శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం)
శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం)

శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం) 1960, 70లలో సాగిన శ్రీకాకుళ గిరిజన రైతాంగ విప్లవ పోరాటాన్ని గురించి ప్రముఖ రచయిత ఛాయరాజ్ వ్రాసిన కథా కావ్యం. అర్ధవలస, అర్ధ భూస్వామ్య భారత దోపిడీ సామాజికార్థిక రాజకీయ వ్యవస్థను రద్దు పరచే నూతన ప్రజాతంత్ర విప్లవోద్యమ విజయం మాత్రమే పీడిత ప్రజానీకానికి విముక్తిని కలిగిస్తుందన్నదే మార్క్సిస్టు-లెనినిస్టు అవగాహన. ఈ అవగాహనతో సాగిన తొలి దశ శ్రీకాకుళ పోరాట ప్రజాపంథా మార్గం శాస్త్రీయమైనదిగా భావించి ఛాయరాజ్ కావ్యీకరించారు. క్లిష్టమైన ఆ కర్తవ్యాన్ని ఆయన వాస్తవికంగా, అనన్య కవితా శక్తితో సాధించారు.[1]

పుస్తకం గూర్చి[మార్చు]

రచయిత ఛాయరాజ్

తను సామాజికంగా కళ్ళు తెరచి తరచి చూసే లోపలే నక్సల్‌బరీ, శ్రీకాకుళం రైతాంగ తిరుగుబాట్లు జరిగిపోయాయి. తనలాంటి ఉపాధ్యాయులు శ్రీకాకుళోద్యమ సారథులుగా, కార్యకర్తలుగా అమరులయిన చరిత్ర పచ్చిగా కదలాడుతూ, వారి పోరాట అనుభవసారం చేతికందకుండా ఎండిపోతోంది. దాన్ని ఒడిసి పట్టుకుని ‘శ్రీకాకుళం’ ఉద్యమ కధాకావ్యంగా మలిచి మనముందు నిలిపినవాడు ఛాయరాజ్‌. ‘శ్రీకాకుళం -అటు విప్లవ రాజకీయాంలోనూ, యిటు విప్లవ సాహిత్యంలోనూ ఉత్ర్పేరకమైపోయింది. తను మౌలికంగా మారలేదు. మారకపదమైపోయింది. శ్రీకాకుళాన్ని చెప్పటమంటే సాహసించటమే. ఆ సాహసం నేను చేయదగిందికాదని తెలిసినా, చారిత్రాకవసరమై ముందు నిలిచింది. కలిసి సమీక్షించుకుందామనే నిర్ణయానికి రాకముందే, ఘనంగా ఎవరిదారిన వారు పోతున్నారు. కవిగా స్పందించి ఈ పోరాటాన్ని నేను పట్టించుకుని కావ్యరూపంలో చెప్పక తప్పలేదు’ (శ్రీకాకుళం - కావ్యం నామాట). ‘అడవుల్లో కురిసిన రక్తాన్ని పట్టి ఆకాశం మీద శ్రీకాకుళం రాస్తాను’ అని తానన్నట్టే... తన రచనలన్నిటిలోకి మహోత్కృష్టమైనదిగా (మాగ్నమోషన్‌గా) శ్రీకాకుళంను నిలిపాడు ఛాయరాజ్‌.[2]

సమీక్ష[మార్చు]

శ్రీకాకుళం గిరిజనోద్యమాన్ని సమీక్షించిన ఒక ప్రజా ఉద్యమం రాజకీయ మహాకావ్యంగా ఇది వెలుగొందింది. ఇది ఒకరి మెప్పుకోసమో, అవార్డులకోసమో వ్రాసినది కాదు. రాజకీయ నిర్మాణం లోకొచ్చి సిద్ధాంత, రాజకీయ లోతులను అధ్యయనం చేసి తన గడ్డ మీద జరిగిన విప్లవ ప్రజా ఉద్యమ ప్రాంతాన్నంతా తిరిగి, ప్రకృతి అందాలను, ఆదివాసుల అంద చందాలను చూసి తన్మయత్వం పొందీ, కష్టాలు, కడాగళ్ళు అవలోకనం చేసుకొని, వారి భాషలోని వాడుక పదాలను పట్టుకొని, ప్రవాహ ఉధృతిలో సాగిన రచన ఇది. రాజకీయ సిద్ధాంత సమస్యలకకు సంబంధించిన పెడధోరణుల నర్థం చేసుకొని, ఆ ఉద్యమ ప్రాంతంలో జరిగిన ఆచరణకు అన్వయించి కావ్యరూపంలో పాఠాలనందించిన రచన ఇది.

1967 అక్టోబరు31 న మొండిఖల్లులో జరుప తలపెట్టిన గిరిజన మహా సభను భ్యగ్నం చేసే కుట్రలో భాగంగా భూస్వాములు జరిపిన హింసాకాండ, కోరన్న మంగన్నలను భూస్వామ్య తూటాలతో హతమార్చడం ద్వారా దోపిడీ వర్గం అడవి ప్రజల గుండెల్లోని అగ్గిని రాజేసింది, అడావిపై హక్కు గిరిజనుడిదే. ఈ హక్కు కోసం చరిత్రలో జరిగిన తిరుగుబాటుల ఫలితంగా వచ్చింది 1917 గిరిజన చట్టం. ఈ చట్టాన్ని ప్రభుత్వాలు దశాబ్దాల కాలం అమలు చేయలేదు. ఏజన్సీ గిరిజన సంఘం ఆ చట్టాన్ని సంఘ శక్తితో అమలు జరుపబూనుకొంది. శ్రమకు తాగిన కూలీ, జీతాలు సాధించడం మాత్రమే కాక భూబదలాయింపులను, కౌలు పేరుతో భూములను గుంజుకోవడాలను, అప్పుకు వడ్డీలను సంఘం నియంత్రించింది. దౌర్జన్యాలు, దాష్టీకాలతో దోపిడీ వర్గం కాజేసిన భూములను ఇరిగితమ స్వంతం చేసుకోవడానికి గిరిజనులు పూనుకున్నారు. సంప్రదాయాలు, మూఢనమ్మకాల పట్ల సంఘం గిరిజనుల్లో నూతన చైతన్యం పెంపొందించింది. చదవటాం వ్రాయడం నేర్చుకొని పార్టీ పాటలు,పార్టీ రాజకీయాలను నేర్చుకున్నారు రిగిజనులు. ఉత్పత్తిని జాగ్రత్త పర్చుకోవడమన్న తమ సంస్కృతిని సంఘ నాయకత్వం గుర్తు చేసింది. తన అవసరాలు తీరకుఖ్ండా తమ ఉత్పత్తులు సంతలకు పోరాదని నిర్ణయం తీసుకొంది. అమలు జరిపింది. సంఘం నిర్ణయం ఆజ్ఞలాగ పరిగణించబడింది. పొలిటికల్ కమాండ్ తిరుగులేని విధంగా నెలకొల్పబడింది. ఈ గాఢనే కవి యిలా గానం చేయ మొదలెట్టాడు.[3]

ఆకు మాటున నిశ్శబ్దం, ఈనెల నుండి ఈటెలు
ఆకు అనే అద్దంలో రేపటి యుద్ధ ప్రతిబింబం
ఆకు యుద్దరేఖలా ఉంది. ఆకు మాటున మీటింగు ఉంది.
ఆకు గమ్యానికి మార్గదర్శిలా ఉంది.

ప్రకృతి అలముకొని ప్రకృతి లో జీవించిన గిరిజనుల గాథను ప్రకృతి అందచందాలనే ఉపమానంగా తీసుకొని గిరిజన పోరాట గాథను అవాహన చేశాడు కవి. గిరిజన స్వయం పరిపాలనా డిమాండ్ - చట్టబద్ద డిమాండ్ ని ప్రచార నినాదంగా వుంచుతూనే స్రమ దోపిడీకి, సాంఘిక అణచిపవేతకు వ్యతిరేకంగా పీడియ వర్గ సమర చైతన్యాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన గిరిజన సంఘ కార్యకర్తలు ప్రజలలో కలిగించారు. రాజకీయ ఉద్యమ అవగాహనను అందుకుంటూ ఉన్న దశలో ఆ రాజకీయాలు ఆచరణ రూపం దాల్చిన తీరు, అది కలిగించిన కంపన ప్రకంపనలు కవిని ఉద్వేగపరిచాయి.


ఛాయరాజ్ కేవలం భావుకుడు కాదు. తాను స్వీకరించిన మార్గదర్శక సిద్ధాంతానికి, గిరిజనోద్యమంలోని వర్గ పోరాటతత్వానికి ఉన్న గాఢమైన సంబంధాన్ని, దాని లోతుపాతులను అర్థం చేసుకొన్న కవి. తాడు మీద నడకలా కావ్యం నడిచింది. ఉద్వేగ ఉధృతి కావ్యం పొడవునా కొనసాగింది. కవిత్వం ప్రవహించింది.

విషయం చిన్నదో బుల్లిదో అయి ఉండి పుంఖాను పింఖాలుగా ఉన్న కవిత్వాలు చాలా ఉన్నాయి. కవిత్వ పరంగా అవి మంచి కవిత్వాలే కావచ్చు. కానీ ఈ కవి ఉద్యమాన్ని, ఉద్యమ గమనాన్ని, దాని రాజకీయాలను, గమన క్రమంలో, మలుపులలో వచ్చిన రాజకీయ తడపబాట్లను ఆసరా చేసుకొని ఒక రాజకీయ పెడధోరణి ఉద్యమాన్ని ఆక్రమించడం అన్న విషయం పట్ల గూడా విస్పష్టమైన వైఖరి కావ్యం చివరి వరకూ ప్రతిఫలింపచేసాడు. ఈ కారణం చేతనే ఇది బహు ఆదరణకు నోచుకోలేకపోయిందని జాలి చూపుతున్న వారున్నారు. వేరు వేరు భావాలు, వేరు వేరు ఆశయాలు, వేరు వేరు లక్ష్యాలు సంఘర్షణ పడుతూనే ఉంటాయి. కీర్తి కాంక్ష ప్వప్రయోజనానికి సంబంధించిన దన్న స్పృహతో ఉన్న కవి చాయరాజ్ వారి జాలి మాటలకు పొంగలేదు, కుంగలీదు, లొందలేదు.

ముందు మాటలో రవిబాబుగారు రెండు శ్రీకాకుళాలని అలంకార ప్రాయంగా అన్న మాట రాజకీయ ఉద్యమ విశ్లేషణకు సంబంధించిన గుణపాఠమె అవుతుంది. కొద్ది చోట్ల కవిత్వం బదులు వచనం దొర్లింది. అందువల్ల కొంపలు మునిగిపోయిందేమీ లేదన్న భావాన్ని కూడా రవిబాబు గారు స్పష్టీకరించారు.

ఆవంత్స సోమసుందరం గారి అభిప్రాయం[మార్చు]

శ్రీ ఛాయరాజ్. ఇతడు నిరంతర కవితా వాహకుడు ఇప్పటికే ఐదారు కావ్యాలు రచించాడు. అవిస్మరణీయ కవితాశాక్తి ప్రదర్శించాడు. ఛాయరాజ్ జనసాహితి సభ్యుడు . చిత్తశుద్ధితో జీవన వాస్తవికతను సందర్శించి మృషావిప్లవ భ్రమలలో కొట్తుకుపోకుండా కవిత్వంలో సత్యవాదనం చేయగల కవి. చరమ దశాబ్ది సింహద్వారం తెరవగానే అందుకున్న ఇతని కావ్యం "శ్రీకాకుళం: అది ఉద్యమ కథా కావ్యం. ఇంత విపులంగా 130 పేజీలలో ఒక విప్లవ వైఫల్యాన్ని చిత్రించిన కావ్యం వేరొకటి లేదు. ఆ విధంగా దీనికి చారిత్రక ప్రాధాన్యతే కాక, కావ్యచరితా ప్రాధాన్యత కూడా ఉంది. "అతివాద" దుందుడుకు విధానం ప్రజాయుద్ధ పంథాను ఏ విధంగా సర్వనాశనం చేసిందో శ్రీకాకుళమే కవికి విప్పి చెప్పింది. అంటూ కొత్తపల్లి రవిబాబు ఈ కావ్య హృదయాన్ని శ్లాఘించాడు. కవి కూడా :శ్రీకాకుళాన్ని చెప్పడమంటే సాహసించడమే. ఈ సాహసం నేను చేయదగింది కాదని నాను తెలిసినా చారిత్రకావసరమై ముందు నిలిచింది. కవిగా స్పంచింది ఈ పోరాటాన్ని నేను పట్టించుకొని కావ్య రూపంలొ చెప్పక తప్పలేదు." అనే సత్య వాక్కుతో కావ్యానికి "నా మాట" కూర్చాడు. యధార్థవాదికి పరిమితులవసరం![4]

మూలాలు[మార్చు]

  1. నాగావళి ‘ఛాయ’ – బి. సూర్యసాగర్[permanent dead link]
  2. శ్రమజీవుల సాంస్కృతిక సేనాని[permanent dead link]
  3. ప్రజాసాహితి, అక్టోబరు 2013 సంచికలో బాహుదా గారి సమీక్ష
  4. ప్రజాసాహితి అక్టోబరు 2013 సంచికలో ఆవంత్స సోమసుందరం సమీక్ష