్నట్టు లేదు. వైభవమంతా వేంకటేశ్వరుడి కొండకే, అనంతారంలో కూడా! మాధవ్ కవిత్వం - అనుపమ మనిషి మెదడు ఒకే ఒక అంగంలోకి కుంచించుకుపోయింది (బహిరంగ రహస్యం - 1998) అనీ, స్పర్శ మాత్రంతోనే విప్పారాల్సిన దేహం చూసినంత మాత్రానికే ముడుచుకు పోయింది (దేహవిస్ఫోటనం - 2000) అనీ, వెలుపలి నిశ్శబ్దం లోపలి శబ్దాల్ని నిలువరించ లేకపోయింది (2004) అనీ రాసిన కవి ఆలోచనాధార యేమై వుంటుంది? ఆ కవి అంతరంగంలోని ఒరిపిడిలో జనిస్తున్న రవ్వలలో కనబడని కార్చిచ్చు యేదో వున్నదనిపించడం లేదా?అనంతారం అరుగులబడిలో, లూకామేష్టారి దగ్గర అఆఇఈ దిద్దడం నేర్చుకుని, తుళ్ళూరు హైస్కూలులో చదువుకొని, అక్కడనుంచి తాడికొండ సత్యసాయి కాలేజీ మీదుగా, గుంటూరు జె.కె.సి. కాలేజి మీదుగా, కాశీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం చేరి, గంగాతీరంలో ప్రశాంతంగా తెలుగు ఎమ్.ఏ., చదువుకున్నాడు. వ్యాకరణం, అలంకారశాస్త్రం మాధవి కొంతయినా ఒంటపట్టటానికి కాశీచదువు బాగా పనికి వచ్చినట్టనిపిస్తోంది. ఈ విద్యాసముపార్జన క్రమంలో మాధవ్కి తారసపడిన కడియాల రామమోహనరాయ్, పాపినేని శివశంకర్ వంటి అధ్యాపకులు కూడా సామాన్యులు కాదు. వారితో యేర్పడిన సాంగత్యం వల్ల తన ప్రాపంచిక దృక్పధానికి కూడా సరైన, సవ్యమైన మార్గదర్శనం లభించింది. మాధవ్ కవిత్వం చెప్పడం యెప్పుడు మొదలు పెట్టాడో కానీ, అచ్చయిన మొదటి పద్యం ఫిబ్రవరి 1991 ప్రజాసాహితిలో వచ్చిన పద్యంగా 'చెమట చిత్తడినేల'లో నమోదైవుంది. మాధవ్ 1991 నుంచి 2014 వరకు. ఇరవై మూడేళ్ల పాటు ఆధునిక తెలుగు కవిత్వపు దారులలో ప్రయాణం చేశాడు. 'అనుపమ' తన మూడవ పుస్తకమే అయినా, యెక్కడా, యెప్పుడూ తన తాత్వికధారని తెగిపోనీయ లేదు. సృజనపరంగా తన అన్వేషణని ఆగిపోనీయలేదు. తరచూ రాయాలని చెప్పడం సాధనకోసమే. సాధన కవినైనా, వచన రచయితనైనా సానపడుతుంది. మెరుగుపరుస్తుంది. కవికి కానీ, వచన రచయితకి కానీ సోమరితనం పనికి రాదు. కవిత్వం కళ కాదనుకునే వారు కవిత్వం జోలికి రాకుండా వుండడమే మంచిది. ప్రసంగానికీ, కవిత్వానికీ తేడా చూడలేని వారు కవిత్వం జోలికి పోకుండా వుండడమే మంచిది. కవిత్వమంటే మాటలను పోగుచేయడం కాదు, మాటలని పొదగడం. రససిద్ది అంటే కొందరు అదియేదో నిషిద్ద పదమనుకుంటారు. వినేవాళ్ళకి కలిగేది అదే. శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, ఆరుద్ర, కుందుర్తి, గద్దర్ గొంతెత్తి పాడినప్పుడు, గోరటి వెంకన్న ఆర్ద్రపద చిత్రాలతో పాట ఆలపించినప్పుడూ, బెల్లంకొండ, ఇస్మాయిల్, నగ్నముని, వేగుంట, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ, వరవరరావు, శివారెడ్డి, పాపినేని, ఖాదర్ మొహియుద్దీన్, గోపి, సిధారెడ్డి, యాకూబ్, కలిగిన ఆ గగుర్పాటు, ఆ పులకరం అదే. ఇప్పుడు రాస్తున్న పసునూరి శ్రీధర్ బాబు అఫ్సర్ వంటి ప్రతిభావంతులైన కవుల తొలిపద్యాలు చదివినప్పుడు తెలుగువాళ్ళకి వంటి, మాధవరావు, కొప్పర్తి వంటి అతి కొద్దిమంది కవులు సాధిస్తున్నది, కలిగిస్తున్నది కూడా రససిద్ధినే మాధవ్ 'అనుపమ' ఒక 'జ్ఞాపకాల చెట్టు, నాకైతే ఈ కొత్తపద్యాలు, కొత్తగా రాసిన పద్యాలు చదువుతుంటే ఒక టైమ్ మెషిన్లో కూర్చుని 1960 దశకంలోకి, అప్పటి గుంటూరుజిల్లా గ్రామ జీవనం లోకి వెళ్ళినట్టనిపించింది. 1960 నుంచి, 1990 వరకు, ఈ మూడు దశాబ్దాలలో ఊళ్ళు 'మారిపోయిన' మాట నిజమే. కరెంటొచ్చింది. టెలివిజనొచ్చింది. మొబైల్ ఫోనొచ్చింది. పురుగుమందు లొచ్చాయి. బి.టి. పత్తి వచ్చింది. పొగాకు తోటలు మాయ మయ్యాయి. కొత్త రాజకీయపార్టీలు ప్రవేశించాయి. ఊళ్ళల్లో రంగురంగుల జెండాలు యెగురుతున్నాయి. ఊళ్ళు మారిపోయిన మాట నిజమే. అయినా సన్నకారు రైతులు మారారా? ఊళ్ళల్లో రెక్కాడితేనే కానీ డొక్కాడని వర్గాల ప్రజలు మారారా? సాగుకింది విస్తీర్ణం కుంచించుకుపోతుంటే నిలువరించే ప్రయత్నం జరుగుతోందా? సారాంశంలో ఇటువంటి అనేకానేక ప్రశ్నల ప్రతిధ్వనులు మాధవ్ 'అనుపమ'లో వినిపిస్తాయి. 'అనుపమ'తో మాధవ్ మరింత ఆర్ద్రంగా మారాడు. మరింత సాంద్రంగా మారాడు. కవిత్వ కళ పట్ల మరింత మెలకువతో, మరింత బాధ్యతతో వుండడం అలవరచుకున్నాడు. స్వీకరించే వస్తువును మరింత స్పష్టమైన వెలుగులో చూడగలుగు తున్నాడు. మరింత పదునుగా తన కవిత్వం ద్వారా మాట్లాడగలుగుతున్నాడు. 'చెమట చిత్తడినేల'ను పరిచయం చేస్తూ, ఆనాడు దర్భశయనం శ్రీనివాసాచార్య, పద్య నిర్మాణంలో కనిపించిన లోపాలను గురించి చేసిన హెచ్చరికను సానుకూలంగా స్వీకరించి మాధవ్ ఆ ధ్యాన పెంచుకున్నాడు. దీనికి 'అనుపమ' కవితలలో అనేక ఉదాహరణలున్నాయి. 'ఒంటరిదీపం', 'మౌనవిస్ఫోటనం', 'అంతరించిపోతున్న జాతి', 'జ్ఞాపకాలచెట్టు, 'మిత్తన 'దుఃఖధూళి', 'దిగులు', 'కురవని చినుకుకోసం' వంటి పద్యాలు మనకి మాధవ్ చేస్తున్న కొత్త వాగ్దానాలని నేననుకుంటున్నాను. 'మాధవ్ 1993లో రాసిన 'అసలైన పోస్టర్ కోసం' అనే పద్యం చదివి, ఇటీవలనే శ్రీధర్ బాబు 'కవితా'లో 'అప్రయాణం' పేరుతో తనద్రవ శైలిలో చాలామంచి పద్యం రాశాడు. ఇది ఇద్దరు సమకాలిక కవుల మధ్య అభిలషణీయమైన అవగాహనకీ, పరస్పర స్ఫూర్తికీ, గౌరవానికీ ఒక ఉదాహరణ మాత్రమే కాక, మాధవ్ స్వీకరించే వస్తువుల ప్రవాహ ప్రాసంగికతను కూడా చూపుతోంది.' అనుపమ పద్యాలలో మాధవ్ అవలీలగా స్థానికతను విశ్వజనీనతగా మార్చివేశాడు. అనుపమలో మాధవ్ తననితాను ఫిలసాఫికల్గానూ, ఫిజికల్గానూ ఒక ఏకసూత్రంలో బంధించుకుని, కండెని తిప్పుకుంటూ, విప్పుకుంటూ వెళ్ళమని, ఆ దారపు కొనని మన చేతిలో పెట్టాడు. అనుపమలో యెక్కి ఊళ్ళు తిరిగివచ్చాక, కొండలూ గుట్టలూ యెక్కి దిగివచ్చాక, గుళ్ళూ గుహలూ, శిధిలాలూ, యుద్ధభూములూ చూసి వచ్చాక నాకొకటి అనిపించింది. మొదట మనమంతా పిల్లలం. ఆ తరువాత, కాలం కలిసివస్తే, విద్యార్ధులం. ఆ పిదప పంతుళ్ళం, గుమస్తాలం, రాతగాళ్ళం, భర్తలం, భార్యలం, తల్లులం, తండ్రులం, కొడుకులం, కూతుళ్ళం, తాతయ్యలం, అమ్మమ్మలం, సైనికులం, వైణికులం. మనమే దురాక్రమణ దారులం, మనమే బందీలం, మనమే కాందిశీకులం. అన్నీ తలమీద మోసుకుతిరుగుతూ వుంటాం చివరివరకూ. తన 'అనుపమ'కి ఈ ముందుమాట నేనే రాయాలని భీష్మించి, నేను రాసేవరకు ఏడాదిన్నరకి పైగా అసాధారణ సహనంతో వేచివున్న తమ్ముడు మాధవ్, మాధవి నిరాశలో ఆశ, కల్లోలాలలో ఆసరా అవుతున్న మా అమ్మాయి ఉమకీ మర్యాదకోసమే కాదు, మనసారా నా ధన్యవాదాలు. 20 మార్చి, 2014 హైదరాబాద్.
- ****** ******
మట్టి భాషను పలవరించిన కవిత్వం -
Niyogi ANDHRAPRABHA -
Sat, 20 Sep 2014, IST
మట్టిపంట/ మట్టి బువ్వ/మట్టి జీవితం/ ఇప్పుడు/ మట్టినికౌగిలించుకుంటే/ దు:ఖ ధూళి రాలుతుంది/ నిన్నటి దాకా/ గజాలలెక్కన/ డబ్బైన మట్టి/ నేడుడొక్కల్లో ముడుచు కొని/దీనంగా చూస్తుంది. ఈకవితా పంక్తులు బండ్ల మాధవరావు రాసిన 'అనుపమ' కవితా సంపుటిలోనివి. బండ్ల మాధవరావు ఆలోచనా పరిధి బహు విస్తృతమైనది. గతంలో వెలువరించినకవిత్వంలో కూడా ఒక విలక్షణ లక్షణం కన్పిస్తుంది. ఇక ఇప్పటి ఈ 'అనుపమ' కవితా సంపుటిలోని ప్రతికవిత మనల్నికదిలిస్తుంది. ఈకవితా సంపుటి వస్తువైవిధ్యంతో ఆకట్టుకుంటుందనిచెప్పవచ్చు.దాదాపు రెండు దశాబ్దాలుగా కవిత్వ లోకంలో ఉన్న మాధవరావు వెలువరించిన మూడవ పుస్తకమిది. ఇందులోని కవితలన్నీ 2009-14 సంవత్సరాల మధ్య వివిధ పత్రికలలో ప్రచురించబడినవి. మట్టిమీద ప్రేమపై అనేకమంది కవులు రాశారు.ఇప్పుడు మట్టిని కౌగిలించుకుంటే దు:ఖ ధూళి రాలుతుందని చెప్పడంలో ఒక విలక్షణతకన్పిస్తుంది. నిజమే పంటలు పండక, పండిన గిట్టుబాటు రాక రైతులు విలవిలలాడుతున్న కాలమిది. దీన్ని మన కళ్ళకుకట్టిన విధానంతీవ బాధకు గురిచేస్తుంది. ఆ దు:ఖం మనదేనన్నంతగా కలచివేస్తుంది. మరో కవితలో మరణాల్ని కీర్తించడం కొత్తేమీకాదు. మణికర్ణికా ఘాట్లో/గంగ కొంగులో పొంగుతున్న/ఆరని చితిమంటల్లో/ నిత్యం నన్ను దహించుకుంటున్నవాడినే/చరిత్రలో సంపూర్ణ స్వర్ణయుగాలుండవు/ పాలించేవాడెవడైనాపద ఘట్టనల కింద నలిగినాత్మలు మౌనంగా రోదిస్తూనేఉంటాయిఅంటాడు. నిజమే ఎవడుపాలించినాపేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు. ఇదేకవితలో నువ్వు విసిరిన ఎంగిలి మెతుకులేపరమాన్నంగా భావించి/నీముందు మోకరిల్లినవాడిని అని వేదనగా పలుకుతాడు.ఈ సంపుటిలోని మొత్తం 46కవితలువేటికవే ప్రత్యేకత కలిగివున్నాయి. బండ్ల మాధవరావు కవిత్వం రాసినది తక్కువేమో గాని రాసినవన్నీ వాసి కట్టినవే. దేవిప్రియ ముందుమాటతో వెలువవడిన ఈ పుస్తకాన్ని పాపినేని శివశంకర్కి అంకితమిచ్చారు మాధవ్.
- గురువారంశీర్షిక
- ప్రభాత_పద్యం
- బండ్ల_మాధవరావు గారి
- మాయమైన_చేతులు
బండ్ల మాధవరావు గారు ఆధునికులు. ఐతే వీరి ఆలోచనలు మరింత ఆధునికంగా వుంటాయి.కవి, ప్రవక్త కాలానికంటె ముందు వుంటారు అనే మాట వీరికి సరిగ్గా నప్పుతుంది. వీరి కవిత్వం ఆ విషయాన్ని రుజువు చేస్తుంది.
సకల విద్వంసాలకు మనిషే కారణమని,మనిషి స్వార్థం, మతి మాలిన ఆలోచనే ఈ విద్వంసాలన్నిటికి కారణమని నమ్మే మనిషి. అలా తన కాలికింది నేల తనది కాకుండా పోతున్న తరుణంలో వీరు తల్లడిల్లుతూ ఊరి కల కంటారు! చెమటచిత్తడి నేల స్పర్శను బాగా తెలిసిన వారు కుడా. ఎ సి గదుల నగరం అతడికి ఉక్కపోత! నిత్యం సామాన్యుని తలపులతో నడయాడే మనిషి. ఇవాల్టి ప్రభాత పద్యం కవిత ఇందుకు ప్రబల తార్కాణం! సహృదయత, స్నేహశీలత వీరికి ప్రత్యేక ఆభరణాలు.
మరి కొంత : ~
○ #స్పర్శ , #చెమచిత్తడినేల, #అనుపమ అని మూడు కవితా సంపూటాలు వచ్చాయి ఇప్పటికి.
○ #ఊరికల పేరుతో ఊరు నేపధ్యంగా ఒక దీర్ఘ కవిత రాశారు.
○ అనుపమ కవితా సంపుటికి గుంటూరు జిల్లా రచయితల సంఘం వారి అవార్డు. కాకినాడ సహృదయ సాహితీ వారి అవార్డు అందుకున్నారు.
○ #కవితా మాస పత్రికకు ప్రధాన సంపాదకులు గా ఉన్నారు.
○ దేవిప్రియ గారి మీద వచ్చిన #బహుముఖ , పాపినేని గారి మీద వచ్చిన #అన్వేషణ అనే ఈ రెండు వ్యాస సంపుటాలకు సంపాదకుడు గా ఉన్నారు.
○ విద్యావేత్త గా #శిఖర అనే పాఠశాలని నడుపుతున్నారు .
మాయమైన చేతులు - బండ్ల మాధవరావు
~
ఒక్కనొక ఉదయాన
నిద్రలేచి చూసుకొనేటప్పటికి
నా చేతులు అదృశ్యమైపోయాయి
పరమ సంభ్రమంగానూ ఆశ్చర్యంగానూ అనిపించింది
అప్పటివరకు అన్నం తినిపించిన చేతులు
నడిచే కాళ్లకు ఆసరా అయిన చేతులు
చేతులు లేకపోవడం
మనిషి లేకపోవడంలాంటిదే కదా!
చెయ్యడం అనే పదం చేతులనుండే కదా పుట్టింది
ఏ పనైనా చెయ్యడం చాతకాకపోతే
తలలేనోడా అని మానాన్న తిట్టినట్టుగా
ఇప్పుడు నేను
పని లేనోడినయ్యాను
పని – బతకడానికేనా
బతికించడానికి కూడా కదా
పనంటే మట్టి
మట్టినుంచు అన్నం
కాళ్ల కింద మట్టి పెళ్లగించబడ్డాక
అన్నం లేదు
అన్నం పెట్టే పనీ లేదు
నువ్వొక ఆకాశ హర్మ్యాన్ని
నా మట్టి తల పై నిలిపాక
నా చేతులు అదృశ్యమవ్వడం ప్రారంభించాయి
మట్టి పిసికిన చేతులు
దుక్కిదున్నిన చేతులు
వెదబెట్టిన చేతులు
కోతకోసిన చేతులు
సమస్తమైన పనిని
ఒడుపుగా చేసిన చేతులు
పని చేసి చేసి అలసిన చేతులు
మట్టినుండి దూరమై
క్రమంగా నాలోకి ముడుచుకుపోయాయి
నువ్వు భూతల స్వర్గపు మాయమాటల్ని
నా నేలతల్లి మీద వెదజల్లాక
మొలవాల్సిన అన్నం
తాలు గింజలై నిర్వీర్యమైపోయింది
మాటల మొక్కల కింద
పరుచుకొన్న పైపంచె మీద
కన్నీటి గింజలు రాలుతున్నాయి
మట్టిని వాడికి అప్పజెప్పాక
కనబడని చేతుల్ని
ముందుబెట్టుకు కూర్చున్నాను
పని లేకపోవడం లోని నరకం
అనుభవంలోకి వచ్చింది!
“ తమ ఊరిని ఇంటిని కవిత్వంగా కథ గా మార్చిన ఇద్దరు కవులు “
{ ఈ వారం కవితాంత రంగంలో “ మాఊరు ఇల్లు “ కవిత్వ కథా సంపుటి కవులు శ్రీ బండ్ల మాధవరావు, శ్రీ పాపినేని శివ శంకర్ గార్లు } ~ తూముచర్ల రాజారామ్ .
“ఒకానొక ఉదయాన నిద్రలేచి చూసుకొనేటప్పటికి నా చేతులు అదృశ్యమయ్యాయి “
ఈ వాక్యాలు పరమ సంభ్రమానికి గురిచేయడమే కాదు చేతులు అదృశ్యం కావడమేమిటి అనే ఆశ్చర్యానికి గురిచేశాయి.ఇదేదో మ్యాజికల్ రియలిజమ్ లా అనిపించింది.లోతుగా వెళితే పరుచుకున్న పై పంచె మీద ధాన్యపు గింజలకు బదులు కన్నీటి బొట్లు రాలుతున్న దృశ్యం రూపు కట్టింది. భూముల్ని కోల్పోయి ఆ కారణంగా పనుల్ని కోల్పోయిన మనిషిని చూపించాడు ఈ కవి.ఈ కవంటాడు “ పని – బతకాడికేనా బతికించుకోడానికి కూడా కదా “ అని.
“మట్టి పిసికిన చేతులు దుక్కి దున్నిన చేతులు వెదబెట్టిన చేతులు కోతకోసిన చేతులు సమస్తమైన పనిని ఒడుపుగా చేసిన చేతులు పని చేసి చేసి అలసిన చేతులు”
మట్టినుండి దూరమై పనిని కోల్పోయి చేతులు మాయమవుతున్నాయనే వాస్తవాన్ని రాబోయే కాలంలో పని లేకపోవడంలోని నరకాన్ని చేతులు అదృశ్యమైపోయాయి అనే మాటతో స్ఫురింపచేశాడు ఈ కవి.ఈ కవి ఎవరంటే బండ్ల మాధవరావు గారు.
“నాకెదురుగా అది వుందో తనకెదురుగా నేనున్నానో ఎప్పటినుంచో ఇద్దరం ఎదురుబొదురుగా అనంత కాలం నుంచి ఈ అనంతారం కొండ అట్టానే నల్లగా అంతెత్తు మినుమలరాశికి మల్లే కదలకుండా చెదరకుండా “
కదలకుండా చెదరకుండా వున్న ఆ కొండ ఈ కవి ఊహలో అంతెత్తు పోసిన మినుమరాశే కాదు ఆ కొండ ఏనుగు ఒంటి మీద విభూతి పట్టె లాగా తెల్లటి చారల్లాంటి మెట్లతో కనిపించే దృశ్యం. సంవత్సరాదికి ముందు ప్రభలతో వెలిగిపోయే ఆ కొండ వైభవం..ఆ కొండమీదవున్న మీద వున్న వేంకటేశ్వరుని మీద ప్రజలకున్న భక్తిని ఈ కవి చెప్పడమే కాదు చేసింది ఆ కొండలోవున్నది మట్టి రాళ్ళే కాదు ఆ కొండకి ఆత్మ వుందని కూడా చెప్పాడు. ఆ కొండని తాను ప్రతిరోజు తన డాబా మీదనుంచి చూసినా..తన తాపం తీరదట. ఇప్పుడా ప్రాంతంలో రాజధాని నిర్మాణం.మెట్ట చేల ఆకుపచ్చని పాటలల్లో ముసిరిన దిగులుని పసిగట్టి అందుకే ఈ కవి ఇలా అంటాడు.
“ఎప్పటికైనా ఇక్కడ మనిషిలాంటి ఒక కొండను చూసినట్టే కొండలాంటి ఒక మనిషిని చూస్తానా “
ఊరు పరాయిదయిపోయిన సందర్భాన్ని దృశ్యా దృశ్య సంఘర్షణగా సహజత్వం కోల్పొతున్న మనిషిని ప్రతిదాన్ని డబ్బుతో కొలిచే అతని స్థితిని చూపెడతాడు.ఇలా చూపెడుతున్న కవి ఎవరంటే పాపినేని శివశంకర్ గారు.
పరిసరాలు మానవుడి జీవన విధానాన్ని తీర్చిదిద్దుతాయి.ఆ పరిసరాలే కవుల మనసుల్లో కావ్యగీతీ కలాపాలవుతాయి. చెట్టు, పుట్ట,చేను ,చెలక,ఏరు,సెలయేరు, కొండ,గుట్ట వొకటేమిటి అన్నీ కవుల్ని కలవరపెట్టి కవిత్వమవుతాయి.తాము వున్న వూరు ,తాము నిసిస్తున్న ఇల్లు,తాము చూసిన కొండ,తాము ఆడుకున్న చింతతోపు,తాము కౌగలించుకొనే భూమి నిన్నటిదాకా నిలిచిన ఒక జీవన ఉనికి అంతా కళ్ళముందే కంకర యంత్రాల మధ్య రాతి దుమ్ములో కలసి పోతుంటే బాధాతప్త హృదయాలు రెండు కవిత్వమయ్యాయి.కథ అయ్యాయి. ఆ కథ కవిత్వాలే బండ్ల మాధవరావు , పాపినేని శివశంకర్ గార్లు.
“మా ఊరు రాజధానయ్యింది ఎక్కడో మూడొందల మైళ్ళ దూరాన ఉండాల్సిన రాజధాని ఇప్పుడు నా నట్టింట్లోకి నడిచొచ్చింది “ ( “ఊరు రాజధానయ్యింది”- బండ్ల మాధవరావు )
తన ఊరు ఒక రాష్ట్రానికి రాజధాని కాబోతుంటే ..ఈ కవి ఎందుకు ఇలా తన వేదనను కవిత్వంగానో కథగానో మలిచాడు సంతోషపడక అని అనిపించక మానదు మీకైనా నాకైనా. డబ్బు తెగులు ఊరిని కమ్ముకున్నప్పుడు తరతరాల ఊరు చరిత్ర కలిగిన ఊరు అనంతవరమైన ఊరు శాపగ్రస్త అయి తనకు తన వాళ్ళకు పరాయిదైపోయి అదొక సచివాలయమై ఎన్నోఏళ్లనుండి వున్నవాళ్ళను నెట్టేస్తే కలిగిన కవిత్వ కథా దుఃఖాశ్రువులే.. “మా ఊరు మా ఇల్లు”
“ ప్రతి పండగా కళకళతోపాటూ ఒక కలను గూడా వెంట తెస్తుందేమో ఈ ఉగాది తెచ్చిన కల పేరు రాజధాని తొలకరి మబ్బు మీద మబ్బల్లే కల తూరుపు వెలుగు మింగిన కల స్వప్న ఛాయల్లో మూలాలేవో కదలబారతా పొలాలు అరూపాలవుతూ అపురూపాలవుతా –“ ( “పొలాల కల “ – పాపినేని శివశంకర్ )
రంగు రంగుల రాజధాని రాకతో అధికారం స్వరం సగం బుజ్జగింపుగా సగం బెదిరింపుగా భూముల్ని గుంజుకున్నప్పుడు కలలన్ని ఎండిపోయిన కళ్ళతో ఎండిపోయిన బీళ్ళల్లా వున్న బతుకుల్ని, ఆకుపచ్చదనం కోల్పోయి సిమెంట్ ను పులుముకుంటున్న పంట భూముల్ని చూసినప్పుడు ఆ కవి కన్నీటి కల్లోల కవిత్వ కథలే “ మా ఊరు మా ఇల్లు “.
ఊర్లో ఇల్లొక్కటే కాదు చెట్టు కూడా వుంటుంది. ఆ చెట్టు నీడాలు పరుచుకున్న మహా వృక్షమై విస్తరించుకొని కూడా వుంటుంది.ఆ చెట్టు కింద సేదదీరడమంటే అమ్మమ్మ కొంగులో దూరి ముడుచుకొని పడుకున్నట్లే వుంటుంది.అట్లాంటి చెట్టు రాజధాని నిర్మాణంతో అదృశ్యమై అక్కడ కాంక్రీట్ మహావనం లేస్తే..ఆ బొమ్మనే బండ్ల మాధవరావు గారు “జ్ఞాప కాల చెట్టు” అని కవిత్వం చేశారు.చెట్టు అదృశ్యమైనా అక్కడ జీవనాలు అట్లాగే వుండటాన్ని చూపిస్తాడు.మాధవరావు చాలా మార్దవుడు.అందుకే అతని కవిత్వం కూడా మార్దవమే.
“ఆ విశాల వృక్షం కింద కూర్చొని చిరుహాలుల్ని ఆస్వాదించడమంటే అమ్మమ్మ ఒళ్ళో అలసొపోయి పడుకున్నప్పుడు ఆమె నేత చీర పైట కొంగుతో విసిరే గాలిని తాకిన అనుభూతి “
కవిత్వ సందర్భం విధ్వంసాల అభివృద్ధి గురించి చెప్పడమే అయిన మాధవరావు దాన్ని మార్దవంగానే రాశాడు. ఎప్పట్నుంచో ఒక పగలని కుండ కోసం కవి పాపినేని గారు వెదుకుతున్నారట. నిజంగా పగలని కుండ మరణం లేని మనిషి వుండడు.మనుషుల్లో పేరుకపోతున్న ఈ ఓటి తనాన్నే శివశంకర్ గారు కుండల్ని ప్రతీకలుగా చేసి “ఓటి కుండలు” అనే ఈ కవిత రాశాడు.
“ఇక్కడేమో కొన్ని ఓటి కుండలు అసహనంగా కుములుతూ,చిట్లిపోతూ మాటిమాటికి చెదిరి ముక్కలవుతూ పెంకులై గుండెల్లో గుచ్చుకుంటూ పగలడమే తప్ప కరచుకోవడం వాటికి తెలీదు ఏ తంబకంతోను అతికించలేం “
బాధలకో కన్నీళ్ళకో కుములుతూ చిట్లిపోతూ కలిసి పోరాడిల్సిన తరుణంలో చెదిరి ముక్కలవుతూ సామూహికంగా కల్సి చేయాల్సిన పనిని చేయకుండా వున్న మనిషి మనస్తత్వాన్ని కవిత్వంగా చెప్పారు ఈ కవి. దృశ్య చిత్రణ తోనో వాతావరణ చిత్రణతొనో శివశంకర్ గారు కవిత్వం సాధిస్తారు.
ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లోకి కొత్తగా ప్రవేశించినప్పుడు ఆహూతలందరికి ఏదో ఒక కాన్క ఇవ్వడం రివాజు ఆ ప్రాంతంలో . అందరితో ఆప్యాయంగా మాధవా అని పిలిపించుకుండే బండ్ల మాధవరావు గారు ఇల్లు కట్టుకున్నప్పుడు తన గృహ ప్రవేశ సంధర్భంగా అథితులందరికీ ఇచ్చిన కాన్క ఈ” మాఊరు మా ఇల్లు” అనే పుస్తకం.
అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రెండుగా భౌగోళికంగా చీలి నవ్యాంధ్ర ,తెలంగాణా రాష్ట్రాలుగా ఏర్పడ్డకా నవ్యాంధ్ర ప్రదేశ్ కి గుంటూరు విజయవాడల మధ్య తుళ్ళూరు,వెలగపూడి మున్నగు ఊళ్ళల్లోని మూడు పంటలు పండే సారవంతమైన భూములు రాజధానిగా మారాయి. అలా ఆ భూములు రాజధానిగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ప్రముఖ కవులు కథకులు అయిన శ్రీ పాపినేని శివశంకర్, బండ్ల మాధవరావు గారలిద్దరు తమ కవితల్ని కథల్ని కలిపి “ మా ఊరు ఇల్లు “ అనే సంకలనం తీసుకొచ్చారు. బండ్ల మాధవరావు గారి వో ఎనిమిది కవితలు,వొక కథ, పాపినేని శివశంకర్ గారి వో మూడు కవితలు, రెండు కథలు ఈ సంపుటిలో వున్నాయి.
బండ్ల మాధవరావు రాసిన “మల్లాయకుంట చేను “ కొత్త రాజధాని నేపథ్యంలో రాయబడి మల్లాయకుంట చేనును తనకు అమ్మడం ఇష్టం లేకపోయినా భూ సమీకరణలో పోవడమో గవర్నమెంటోళ్ళు గుంజేసుకోవడమో చేస్తే ఎలా అన్న సంఘర్షణతో ముగిసే కథ. శివశంకర్ గారి కథ “చింతలతోపు” అనేది 1994 లో రాయబడింది. మూడు దశాబ్దాల కాలంలో వొచ్చిన మార్పులు ఈ కథలో స్పృశించబడ్డాయి. పొగాకు పంట చేతికొచ్చినా ధర నిర్ణయించే కుట్రని ,ఆ కుట్రకు బలయిపోయే రైతుల్ని. హైస్కూల్ చదువులుకూడా చదివించలేని వరదయ్య లాంటి రైతుల జీవితాల్ని, వ్యవసాయం కోసం బాకీలు చేసి అప్పులు తీరక తాతల కాలం నాటి చింతతోపుల్ని నరికి అమ్ముకుంటున్న పరిస్థితుల్ని ఈ కథ చూపెడుతుంది. రామక్రిష్ణ అనే సబ్ ఎడిటర్ జీవితంలోని ఖాళీలను చూపించే కథ పాపినేని శివశంకే గారి మరో మంచి కథ “సగం తెరిచిన తలుపు”.వాడీ వాడీ అరిగిపోయిన మాటలతో కవిత్వం రాస్తూపాఠకుడిలో ఏ స్పందనా కలిగించని పలుకుబడి వున్న ఒక కవి ని గురించి రాసిన ఒక సందర్భం ఇప్పటి పత్రికల సంపాదకుల వైఖరిని బయటపెడుతుంది. కథల గురించి ఇక్కడ రాయడం నాఉద్దేశ్యం కాదు.
ఈ సంపుటిలో ఈ కవులిద్దరి కవితలు అన్నీ పంట భూములు రాజధానిగా మారుతున్న క్రమంలో రైతుల శిథిల జీవనం పొలాల కల పంచ వన్నెల అభివృద్ధి కుట్రై ఎట్లా మోసం చేస్తుందో ..పని కోల్పోయిన మనుషుల నిస్సహాయత వల్ల మొలవాల్సిన అన్నం తాలుగింజలై పోయే దృశ్యాల్ని చూపెడతాయి.
“అక్కడ కురిసిన వాన నా చేను దేహాన్ని తడిపి నాలుగు ముక్కలై చారెడు గింజలై నన్ను నా నా ఇంటినీ నిరంతరం ప్రవహింప చేస్తుంది”
మాధవరావు ముచ్చబోడు అనే ప్రాంతం మ్మీద రాసిన కవిత ఇది. నూతన రాజధాని కారణంగా బోడు మాయమై కొండ దేహమంతా తెల్లగా పగిలి గాయాలు గాయాలుగా మారిన ఒక మరణం గురించి “ఒక అసహనంతో ఒక దుఃఖంతో ఒక కలత నిద్రలో ఒక నిస్సహాయతతో కవి తనలోని ఘర్షణల్నీ సంఘర్షణల్ని బయట వున్న అలజడి ఆందోళనల్నీ కవిత్వం చేశాడు మాధవరావు గారు.
“ కాగితం మీద గీసిన నాలుగు గీతలు గోడలై ఇప్పుడొక గూడయ్యాయి “
అని అందమైన పొదరిల్లు లాంటి ఇల్లు కట్టుకున్నా “నవధాన్యాల రాసులకు నాలుగు చేతుల చప్పుళ్ళకీ “ ఈ రాజధాని నిర్మాణం వీడ్కోలు పలుకడం అత్యంత విషాదం. పాపినేని గారి గురించి మాధవరావు గారి గురించి తెలియని సాహితీ ప్రియులైన వాళ్ళుండరు. కానీ ఈ ప్రాంతంలో పరుచుకున్న దుఃఖధూళి తెలియాలంటే “మా ఊరు ఇల్లు “చదువాల్సిందే.
ఇవాళ్టి కవిత్వానువాద శీర్షిక ముఖ్య అతిధి... కవి బండ్ల మాధవ రావు. సౌమ్యుడు.. నిశ్శబ్దంగా తన సాహితీ ప్రయాణాన్ని ఒక నిశ్చల నదీ ప్రవాహం లా గా సాగించే మాధవ రావు ను ఈ శీర్షిక కు పరిచయం చేస్తున్నాను.. ప్రతి మాటలో ఒక వినయం..ఒక ఫ్రాంక్ నెస్..రాత్రి 11 గంటలకు ఒక గంట పాటు కూల్ గా మాట్లాడుతూ ఓపిగ్గా సమాధానం ఇస్తూ వచ్చారు.. ఒక నిగర్వి. ఆయన జీవితం..సాహిత్య ప్రయాణం ఆయన మాటల్లోనే ఇంటర్వ్యూ లాగా అందించాను..
- ..
సి.వి. సురేష్ : మీ లిటరరీ కెరీర్ ఏ వయసు నుంచి స్టార్ట్ అయింది?
బండ్ల మాధవరావు : సాహిత్యానికి సంబంధించి సాహిత్య స్పృహతో చేసిందేదైనా ఉందంటే అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాతే అయినా అంతకుముందు ఇంటర్మీడియట్ టైమ్ లో కథలంటే ఆసక్తిగా ఉండేది. అభిమాన రచయిత అంటే యండమూరి వీరేంద్ర నాథ్. ఆయన నవలలు చదవటం చర్చ పెట్టుకోవటం చేసేవాళ్ళం. ఆ ప్రభావంతో మూడు కథలు రాసినా ఆ ప్రక్రియ మనవల్ల కాదనిపించింది. ఆ తర్వాత డిగ్రీ తెలుగు సాహిత్యం. నా గురువులు ఇంటర్మీడియట్ లో ఆధునిక సాహిత్యం లో కృషి చేసిన పాపినేని శివశంకర్ గారు, డిగ్రీ లో కడియాల రాంమోహన్ రావు గారు, ప్రాచీన సాహిత్యమూ, సాహిత్యం పట్ల బాగా పట్టున్న గుండ్లవరపు లక్ష్మీనారాయణ, పులిచర్ల సాంబశివరావు, పులిచర్ల సుబ్బారావు, గొల్లపూడి ప్రకాశరావు వీళ్ళంతా డిగ్రీలో చదువుచెప్పినవాళ్ళే. వీళ్ళందరూ బోధిస్తున్నప్పటికీ, సాహిత్యం అనేది ఒక మెడిసిన్, ఇది సమాజానికి ఏ విధంగా ఉపయోగించాలి అనే ధృక్పథాన్ని పరిచయం చేసింది మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ లో డా. కె. ముత్యం. ఆ తర్వాత సీరియస్ గా రాయటం మొదలెట్టా.
సి.వి. : ఇప్పటివరకూ మీరు ఎన్ని కవితలు రాసుంటారు ?
మాధవ : 180 కవితల దాకా రాసుంటాను. మొదటి కవిత 1990 డిసెంబర్ లో ఆంధ్ర పత్రికలో వచ్చింది. తర్వాత ప్రజాసాహితి, ఆహ్వానం, సాహిత్య నేత్రం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి లాంటి పత్రికలలో కంటిన్యూగా కవిత్వం వస్తోంది. 1998 లో "చెమట చిత్తడి నేల" మొదటి కవితా సంపుటి, రెండవ సంపుటి "స్పర్శ" 2005 లో, కొంత లాంగ్ గ్యాప్ తర్వాత 2014 లో "అనుపమ" కవితా సంపుటి వేశాను. "ఊరికల" అనే దీర్ఘ కవిత 2017 లో, అదే సంవత్సరం పాపినేని శివశంకర్ గారితో కలిసి కథలు కవితలు కలిపి "మా ఊరూ మా ఇల్లూ" అనే పుస్తకం వేశాను.
సి.వి. : మీ సాహిత్య ప్రయాణంలో మిమ్మల్ని బాగా బాధపెట్టిన సంఘటన ఏదైనా ఉందా?
మాధవ : పాపినేని శివశంకర్ మంచి గైడెన్స్ ఇస్తుండేవారు. నేను రాసిన ప్రతీ వాక్యం ఆయన చదివి అనలైజ్ చేసేవారు. కవిత రాయటం వరకే నీ బాధ్యత. అచ్చవుతుందా కాదా తర్వాత దానికి వచ్చే స్పందన పాజిటివా నెగిటివా, నెగిటివైతే దాంట్లో మంచేంటో తీసుకుని దాన్ని అన్వయించుకునే ప్రయత్నం చెయ్.. ఇలా చెప్తుండేవారు. దాంతో ఎవరినీ నొప్పించలేదు నొప్పింపబడలేదు.
సి.వి. : సంతోషపడిన సందర్భం?
మాధవ : కవికీ, కథకులకెవరికైనా అక్షరాన్ని అచ్చులో చూసుకోటానికి మించిన సంతోషం ఉండదు. అది మొదటిసారి మొదటి కవిత కావచ్చు, ఇంతకాలం తర్వాత ఈ రోజుది చూసుకున్నా అటువంటి భావనే ఉంటుంది. కనుక ప్రత్యేకంగా సంతోషం అని కాకపోయినా చెప్పాలంటే.. ఒక్కో కవితకూ బహుమతులు రావటంలాంటి చాలా సందర్భాలున్నా, "అనుపమ" 2017 లో వెలువడిన తర్వాత మొట్టమొదట మిత్రుడు పలమనేరు బాలాజీ పలమనేరు రచయితల సంఘం తరఫున "సృజన" అవార్డు ప్రకటించినపుడు చాలా సంతోషపడ్డాను.
ఒక అంశం... ఊరి కల అనే దీర్ఘ కవిత గురించి చెప్పాలి.. దాని నేపథ్యం ఏమంటే, అమరావతి క్యాపిటల్ కోసం 29 గ్రామాలు స్వాధీనం చేసుకొన్నారు.. భూములు నీళ్లు లేక భారం అయిన పరిస్థితుల్లో.. ప్రభుత్వం వచ్చి భూములు తీసుకోవడం తో..వాళ్ళ జీవన విధానం బాగా మారిపోయింది.. అయితే, మా ఊరు ఈ క్యాపిటల్ లో.. ఒక చిన్న వీధి గానో.. ఒక పేట లాగానో కుచించుకు పోవడం కూడా చూడాలి.. ఈ సంఘర్షణ లో నేను రాసిన దీర్ఘ కవిత.."ఊరి కల" . దీన్ని ఎందుకు ప్రస్తావిస్తున్న అంటే..ఈ కవిత నాకు మంచి పేరు తెచ్చింది..
సి.వి. : మీ సంకలనాలు అచ్చు వేయడానికి సమస్యలు కానీ, రాజకీయాలు గానీ ఎదుర్కొన్నారా?
మాధవ : పెద్దగా సమస్యలు ఎదుర్కోలేదు. మొదటి రెండు సంపుటుల విషయంలో, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఆర్థిక సహకారం అందిస్తారని తెలిసి అప్లై చేయటం, అది శాంక్షన్ అవటం, తెలుగు లిటరేచర్ లోనే పీజీ, పీహెచ్ డీ చేసిన నా శ్రీమతి డా. ఉమారాణి అందించిన ప్రోత్సాహంతో అచ్చు వేశాను. తర్వాత పుస్తకాలు నా స్వంత ఖర్చుతో నే వేశాను.
సి.వి. : సాహిత్యమే వృత్తి గా, కెరీర్ గా తీసుకునే పరిస్థితి ఉందంటారా?
మాధవ : ఎంత మాత్రమూ లేదు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నాకు ఈ ప్రశ్నలెప్పుడూ ఎదురవుతునే ఉన్నాయి అంటే సాహిత్యం సమాజానికేమైనా ఉపయోగపడుతుందా లాంటివి. మీరడిగిందానికీ దీనికీ లింకప్ ఏంటంటే, సాహిత్యం సమాజంపై ప్రభావం చూపిస్తుంది కానీ, ఒకప్పటిలా సాహిత్యం పై ఆధారపడి జీవించే పరిస్థితి ఎవరికీ లేదు. కథైనా కవితైనా ఏ సాహిత్య ప్రక్రియైనా మార్పుకు టూల్ లా ఉపయోగపడుతుందే తప్ప సాహిత్యమే బ్రతుకుతెరువయే పరిస్థితి లేదు.
సి.వి. : సమాజంలో కవిగా గుర్తింపుకై చేసిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? కవిగా గుర్తింపు రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితి గురించి..?
మాధవ : వ్యక్తిగతంగా ఒక దృష్టి ఉంటుంది. కవితాలోకం పరంగా ఓ ఆలోచన ఉంటుంది. ఆ రకంగా చూస్తే వ్యక్తిగతంగా తీసుకుంటే ఈ రోజుకీ నేను కవినని చెప్పుకోటానికి మొహమాటపడుతుంటాను. కవిగా మొదటి సంపుటి వచ్చిన దశలోనూ, తర్వాతా గుర్తించినప్పటికీ నేనేదో చేతనైంది రాస్తున్నాను వాళ్ళేదో అనుకుంటున్నారే తప్ప పెద్ద అనుకోదగ్గ కవిని కాదనే భావన ఉండేది. ఎటుతిరిగీ అనుపమ బయటకు వచ్చిన తర్వాతే దానికి మూడు నాలుగు అవార్డులు వచ్చిన తర్వాత ఇప్పుడు హమ్మయ్య నేను కూడా కవినే అనుకుంటున్నానే తప్ప, నేనూ కవినే అని చెప్పుకోవటం ఇప్పటికీ మొహమాటమే. ప్రముఖ కవి అంటున్నా, మిత్రులే సాహిత్య పేజీలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ రోజుకీ కూడా పత్రికకు కవిత పంపించి రిమైండ్ కూడా చేయను. వేయటం వేయకపోవటం దటీజ్ దెయిర్ విష్ అనుకుంటాను. నేనొక నియమం పెట్టుకున్నాను, కవితలో పబ్లిష్ చేసే విషయం ఉంది అనుకుంటే వేస్తారు లేదంటే తీసి పక్కన పడేస్తారు. అలాగే ఓ కవిత ఓ సాహిత్య పేజీ నిర్వాహకుడికి నచ్చొచ్చు.. ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అందుకే ఎవరినీ అడగను.
సి.వి. : జీవితం కవిత్వం రెండూ వేరువేరని భావిస్తారా? రెండూ ఒక్కటే అని భావిస్తారా?
మాధవ : ఉపాధ్యాయ వృత్తిలో పిల్లలకు మంచి చెప్పాల్సిన ఉద్యోగంలో ఉన్నాను. ఈ క్రమంలో చిన్న విషయమైనా నేను ఆచరించనిదే పిల్లలకు చెప్పటానికి ఇష్టపడను. నేను ఆచరిస్తానా లేదా పిల్లలు చూడరు. అయినా సరే నేను ఇష్టపడను. ఇదే కవిత్వానికీ అప్లై చేస్తా. విషయం పట్ల కాంట్రవర్సీ ఉంటే దాన్ని నేను కూడా అడ్రెస్ చేస్తుంటాను. వ్యక్తిగా ఎక్కడైనా కాంట్రవర్సీ గా లాగటానికి ప్రయత్నం చేస్తే దాంట్లోకి జారిన సందర్భాలేవీ లేవు. ఈ సందర్బంగా నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి.. కవిత అనే ఓ సాహిత్య పత్రిక ను నేను నిర్వహిస్తుంటాను. దాదాపు 60 సంచికలు వచ్చాయి. ఈ పత్రికలో హెచ్చర్కే గారు రాసిన ఒక సాహిత్య వ్యాసాన్ని ఆయన పెర్మిషన్ తో ప్రచురితం చేసాను.. దాని పైన ఆ పత్రిక కు సంబంధించి ఇంకొక వ్యక్తి ఈ అంశాన్ని పెద్ద తప్పుగా దాన్ని ఫోకస్ చేసి, నాపైన పోస్టింగ్ పెట్టి, అనేకమంది ముందర నన్ను దోషి గా చిత్రీకరించారు. చాలా చర్చ జరిగింది.కొందరు ఫేవర్ గా..ఇంకొందరు ఎగెనెస్ట్ గా కామెంట్స్ చేశారు..కానీ, నేను మాత్రం ఒకే ఒక వాక్యం రాసి అక్కడ పెట్టాను.. "హెచ్చర్కే గారి అనుమతి తర్వాత మీతో కూడా అనుమతి తీసుకోవాలన్న విషయం తెలీదు" మిగిలిన కామెంట్స్ అన్నీటి పై..వాళ్ళ వాళ్ళ విజ్ఞత కు వదిలేస్తున్నాను.. అని పెట్టాను. నా కవిత్వాన్ని గురించి ఎవరైనా విమర్శ చేస్తే సమాధానం ఇస్తాను. కానీ, వ్యక్తిగత మైన విమర్శలు.. వాటి పైన వాదనలకు నేను ఎప్పుడూ దూరం ఉంటాను. .. సి.వి. : మీ సాహితీ ప్రయాణం లో ఏదైనా ఒక తప్పు జరిగి ఉండకపోతే, మీ సాహితీ కెరీర్ ఇంకా బాగా ఉండేది. అని మీకు ఎప్పుడైనా అనిపించిందా!?
మాధవ : అట్లా ఏమి లేదు..నిశ్శబ్దంగా పనిచేసుకొంటూ వెళ్లే వ్యక్తిత్వం. పెద్దగా మాటలు.. విమర్శలు నా కెరీర్ లో అస్సలు కనిపించవు. ఎవరైనా న చేంజ్ పిలిచి ఫార్మల్ గా పిలుస్తారు తప్పా ఇంకోటి కాదు. నా ఈ నిశ్శబ్ద ప్రయాణం లో కలిసొచ్చే వారితో కలిసి సాగడం.. చర్చించుకోవడం మాత్రమే నా తత్వం.
సి.వి. : మీరు కవిగా ఒక సంపూర్ణ వ్యక్తిత్వం ను సమాజం లో అనుభవించారా!? లేక మాధవరావు (నార్మల్ మాన్) గా సమాజం లో పరిపూర్ణత ను అనుభవించారా!?
మాధవ : చెమట చిత్తడి నేల కు ముందు కవితలు అన్నీ గ్రామీణ నేపధ్యం లో వచ్చినవే.. monsant విత్తనాలను ఇండియా లోకి అనుమతించడం, గాట్ ఒప్పందాలు ఇవన్నీ నా కవిత వస్తువులు అయ్యాయి.. నా చుట్టూ ఉన్న పతిస్థితుల పై కవిత్వం చేయడం మొదలు పెట్టాను.. వీటి వల్ల నాకు అమితమైన పేరు వచ్చింది.. అనేక సామాజిక అంశాలు పైన రాసాను..ఈ కవితల వల్ల నాకు ఆ పేరు వచ్చింది.. కవిగా మారిన తర్వాతనే నా జీవితం లో సంపూర్ణత ను అనుభవించాను.. టీచర్ గా వచ్చిన గుర్తింపు కు మించిన పరిపూర్ణత నాకు కవి గా మిగిలింది.
సి.వి. మీరు కవిసంగమం పై మీ అభిప్రాయం..
మాధవ : దీనికి ముందు ఒక చిన్న విషయం గుర్తు చేయాలి.. ఈ ఫేస్ బుక్ రాకమునుపే అక్రూట్ అనే ఒక విధానం ఉండేది. అందులో నేనూ ఇంకా ఒక పదిమంది యంగ్ పోయెట్స్ కవిత్వం అని రాసి కొద్ది రోజులు మైంటైన్ చేసాము.. తర్వాత ఎవరి కెరీర్ వాళ్లకు. లైఫ్ లో సమయం కుదుర్చుకోలేక పోయారు. ఆ తర్వాత కొద్దీ రోజులకు కవిసంగమం ను యాకూబ్ గారు మొదలు పెట్టారు.. అద్భుతంగా అభివృద్ధి అవుతోంది. మొదట్లో ఎవరు పడితే వాళ్ళు.. మామూలు వాఖ్యలు కూడా అందులో రాస్తూ వచ్చారు.. రాను రాను చాలా అద్భుత కవిత్వం వస్తోంది.. ఇవాళ బాగా రాస్తున్న వారిలో చాలామంది కవిసంగమం లో నుండి బయటకు వచ్చిన వారే. ఇక వారం వారం ఆ శీర్షికలు. రాజారామ్ గారు.. మీరూ.. నారాయణస్వామి గారు..అఫ్సర్ గారూ.. ఎల్.ఎన్. గుంటూరు గారు, వంశీ కృష్ణ గారూ..ఇంకా కొందరు రాసే విషయాలు అద్భుతం..ఒక గైడింగ్ ఫ్యాక్టర్స్.. రచయితలకు చాలా ఉపయుక్తమైనవి.. కవిత్వానువాద శీర్షిక ను చాలా భిన్నంగా నడుపుతున్నారు. ఇలా కవిని పరిచయిస్తూ చేసే క్రమం..! ఏ కవిత్వం అయినా అనువాదం అయితేనే అది ఎల్లలు దాటుతుంది.. మీ అనువాదాలన్నీ ఒక బుక్ రూపం లో తీసుకురావడం చాలా అవసరం. నా పోయెమ్స్ కూడా కొన్ని ఆంగ్లం లోకి..హిందీ..కన్నడ లోకి వచ్చాయి..కానీ.ఇవాళ మీరు రాసే విధానం అద్భుతం. ఇలా ఎప్పుడూ రాలేదు.. అయితే. దురదృష్ట వశాత్తు కవిసంగమం నిర్వహించే కార్యక్రమం లో నాకు అవకాశం రాలేదు.. ఒకసారి ఒక గ్రూప్ కవిత్వ చర్చల్లో కి పిలిచారు. కానీ నాకు వీలు కాలేదు... ఆ మూడు తరాల పోయెట్స్ పఠన కార్యక్రమం లో నాకు అవకాశం రాలేదు.. .. ఇప్పుడు ఆ కార్యక్రమం బంద్ అయ్యింది.. అని ఆ స్థానం లో 'ఊరూరా కవిసంగమం' వస్తోంది అని నేను చెప్పాను.. హ..అవును..నిన్న నో మొన్న నో చూసాను..అని మాధవరావు గారు చెప్పారు... ఒకే ఒక సలహా ఏమంటే... రాసిన కవిత ను ఎడిట్ చేసే విధానం.. ఎలా రాయాలి అనే ఒక క్రిటిక్ ఉండాలి..అప్పుడు ఇంకా కవులు పదును అవుతారు..
సి.వి.: మీ నుండి వర్ధమాన కవులు తెలుసుకొనేదేదైనా ఉందా!?
మాధవ : చెప్పేంత పెద్ద వాణ్ణి కాదు కానీ... ఒకటైతే చెప్పాలి.. రాసిన వాక్యం తడి ఆరకముందే దాన్ని పబ్లిష్ చేయాలన్న ఆలోచన మానుకోవాలి.. దాన్ని బాగా మగ్గబెట్టి, రెఫైన్ చేసి.. ఒకటికి రెండు సార్లు చదివి పోస్ట్ చేయడం మంచిది. మీరు నమ్ముతారో లేదో నేను వెంటనే పోస్ట్ చేయను.. కవిత నిర్మాణం గురించి తెలుసుకోవచ్చు. చదువు కోగలిగిన వారే కవిగా నిలబడతారు..
సి.వి. : మో.త్రిపుర ల మధ్య ప్రధాన తేడా!?
మాధవ : వాళ్లిద్దరూ నాకు గురువుల్లాంటి వాళ్ళు.. బెనారస్ హిందూ యూనివర్సిటీ లో చదవడం నాకా అదృష్టాన్ని తెచ్చింది.. వీళ్లిద్దరి రచనల్లో పెద్ద తేడా ఉండదు.. రచనల్లో అస్పష్టత ఉంటూనే..స్పష్టంగా చెప్పగలిగిన దిట్టలు ఇద్దరు.. మో ను అస్పష్ట కవి అంటుంటారు.. ఒక పదేళ్లు ముందుకెళ్లి రాసిన కవి.. అప్పట్లో అర్థం కాకపోయి ఉండొచ్చు..త్రిపుర కథల్లో.. కూడ.. ఆయన వెళ్లిన ప్రాంతాలు.. అక్కడి పరిస్థితులును అక్షరం చేశారు. అది నాకు చాలా ఇష్టం.. వాళ్లిద్దరూ కూడా బెనారస్ హిందు యూనివర్సిటీ నుండి వచ్చిన వాళ్లే...
సి.వి. మీరు ఇష్ట పడిన రచయిత ఎవరు..? వాళ్ళ ప్రభావం మీ సాహిత్యం పైన పడిందా..?
మాధవ : కవిత్వం అద్భుతంగా రాస్తున్న ప్రతి ఒక్కరినీ నే ఇష్ట పడతాను.. కాకపోతే.. నా గురువు... పాపినేని శివశంకర్ గారిని నేను అత్యధికంగా ఇష్టపడతాను.. అయితే, నా ప్రతి రచన ఆయన దృష్టి కి వెళ్ళేది.. నా రచనల పైన ఆయన ప్రభావం పడకుండా చేసిందీ ఆయనే.. ఎంతో వివరంగా వాక్య నిర్మాణం.. పదాల ఎంపిక ఇవన్నీ కూడా ఆయన చర్చించే వారు.. .... ఇంకా... ఆరుద్ర గారిని కలవడం ఒక గొప్ప జ్ఞాపకం.. మహీధర రామ్మోహన్ రావు గారితో కూడా అనేకసార్లు కలిశాను.. చాలామందిని కలిసేందుకు వెళ్ళేవాడిని.. చాలా ఉపయోగం అయ్యింది.. విజయవాడ లో ఉన్నన్ని రోజుల్లో, ఊర్లోకి ఎవరు గొప్ప రచయత వస్తే.. ఆయన దగ్గరకు వెళ్లడం.. వాళ్ళను నా స్కూల్ కు పిల్చుకు వచ్చి.. నాలుగు మాటలు వాళ్లతో పిల్లలకు చెప్పించేవాడిని.. ..
ఇక ఈ కవిత అనుసృజన విషయానికి వస్తే..పూర్తి స్వేచ్ఛ ను తీసుకున్నాను.. ..
◆◆
బండ్ల మాధవరావు : || శిథిల జీవనం|| అనుసృజన : సి.వి.సురేష్|| THE RUINED LIFE|| ..
Here,
some life style is being corroded…
The age old culture
Sheathed with new screens….
The soil transforming its colors
Which, graced the life and soul
May be,
My primitive man
headed soil spurned from the ground
The sacred stone in the village
The crop in the fields…
The produce in the farms…
Are destroying themselves their origins..
In between the towns…
the forests n’ heaths transformed into fertilelands..
and ramifying alike concrete parks…!
If you paw the soil.. ..
May not get the water…
The polluted ponds may be effervesced
From those ruins…
Some treasure troves may be earthen out…
The north-east mountain ranges
May obstruct the winds..
Flowed on my farms!
.. May be …
Some ponds may be ensconced
By sccoping the souls.
Where your do not…
Your fount springs of the soul
May quench the others thirstiness.
Even though ….
Your mud prints…
Will remain In detritus..
for the sake of history!
..... ...... ఒరిజినల్ పోయెమ్ : బండ్ల మాధవరావు || "శిథిల జీవనం"||
ఇక్కడో జీవన విధానం శిధిలమవుతున్నది
వందల యేళ్ల సంస్కృతి
కొత్త పరదాలను కప్పుకొంటోంది
జీవాన్నీ జీవితాన్నీ ప్రసాదించిన మట్టి
రంగు మార్చుకొంటోంది
బహుశ
నా పురామానవుడు
తవ్వి తలకెత్తుకొన్న మట్టి
నిలిపిన బొడ్రాయి
వేసిన పైరు
పండించిన పంట
మూలాల్ని ధ్వంసించుకొంటున్నాయి.
ఊరికి ఊరికి మధ్య నిలిచిన
అడవులు బీళ్లు పంటపొలాలై
ఇపుడు కాంక్రీటు వనాలుగా విస్తరిస్తున్నాయి
నువ్వు మట్టిని తవ్వితే
నీళ్లు రాకపోవచ్చు
కాలుష్య కాసారాలు బుస బుస పొంగొచ్చు
అక్కడే
ఆ శిధిలాల్లోంచే
ఏవో కొన్ని లంకెబిందెలు బయుటపడొచ్చు
నా పైర్ల మీదుగా వేచే తూర్పు గాలిని
ఈశాన్యాన నిలిచిన
కొండలు అడ్డగించొచ్చు
ఈ పక్కనే
కొన్ని గుండెల్ని తవ్వి
చెరువుల్ని ఏర్పరచొచ్చు
నువ్వు లేని చోట
నీ గుండెల్లోని చెలమలు
ఎవరికో దాహార్తిని తీర్చొచ్చు
అయినా నీ మట్టిముద్రికలు
చరిత్రకోసం శిధిలాల్లో నిలిచేవుంటాయి
అనుపమ (2014) ప్రచురించిన ఏడేళ్ళ తరువాత 'దృశ్య రహస్యాల వెనుక' తెస్తున్నారు. తొలినాటికీ (1998), తరువాతి కాలానికీ గల మీ పరిణామక్రమాన్ని గురించి చెప్పండి.
కవితా సంపుటులు వేసే విషయం లో ఈ వ్యవధి నాకు సహజమైనదే. 90 నుంచి రాయడం మొదలుపెడితే మొదటి సంపుటి "చెమట చిత్తడి నేల" 98 లో వచ్చింది. రెండవది ఏడేళ్ళతర్వాత "స్పర్శ"(2005); తొమ్మిదేళ్ల తర్వాత ‘అనుపమ' వచ్చాయి. ఇప్పుడు "దృశ్య రహస్యాల వెనుక" వస్తోంది. మధ్యలో 2017 లో "ఊరికల" దీర్ఘ కవిత, శివశంకర్ గారితో కలిసి "మా ఊరు మా ఇల్లు" అనే కథా కవితా సంపుటులు తెచ్చాను. 30 ఏళ్ళ అనుభవంలో, క్రమ పరిణామం లేకపోతే వ్యక్తిగా మనం లేనట్టేననుకుంటున్నాను. తొలిసారి రాసిన కవితకి ఇప్పుడు రాస్తున్న కవితకి, వస్తువు సమాజంలోంచే తీసుకున్నప్పటికి,వ్యక్తికరణ లోనూ, భాషా వినిమయం లోనూ ప్రస్పుటమైన మార్పు నా కవిత్వం లో కనబడుతుందనే అనుకుంటున్నాను.
2. సంపాదకుడిగా మీరీమధ్య బిజీ అయ్యారు ? అయినా కవితా మాసపత్రిక నిరాఘాటంగా రావడం లేదు.
"కవితా!" మాస పత్రిక కు సంపాదకుడు గా, వార్షిక సంచికలకు సహ సంపాదకుడుగా, దేవిప్రియ (బహుముఖ), పాపినేని (అణ్వేషణ) అభినందన సంచికలకు సంపాదకుడుగా, పని చేయడం మరువలేని అనుభవం. కవితా! మాస పత్రిక ఒకింత ఆలస్యానికి ప్రత్యేక మైన కారణాలు ఏమీ లేవు కానీ, శ్రీ శ్రీ ప్రింటర్స్ లో టెక్నీషియన్స్ కొరత, విశ్వేశ్వరరావు గారు మహాప్రస్థానం మహా గ్రంథం మీద దృష్టి పెట్టటం, కొద్దిగా నా అలసత్వం, ముఖ్య కారణాలు. ఏమైనా కవితా! పత్రిక ఆగిపోదు. త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తుంది
3.వచన కవిత్వ చరిత్రలో మిమ్మల్ని మీరెక్కడ గుర్తిస్తారు ?
వచన కవిత్వాన్ని నాలుగు తరాల కవిత్వం గా భావిస్తుంటాను. కుందుర్తి దగ్గర మొదలైన తొలి తరం, 80 ల, 2000, 2020 లలో కవితా నిర్మాణం లోనూ, భాషా వినిమయం లోనూ ఎన్నో మార్పులను తెచ్చింది. 90లలో మొదలైన ఒక కవి వీటన్నిటిని అవలోకిస్తూ, తనలోకి వాటిని ఆవాహన చేసుకుంటూ 2020ల తరం లో కూడా పటిష్టం గా నిలబడే ఉన్నాడంటే, తప్పకుండా అతనికి ఆధునిక వచన కవితా చరిత్రలో ఎంతోకొంత స్థానం ఉన్నట్లే అనుకుంటాను. గుంటూరు జిల్లా సాహిత్య చరిత్ర రాస్తూ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు నా రచనల గురించి నాలుగు పేజీలలో ప్రస్తావించారు. ఏ నాటి కవిత్వ చరిత్ర లో స్థానం సంపాదించుకోవడమైనా అది విమర్శకులు, పాఠకులు నిర్ణయించాల్సిన అంశం.
4.వచన కవిత్వ రచనలో వస్తున్న మార్పులను మీరే విధంగా వ్యాఖ్యానిస్తారు ?
గత 30 సంవత్సరాలుగా కవిత్వం లో సంక్లిష్టత,అస్పష్టత ల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆధునికోత్తర కవిత్వం లో ఇవి చాలా సహజమైనవే అన్నంతగా ఒక దశలో కవిత్వాన్ని ఆక్రమించాయి. కాని 2000 తర్వాత వస్తున్న కవులు దీనిని అధిగమించి అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. ఇప్పటికీ రూపానికి, శుద్ధ కవిత్వానికే మేం ప్రాధాన్యత ఇస్తామనే కవులు కూడా అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. అలాగే సంఘటనల కోసం ఎదురుచూస్తూ వెంటనే కవిత్వం రాస్తున్నవారూ ఉన్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చెయ్యడమనేది నాకు ఇష్టమైన పని. అలాంటపుడు ఆ సంఘటన ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత కవిత రాస్తే ఆ కవితకున్న రిలవెన్స్ పోతుంది కదా అని కూడా మిత్రులు అడుగుతారు. కాని చరిత్ర ను రికార్డ్ చేసే క్రమంలో దాని రిలవెన్స్ ఎప్పటికీ పోదు అనేది నా భావన. అలాగే వాక్యం రసాత్మకం కావ్యం అన్నంతమాత్రాన ఏకవాక్య కవితలు, నానీలు, నానోలు లాంటివి కవిత్వం అంటే ఎందుకో నా మనసొప్పుకోదు. కవిత్వానికి ఒక నిర్వహణ, అంతర్ రుచిరత్వము, చదివేకొద్దీ లోపలికి వెళ్లి దాన్ని ఆస్వాదించే గుణము ఉండాలనుకొంటాను. వీటన్నింటిని ఇప్పుడు వస్తున్న కవిత్వం లో గమనిస్తున్నాను. పరిణామక్రమాన్ని ఆహ్వానిస్తున్నాను. ఆస్వాదిస్తున్నాను.
5.జూం ద్వారా తొలి సాహిత్య కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన వారుగా, సాహిత్యంలో సామాజిక మాధ్యమాలకెలాంటి ప్రాధాన్యాన్నివ్వాలి ?
గత సంవత్సరం మార్చ్ 24 నుండీ ఎవరికి వాళ్ళం ఇళ్లల్లో బందీలమైపోయాం. ఏం జరుగుతుందో తెలియక భయం భయం గా ఎక్కడివారం అక్కడే బిగసుకుపోయాం. దాదాపు నెలన్నర బయట ఎవరి ముఖం చూడకుండా గడిపేసాం. మే 1 అంటే విజయవాడ సాహితిమిత్రులకు ఒక కవిత్వ పండుగ. గత 22 సంవత్సరాలుగా క్రమం తప్పకుండ మే 1 సాయంత్రం విజయవాడ లో కవిత్వం తో ఒక సాయంకాలం కార్యక్రమాన్ని జూమ్ లో నిర్వహించాలనిపించింది. దానికి మీరూ, అనిల్, విశ్వేశ్వరరావు ఇంకా కవిమిత్రులు సహకారం అందించారు. అది అనేక సాహిత్య కార్యక్రమాలకు దిక్సూచి అయింది. కవిత్వ వికాసానికి సామాజిక మధ్యమాలు కీలకంగా మారాయి. అయితే అక్కడ వెల్లువెత్తుతున్న కవిత్వాన్ని గురించి మాత్రం నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. రాసిన కవిత్వాన్ని ఒక సంపాదకుడు సరిచూడవలసిన అవసరం ఉంది. అలా లేకపోవడం వలన అకవిత్వం కుప్పలు తెప్పలుగా మన ముందుకు వస్తోంది. అందుకే రాసిన ప్రతి అక్షరం గోడమీద పెట్టడం కాకుండా ఎవరైనా విశ్లేషణ చెయ్యగల వారికి చూపించి అప్పుడు పాఠకుల ముందు పెడితే బాగుంటుంది అనేది నా ఆలోచన.
6. అందుకేనా, మీ దృశ్య రహస్యాల వెనుక సంపుటికి సంపాదకుణ్ణి పెట్టారు ?
నిజానికి తెలుగులో కవిత్వ సంపుటులకు సంపాదకులు ఉండే సంప్రదాయం లేదు. అయినా నేను ఆ సంప్రదాయాన్ని తెలుగులో కూడా తీసుకురావాలనే ఉద్దేశం తో డా. ఏ. కె ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేస్తే సహృదయతతో అంగీకరించారు. వారికి నా కృతజ్ఞతలు.
7.మీరు శిఖర, విద్యాసంస్థ ని నడుపుతున్నారు కదా ? స్కూల్లో పిల్లలకి కవిత్వం గురించి చెబుతారా ? ఈ తరం సాహిత్యాభిరుచిని గురించి చెప్పండి.
స్కూల్ లో పిల్లలకు కథలు కవిత్వం చదివి వినిపించడం, వారితో రాయించడం గత ముప్పై ఏళ్లుగా చేస్తున్న పనే. కోవిడ్ కంటే ముందు ఎండాకాలం సెలవల్లో కేంద్ర సాహిత్య అకాడమీ తో కలిసి శిఖర స్కూల్ లో కథ, కవితా రచన, బొమ్మలు, కార్టున్ లు వేయడం మొదలైన అంశాలలో ప్రముఖ రచయితలు, కవులు, చిత్రకారులు, కార్టునిస్టులతో వర్క్ షాపు నిర్వహించాము. ఇక ఇప్పటి తరంలో సాహిత్యభిలాష గురించి చేప్పాలంటే పెరుగుతున్న జనాభా, అక్షరాస్యత లను దృష్టిలో పెట్టుకుంటే దానికి సమస్థాయిలో సాహిత్యభిలాషులు పెరగటం లేదనేది వాస్తవం. ముఖ్యం గా బోధనాంశాలలో సామజిక శాస్త్రాల ప్రాధాన్యత తగ్గడం, టీవీలు, సెల్ ఫోన్ ల వాడకం పెరగడం దీనికి కారణాలనుకుంటున్నాను. అయితే గమనించాల్సింది ఏమిటంటే నిష్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ కొత్తతరం పాఠకులు, కవులు, రచయితలు ఈ యవనిక మీదకు వస్తూనే ఉన్నారు. వీరిలో చాలామంది సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకొని అధ్యయనం, అభ్యాసనం చేస్తూనే ఉన్నారు.
శ్రీరామ్ పుప్పాల | August 14, 2021 at 5:02 am | Categories: 2021 సంచికలు, ముఖాముఖి, సంచిక: 15 ఆగష్టు 2021 | URL:
కవితా ఓ కవితా - శ్రీరామ్ - 12
నేనాయన ఇవాళ పుస్తకం చదివి నాకనిపించింది రాశాను. ఆయన ఆ పుస్తకం చుట్టూ గూడు కట్టుకున్న తన అనుభవాల్ని మనతో పంచుకున్నారు. చాలా బాగ గడిచిందీ పక్షం. భేషజం లేని అఫ్సర్ సాబ్. థ్యాంక్యూ సో మచ్. ఈ పక్షం మన పుస్తకం చెమట చిత్తడి నేల.
అతని కవిత్వమంతా అన్నం మొలకెత్తడమే
బండ్ల మాధవ రావ్ ది 2014 లో అనుపమ అని ఒక కవిత్వ సంకలనం వచ్చింది. అందులో ముందు మాట రాసిన దేవిప్రియ "మాధవ్ 2009 లో రాసిన దిగులు అన్న కవితల్లోని 27 పంక్తులని చదివిన తర్వాత నేను భారంగా దిగులుగా సాలోచనగా మౌనంగా ఉండిపోయాను.మైనస్ ఐదు డిగ్రీల సెల్సియస్ చలిలో నా చుట్టూ ఎవరో వంద డిగ్రీల మంటని రాజేసి, నన్ను మరగించి, కరగించి వేస్తున్నట్టు, అయినా వేదనలో కేక వేయడానికి కూడా నోరు పెగలనట్టు....." అని ఇలా రాసుకుంటూ వెళ్తాడు. ఈ మాటలు నన్ను కట్టిపడేశాయి. అత్యుత్తమమైన, సాంద్రమైన కవిత్వం చదివినపుడు మనం వెంటనే మాట్లాడలేమన్న అతని ఉటంకింపు ఆలోచింపజేసింది. పుస్తకం బాగుంటుంది. ముఖ్యంగా మాధవ్ (అందరూ ఇలానే ప్రేమార పిలుస్తారని చెప్పడానికి నేనూ ఇదే సంబోధన చేస్తున్నానంతేనండోయ్) వాళ్ళ చిన్నమ్మ మీద రాసిన కవిత్వ పంక్తులు, జ్ఞాపకాల చెట్టు లాంటి కవితలు అతని వైయిక్తిక జీవన ప్రణయాన్ని ఆవిష్కరిస్తాయి. అయితే మాధవ్ ఏమిటి ? అతని భావజాలమేమిటి ? అతని కవిత్వ నిర్మాణమూ, రహస్యమూ తెలుసుకోవాలంటే 1998 లో వచ్చిన "చెమట చిత్తడి నేల" చదవాల్సిందే. ఎందుకంటే దేవీప్రియే అనుపమలో మరోచోట "చెమట చిత్తడి నేలను పరిచయం చేస్తూ ఆనాడు దర్భశయనం శ్రీనివాసాచార్య పద్య నిర్మాణంలో కనిపించిన లోపాలను గురించి చేసిన హెచ్చరికను సానుకూలంగా స్వీకరించిన మాధవ్ ఈ ధ్యాసను పెంచుకున్నాడు" అని ఉటంకిస్తాడు. ( ఈ గమనింపు స్పష్టంగా ఆ ముందుమాటలో లేదు మరి) కనుక కవికి ఒక విలువైన ప్రయాణం ఉంటుంది. ఆ దారంట మనమూ వెళ్తే చాలా తెలిసివస్తాయి.
మాధవ్ మొదటి పుస్తకమంతా నాకొక దీర్ఘ కావ్యంలా అనిపిస్తుంది. కారణం వస్తువుల్లోని ఏకసూత్రత. అంతర్లీనంగా ఉండే భావధారలో తడి ఆసాంతమూ గ్రామీణ జీవన సౌందర్యానిదే అయి ఉంటుంది. ఇక్కడి సౌందర్యమనగా కాంట్ చెప్పినట్టు వస్తువు యొక్క నిర్దిష్ట రూపమో, ఫ్రీ లేదా డిపెండెంట్ బ్యూటీ నో కాదు. క్రోచీ ప్రతిపాదించిన నిర్వికల్ప (Intutive), తార్కిక (logical) రూప విన్యాసం. మాధవ్ కి కనిపించిన గ్రామీణ వాతావరణంలోని వస్తువుల్ని కవిత్వం చేసిన ఈ పుస్తక సందర్భమంతా అతని నిర్వికల్ప జ్ఞానమే అతని అభివ్యక్తికి కారణంగా ఉంటుంది.
తుమ్మ ముల్లో జొన్న దుంపో గుచ్చుకున్న వాడి బాల్యానికి ఇటుక రాయి కాపడం పెడుతుంటాడు ఒగుడాకైన వాడి చిన్నతనం ఏ ముళ్ళ కంచెకో పట్టి చీరుకుపోయింది (ఒకానొక బాల్యపు దృశ్యం).
ఈ కవిత ఎంత సహజ జ్ఞాన అభివ్యక్తిని ప్రదర్శిస్తుందో గమనించదగ్గది. అంటే అతని కళ్ళ ముందు కనిపిస్తున్న అనేక వస్తువుల్ని, వాటిని వాటిగా గాక వాటిని కవి అనుభవించే ఊహాశాలీనత వల్ల ఏర్పడే సౌందర్యంగా భావించాలి. అది వస్తుపరంగా వచ్చిందే తప్ప శిల్ప పరంగా కాదు.
ఎదుగుతున్న చేతులు కలవారిళ్ళల్లో అంటు తపేళాలుగానో పంటపొలాల్లో కలుపుదీసే లిక్కులుగానో రూపొందుతాయి గడ్డి మూటల్లోనో పంచెల్లోనో కూరుకుపోయిన నా తల్లి యెవ్వనం కామందుకో కామందు గారి పెద్దబ్బాయికో విందవుతుంది. (కూలితల్లి)
లాంటి కవితల్లో అతని వస్తు స్పృహ నిర్మాణంతో పోటీ పడుతుంది. ఈ కవితే కాదు, ఆ లాంటి చాలా కవితలు, బృహస్పతుల ఖడ్గాలింగనాలలో, వస్తు ప్రవాహంలోకి, రసదగ్ధ హృదయంలో, రూపాయి రూపాయి దూరం లాంటివెన్నో కవి వస్తు వ్యామోహాన్ని బయటపెడతాయి. వస్తువు లేని కవిత్వముండదు కదా ? మరి మాధవ్ వస్తు విన్యాసానికున్న ప్రత్యేకత ఏమిటని ఆలోచిస్తే అతను చూసిన సంఘటనలని అనుభవించి ఆర్ద్రమైపోయిన దాఖలా కనిపిస్తుంది. కవి ఆర్ద్రమైతే వస్తు నిర్వహణ చిక్కబడుతుందా, తేలికవుతుందా ? ఆ ఆర్ద్రత కవిత్వ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుందా ? ఉద్వేగాలమీద పట్టు లేనప్పుడు కొంత జారిపోవడం సహజమే కదా ? ఈ కవితా సంపుటిలో చాలా వరకు రూపం కన్నా సారమే కనిపిస్తుంది. అయితే ఇందాకనుకున్న సౌందర్య వివేచన సారానిది కాదు కదా ? రూపానిదే. మరి ఈ రూపం ఇతనెంచుకున్న వస్తువుల్లోని కృత్రిమత్వాన్ని కరిగించిన విధానాన్ని ఆవిష్కరిస్తుంది. అయినప్పటికీ పుస్తకమంతా వస్తురూప అవిభాజ్యాన్ని దాటి కవి తీసుకున్న అంశమే అతని సృజనకి ప్రధాన ధర్మంగా ప్రకాశిస్తుంది. కొన్ని ఉదాహరణలు చూడండి.
నేను పుడదామనుకున్నప్పుడు అమ్మకి మహిళా మండలి మీటుంగుందట అందుకే నా పుట్టుకను వాయిదా వేసుకున్నాను ఆకలేసి ఆబగా అమ్మ స్థనాల మీదకు దూకినపుడు అందాలు జారిపోతాయని అమ్మ మాతృ ప్రేమ డబ్బాలతో పట్టింది (బందీలం)
మనిషింటే సృజనగానో స్పందనగానో గాక అనేకానేక వస్త్వావయవాల సమాహారమై పోయాడు ... వస్తువు మార్పిడే ప్రేమగా నిరూపించబడుతుంది జ్ఞానపు గదుల్లోకి హింసోన్మాద లైంగిక విశృంఖలతలు జొరబడ్డాక ఏం మిగిలిందిక్కడ ? (వస్తు ప్రవాహంలోకి) ... వేల వేల శరీరాల రాపిళ్ళలో నీ ఆకలి సమస్య పరిష్కారమవుతుంది నీ జీవితం ఈ సమాజానికున్న అనేకానేక రసికారుతున్న పుండ్లలో ఒక పుండై శాశ్వతంగా ఉంటుంది (హృదయ విదార సంగీతం )
ఇలా మాధవ్ కవితలన్నింటికీ అతని వివేచన పాఠకుడికి చేరడమే లక్ష్యంగా ఉన్న లక్షణం కనిపిస్తుంది. అంటే చదివే మనస్సుని అతని కవిత్వ వస్తువు దీపంచేస్తుంది. మనమా వెలుతురులో భావచిత్రాల్నో, ధ్వనినో ఇంకే అలంకారికతనో వెతుక్కోవలసి వస్తే అది వేరే విషయం. మాధవ్ వస్తు నిర్వహణలోని ఆధిపత్య ధోరణికి, అప్పటి కాలమాన పరిస్తితులే కారణం కావొచ్చును. ఇది 1998 లో వచ్చిన సంకలనం. పుస్తకమంతా సామాజిక వేదనే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకీ వేదన పట్ల కవి ఇంత వ్యాకులపడ్డాడు. ఘర్షణ పడ్డాడు ? పీడన చెందాడు ? ఆర్ధిక సరళీకరణ జరిగిన తొలి దశాబ్ది కాలాన్ని గనుక పరిశీలించినట్లైతే, మానవ జీవితాన్ని అనంతవిశ్వానికి ఓపెన్ మార్కెట్ చేసిన మార్పు తప్పకుండా కనిపిస్తుంది. సామాజికంగా శ్రమ రూపురేఖలు, దాని ప్రాభావంగా వచ్చిన భాషలోని ప్రయోగాలూ, తత్సంబంధ జీవన నిర్వచనాలు చాలా వినూత్నంగ సాహిత్యంలోకి జొరబడ్డాయి. వాటి ప్రభావమంతా కవి ఎంచుకున్న వస్తువును కవిత్వం చేస్తున్న క్రమం మీదే ఎక్కువగా పడుతుంది. అక్కడ ఘర్షణ లోని తీవ్రతమొత్తమూ సమాజం ఎదుర్కొంటున్న స్థూల సమస్యల మీదే కేంద్రీకృతమవడం చేత ఆ 'విషయమే' ప్రముఖాంశంగా ఉంటుంది. అదే మాధవ్ కవిత్వంలో డామినెంట్ రోల్ పోషించాయని అనుకుంటాను.
ముందు మాటలో దర్భశయనం 'ఇతని కవిత్వంలో అక్కడక్కడా వచనత్వం ఎక్కువ పాళ్ళల్లో ఉందా అనిపించవచ్చు" అంటాడు. బహుశా ఈ వాక్యాన్ని తీసుకునే దేవిప్రియ అనుపమ కాలానికి శిల్ప ధ్యాసను పెంచుకున్నాడని అనడానికి కారణం కూడానేమో ? ఏది ఏమయినా మాధవ్ మొదటి పుస్తకమే చాలా బాగుందని చెప్తాను. దానిక్కారణం అతని కవిత్వీకరించిన అంశాలపట్ల అతని నిబద్దమైన వ్యక్తీకరణ. స్పష్టత. అది ఒత్తిడిని ప్రతిఫలించింది. శిల్పాన్వయాల్ని ధిక్కరించినా అందులోని రసావిష్కరణకి కారణం అతని వాక్యాల కళాత్మకతలోని ప్రత్యేకమైన సారం వలన. అతని సౌందర్యమంతా అతని కవిత్వ సారమే, తప్ప అతను వాడిన మెటఫర్లూ కాదు, సిమిలీలూ కాదని ప్రగాఢమైన నమ్మకం కలుగుతుంది. కవిని కాలం ఎందుకు ప్రభావితం చేస్తుంది ? ఆ కాలం అనుభవించిన ఘర్షణవల్ల. ఆ ఘర్షణాత్మక అభివ్యక్తి చెమటచిత్తడినేల తో పోల్చితే మిగతా రెండు పుస్తకాల్లో ఆ నిజాయితీని ప్రదర్శించదు. రెండో పుస్తకం "స్పర్శ" లో జీవితం పట్ల మారుతున్న అతని దృక్పధం కనిపిస్తుంది. అతను కవిత్వీకరిస్తున్న సామాజిక పీడన పల్చబడిపోయి కాస్త తక్కువగానే హత్తుకుంటుంది. అనుపమ కొచ్చేసరికి అది మారి అతని కవిత్వీకరణ శిల్పపరంగా ఉన్నతంగా కనిపిస్తుంది.
ఒక దుక్ఖపు కెరటం తీరాన్ని తనలో ఇముడ్చుకుంది (తీరాన్ని తాకిన దుక్ఖం)
సంఖ్యా శాస్త్రం ఒక్కటే సకల కళల్నీ మింగేస్తోంది (ఆత్మ హత్యల రుతువు)
పయనం - దేహాన్ని విడిచి నిరంతరాయంగా సాగే ఆలోచన (కొన్ని నిర్వచనాలు)
లాంటి వ్యక్తీకరణలు మొదటి పుస్తకంలో కనిపించవు. అదే విధంగా --
అన్నం మొలకెత్తడమంటే నన్ను నేను భూమిలో పాతేసుకోవడమే (అన్నం మొలకెత్తడమంటే)
భూమి పెనమ్మీద వేగుతున్న మాకు పచ్చదనం కావాలి (చాటెడు మబ్బు కోసం)
ఊరికి ఉత్తరాన ఉండాల్సిన శ్మశానం నడిబొడ్డుకి తరలి వచ్చింది (మా ఊరి దృశ్యం కోసం)
ఇప్పుడు గోడకు అసలైన సరికొత్త నినాదం కావాలి (అసలైన పోష్టరు కోసం)
లాంటి వాక్యాలు "అనుపమలో" కనిపించవు. కవిగా మాధవ్ చెమట చిత్తడి నేల లో నచ్చినంత అనుపమ లో నచ్చడు. దానిక్కారణమూ కాల ప్రవాహంలో అతని అనుభవాల్ని అక్షరబద్దం చేస్తున్న క్రమంలోని తన అనుభూతులే కారణం. శిల్పపరమైన శోభకి అనుపమ నిలబడితే, మొదటిపుస్తకం తన సామాజికుడిలోని వ్యాకులత, అంతర్మధనమూ పైకెత్తి చూబెడుతుంది. అతని మిత్రుడు ముత్యం పరిచయం చేసిన మార్క్సిజం సారాన్ని వెతుక్కోవాలంటే చెమట చిత్తడి నేలే ఆధారం. స్పర్శ పుస్తకం ఈ రెంటి దృక్పధాలకీ మధ్యస్తంగా నిలబడుతుంది. అతని ప్రయాణంలో అడుగడుగునా అతని మానవీయ లక్షణాల ప్రభావం అతని కవిత్వం పై ఎక్కువగా కనిపిస్తుంది. మనిషి సౌమ్యుడు. ఎవ్వర్నీ గట్టిగా ఒక మాటనడు. కోపం తొందరగా రాదు. వొచ్చినా పోగొట్టడం తేలిక. అతని మానవీకరణ లక్షణమ్మొత్తమూ మొదటిపుస్తక తదనంతరంగా కనిపిస్తుంది. సృజనపరంగా సాంద్రమయ్యిన దాఖలా అతని నాస్టాల్జిక్ జీవన పార్శ్వాల చిత్రణలోనే ఎక్కువ ఉందన్న సంగతి అనుపమ నిరూపిస్తుంది. కవిగా సంతృప్తికరమైన వాస్తవిక జీవన పెనుగులాటని ఆవిష్కరించిన లక్షణం చెమట చిత్తడి నేల లో కనిపిస్తుంది. అనుపమ ఫిలాసఫీ అన్నాడు దేవీప్రియ. చెమట చిత్తడి నేలే అతని కవిత్వ ఫిలాసఫీ అనగలను నేను. ఏదీ అవాస్తవం కాకపోవచ్చు, పాఠకుణ్ణి హత్తుకున్నప్పుడు కవి చేసిన ప్రతిపాదనలే దేనికైనా ప్రాతిపదికలవుతాయి. మాధవ్ తన మొదటి పుస్తకంలో చేసిన వాగ్దానం చాలా బలమైనది. రూప సారాల నిగ్గులూ, వగైరాలు తీసి పక్కనపెట్టమని చెప్పలేను గానీ, అతని కవిత్వానిది మానవతా సౌందర్యం. అక్షరాల్లో అతని మనస్సు వికసించి కనిపిస్తుంది. అతని కవిత్వ సౌందర్య నిర్మాణంలో ఎక్కడా కవిగా అభేదాన్ని కనిపించనీయడు. అతని కవిత్వానందమూ, ముగ్ధత ఒకటే. అది అతని సరళ భావ ప్రకటన. దాన్ని పీఠికలు రాసినవాళ్ళతో సహా ఎవరైనా వచనమన్నా, కవిత్వమన్నా, ఈ వచన కవిత్వమంతా అనంత(తారం) మాన(ధ)వుని సమ్మోహన రసానుభూతే.
అతను విజయవాడ సాహితీ మిత్రులలో యాక్టివ్ కార్యకర్త. కవితా మాస పత్రిక ఎడిటర్ గా ఉన్నాడు. వార్షిక సంచికల కూర్పులో అతని పరిశీలన ఎన్నదగినది. గుంటూరు రచయితల సంఘం అతని కవిత్వాన్ని ఘనం గా సత్కరించింది. అలాగే పలమనేరు సృజనసాహితీ పురస్కారం పొందారు. గోవా రాష్ట్ర ప్రభుత్వం వారి పోయెట్రీ ఫెస్టివల్, కేంద్ర సాహిత్య అకాడెమీ వారి జాతీయ పోయెట్రీ ఫెస్టివల్లో పాల్గొన్నారు.
అతను తెలుగులో ఎమ్మే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో చేశాడు. పీహెచ్ డీ సగంలో ఆగిపోయింది. అతను ప్రస్తుతం విజయవాడలో శిఖర అనే పేరుతో స్కూలు నడుపుతున్నాడు. అతని భార్య ఉమారాణి. ఆమె శాస్త్రీయ నాట్యరీతుల మీద పరిశోధన చేశారు. మాధవ్ తనకిష్టమైన గురువుగారు పాపినేని శివ శంకర్ గారి అన్వేషణ సాహిత్య వ్యాస సంకలనానికి సంపాదకులలో ఒకరిగా వ్యవహరించారు
ఈ నెల 28 న సహృదయ సాహితీ సంస్థ కాకినాడలో బండ్ల మాధవ రావ్ కి రజతోత్సవ పురస్కారాన్నిచ్చి సత్కరిస్తోంది. అనిల్ కీ, కొమ్మవరపు విల్సన్ రావ్ క్కూడా సన్మానం చేస్తోంది. చాలా మంచి కార్యక్రమం. మనందరమూ అతని కవిత్వానికి అభినందనలు చెబ్తే ఎంతో హృద్యంగా ఉంటుంది కదూ ? మరింకెందుకు ఆలస్యం ? @ 88976 23332.
ఉంటాను మరి. మళ్ళీ వచ్చే పక్షందాకా శెలవ్ మీ శ్రీరామ్ 99634825
Skip to main content search Home search సాహిత్యం మట్టి - మనుషుల అదృశ్య రహస్యాలు Feb 14,2022 07:06
చెమట చిత్తడి నేల, స్పర్శ, అనుపమ, ఊరి కల కవితాసంపుటాలతో తనకంటూ ఒక ప్రత్యేక పంథాను సొంతం చేసుకున్న మట్టిమనిషి, రైతుకవి బండ్ల మాధవరావు. ఆయన తాజాగా ప్రకటించిన కవిత్వజాడ 'దశ్య రహస్యాల వెనుక'. మిగతా సంపుటాల కన్నా ఈ పుస్తకానికి ప్రత్యేకత ఉంది. మట్టి తన రూపం కోల్పోయి, రైతు ఆకాశంలో గిరికీలు కొడుతున్న సంక్షుభిత సందర్భంలో లోకం ఎదుట ప్రదర్శించిన ఈ కవితాదృశ్యాలు... వర్తమాన గాయాల వెనుక రహస్యాలు!
మాధవరావు కవిత్వం లలితంగా ఉంటుంది. సరళంగా సాగుతుంది. తేలికైన పదాల పొందికతో వాక్యాలు పరుగులు తీస్తాయి. అట్లా అని ఆయన సంధించే అక్షరం నంగిగా మూల్గదు. విధేయంగా ఉండదు. వంగివంగి నడవదు. ధీమాగా గొంతు విప్పుతుంది. ప్రశ్నిస్తుంది. గర్జిస్తుంది. నిటారుగా నడుస్తుంది. మట్టికీ మనిషికీ మధ్య సంబంధం విచ్ఛిన్నమవుతున్న అత్యంత దురదృష్టకర దృశ్యాలు ఈ సంపుటిలోంచి పైకిలేచి మనల్ని గాయపరుస్తాయి. దాంతోపాటు ప్రశ్నార్థక మవుతున్న ఉనికి, జీవనమూలాల శైథిల్యం, సామాన్యుడి నైరాశ్యం, రాజకీయ అరాచకం, కాషాయ పైత్యం, వేధిస్తున్న వైరస్ వంటి వివిధ అంశాలపై రాసిన కవితలు బలంగా గుండెల్ని తాకుతాయి.
'తాత, నాన్న జ్ఞాపకాలతో తడిసిన ఇంట్లో' పుట్టిన కవికి బాల్యంలో అపురూమైన అనుభవాలున్నాయి. 'నిలువెత్తు మేటు గట్టిన పత్తిమండెలతోనో/ పొగాకు బేళ్లతోనో వేరుశనగ రాశులతోనో/ నిరంతరం పొలాన్ని కుప్పబోసినట్లు/ పంచ అంతా పంటలతో కళకళలాడుతూ' ఉండేది. ఓ కుటుంబం కదలాడుతూ ఉండేది. 'తాతనుండి మనవడిదాక/ ఓ జీవజల ఎగసిపడుతూ' ఉండేది. ఊరి నిండా దోస్తులూ మామయ్యలూ అత్తయ్యలూ బాబాయిలూ పిన్నమ్మలూ ఉండేవారు. ఇంట్లోంచి కాలు బయటపెడితే ఆత్మీయతాను రాగాలు తొణికిసలాడేవి.
కాలం గిర్రున తిరిగింది. ఎక్కడో ఉండాల్సిన రాజధాని ఊరి నడిబొడ్డుకొచ్చి నిలబడింది.మట్టికీ మనిషికీ, మనిషికీ డబ్బుకీ, డబ్బుకీ సౌఖ్యాలకీ మధ్య చిత్రవిచిత్రమైన సంబంధాలు వీధి అరుగులపైకెక్కి కూచున్నాయి. కృత్రిమత్వ మేదో గాలినిండా వ్యాపించింది. ఈ పరిణామాలన్నీ మాధవ మనసును మెలి పెట్టాయి. ఆ ఆవేదనలోంచి అంటున్నారు... ఊళ్లోకి రాబోయే అంకుల్ ఆంటీల కోసం/ పొలాలు పంటల్ని ఖాళీ చేస్తున్నాయి/ పచ్చదనం మీద మొలవబోయే/ కాంక్రీటు వనాలకోసం/ మట్టిలోంచి పుట్టాల్సిన అన్నం మెతుకులు/ పైకి రావడానికి దారిలేక/ తిరిగి మట్టిలోకే ముడుచుకొంటున్నాయి (మా ఊరు రాజధానయ్యింది)
పోనీ, నిజంగానే అక్కడ రాజధాని వెలిసిందా? సరికొత్త ప్రపంచమేదైనా ఆవిష్క ృతమైందా? లేదు. రాజధాని అక్కడ ఉందో లేదో తెలియదు. తన జన్మభూమి ఇప్పుడు ఊరూ కాదు, నగరమూ కాదు. జనం తమ పాదాలు నేలమీద నిలబడి ఉన్నాయో, ఆకాశంలో తేలియాడుతున్నాయో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ పరిణామాల పర్యవసనామే 'విరిగిన కల'. 'లాటరీగా మారిన ఆకలివేటలో/ నిన్నూ నీ ఊరినీ నీ పొలాల్నీ కోల్పోయాక/ ఊరించిన రాజధాని సౌధం/ హఠాత్తుగా కళ్లముందే కుప్పకూలి పోయింది'. భారీయంత్రాలు, వలసకూలీలు పైకిలేపిన ఆకాశహర్మ్యాలు ఇంకా పూర్తి కాకముందే తరలింపు ప్రకటన బాంబులా పేలింది. 'పాత ఇంటిని పీకేసి కట్టిన కొత్త ఇంటికి/ గృహప్రవేశం చెయ్యనే లేదు/ అప్పటిదాకా పచ్చబారిన మట్టి/ అప్పటిదాకా అన్నమైన మట్టి/ అప్పటిదాకా జీవితమైన మట్టి/ గిరికీలు కొడుతూ కాళ్లముందు సాగిలపడింది/ జెండాల ఎజండాల నేపథ్యంలో ఊరు / ఆంక్షల సంకెళ్ల మధ్య/ ఊపిరి కోసం అల్లాడుతోంది' అని అనంతర పరిణామాలతో తీవ్రంగా గాయపడిన స్థానికుల వేదనను ప్రతిభావంతంగా కవిత్వీకరించారు.
ఈ గందరగోళ దృశ్యాల నడుమ మట్టి మాయమైపోతోంది. తేమ ఆవిరైపోతోంది. పొలం అదృశ్యమవుతోంది. పని- నిన్నటి ఖాళీని పూరించిన పవిత్రకర్మ. శ్రమ- నిన్నటి శరీరం చిందించిన చెమటచుక్క. ఇప్పుడు ఆ రెంటి అవసరమూ లేక ఏకంగా చేతులే మాయమైపోయాయి. 'ఒకానొక ఉదయాన/ నిద్రలేచి చూసుకొనేటప్పటికి/ నా చేతులు అదృశ్యమైపోయిన' రహస్యాన్ని బయట పెట్టారు. 'చేతులు లేకపోవడం మనిషి లేకపోవడం లాంటిదే కదా' అని మనల్ని ఉలిక్కిపడేలా చేస్తారు. 'ఇప్పుడు నేను/ పని లేనోడినయ్యాను/ పని- బతకడానికేనా/ బతికించడానికి కూడా కదా/ పనంటే మట్టి/ మట్టిలోంచి అన్నం/ కాళ్లకింద మట్టి పెళ్లగించబడ్డాక/ అన్నం లేదు/ అన్నం పెట్టే పనీలేదు' (మాయమైన చేతులు). మట్టి పిసికిన చేతులు, దుక్కి దున్నిన చేతులు, కోత కోసిన చేతులు రాజ్యం దాడిలో ధ్వంసమయ్యాయన్న నగసత్యాన్ని బలంగా రికార్డు చేశారు.
రాష్ట్రమేమిటి, దేశమేమిటి! నాగలి నాలుగుదిక్కులా విలపిస్తూనే ఉంది. బరువు మోయలేక వెన్నెముక వంగిపోతూనే ఉంది. కొత్త చట్టాల కొరడా దెబ్బలు తినే ప్రసక్తే లేదని తలపాగాలు పొలాల్ని వదిలి రోడ్లెక్కాయి. ఆ రైతన్నలకు కవి షరతుల్లేని మద్దతు ప్రకటిస్తున్నారు 'నగరాన్ని ముట్టడించిన నాగళ్ళు' రూపంలో. 'ఆకాశ దారుల్లో మట్టి మనుషులు/ పచ్చని దేహాన్ని ఎగరేస్తున్నారు/ కొత్త చట్టాల ఎజెండాల్లో హరిత వర్ణ పతాకం/ పొలాల మధ్య కదలాడుతూ/ రాజధాని రోడ్లను చుట్టుముడుతోంది' అని అక్కడి దృశ్యాన్ని ఆవిష్కరించిన కవి 'ఎప్పటికైనా నగరాన్ని ముట్టడించిన/ నాగళ్లదే అంతిమ విజయం' అని ముందే భాష్యం చెప్పారు.
సంపుటి మకుటంగా నిలిచిన 'దృశ్య రహస్యాల వెనక' అద్భుతమైన కవిత. 'గొంతులోంచి మాట బయటకు రాకముందే/ గొంతు చుట్టూ బిగిస్తున్న ఉరితాళ్లు/ అనేక అణచివేతల మధ్య/ ప్రశ్నపై వాడు ఆధిపత్యం చలాయిస్తున్నాడు' అని విస్పష్టంగా చెప్పి 'నిజానికి మట్టి కదా నా ఉనికి' అని ఘనంగా చాటుకున్న కవి ఆ ఉనికిని మాయం చెయ్యాలని చూస్తున్న శక్తులపై యుద్ధం ప్రకటిస్తారు. గోవులో తులసిదళాలో స్వామిభక్తికి కొలమానాలుగా రాజ్యమేలుతున్న దుర్బలత్వాన్ని నిరసిస్తారు. అదృశ్యంగా పొంచి ఉండే తుపాకుల పహారా, ముళ్లతీగలు, గోడల్ని బద్దలు కొట్టాల్సిన అవసరాన్ని వక్కాణిస్తారు. ఈ పరిష్కార ప్రస్తావన కవితలో ఎక్కడా కనిపించదు. అదే ఈ కవితలోని శిల్ప రహస్యం.
కవి పేదల పక్షపాతి. పీడనకు మూలాలు వెతకటంలోనే అతని నిరంతర అన్వేషణ. ఎంత వెతికినా ఆ మూలాలు వెళ్లీవెళ్లీ రాజ్యంలోనే విలీనమవుతున్న రహస్యాన్ని బహిరంగం చేస్తారు. గాల్లోంచి పూలు పూయించి, భవనాలు మొలిపించి, సంక్షేమం జపించి, స్వర్గాలు సృష్టించేది సింహాసనమేనని నిర్ధరిస్తారు. నెగ్గుకు రావటం కోసం వాళ్లు చెప్పే మాటలు కూడా ఎంత వక్రంగా ఉంటాయో ధ్వనిస్తారు. 'మకిల పట్టిన మాటల్ని/ చిలుము పట్టిన మాటల్ని/ చింతపండుతోనో/ పొయిలోని బూడిదతోనో' తోమాలంటారు 'మాటల అంచున' కవితలో. వంకర తిరిగిన, చొట్టలు పడిన మాటల్ని సాపు చెయ్యాలంటారు. కన్యాకుమారి నుంచి కాశ్మీరు దాకా ఈ మాటలు దీర్ఘకాలిక వ్యాధులతో తీసుకుంటున్నాయి. అధివాస్తవ అధికరణాలు, ఆంక్షల ఆజ్ఞలు కుంకుమపూల లోయను కాంతిహీనం చెయ్యాలని చూస్తున్న కుట్రల్ని కవి బహిరంగం చేస్తున్నారు. ఇనపబూట్ల తొక్కిడిలో, కవాతుల కనుసన్నలలో భావి ఆశలరెక్కలు తెగిపడుతున్న క్రూరత్వాన్ని కవిత్వీకరిస్తున్నారు. 'బతకడమే యుద్ధమవుతున్న చోట/ ఎవడెందుకు ఆయుధమవుతున్నాడో/ ఎవడెందుకు మందుపాతరవుతున్నాడో/ కారణాలు సమాధవుతున్న' (కుంకుమపూల విధ్వంసం) కాశ్మీరులోని నిత్య మారణ హౌమాల వెనక రాజకీయ ఎజెండాలను ఎండగట్టారు. 'ఇల్లూడ్చినట్లు, అంట్లు కడిగినట్లు/ పిల్లల పీతిగుడ్డలుతికినట్లు' ఈ దేశపు దేహాన్ని శుభ్రపరచాలని 'కొత్త చిగుళ్ల కోసం'లో ప్రతిపాదించారు.
మాధవ కవిత్వంలో వాక్యాలు ఒకదాని వెంట ఒకటి ధారలా కురుస్తాయి. వస్తువు తాలూకు అంతర్ బహిర్ ఛాయలన్నీ క్యూలో నిలబడి ఘోషిస్తాయి. ఆ గాఢత ధాటికి హృదయం చెమ్మగిల్లుతుంది. ఈ సంపుటిలోని కవితలన్నిటా అలాంటి వాక్యాలెన్నో ఉన్నాయి. ఈ సంపుటికి సంపాదకత్వ బాధ్యతను సమర్థంగా నిర్వహించటంతోపాటు 'కవిత్వం వొక సజీవ బంధం' ఎలా అవుతుందో గొప్పగా విశ్లేషించారు ఎ.కె.ప్రభాకర్. భువనచంద్ర రాసిన 'జ్వాలామాధవీయం' ఒక ఆత్మీయ భాషణ. ఉమారాణి గారి 'దేవిప్రియ జ్ఞాపకాలు' చదువుతుంటే కన్నీటిని నియంత్రించటం చాలా కష్టం. ఈ సంపుటిని దేవిప్రియ గారికి అంకితమివ్వటం ద్వారా ఆయన పట్ల తన అపార గౌరవాన్ని చాటుకున్నారు కవి. గిరిధర్ అరసవల్లి పుస్తకం గెటప్నీ, ముఖపత్రాన్నీ అందంగా తీర్చిదిద్దారు. ప్రతుల కోసం 88976 23332 నెంబర్లో కవిని సంప్రదించొచ్చు.
- ఎమ్వీ రామిరెడ్డి .... 98667 77870
సారంగ Type here to search... Search
2021 సంచికలుముఖాముఖిసంచిక: 15 ఆగష్టు 2021
కవిత్వానికి ఎడిటర్ వుండాల్సిందే!
శ్రీరామ్ పుప్పాల
బండ్ల మాధవరావు కవిత్వ సంపుటి “దృశ్య రహస్యాల వెనక” ఆగస్టు పదిహేను ఆవిష్కరణ!
1. అనుపమ (2014) ప్రచురించిన ఏడేళ్ళ తరువాత ‘దృశ్య రహస్యాల వెనుక’ తెస్తున్నారు. తొలినాటికీ (1998), తరువాతి కాలానికీ గల మీ పరిణామక్రమాన్ని గురించి చెప్పండి.
కవితా సంపుటులు వేసే విషయం లో ఈ వ్యవధి నాకు సహజమైనదే. 90 నుంచి రాయడం మొదలుపెడితే మొదటి సంపుటి “చెమట చిత్తడి నేల” 98 లో వచ్చింది. రెండవది ఏడేళ్ళతర్వాత “స్పర్శ”(2005); తొమ్మిదేళ్ల తర్వాత ‘అనుపమ’ వచ్చాయి. ఇప్పుడు “దృశ్య రహస్యాల వెనుక” వస్తోంది. మధ్యలో 2017 లో “ఊరికల” దీర్ఘ కవిత, శివశంకర్ గారితో కలిసి “మా ఊరు మా ఇల్లు” అనే కథా కవితా సంపుటులు తెచ్చాను. 30 ఏళ్ళ అనుభవంలో, క్రమ పరిణామం లేకపోతే వ్యక్తిగా మనం లేనట్టేననుకుంటున్నాను. తొలిసారి రాసిన కవితకి ఇప్పుడు రాస్తున్న కవితకి, వస్తువు సమాజంలోంచే తీసుకున్నప్పటికి,వ్యక్తికరణ లోనూ, భాషా వినిమయం లోనూ ప్రస్పుటమైన మార్పు నా కవిత్వం లో కనబడుతుందనే అనుకుంటున్నాను.
2. సంపాదకుడిగా మీరీమధ్య బిజీ అయ్యారు ? అయినా కవితా మాసపత్రిక నిరాఘాటంగా రావడం లేదు.
“కవితా!” మాస పత్రిక కు సంపాదకుడు గా, వార్షిక సంచికలకు సహ సంపాదకుడుగా, దేవిప్రియ (బహుముఖ), పాపినేని (అణ్వేషణ) అభినందన సంచికలకు సంపాదకుడుగా, పని చేయడం మరువలేని అనుభవం. కవితా! మాస పత్రిక ఒకింత ఆలస్యానికి ప్రత్యేక మైన కారణాలు ఏమీ లేవు కానీ, శ్రీ శ్రీ ప్రింటర్స్ లో టెక్నీషియన్స్ కొరత, విశ్వేశ్వరరావు గారు మహాప్రస్థానం మహా గ్రంథం మీద దృష్టి పెట్టటం, కొద్దిగా నా అలసత్వం, ముఖ్య కారణాలు. ఏమైనా కవితా! పత్రిక ఆగిపోదు. త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తుంది
3.వచన కవిత్వ చరిత్రలో మిమ్మల్ని మీరెక్కడ గుర్తిస్తారు ?
వచన కవిత్వాన్ని నాలుగు తరాల కవిత్వం గా భావిస్తుంటాను. కుందుర్తి దగ్గర మొదలైన తొలి తరం, 80 ల, 2000, 2020 లలో కవితా నిర్మాణం లోనూ, భాషా వినిమయం లోనూ ఎన్నో మార్పులను తెచ్చింది. 90లలో మొదలైన ఒక కవి వీటన్నిటిని అవలోకిస్తూ, తనలోకి వాటిని ఆవాహన చేసుకుంటూ 2020ల తరం లో కూడా పటిష్టం గా నిలబడే ఉన్నాడంటే, తప్పకుండా అతనికి ఆధునిక వచన కవితా చరిత్రలో ఎంతోకొంత స్థానం ఉన్నట్లే అనుకుంటాను. గుంటూరు జిల్లా సాహిత్య చరిత్ర రాస్తూ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు నా రచనల గురించి నాలుగు పేజీలలో ప్రస్తావించారు. ఏ నాటి కవిత్వ చరిత్ర లో స్థానం సంపాదించుకోవడమైనా అది విమర్శకులు, పాఠకులు నిర్ణయించాల్సిన అంశం.
4.వచన కవిత్వ రచనలో వస్తున్న మార్పులను మీరే విధంగా వ్యాఖ్యానిస్తారు ?
గత 30 సంవత్సరాలుగా కవిత్వం లో సంక్లిష్టత,అస్పష్టత ల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆధునికోత్తర కవిత్వం లో ఇవి చాలా సహజమైనవే అన్నంతగా ఒక దశలో కవిత్వాన్ని ఆక్రమించాయి. కాని 2000 తర్వాత వస్తున్న కవులు దీనిని అధిగమించి అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. ఇప్పటికీ రూపానికి, శుద్ధ కవిత్వానికే మేం ప్రాధాన్యత ఇస్తామనే కవులు కూడా అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. అలాగే సంఘటనల కోసం ఎదురుచూస్తూ వెంటనే కవిత్వం రాస్తున్నవారూ ఉన్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చెయ్యడమనేది నాకు ఇష్టమైన పని. అలాంటపుడు ఆ సంఘటన ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత కవిత రాస్తే ఆ కవితకున్న రిలవెన్స్ పోతుంది కదా అని కూడా మిత్రులు అడుగుతారు. కాని చరిత్ర ను రికార్డ్ చేసే క్రమంలో దాని రిలవెన్స్ ఎప్పటికీ పోదు అనేది నా భావన. అలాగే వాక్యం రసాత్మకం కావ్యం అన్నంతమాత్రాన ఏకవాక్య కవితలు, నానీలు, నానోలు లాంటివి కవిత్వం అంటే ఎందుకో నా మనసొప్పుకోదు. కవిత్వానికి ఒక నిర్వహణ, అంతర్ రుచిరత్వము, చదివేకొద్దీ లోపలికి వెళ్లి దాన్ని ఆస్వాదించే గుణము ఉండాలనుకొంటాను. వీటన్నింటిని ఇప్పుడు వస్తున్న కవిత్వం లో గమనిస్తున్నాను. పరిణామక్రమాన్ని ఆహ్వానిస్తున్నాను. ఆస్వాదిస్తున్నాను.
5.జూం ద్వారా తొలి సాహిత్య కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన వారుగా, సాహిత్యంలో సామాజిక మాధ్యమాలకెలాంటి ప్రాధాన్యాన్నివ్వాలి ?
గత సంవత్సరం మార్చ్ 24 నుండీ ఎవరికి వాళ్ళం ఇళ్లల్లో బందీలమైపోయాం. ఏం జరుగుతుందో తెలియక భయం భయం గా ఎక్కడివారం అక్కడే బిగసుకుపోయాం. దాదాపు నెలన్నర బయట ఎవరి ముఖం చూడకుండా గడిపేసాం. మే 1 అంటే విజయవాడ సాహితిమిత్రులకు ఒక కవిత్వ పండుగ. గత 22 సంవత్సరాలుగా క్రమం తప్పకుండ మే 1 సాయంత్రం విజయవాడ లో కవిత్వం తో ఒక సాయంకాలం కార్యక్రమాన్ని జూమ్ లో నిర్వహించాలనిపించింది. దానికి మీరూ, అనిల్, విశ్వేశ్వరరావు ఇంకా కవిమిత్రులు సహకారం అందించారు. అది అనేక సాహిత్య కార్యక్రమాలకు దిక్సూచి అయింది. కవిత్వ వికాసానికి సామాజిక మధ్యమాలు కీలకంగా మారాయి. అయితే అక్కడ వెల్లువెత్తుతున్న కవిత్వాన్ని గురించి మాత్రం నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. రాసిన కవిత్వాన్ని ఒక సంపాదకుడు సరిచూడవలసిన అవసరం ఉంది. అలా లేకపోవడం వలన అకవిత్వం కుప్పలు తెప్పలుగా మన ముందుకు వస్తోంది. అందుకే రాసిన ప్రతి అక్షరం గోడమీద పెట్టడం కాకుండా ఎవరైనా విశ్లేషణ చెయ్యగల వారికి చూపించి అప్పుడు పాఠకుల ముందు పెడితే బాగుంటుంది అనేది నా ఆలోచన.
6. అందుకేనా, మీ దృశ్య రహస్యాల వెనుక సంపుటికి సంపాదకుణ్ణి పెట్టారు ?
నిజానికి తెలుగులో కవిత్వ సంపుటులకు సంపాదకులు ఉండే సంప్రదాయం లేదు. అయినా నేను ఆ సంప్రదాయాన్ని తెలుగులో కూడా తీసుకురావాలనే ఉద్దేశం తో డా. ఏ. కె ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేస్తే సహృదయతతో అంగీకరించారు. వారికి నా కృతజ్ఞతలు.
7.మీరు శిఖర, విద్యాసంస్థ ని నడుపుతున్నారు కదా ? స్కూల్లో పిల్లలకి కవిత్వం గురించి చెబుతారా ? ఈ తరం సాహిత్యాభిరుచిని గురించి చెప్పండి.
స్కూల్ లో పిల్లలకు కథలు కవిత్వం చదివి వినిపించడం, వారితో రాయించడం గత ముప్పై ఏళ్లుగా చేస్తున్న పనే. కోవిడ్ కంటే ముందు ఎండాకాలం సెలవల్లో కేంద్ర సాహిత్య అకాడమీ తో కలిసి శిఖర స్కూల్ లో కథ, కవితా రచన, బొమ్మలు, కార్టున్ లు వేయడం మొదలైన అంశాలలో ప్రముఖ రచయితలు, కవులు, చిత్రకారులు, కార్టునిస్టులతో వర్క్ షాపు నిర్వహించాము. ఇక ఇప్పటి తరంలో సాహిత్యభిలాష గురించి చేప్పాలంటే పెరుగుతున్న జనాభా, అక్షరాస్యత లను దృష్టిలో పెట్టుకుంటే దానికి సమస్థాయిలో సాహిత్యభిలాషులు పెరగటం లేదనేది వాస్తవం. ముఖ్యం గా బోధనాంశాలలో సామజిక శాస్త్రాల ప్రాధాన్యత తగ్గడం, టీవీలు, సెల్ ఫోన్ ల వాడకం పెరగడం దీనికి కారణాలనుకుంటున్నాను. అయితే గమనించాల్సింది ఏమిటంటే నిష్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ కొత్తతరం పాఠకులు, కవులు, రచయితలు ఈ యవనిక మీదకు వస్తూనే ఉన్నారు. వీరిలో చాలామంది సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకొని అధ్యయనం, అభ్యాసనం చేస్తూనే ఉన్నారు.
శ్రీరామ్ పుప్పాల
ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది
Gopal .sunkara August 14, 2021 at 5:24 am సందర్భం వాక్యం
అభినందనలు
Reply కోడూరి విజయకుమార్ August 15, 2021 at 7:11 am సంభాషణ బాగుంది మిత్రులు మాధవకు శ్రీ రామ్ కు అభినందనలు
Reply Dr.Banala Srinivas Rao August 15, 2021 at 9:56 pm కవిత్వం గురించి సమాజానికి సాహిత్య అవసరం గురించి తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా వెలిబుచ్చిన మాధవ్ గారికి మంచి ప్రశ్నలతో అడిగిన శ్రీరామ్ గార్కి ధన్యవాదాలు
"*సరళ శైలిలో సాంద్రత నింపే కవి బండ్ల మాధవరావు*"
- *పలమనేరు బాలాజీ*
కృష్ణా జిల్లా రచయితల సంఘం మహాసభలు నిన్న అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జరిగాయి. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నెలకొల్పిన కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆలూరి బైరాగి స్మారక పురస్కారం - 2024 ఈ ఏడాది కవితా రంగంలో విశేష కృషి చేసిన బండ్ల మాధవరావుకు ప్రదానం చేశారు. బండ్ల మాధవరావు తెలుగు కవితా ప్రపంచంలో అందరికీ స్పూర్తిదాయకమైన కవి. ఎక్కడా అనుకరణకు లొంగని కవిత్వం అతడిది. విభిన్నమైన కవితా వస్తువులు, సహజమైన శైలి శిల్పం, మనిషిని పల్లెను ప్రేమించేతత్వం, నిరాడంబరత అతడి కవిత్వాన్ని పాఠకులకు చేరువ చేసాయి. 1991 నుంచి 2014 వరకు 23 ఏళ్ల సుదీర్ఘ కాలంలో మూడు కవితా సంపుటాలను వెలువరించాడు. చెమట చిత్తడి నేల (1998), స్పర్శ (2005), అనుపమ (2014). దృశ్య రహస్యాల వెనుక ఆ తర్వాత వచ్చిన కవితా సంపుటి. ఈ కవితా సంపుటిలో చాలా పదునైన కవితలు కనిపిస్తాయి. అమరావతిలో అంతర్భాగమై అంతరించి పోతున్న తన ఊరు అనంతరం గురించి ఊరి కల' అనే ఒక దీర్ఘ కవితను 2017 డిసెంబర్లో వెలువరించాడు. నిద్ర పట్టనివ్వని నిద్రలోనూ అదే కల గురించి, మాట్లాడుతూ, "ఊరెళ్ళి రావాలి/ ఊరెళ్ళి రావాలి. మా ఊరి మీద వీచే చివరి పైరగాలిని/ వంటికంటించుకోవడం కోసం ఒకే ఒక్కసారి ఊరి చెరువులోని బురదలో రావడం కోసం ఊరెళ్ళి రావాలి" అంటాడు. అసాధారణంగా రాయటానికి చాలా ఎక్కువ కష్టపడాలి అంటారు కానీ, చాలా సులభంగా సాధారణంగా, సహజంగా రాయటానికే ఇంకా ఇంకా ఎక్కువ కష్టపడాలి అని తన కవిత్వం చదివితే అర్ధం అవుతుంది. "గేదె పక్కలో పడుకొని/ నేను పడుతున్న ఆనందాన్ని/ ఎప్పుడు చూశాడో/ గేదె పక్కలో పడుకోవాలన్నాడో కవి" "బహుశా కొన్నేళ్ల తర్వాత / మా ఊరి వేప చెట్టు కింద అరుగు/ ఏ పురావస్తు తవ్వకాల్లోనో బయటపడవచ్చు. అప్పుడు ఈ చరిత్రను మళ్ళీ/ తవ్వి తిరగబోసుకొంటాను" ఊరికి వెళ్లడం అంటే అంత సులభమైన విషయం ఏమీ కాని, అది చాలా భయపడే విషయం అని, భయపెట్టే విషయం అని ఈ కవిత చెబుతుంది. "అయినా ఊరెళ్లాలంటే భయం నీటియం/ బతుకు భయం/ జీవితాన్ని గూర్చి భయం /జీవించడాన్ని గూర్చి భయం/ నాలుగు మెతుకులు/ సందర్బం లోపలికెళ్లే దారిని గూర్చి భయం / మట్టినాది కానప్పుడు, మొక్క నన్ను 'విడిచి వెళ్లినప్పుడు / రేపటి రోజు/ మా కొండంతై నన్ను కలవర పెడుతుంటే/ ఊరెళ్లాలంటే అనంతరం భయం" ఊరు ఏమైందో తెలిస్తే కళ్ళు చెమ్మగిల్లుతాయి, గుండెల్లో నొప్పి మొదలవుతుంది. డబ్బు వాసన వేసే మనుషులతోనే ఊరు మొత్తం నిండి పోతే ఊరు ఏమవుతుందో చూడండి. "ఊరంటే ఇప్పుడు సరికొత్త భవనాలు / రంగు రంగుల కార్లు/ ఇప్పుడు నేను ఊర్లోకి వెళితే/ ఎవరూ ఎప్పుడొచ్చావని అడగడం లేదు/ డబ్బు వాసనేస్తున్న మనుషులతో/ ఊరు ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. కళ్లముందే ధ్వంసమైపోయిన ఊరు / నగరపు రెక్కల్ని తొడుక్కుంటున్నది. శిధిలమైన సంబంధాలతో మనుషులు/ రెక్కల గుర్రాల మీద విహరిస్తున్నారు. ఇప్పుడక్కడ ఊరు లేదు/ బంధువులు లేరు / బంధుత్వాలు లేవు /మట్టి లేదు / చెట్టు / పుట్ట అంతరించిపోయింది". అంతరించిపోయిన ఊరు మానవ సంబంధాల గురించి, అంతరించిపోయిన పల్లె సంస్కృతి గురించి అంతరించిపోయిన ఊరి గురించి హృద్యంగా చెప్పాడు బండ్ల మాధవరావు. ఈ కవి ఎక్కువగా రాయడు. తనను తాను కానీ ఇతరులను కానీ అనుకరించడం ఉండదు. ఎక్కడా అనుసరణ ఉండదు. ఎంతో సాధన చేసే తప్ప ఇలాంటి అసాధారణ శైలి ఏర్పడదు. ఒక మంచి కవిత చదివితే ఒక మంచి మనిషి మనతో తోడున్నట్టు అనిపిస్తుంది. అలాంటి మంచి కవితలు ఆయన సాహిత్య సంపుటాల్లో ఎన్నో కనిపిస్తాయి. పేజీలు తిప్పే కొద్దీ, కఠినమైన సత్యాలు, చారిత్రక నిజాలు, సంఘర్షణలు, పోరాటాలు, గొప్ప ఆశలు, గొప్ప గొప్ప కలలు ఎన్నో కనిపిస్తాయి. చదివే కొద్దీ కవిత పాఠకుడిని తన లోపలికి రహస్యంగా లాక్కుంటుంది. ఒక సున్నితమైన అలజడిని రేపుతుంది. గతం ఏమిటో, వర్తమానం ఏమిటో అసలైన నిజాలు చెబుతూనే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో హెచ్చరిస్తుంది. అణువణువుని, మనిషి మనిషిని ప్రేమించగలిగే హృదయ వైశాల్యం బండ్ల మాధవరావుకు ఉంది కనుకే అతని కవిత్వం తడితడిగా ఉంటుంది. కన్నీటి చెమ్మ ఉంటుంది. ఒక హెచ్చరిక ఉంటుంది. ప్రేమతత్వం ఉంటుంది, తాత్వికత ఉంటుంది, చారిత్రక రాజకీయ కోణంలో నుంచి సత్య దృష్టితో మనిషిని ప్రపంచాన్ని సమాజాన్ని అర్ధం చేసుకోవడం ఉంటుంది. అతని కవిత్వాన్ని చదువుతుంటే ఒక మనిషిని చదివినట్టు ఉంటుంది. ఉపాధ్యాయ రంగంలో, పాఠశాలల నిర్వహణ రంగంలో విశేషమైన అనుభవం ఉండటం, విద్యార్థులను విపరీతంగా ప్రేమించే మనస్తత్వం ఉన్న ఉపాధ్యాయుడు కాబట్టే పిల్లల పట్ల అతడికి గల ప్రేమంతా అతడి అక్షరాల్లోనే తెలుస్తుంది. అందుకే "నువ్వు ఏ భాషలో రాసినా/ నీ అక్షరాలకు లక్షలాది అక్షరాలు తోడుంటాయి/ నీ అక్షరాన్ని అగ్నిలో మండించు / ఎప్పటికైనా సమస్త ఆయుధాల్నీ జయించే అంతిమ ఆయుధం అక్షరమే' అంటాడు 'అక్షరాలు' అనే కవితలో. అక్షరాలు మనుషుల్ని ఎంతగా ఎలా ఆయుధాలలాగా భయపెట్టగలవో అతడు చెబుతాడు. ఈ కాలంలో ఏది నేరమవుతుందో చెబుతాడు. "ప్రశ్నించడాన్ని ఎదిరించడాన్ని ముందే నేర్చుకొన్నందుకు/ ఎగరడమే నేరమైపోయిందివాళ" అంటాడు 'విడివిడిగానే' అనే కవితలో చాలా సున్నితంగా చెప్పే ఒక మాట చూడండి : "ఎదురైన వాళ్లను ప్రశ్నించిన మనం/ కలిసి నడిచొచ్చిన కాళ్ళనే విరగగొట్టుతున్నాం./ చేతుల్లోని పువ్వుల్ని గుర్తించకుండా/ మందుపాతరాల్ని అన్వేషిస్తున్నాం” 'దృశ్య రహస్యాల వెనుక కవితాసంపుటి లోని యాభై కవితలు చాలా అద్భుతమైనవి మళ్లీ మళ్లీ చదివింప చేసేవి. చిత్తడి నేల, స్పర్శ, అనుపమ, ఊరి కల ... 'దృశ్య రహస్యాల వెనుక' కవిగా అతని ప్రయాణం నిర్విరామంగా కొనసాగుతూనే ఉందనడానికి ఉదాహరణలు. రాజకీయ అస్థిరత, మనుషులు వలసపోవడం, ఇండ్లు ఊర్లు పొలాలు మాయం కావడం, ఉన్నట్టుండి మనుషులు లేకుండా పోవటం, ఉన్నా ఉన్నట్టు లేకపోవడం, సాంద్రతతో కూడిన దుఃఖంతో కూడిన ఆవేశంతో కూడిన ఒక వెతుకులాట.. మనుషులు మాట్లాడినట్లు ఉండదు, పొలాలు మాట్లాడినట్లు ఉంటుంది. ఇండ్లు మాట్లాడినట్లు ఉంటుంది ఒక సమూహం, ఒక సమాజం మాట్లాడినట్లు ఉంటుంది. అదే.. మాధవరావు కవిత్వం. విజయవాడలో జరిగే సాహిత్య సాంస్క ృతిక కార్యక్రమాలకు ఆయన ఆత్మీయంగా స్నేహహస్తం అందిస్తుంటారు. ఎన్నో పుస్తక ఆవిష్కరణలు, ఎన్నో సాహిత్య సభలు, మేలు కలయికలు... ఆయన ఒక మంచి స్నేహశీలి అని గొప్ప సాహిత్య కార్యకర్త అని నిరూపిస్తాయి. 'కవితా!' మాస పత్రిక నిర్వహణలో, విలువైన సంచికల ఆవిష్కరణలో శ్రీశ్రీ విశ్వేశ్వర రావు గారికి ఆత్మీయుడిగా ఆయన అవిశ్రాంతంగా కొనసాగిస్తున్న సాహిత్య కృషి విలువైనది, విస్మరించలేనిది. - పలమనేరు బాలాజీ