ఆపరేషన్ సఫేద్ సాగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆపరేషన్ సఫేద్ సాగర్‌లో ఉపయోగించిన మిగ్-23 బిఎన్ యుద్ధ విమానం

ఆపరేషన్ సఫేద్ సాగర్, 1999 కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం, భారత వైమానిక దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషనుకు పెట్టిన పేరు. పాకిస్తాన్ సైన్యానికి చెందిన సాధారణ సైనికులను, సైన్యం పోషణలో ఉన్న కిరాయి సైనికులూ కార్గిల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పర్వతాలను అక్రమంగా ఆక్రమించుకుని తిష్ట వేసారు. వారిని తరిమి కొట్టే లక్ష్యంతో ఈ ఆపరేషన్ను చేపట్టారు. 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వైమానిక శక్తిని ఉపయోగించడం ఇదే తొలిసారి.

కార్యకలాపాలు[మార్చు]

భూస్థిత కార్యకలాపాలు[మార్చు]

1999 మే ప్రారంభంలో కార్గిల్‌లో పాకిస్తానీలు చొరబాట్లు జరిపినట్లు గుర్తించారు. కాశ్మీర్‌లో విపరీతమైన శీతాకాల వాతావరణం కారణంగా, భారత పాకిస్తాన్ సైన్యాలు తమ ఫార్వర్డ్ పోస్టులను విడిచి వెనక్కి వెళ్ళి, తిరిగి వసంతకాలంలో వాటిని ఆక్రమించడం ఏటా మామూలుగా జరిగే వ్యవహారమే. ఆ సంవత్సరం వసంతకాలంలో పాకిస్తాన్ సైన్యం, నిర్ణీత సమయాని కంటే ముందే ఫార్వర్డ్ పోస్టులను తిరిగి ఆక్రమించడం ప్రారంభించింది. కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ప్రాథమిక దశలో, వారు తమ సొంత పోస్టులను మాత్రమే కాకుండా, భారతదేశానికి చెందిన 132 పోస్టులను కూడా తిరిగి ఆక్రమించారు. [1]

మే రెండవ వారం నాటికి, బటాలిక్ సెక్టార్‌లో స్థానిక గొర్రెల కాపరి ఇచ్చిన సూచన మేరకు భారత సైన్యం పెట్రోలింగ్‌పై ఆకస్మికంగా దాడి చేయడంతో చొరబాటు సంగతి బయటపడింది. ఆక్రమణల స్వభావం లేదా విస్తీర్ణం గురించి మొదట్లో అంతగా అవగాహన లేకపోవడంతో, ఆ ప్రాంతంలోని భారత సైనికులు మొదట్లో కొద్ది రోజుల్లోనే వారిని ఖాళీ చేయిస్తామని ప్రకటించారు. అయితే, నియంత్రణ రేఖ వెంబడి ఇతర చోట్ల కూడా చొరబాట్లు జరిగినట్లు తెలియడంతో మొత్తం ప్రణాళిక చాలా పెద్ద స్థాయిలో ఉందని త్వరలోనే స్పష్టమైంది. భారతదేశం, 2,00,000 మంది సైనికులతో ఆపరేషన్ విజయ్‌ను చేపట్టింది. అయితే, అక్కడి నైసర్గిక పరిస్థితుల కారణంగా, డివిజన్, కార్ప్స్ స్థాయి కార్యకలాపాలను చేపట్టే అవకాశం లేదు. చాలా పోరాటాలు రెజిమెంటల్ స్థాయి లోనో బెటాలియన్ స్థాయి లోనో మాత్రమే జరుగుతాయి. ఫలితంగా, 20,000 మందితో కూడిన భారత సైన్యపు రెండు డివిజన్లు, [2] భారత పారామిలిటరీ బలగాలు, వైమానిక దళం నుండి అనేక వేల మందిని ఈ సంఘర్షణ ప్రాంతంలో మోహరించారు. భారత సైన్యం పూర్తి శక్తితో ఈ ప్రాంతంలోకి ప్రవేశించింది. చొరబాటుదారులు బాగా పాతుకుపోయినట్లు కనుగొన్నారు. ఫిరంగి దాడుల వలన కొన్ని ప్రాంతాలలో సత్ఫలితాలు కనిపించినప్పటికీ, మరింత మారుమూల ఉన్నవారికి వైమానిక దళం సహాయం అవసరం పడింది. పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉండేందుకు, భారత ప్రభుత్వం మే 25న, అంటే మొదటి నివేదికలు అందిన మూడు వారాల తర్వాత, చొరబాటుదారుల స్థానంపై దాడి చేయడానికి భారతీయ వాయుసేన ఫైటర్ జెట్‌లను - అవి భారత భూభాగంలోనే ఉండాలనే సూచనలతో - మే 25న పరిమిత వినియోగాన్ని మాత్రమే ఆమోదించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రణ రేఖను దాటరాదని IAF ను ఆదేశించారు.

ఎయిర్ కార్యకలాపాలు[మార్చు]

ఎయిర్ ఆపరేషన్ల సారాంశం[మార్చు]

ఒక్కో రకపు విమానాలు జరిపిన దాడుల మొత్తం సంఖ్యలు: [3]

రకం దాడుల సంఖ్య మొత్తం దాడుల్లో

%

రవాణా 3427 44.9%
హెలికాప్టర్లు 2474 32.4%
ఫైటర్స్ 1730 22.7%
మొత్తం 7831

టాస్క్ (ఫాస్ట్ జెట్‌లు) వారీగా ఎయిర్ ఆపరేషన్‌ల విభజన

పాత్ర దాడుల సంఖ్య మొత్తం దాడుల్లో

%

వైమానిక దాడులు 578 48%
CAP & ఎస్కార్ట్ 462 39%
రెక్కీ 159 13%
మొత్తం 1199

విమాన కార్యకలాపాల వివరాలు[మార్చు]

భారతీయ వైమానిక దళం (IAF) మే ప్రారంభం నుండి అక్కడ సాధారణ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ (ELINT), ఫోటో, వైమానిక నిఘాను నిర్వహిస్తోంది. మే 21 న, Wg Cdr CH కులకర్ణి, Sqn Ldr A పెరుమాళ్, Sqn Ldr యు.కె. ఝా 106 స్క్వాడ్రన్ నుండి కాన్‌బెర్రా PR57 విమానంలో నిఘా కోసం వెళ్ళినపుడు, చైనా నిర్మిత అంజా ఇన్‌ఫ్రారెడ్ క్షిపణి దాడికి గురైంది. [4] ఒక ఇంజను మాత్రమే పనిచేస్తున్న స్థితిలో ఆ విమానం సమీపంలోని శ్రీనగర్ IAF స్థావరానికి తిరిగి వచ్చింది. సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. భారత ప్రభుత్వం, పరిస్థితిని తీవ్రతరం చేయకూడదనే ఉద్దేశ్యంతో, ప్రమాదకరమైన రక్షణాత్మకమైన ఎయిర్ పవర్ వినియోగాన్ని పరిమితంగానే చేపట్టేలా మే 25 న ఆదేశాలిచ్చింది. ఇది పూర్తిగా నియంత్రణ రేఖకు భారతదేశం వైపున మాత్రమే చేపట్టాలమ్ని కూడా ఆదేశించింది. [5] [6] పాకిస్తానీ వైమానిక దళం నుండి ఎటువంటి వ్యతిరేకత ఎదురవ లేదు.

భారత వైమానిక దళం (IAF) మే 26న తన మొదటి ఎయిర్ సపోర్ట్ మిషన్‌లను శ్రీనగర్, అవంతిపోరా, ఆదంపూర్‌ల లోని ఎయిర్‌ఫీల్డ్‌ల నుండి నడిపింది. గ్రౌండ్ ఎటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ మిగ్-21 లు, మిగ్ -23లు, మిగ్-27 లు, జాగ్వార్‌లు, హెలికాప్టర్ గన్‌షిప్‌లు [7] చొరబాటుదారుల స్థానాలపై దాడి చేశాయి. మే 30న మిరాజ్ 2000 ఫ్లీట్‌ను కూడా చేర్చారు. MiG-21 లకు భూదాడి అనేది ద్వితీయ పాత్రే. దాని ప్రధానమైన పాత్ర గాలిలోనే శత్రు విమానాలను అడ్డుకోవడం. నిరోధాలు ఎక్కువగా ఉండే కార్గిల్ వంటి భూభాగంలో అవి చక్కగా పనిచెయ్యగలవు.

ప్రారంభ దాడుల్లో MiG-21లు, ఆ తరువాత MiG-29లు పాల్గొన్నాయి. టోలోలింగ్ సెక్టార్‌లో మిల్ ఎమ్‌ఐ-17 గన్‌షిప్‌లను కూడా మోహరించారు. [8] ఈ కాలంలో పౌర విమానాలు తిరక్కుండా శ్రీనగర్ విమానాశ్రయాన్ని మూసివేసి, పూర్తిగా భారత వైమానిక దళ వినియోగానికే కేటాయించారు. [7]

మే 27న ఇంజిన్ మంటల కారణంగా ఒక MiG-27 కూలిపోయింది. బటాలిక్ సెక్టార్ మీదుగా వెళ్తున్న ఒక MiG-21 ని పాకిస్తాన్ సైన్యం కూల్చివేసింది. [9] [10] అప్పటి Flt Lt K నచికేత MiG-27 ను నడిపాడు. ప్రయోగించిన క్షిపణుల ఎగ్జాస్ట్ గ్యాస్‌ను తీసుకోవడం వల్ల దాని ఇంజిన్ మండిపోయింది. MiG-21 లో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా, నచికేతకి ఎస్కార్టుగా వెళ్తున్నాడు. శత్రు ఉపరితలం నుండి వైమానిక క్షిపణుల రూపంలో శక్తివంతమైన ముప్పు ఉన్నప్పటికీ అతడు కూలిపోయిన MiG-27ని గుర్తించడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతని విమానాన్ని భుజంపై నుండి ప్రయోగించే స్ట్రింగర్ క్షిపణితో కూల్చివేసారు. అతను ప్రమాదం నుండి బయటపడ్డాడని, కానీ పాకిస్తాన్ సైనికులు అతన్ని చంపేసి ఉంటారని భారత సైన్యం నమ్ముతోంది. భారత అధికారులు చేసిన పోస్ట్‌మార్టం ప్రకారం అహుజా శరీరంపై రెండు పాయింట్-బ్లాంక్ బుల్లెట్ గాయాలు ఉన్నాయి. పాయింట్-బ్లాంక్ గాయాలు శత్రువు ఉద్దేశ్యాన్నీ, జెనీవా ఒప్పందాల ఉల్లంఘననూ స్పష్టంగా సూచించాయి. Flt లెఫ్టినెంట్ నచికేతను తరువాత పాకిస్తాన్ TVలో ఊరేగించారు; ఇది యుద్ధ ఖైదీల పట్ల జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారతదేశం ఆరోపించింది.

మరుసటి రోజు, టోలోలింగ్ సెక్టార్‌లో మూడు స్టింగర్ క్షిపణులు ఢీకొన్నప్పుడు, ఒక Mi-17 కూలిపోయి, నలుగురు సిబ్బంది మరణించారు. [8] ఈ నష్టాల కారణంగా భారత వైమానిక దళం తన వ్యూహాన్ని మార్చుకుని, హెలికాప్టర్లను ప్రమాదకర పాత్రల నుండి ఉపసంహరించింది.

మే 30 నుండి, లేజర్ గైడెడ్ బాంబులు (LGB) వేసే సామర్థ్యమున్న మిరాజ్ 2000ను రంగంలోకి దింపి, విస్తృతంగా ఉపయోగించారు. అధిక-ఎత్తు ప్రాంతాల్లో పనిచేసే అత్యుత్తమ విమానంగా దీన్ని పరిగణిస్తారు. మొదట్లో Wg Cdr సందీప్ చబ్రా నేతృత్వంలోని నం. 7 స్క్వాడ్రన్, డ్రాస్ సెక్టార్‌లోని ముంతో ధాలో, టైగర్ హిల్, పాయింట్ 4388 ల వద్ద మూడు రోజుల పాటు చొరబాటుదారుల స్థానాలను 250 కిలోల మామూలు బాంబులతో [8] దాడి చేసింది. జూన్‌లో మంచు తగ్గుముఖం పట్టడంతో, ఇప్పటివరకు దాగి ఉన్న పాకిస్తాన్ స్థావరాలు బయట పడ్డాయి. మిరాజ్ 2000, తదనంతరం అన్ని విమానాల ద్వారా పగలు, రాత్రి నాన్‌స్టాపుగా దాడులు చేసారు.

జూన్ చివరి వారాల్లో మిరాజ్‌లు, ఎల్‌జిబిలతో పాటు మామూలు బాంబులతో టైగర్ హిల్‌పై పాకిస్తానీల అక్రమ స్థావరాలపై పదే పదే దాడి చేసాయి. ఈ యుద్ధంలో కేవలం 9 LGB లను మాత్రమే ఉపయోగించారు - మిరాజ్ విమానలు ఎనిమిదీంటిని, జాగ్వార్ ఒకదాన్నీ వాడాయి. [8] మామూలు బాంబులు అత్యంత ప్రభావవంతమైనవిగా నిరూపితమయ్యాయి. జూన్ 24న LGB మిషన్లలో మొదటిదాన్ని (అప్పటి) చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ACM AY టిప్నిస్ పరిశీలించాడు. [8] LGB లన్నిటినీ రెండు-సీట్ల విమానాలే వేసాయి. వెనుక-సీటు లోని పైలట్, ఆయుధ వ్యవస్థల అధికారి (వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ -WSO) గా కూడా పనిచేసాడు.

ఈ యుద్ధంలో మిరాజ్ 2000 తన విలువను నిరూపించుకుంది. మామూలు బాంబులతో దాని ఖచ్చితత్వం ఎంతలా ఉందంటే, LGB-లతో కూడిన రెండు-సీట్ల విమానం మామూలు బాంబులను వేసే విమానాల వెనుక వెళ్తూ అవి బాంబులు వెయ్యడాన్ని వీడియో తీసాయి. శత్రువును నాశనం చెయ్యడంలో మామూలు బాంబులు పూర్తిగా సఫలం కాని సందర్భాల లోనే అవి తమ ఎల్‌జిబి లను ప్రయోగించేవి. [8] అందువల్లనే, ఎల్‌జిబి లను వాడాల్సిన అవసరం చాలా తక్కువగా ఏర్పడింది.

ఈ విమానాలన్నీ సముద్ర మట్టానికి 9,000-10,000 మీటర్ల ఎత్తులో, అవసరమైనప్పుడు డైవింగు చేస్తూ, మనుషులు మోసుకెళ్ళే క్షిపణులు (MANPAD) ల పరిధి నుండి బాగా దూరంగా వెళ్తూ పనిచేసాయి. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ కోసం అవసరమైన ఎయిర్‌స్ట్రిప్‌లు తక్కువ సంఖ్యలో ఉండడం కూడా వరసగా దాడులు చెయ్యలేకపోవడం, తక్కువ సామర్థ్యంతో పనిచెయ్యడానికి కారణమయ్యాయి. అయితే, చొరబాటుదారులపై వందలాది సార్టీలు చేసినప్పటికీ, ఎటువంటి ఇతర వస్తు, ప్రాణ నష్టాలు జరగలేదు. ఆ విధంగా పర్వత పోస్టులన్నిటినీ భారతీయ దళాలు క్రమంగా స్వాధీనం చేసుకున్నాయి. భారత వైమానిక దళం, "పాకిస్తానీ చొరబాటుదారులపైన, సరఫరా శిబిరాలు, ఇతర లక్ష్యాల పైన చేసిన వైమానిక దాడులు గొప్ప ఫలితాలను అందించాయి." అని వ్యాఖ్యానించింది.

అనంతర పరిణామాలు[మార్చు]

ఈ పరిమిత యుద్ధంలో నేర్చుకున్న పాఠాల పర్యవసానంగా భారత వైమానిక దళం దాని యుద్ధ విమానాలను ఉన్నతీకరించుకోవడం మొదలు పెట్టింది. 2000 ల ప్రారంభంలో రష్యా నుండి సుఖోయ్ ఎస్‌యు-30MKI హెవీ ఫైటర్‌లను కొనుగోలు చేయడం, ఆ తర్వాత వాటిని సహ-అభివృద్ధి చేయడం వీటిలో ఒకటి. తేజస్ యుద్ధ విమానం అభివృద్ధి, తయారీని కూడా వేగవంతం చేసారు. 

ఇవి కూడా చూడండి[మార్చు]

  • NJ9842, నియంత్రణ రేఖ ముగిసి, AGPL మొదలయ్యే బిందువు
  • ఇందిరా కల్, AGPL ముగిసే బిందువు

మూలాలు[మార్చు]

  1. "Guns and Glory Episode 7: 1999 Indo-Pak War in Kargil, Part 1". YouTube.
  2. . "Lessons from Kargil.". Archived 2009-04-08 at the Wayback Machine "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-04-08. Retrieved 2022-12-26.
  3. "Kargil War, Progress of Air Operations". VayuSena. States that the IAF and MoD Annual Report are the sources for this data.
  4. Lambeth, Benjamin (20 September 2012). Airpower at 18,000': The Indian Air Force in the Kargil War (Report).

    "Airpower at 18,000': The Indian Air Force in the Kargil War", Carnegie Endowment for International Peace, Washington, D.C., 20 September 2012
  5. "IAF planned to bomb targets in Pakistan during Kargil War". The Economic Times. 26 July 2017.
  6. "All you need to know about Kargil War". The Economic Times. 26 July 2018.
  7. 7.0 7.1 "India launches Kashmir air attack". BBC News. 26 May 1999.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 "The Mirage 2000 in Kargil". Bharat Rakshak. 16 October 2009. Archived from the original on 7 August 2011.
  9. "India loses two jets". BBC News. 27 May 1999.
  10. Dutta, Sujan (22 May 2006). "Flyer pushes frontier again – Nachiketa returns to area where his plane was shot down". The Telegraph (Kolkata). Archived from the original on 30 June 2007. Retrieved 18 September 2006.