వాడుకరి:Svpnikhil/ర్యాంకు ముఖ్యమా ? నాలెడ్జి ముఖ్యమా ?

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం కార్పోరేట్ కళాశాలల వారిని రాయమంటే నూటికి నూరు శాతం ర్యాంకులే ముఖ్యమంటారు. ఈ దౌర్భాగ్యానికి నిదర్శనం మనం ర్యాంకుల విడుదల రోజు టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఒకరిని మించి మరొకరు పరోక్షంగా వేసుకొనే విసుర్లు మొదట్లో నవ్వు తెప్పించినా తరువాత వెగటు తెప్పిస్తాయి. అవి కూడా ఎప్పుడూ రానంత గట్టిగా విపరీతమైన శబ్దంతో వస్తాయి. దీనికి తోడు ఆ ప్రకటనల్లో సినిమా పాటలు పెట్టి ఎదుటివారిని దెప్పిపొడిచే ఈ విపరీత ధోరణి మన ఆంధ్రరాష్ట్రంలోనే ఎక్కువ. దీనికి కారణం ఇంటర్ స్థాయిలో రెండు ప్రముఖ కళాశాలలు రాష్ట్రాన్ని శాసించటం. ఈ మధ్య కొత్తగా కామర్సు విద్యకు ఆదరణ పెరగటంతో ఇందులోనూ అవే సంస్థలు ఏకస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఒక ప్రముఖ కార్పోరేట్ కళాశాల ఈ విధంగా ప్రకటనలు గుప్పిస్తోంది – ‘ప్రతిభకు కొలమానం మార్కులే’. ఇలా మార్కులు మాత్రమే ముఖ్యమని తల్లిదండ్రులని చేడుదోవ పట్టిస్తున్నారు.

ఉపోద్ఘాతం[మార్చు]

ఆటపాటలు లేకుండా రోజుకు పదహారు గంటలు చదువు పేరుతో వేలకు వేలు ఫీజులు కడుతున్నాం కదా అని తల్లిదండ్రులు , మార్కులు రాకపోతే విద్యార్థులు ఎక్కడ చేజారిపోతారో అని యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందిపెడుతున్నాయి. పాఠ్యాంశాలపై ఆసక్తి కలిగించి , నేర్చుకోవాలన్న తపన వారిలో కలిగించినపుడే ఫలితం ఉంటుంది. ఐ.ఐ.టి., ఎంసెట్ లాంటి పోటి పరీక్షల్లో గట్టెక్కితే అభివృద్ధిలో శిఖరాగ్రం చేరుకున్నట్లేనని భావిస్తూ వారిపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల అంచనాలు చేరుకోలేకపోతే వారి కోపానికో, వ్యంగ్యానికో గురి కావాల్సి ఉంటోంది.

సరిగ్గా ఎం.పి.సి., బై.పి.సి., సి.ఎ.,లలో ఎం తీసుకోవాలో అర్ధం కాకుండానే తల్లిదండ్రులు వారి భావిష్యత్తును నిర్ణయిస్తున్నారు.

వివరణ[మార్చు]

పిల్లలు కూడా ర్యాంకులు ముఖ్యమనే భావనలో పడి గైడ్లు , ఇతరత్రా పుస్తకాలు కొని కేవలం వాటిని మాత్రమే చదివి అసలైన విషయాన్ని వదిలేస్తున్నారు. ఉపాద్యాయులు కూడా వారికీ విషయ పరిజ్ఞానాన్ని అందివ్వకుండా పదహారు గంటలు ఏకబిగిన పాఠశాలలలో బోధిస్తున్నారు.

ఉదాహరణ[మార్చు]

విషయ పరిజ్ఞానం లేకుండా గైడ్లు , టెస్ట్ పేపర్లు చదివితే ఏమవుతుందో అనేదానికి చక్కటి ఉదాహరణ: 2012 ఇంటర్ ద్వితీయ సంవత్సరం భౌతిక శాస్త్రం ప్రశ్నాపత్రం . ఇంటర్ బోర్డు చరిత్రలో ఇంతటి కష్టంగా ఎప్పుడు ఇవ్వలేదని వారే ఒప్పుకున్నారు. అక్కడ పుస్తకంలో లేని ప్రశ్నలు ఇచ్చింది రెండు మాత్రమే మిగతావన్నీ ఇంతవరకేప్పుడు ఇవ్వనివి . కేవలం గైడ్ లు మాత్రమే చదివించే ప్రైవేటు కళాశాలలు సైతం తికమక పడ్డాయి. విద్యార్థులు పరీక్ష గదుల్లో ఏడవటం సైతం మనం వార్తల్లో చూశాం.

నివారణ చర్యలు[మార్చు]

  • విద్యార్థులకు వక్తృత్వ , వ్యాసరచన, ఆట పోటీలు నిర్వహించాలి. దీనివల్ల చదువులో ప్రతిభ చూపలేకపోయినా విద్యార్థులు వాటిలో మెరుగుపడటం వల్ల ఆ అభద్రతా భావం నుంచి తప్పుకుంటారు.
  • ఎన్.ఎన్.ఎస్., ఎన్.సి.సి., లాంటివి అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో ఉండాలి. దీనివల్ల నాయకత్వ లక్షణాలు మెరుగుపడి వారు శారీరకంగా దారుడ్యంగా తయారవుతారు .
  • పదవ తరగతిలో మార్కులకు బదులు ఇస్తున్న గ్రేడింగ్ విధానం శ్రేయస్కరమైనది. దీన్నే ఇంటర్ బోర్డు కూడా అవలంబిస్తానని చెప్పడం ఆనందకరమైన విషయం. ఐనా ఇంకా కొన్ని సంస్థలు పాత పంథాలోనే వెఱ్రిమొర్రి ప్రకటనలు జారీ చేస్తున్నాయి.
  • ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో అమలవుతున్న స్మార్ట్ క్లాసు విధానం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలైతే బాగుంటుంది.

ఇంటర్ లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి సైతం ఐ.ఐ.టి., సి.ఎ. లాంటి పరీక్షల్లో వెనకబడటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే మనకు సరైన సమాధానం దొరుకుతుంది.

ముగింపు[మార్చు]

తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏమిటంటే పోటీపరీక్షల్లో ప్రవేశం అత్యంత గొప్ప విషయం అనుకుంటూ పిల్లలమీద ఒత్తిడి పెట్టకూడదు. వారి అభిలాషల్ని, తెలివితేటల్ని అర్ధం చేసుకుని తమకు ఆసక్తికరమైన రంగంలో విజయం సాధించడానికి తోడ్పడాలి. ర్యాంకు ఆధారితంగా విద్యార్ధి తెలివిని అంచనా వేయడం మూర్ఖత్వం. ఉత్తమ తెలివితేటలున్న విద్యార్ధి చదువులో కాకపోతే మరే ఇతర విషయాల్లోనైన అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తాడు. దీన్ని బట్టి చూస్తే తెలివితేటలే ముఖ్యమని అర్థమవుతోంది.

విద్య అనేది కేవలం మార్కుల కోసమే అన్నట్టు ఉండకూడదు , అది వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి.