శికారిపుర రంగనాథరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శికారిపుర రంగనాథరావు
జననం
శికారిపుర రంగనాథరావు

(1922-07-01)1922 జూలై 1
షిమోగా జిల్లా, సాగర్ తాలూకా,ఆనందపురం. పాత మైసూరు రాజ్యం (కర్ణాటక)
మరణం2013 జనవరి 3(2013-01-03) (వయసు 90)
జాతీయతభారతీయుడు
వృత్తిపురాతత్వ వేత్త

శికారిపుర రంగనాథరావు (1922 జూలై 1 - 2013 జనవరి 3), భారతీయ పురావస్తు శాస్త్రవేత్త. గుజరాత్‌లోని ఓడరేవు నగరం లోథాల్, బెట్ ద్వారకతో సహా అనేక హరప్పా ప్రదేశాలను కనుగొన్న బృందాలకు ఆయన నాయకత్వం వహించాడు. ఆయన డాక్టర్. ఎస్‌ఆర్ రావు గా ప్రసిద్ధి.

జీవిత చరిత్ర, వృత్తి[మార్చు]

రావు 1922 జూలై 1న మాధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతను మైసూర్ విశ్వవిద్యాలయం నుండి విద్య పూర్తి చేశాడు. బరోడా స్టేట్ ఆర్కియాలజికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి, తదనంతరం భారత పురావస్తు శాఖలో వివిధ హోదాల్లో పనిచేశాడు. రంగ్‌పూర్, అమ్రేలి, భగత్‌రావ్, ద్వారక, హనూర్, ఐహోల్, కావేరిపట్టణం మొదలైన అనేక ముఖ్యమైన ప్రదేశాలలో త్రవ్వకాలు జరిపించాడు. అతని కృషిలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి లోథాల్ వద్ద పరిశోధన, త్రవ్వకాలు జరిపించడం. ఇది చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు, భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన సింధు నాగరికత ప్రదేశం. రావు మైసూర్ విశ్వవిద్యాలయం నుండి జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్, సాహిత్యంలో డాక్టరేట్ లు పొందాడు. రావు దేశ పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో అనేక చారిత్రక ప్రదేశాల త్రవ్వకాలను పర్యవేక్షించాడు.

అతను తాజ్ మహల్, ఇతర కోటల వంటి స్మారక చిహ్నాల పరిరక్షణలో పాలుపంచున్నాడు. 1980లో అధికారికంగా పదవీ విరమణ చేసినప్పటికీ, ASI డైరెక్టర్ జనరల్‌ తరపున ప్రముఖ భారతీయ పురావస్తు ప్రాజెక్టులలో పని చేయాల్సిందిగా రావును అభ్యర్థించారు. రావు చొరవతో NIO 1981లో అప్పటి డైరెక్టర్ సయ్యద్ జహూర్ ఖాసిం ఆధ్వర్యంలో సముద్రపు పురావస్తు పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది, అది ప్రపంచ గుర్తింపు పొందిన సంస్థగా ఎదిగింది. అతను భారతదేశంలోని సొసైటీ ఆఫ్ మెరైన్ ఆర్కియాలజీ స్థాపకుడు. రావు అనేక దశాబ్దాలుగా భారతీయ పురావస్తు శాస్త్రంలో అగ్రగామిగా ఉన్నాడు. అతను సింధు లోయ నాగరికత కు చెందిన ప్రదేశాల నుండి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన త్రవ్వకాల వరకు భారతదేశ పురాతన గతం గురించి విస్తృతంగా జరిగిన పరిశోధనలలో పాల్గొన్నాడు.

సింధు లిపిని చదవడం[మార్చు]

రావు (1992) [1] సింధు లిపిని అర్థంచేసుకున్నట్లు పేర్కొన్నాడు. సింధు నాగరికత కు చెందిన పూర్తి స్థాయిలో ఆ లిపి ఏకరూపతను సూచిస్తూ, అతను దానిని ఫోనిషియన్ అక్షరమాలతో పోల్చాడు. ఈ పోలిక ఆధారంగా ఆయా గుర్తులకు ధ్వని విలువలను కేటాయించాడు. అతని విశ్లేషణలో ఏకా, త్ర, చతుస్, పంటా, హప్త/సప్త, దశ, ద్వాదశ, శత (1, 3, 4, 5, 7, 10, 12, 100) సంఖ్యలతో సహా "సంస్కృతీకరించిన" పఠనం ఏర్పడింది.

ప్రధాన స్రవంతి పండితులు రావు చేసిన పోలిక విధానంతో ఏకీభవించినప్పటికీ, అతని విశ్ళేషణకు సంబంధించిన వివరాలను ఆమోదించలేదు. ఆ లిపి ఇప్పటికీ సాధారణంగా అర్థం కాలేదు. ఆ లిపిని విశ్లేషించేందుకు జరిగిన ఇతర విచిత్రమైన ప్రయత్నాలను తోసిపుచ్చిన జాన్ ఇ. మిచినర్, " చాలా ఆత్మాశ్రయమైనదైనప్పటికీ, అంతగా నమ్మజాలని ప్రయత్నం అయినప్పటికీ లిపిలో ఇండో-యూరోపియన్ ప్రాతిపదికను గుర్తించడానికి చేసిన మంచి ప్రయత్నం రావుదే" అని పేర్కొన్నాడు. [2]

2002లో ది హిందూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రావు తాను చేసిన విశ్లేషణపై తనకున్న విశ్వాసాన్ని నొక్కిచెప్పాడు, "ఇది ఖచ్చితంగా ఇండో-ఆర్యన్ భాష అని ఇటీవలే మేము నిర్ధారించాం, అర్థంచేసుకున్నాం. నేను ఈ లిపిని వివరించానని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీకి చెందిన ప్రొ. డబ్ల్యుడబ్ల్యు డి గ్రుమ్మాండ్ తన వ్యాసంలో రాసాడు"

ద్వారక గుర్తింపు[మార్చు]

ద్వారకా పట్టణానికి ఉత్తరాన 30 km (19 mi) దూరాన, ఇసుక, రాతితో కూడుకున్న కుశస్థలి ( బెట్ ద్వారక ) ఉంది. దాని ఒడ్డునే రావు, అతని బృందానికి 560 మీటర్ల పొడవున ఉన్న ఒక గోడ కనిపించింది. ఇక్కడ లభించిన కుండలు, థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్ ఆధారంగా సా.పూ. 1528 నాటికి చెందినవని వారు కనుగొన్నారు. [3] [4] ద్వారకా జలాల్లో పెద్ద సంఖ్యలో కనిపించే మూడు రంధ్రాల త్రిభుజాకార రాతి లంగర్లు లోథాల్, మొహెంజొదారోలో ఒకే రంధ్రం ఉన్న లంగర్లు పరిణామం చెంది ఏర్పడనవేనని సూచించాయని రావు చెప్పాడు. హరప్పా దశ చివరి నాళ్ళకు చెందిన లంగర్లు సైప్రస్, సిరియాల్లో ఉపయోగించిన చివరి కాంస్య యుగం నాటికి చెందిన అవేలాంటి లంగర్ల కంటే కొన్ని శతాబ్దాల పురాతనమైనవని రావు నొక్కి చెప్పాడు. అయితే, ఆ తర్వాత NIO చేసిన పరిశోధనలో అవి సామాన్య శకం పద్నాలుగో శతాబ్దానికి చెందినవని నిర్ణయించింది. భారతదేశంలోని ఇతర పాత ఓడరేవులలో ఇలాంటి లంగర్లు కనిపించాయని కూడా పేర్కొంది. 

ద్వారక వద్ద వెలికితీసిన అవశేషాలు విష్ణువు ఎనిమిదవ అవతారమైన కృష్ణుడికి నిలయమైన చారిత్రాత్మక నగరమేనని రావు వాదించాడు. [3] మహాభారతం ప్రకారం, ప్రస్తుతం శిథిలావస్థలో సముద్రంలో మునిగిన ఉన్న కుశస్థలిలో ద్వారకను నిర్మించాడు. తర్వాత గోమతీ నది ముఖద్వారం వద్ద మరో నగరాన్ని నిర్మించాడు. ప్రతి పౌరుడు ఏదో ఒక గుర్తింపును-ఒక ముద్రను కలిగి ఉండాలని కృష్ణుడు ఎలా కోరుకున్నాడో కూడా మహాభారతం సూచిస్తుంది. 

ప్రచురణలు[మార్చు]

  • లోథల్ అండ్ ఇండస్ సివిలైజేషన్, బొంబాయి: ఆసియా పబ్లిషింగ్ హౌస్ ,ISBN 0-210-22278-6 (1973)
  • లోథల్: ఎ హరప్పన్ పోర్ట్ టౌన్ (1955 - 1962), సంపుటాలు. I, II, మెమోయిర్స్ ఆఫ్ ది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నెం.78, న్యూఢిల్లీ, ASIN: B0006E4EAC (1979, 1985)
  • లోథాల్, న్యూఢిల్లీ: డైరెక్టర్ జనరల్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (1985)
  • డాన్ అండ్ డెవల్యూషన్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్ ISBN 81-85179-74-3, ఢిల్లీ: ఆదిత్య ప్రకాశన్ (1991)
  • భారతీయ కళ, పురావస్తు శాస్త్రంలో కొత్త పోకడలు: SR రావు యొక్క 70వ జన్మదిన వేడుకల సంపుటాలు, BU నాయక్, NC ఘోష్ సంపాదకీయం, 2 సంపుటాలు. (1992)
  • న్యూ ఫ్రాంటియర్స్ ఆఫ్ ఆర్కియాలజీ, బొంబాయి: పాపులర్ ప్రకాశం ,ISBN 81-7154-689-7 (1994)
  • ది లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారక, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ,ISBN 81-86471-48-0 (1999)
  • మెరైన్ ఆర్కియాలజీ ఇన్ ఇండియా, ఢిల్లీ: పబ్లికేషన్స్ డివిజన్,ISBN 81-230-0785-X (2001)

మూలాలు[మార్చు]

  1. Elst, Koenraad. "The Vedic Harappans in writing Dr. Koenraad Elst, Remarks in expectation of a decipherment of the Indus script". Archived from the original on 4 February 2016. Retrieved 17 January 2013.
  2. John E. Mitchiner (1978), Studies in the Indus Valley Inscriptions, Oxford & IBH, p. 5
  3. 3.0 3.1 S.R.Rao, The Lost City of Dvaraka. National Institute of Oceanography 1999
  4. K.H. Vora et al, "Cultural sequence of Bet Dwarka island based on thermoluminescence dating" 2002 https://www.jstor.org/stable/24106004?seq=1