ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు
దేశంభారత దేశము
ప్రదేశంపుట్టంగండి, పెద్ద అడిశర్ల పల్లి మండలం, నల్లగొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
ఆవశ్యకతసాగునీరు, తాగునీరు
నిర్మాణం ప్రారంభం1983
ప్రారంభ తేదీ2004
యజమానితెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం) తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, పెద్ద అడిశర్ల పల్లి మండలంలోని పుట్టంగండి గ్రామంలో ఉన్న ప్రాజెక్టు. నల్లగొండ జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు సాగు నీరు, తాగునీరు అందించే లక్ష్యంతో కృష్ణానదిపై ఈ ప్రాజెక్ట్‌ నిర్మించబడింది.[1]

ప్రారంభం[మార్చు]

నల్లగొండ జిల్లాలోని గ్రామాలకు సాగునీటికి, తాగునీటికి కృష్ణానది మాత్రమే ఆధారంగా ఉంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద రాని నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 1970, 1973లలో లోనే శ్రీశైలం ఎడమ గట్టు కాలువకు నీరు అందించాలని నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ నీటి కేటాయింపులు జరగలేదు.

1979 లిఫ్ట్‌ స్కీమును ప్రతిపాదించింది. నాగార్జునసాగర్‌ జలాశయం వెనుక తట్టు నుంచి నీటిని ఎత్తిపోయడానికి ఒక పథకం సర్వేకు, ఒక 1981 లో కోసం జీ ఓ 342 ద్వారా మరొక ఉత్తర్వును జారీ చేసింది. నల్లగొండ జిల్లాలోని సుమారు 3 లక్షల ఎకరాల ఎగువ భూములకు సాగునీరు, దారి పొడవున గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా నిర్మించే శ్రీశైలం ఎడమ కాలువ పథకం కోసం 1979 ఆగస్టు 7న జీవో 315 ద్వారా హై లెవెల్‌ కాలువ సర్వేకు, 1981 ఆగస్టు 1న జీవో 342 ద్వారా సమగ్ర సర్వే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాగార్జున సాగర్‌ జలాశయం నుండి పుట్టంగండి పంప్‌ హౌస్‌ ద్వారా నీటిని ఎత్తిపోసి అక్కంపల్లి జలాశయానికి చేర్చడంకోసం 46 కి మీ పొడవు కలిగిన గ్రావిటీ కాలువ తవ్వకానికి 1983 సెప్టెంబరు 1న ప్రభుత్వం జీవో 368 ద్వారా రు.1640.50 లక్షలకు అనుమతి లభించి అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు చేతులమీదుగా ప్రారంభించబడింది.[2]

అనేక కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. దాంతో, జల సాధన సమితి ఆధ్వర్యంలో నీటికోసం జిల్లావ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగాయి. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి 500లకు పైగా రైతులు, సామాన్య ప్రజలు నామినేషన్లు వేసి నీటి సమస్యను దేశం దష్టికి తీసుకుపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించింది. నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు నర్రా రాఘవ రెడ్డి, బద్దు చౌహాన్‌, నంద్యాల నరసింహారెడ్డి, ఉజ్జిని నారాయణరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరుల సహకారంతో శ్యాంప్రసాద్‌ రెడ్డి, పెంటారెడ్డి లాంటి తెలంగాణ ఇంజనీర్ల రూపకల్పనలో 100 మీ ఒకటే లిఫ్ట్‌ తో, నాగార్జున సాగర్‌ జలాశయం నుండి 510 మీ వద్ద నుంచే నీటిని ఎత్తిపోసే విధంగా ప్రాజెక్టును రూపకల్పన జరిగి, 2001లో లిఫ్ట్‌ స్కీము పనులు ప్రారంభమయ్యాయి. 2004లో పుట్టంగండి వద్ద పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఒక్కొక్క పంపు 600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగల సామర్థ్యంతో 18 మెగావాట్ల 4 పంపులను నిర్మించడంతో నీటిని లిఫ్ట్‌ చేయడం ప్రారంభమయ్యింది. నల్లగొండ జిల్లా రాజకీయ నాయకుడు కీ.శే. ఎలిమినేటి మాధవ రెడ్డి పేరుమీదుగా ఈ ప్రాజెక్టు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుగా పేరు మార్చడం జరిగింది.[1]

సామర్థ్యం[మార్చు]

ఎత్తిపోసే మొత్తం నీటి పరిమాణం 30 టిఎంసిలు కాగా, ఒక్కొక్క పంపు డిశ్చార్జ్‌ సామర్థ్యం 600 క్యూసెక్కులతో 18 మెవా సామర్థ్యం కలిగిన 4 పంపులు ఉన్నాయి.[3]

ఉపయోగం[మార్చు]

పుట్టgగండి ట్యాంక్ నుండి గురుత్వాకర్షణశక్తి ద్వారా 1.5 టిఎంసిఎఫ్ నిల్వ సామర్థ్యంతోవున్న అక్కంపల్లి రిజర్వాయర్ కి నీటిని పంపించి, అక్కడినుండి హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తారు.[4] నల్లగొండ జిల్లాలో 15 మండలాల్లోని 1,09,250 హెక్టార్లకు (2.70 లక్షల ఎకరాలు) సాగునీరు, ప్రాజెక్టు దారి పొడవున 516 ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరును అందిస్తుంది.

ఇతర వివరాలు[మార్చు]

  1. 2006, సెప్టెంబరు 26న ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేయబడింది.[2]
  2. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులోని టన్నెల్‌ పనులను 2022 ఏడాదిలో పూర్తిచేసే దిశగా పనులు సాగుతున్నాయి.[5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ మ్యాగజైన్ (10 April 2019). "ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్‌ (శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం)". magazine.telangana.gov.in. శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే. Archived from the original on 31 జూలై 2019. Retrieved 31 July 2019.
  2. 2.0 2.1 నవతెలంగాణ, దీపిక (10 December 2015). "తెలంగాణలో అతి పొడవైన నీటి కాలువ ఏది?". www.navatelangana.com. Archived from the original on 31 జూలై 2019. Retrieved 31 July 2019.
  3. "Expert suggests for full use of Puttamgandi pump house for Dindi project". Retrieved 31 July 2019.
  4. "Akkampalli Dam D06050". Archived from the original on 3 అక్టోబరు 2016. Retrieved 31 July 2019.
  5. సాక్షి, తెలంగాణ (13 January 2019). "ఎస్‌ఎల్‌బీసీకి రూ. 80 కోట్లు". Sakshi. Archived from the original on 31 జూలై 2019. Retrieved 31 July 2019.