బిందు సరోవరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిందు సరోవరము

"" బిందు సరోవరం "" గుజరాత్ రాష్ట్రంలోని ఒక సరోవరం.ఈ సరోవరాన్ని సరస్వతీ నది చుట్టి పారింది. ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చరిత్ర కలది.[1]

విశేషాలు[మార్చు]

గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కర్దమ ప్రజాపతి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి విష్ణువు ప్రత్యక్షమైన ప్రాంతము. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి.

భాగవతం లో జరిగిన యధార్థ సంఘటన[మార్చు]

రసాతలమనే లోకం మన భూలోకం కన్నా చాలా క్రింద ఉన్న లోకం. వరాహ స్వామి రసాతళములో ఉన్న భూమిని ఉధ్ధరించి, హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఆ తర్వాత వరాహ భగవానుడు తిరుమలలో స్వయంభూ గా భూదేవితో సహా వెలసి ఉన్నాడు. బ్రహ్మ దేవుడు భూలోకమందు సృష్టి కార్యము చేయుటకు కొందరు ప్రజా పతులును సృష్టించాడు. అందులో ఒకరు కర్దమ ప్రజాపతి. బ్రహ్మ దేవుడు సృష్టి కార్యము చేయవలసినదని కర్దమ ప్రజాపతిని ఆజ్ఞాపించాడు. కర్దమ ప్రజాపతి బ్రహ్మ దేవుడి ఆజ్ఞ మేరకు, మంచి గుణవంతురాలైన ధర్మ బద్ధమైన భార్య కోసం శ్రీ మహావిష్ణువు కోసం 10 వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై అంతటి మహా భక్తుడిని చూసి ఆయన కన్నుల నుండి ఆనందభాష్పములు పడ్డాయి. ఆ ఆనంద బాష్ప ములు పడిన చోట ఒక బిందు సరోవరం ఏర్పడింది. ఆ సరోవరమే ఈ బిందు సరోవరం. సరస్వతీ నది ఈ బిందు సరోవరాన్ని చుట్టి పారింది.

భాగవతం లోని పద్యం::

ముందటఁ గాంచె నంత బుధముఖ్యుఁడు విష్ణుఁడు గర్దమున్ మహా నంద మెలర్పఁ జూచి నయనంబుల రాలిన బాష్పముల్ ధరన్ బిందువులై వెసం దొరఁగి పేర్చి సరస్వతిఁ జుట్టి పాఱుటన్ బిందుసరోవరం బనెడి పేరఁ దనర్చిన పుణ్యతీర్థమున్:

భాగవతం లోని ఈ పద్యం ప్రకారం ఆ బిందు సరోవరాన్ని సరస్వతీ నది చుట్టి పారింది. నిజంగానే ఆ బిందుసరోవరాన్ని సరస్వతీ నది చుట్టి పారడం మనం చూడవచ్చు. శ్రీ మధ్భాగవతం సత్యమే చెప్పింది, అనడానికి ఈ ఒక్క ఆధారము చాలు.కొన్ని లక్షల సంవత్సరాల ముందు జరిగింది ఈ సంఘటన. ఓం నమో భగవతే వాసుదేవాయ మన భారతీయ సనాతన వేద ధర్మమును మనం రక్షించుకుందాం.

కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మిదిమంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ ఉంటే బాగుంటుందనిపించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజచేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్రభాగ్యాన్ని కలిగించాడు. ఆ పుత్రుడే కపిలుడు.

ఇతర విశేషాలు[మార్చు]

ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృదేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృదేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.

బిందు సరోవరం గుజరాత్‌లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్‌ - డిల్లీ జాతీయ రహదారిలో ఉంది. సిద్ధపూర్‌ అహ్మదాబాద్‌ నుంచి సుమారు 115 కి.మీ దూరములో ఉంది. గుజరాత్‌లోని అన్నిముఖ్యపట్టనాల నుంచి సిద్ధపూర్‌కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్‌ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేక ధర్మశాలలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణమే కాబట్టి, అహ్మదాబాద్‌కు యాత్రార్థం వెళ్లిన యాత్రీకులు తప్పక బిందుసరోవరాన్ని దర్శించుకుని వస్తుంటారు.

మూలాలు[మార్చు]

  1. 🕉 భారతీయ సనాతన వేద ధర్మ శాస్త్రములు 🕉 శ్రీ మధ్భాగవతం ఆధారము