వాడుకరి:Purushotham9966/అగస్త్యరెడ్డి వెంకురెడ్డి
అగస్త్యరెడ్డి వెంకురెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం, ఈదురు గ్రామం. పుట్టిన తేదీ 04-10-1939. పెరిగిన ఊరు మాతామహుల ఊరు వరకవిపూడి గ్రామం.నెల్లూరు వి. ఆర్. కళాశాలలో చదివి, నాగపూరు విశ్వవిద్యాలయంలో ఏం. ఏ. ఎల్. ఎల్. బి పాసయ్యాడు. కొద్దికాలం రెవెన్యూశాఖలో ప్రోబేషనరి డిప్యూటీ కలెక్టరుగా చేసి, హయిదరాబాదు, నెల్లూరులలో న్యాయవాద వృత్తిలో కొంత కాలం కొనసాగాడు. వెంకురెడ్డి ఇంటర్నేషనల్ ఆయుర్వేదిక్ సొసైటి వ్యవస్థాపక అధ్యక్షుడుగా,సింహపురి పారిశ్రామిక సంస్థ కార్యదర్శిగా పనిచేశాడు. నెల్లూరు వర్ధమాన సమాజం కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడుగా నాలుగు దశాబ్దాలు కొనసాగాడు. రావు బహదూర్ రేబాల లక్ష్మీనరసారెడ్డి పురమందిరం(Town hall) కార్యదర్శిగా పన్నెండేండ్లు కొనసాగాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడుగా ఎంపిక అయి కొనసాగాడు. నెల్లూరులో తిక్కన విగ్జాన కేంద్రం, "కవికోకిల" దువ్వూరు రామిరెడ్డి విగ్జానసమితి నెలకొల్పి, ఆ సంస్థలకు కార్యదర్శిగా పనిచేశాడు. వెంకురెడ్డి తెలుగు పద్యకవి, భగవద్ గీతను పద్యాలలో తెనిగించాడు, షాణ్మాతుర స్తవము పేరుతో ఆత్మాశ్రయ శతకం రచించాడు, ఇవికాక ఈయన రచించిన స్వప్నానుభూతి, తిరుమలేశ శతకం, వెంకటేశ శతకం, తదితర అముద్రిత రచనలు కొన్ని ఉన్నవి. ఈయన అవివాహితుడు, 2023 సెప్టెంబరు 22 న 84 వ ఏట మరణించాడు. మూలాలు: ఆగస్త్యరెడ్డి వెంకురెడ్డి షాణ్మాతుర స్తవము, ప్రచురణకర్త బి. సురేంద్రనాథరెడ్డి, "కవికోకిల" దువ్వూరు రామిరెడ్డి విగ్జానసమితి, శక్తి గ్రాఫిక్స్, ఆచారి వీధి, నెల్లూరు, 2022, గీతా సుధాలహరి(ముద్రితం)