జాతీయపతాక నియమావళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాతీయపతాక నియమావళి అనేది భారత జాతీయపతాక వాడకాన్ని నిర్దేశించే చట్టాల సమాహారం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాతీయపతాకం ఉత్పత్తి తగు నిర్దేశకాల ప్రకారమే జరిగేటట్లు పర్యవేక్షిస్తుంది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన శిక్ష తప్పదు. ఈ నియమావళిని Emblems and Names (Prevention of Improper Use) Act, 1950 (No.12 of 1950) and the Prevention of Insults to National Honour Act, 1971 (No. 69 of 1971) అనే రెండు చట్టాల్లోని అంశాలను కలిపి 2002లో రూపొందించారు.

ఈ నియమావళి చాలా కఠినంగా ఉందనీ, సాధారణ పౌరులు తమ ఇండ్లమీద, ఇతర భవంతులమీద జెండానెగరేసే అవకాశం లేకుండా చేసిందనీ విమర్శలుండేవి. చాలా సంవత్సరాలు కేవలం ప్రభుత్వ భవంతులమీదనూ, ప్రభుత్వాధికారులకూ మాత్రమే జెండానెగరేసే ఆధికారముండేది. 2001 లో నవీన్ జిందాల్ సుప్రీం కోర్టులో ఒక కేసు గెలవడంతో ఆ పరిస్థితి మారిపోయి దేశపౌరులందరికీ జెండానెగరేసే అవకాశం కలిగింది. జెండాను నడుం కిందిభాగంలోగాని, లోదుస్తులమీదగానీ ధరించరాదని నియమావళిని 2005లో సవరించారు.

ప్రోటోకాల్[మార్చు]

2002కు ముందు జాతీయ సెలవుదినాల్లో తప్ప మిగతాటప్పుడు జాతీయపతాకాన్ని ప్రజలు ఎగరేయడానికి అనుమతించేవారు కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే ఆ అధికారముండేది. ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ నవీన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. జిందాల్ తన కార్యాలయ భవంతి మీద జాతీయపతాకాని ఎగురవేయగా అధికారులు దాని స్వాధీనం చేసుకుని, ఆయన్ను ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు. జిందాల్ నిబంధనలకు అనుగుణంగా జాతీయపతాకాన్ని ఎగరేయడం పౌరుడిగా తన హక్కని, దేశం పట్ల తనప్రేమను ప్రకటించుకునే మార్గమని వాదించాడు.మూస:Inote ఆ కేసుమూస:Inote సుప్రీం కోర్టుకు వెళ్ళింది. సుప్రీం కోర్టు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని వేయమని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర మంత్రిమండలి పతాకం గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరైనా జాతీయపతాకాన్ని ఎగరేయవచ్చని అనుమతిస్తూ జాతీయపతాక నియమావళిని సవరించింది. ఈ సవరణ 2002-01-26 నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయపతాక నియమావళి అనేది చట్టం కానప్పటికీ, ఆ నియమావళి లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సుప్రీం కోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందాల్[1] కేసులో పేర్కొంది. జాతీయపతాకాన్ని ఎగరేసే హక్కు సంపూర్ణహక్కు కాదు. పరిమితులతో కూడిన హక్కు. దీన్ని భారత రాజ్యాంగంలోని 51A ఆర్టికల్‌లోని ప్రాథమిక విధులతో కలిపి అన్వయించవలసి ఉంటుంది.

పతాకాన్ని గౌరవించడం[మార్చు]

భారతీయ చట్టం ప్రకారం జెండాను ఎల్లవేళలా "గౌరవంతో, విధేయతతో" చూడాలి. The Emblems and Names (Prevention of Improper Use) Act, 1950 స్థానంలో వచ్చిన జాతీయపతాక నియమావళి - 2002 పతాకం వాడకం, ప్రదర్శనలకు సంబంధించిన నియమాల సమాహారం.


దీని ప్రకారం పతాకం ఎప్పుడూ నేలనుగానీ, నీటినిగానీ తాకరాదు. టేబుల్ క్లాత్ గా గానీ, ప్లాట్ ఫాం ముందుగానీ వాడరాదు. విగ్రహాలమీద, ఇతర వస్తువుల మీద గానీ కప్పరాదు. 2005 వరకు దుస్తులమీద, యూనిఫారాల్లో జెండాను వాడడం నిషిద్ధంగా ఉండేది. 2005-07-05 న సవరించబడిన నియమావళి ప్రకారం దుస్తులమీద, యూనిఫారాల్లో జెండాను వాడవచ్చు. ఐతే, నడుం కిందిభాగంలో, లోదుస్తులమీద వాడరాదు. జెండాను దిండుగలీబులమీద, చేతిరుమాళ్ళమీద ఎంబ్రాయిడర్ చేయడం కూడా నిషిద్ధం.


ఉద్దేశపూర్వకంగా జెండాను తలకిందులు చేయడం, దేంట్లోనైనా ముంచడం, ఆవిష్కరణకు ముందు పువ్వులు తప్ప ఇతర వస్తువులను జెండాలో ఉంచడం, జెండా మీద ఏదైనా రాయడం కూడా నిషిద్ధం.

పతాకానికి తీసుకోవలసిన జాగ్రత్తలు[మార్చు]

జెండా గౌరవాన్ని కాపాడడానికి పాటించవలసిన సాంప్రదాయిక నియమాలు అనేకం ఉన్నాయి. బహిరంగప్రదేశాల్లో వాతావరణపరిస్థితులతో నిమిత్తం లేకుండా సూర్యోదయమప్పుడు ఎగురవేసి, సూర్యాస్తమయమప్పుడు దించివేయాలి. ఐతే ప్రత్యేకపరిస్థితుల్లో పబ్లిక్ భవంతి మీద రాత్రిపూట కూడా ఎగరనివ్వవచ్చు.


జెండాను ఎప్పుడూ తలకిందులుగా చూపించరాదు, ఎగురవేయరాదు, చిత్రించరాదు. నిలువుగా ధరించినప్పుడు సరిగ్గా 90 డిగ్రీలు తిప్పడంతో బాటు జెండాను తిప్పి ధరించాలి. దారాలు ఊడిపోయిన, మురికిగా ఉన్న జెండాను ప్రదర్శించడమంటే జెండాను అవమానించడమే. పతాకావిష్కరణకు వాడే జెండాకఱ్ఱలకు, జెండాను కఱ్ఱకు కట్టే తాడుకు కూడా ఇలాంటి నియమాలే వర్తిస్తాయి. ఇవన్నీ సరైన స్థిలో ఉండేట్టు జాగ్రత్త వహించాలి.

జాతీయపతాక ప్రదర్శన[మార్చు]

పతాకప్రదర్శనను నిర్దేశించే నియమాల ప్రకారం రెండు జెండాలను పూర్తిగా విస్తరించి పోడియం వెనుక గోడ మీద సమాంతరంగా ప్రదర్శించినప్పుడు వాటికి కర్రలను తగిలించే చివరలు రెండూ ఒకదానికొకటి అభిముఖంగా ఉండాలి. జెండాను చిన్నకర్రకు తగిలించినప్పుడు గోడకు వాలుగా అందంగా కనిపించేటట్లు వేలాడదీయాలి. రెండు జాతీయపతాకాలను X ఆకారంలోని కర్రలకు తగిలించినట్లైతే రెండుజెండాలూ వ్యతిరేకదిశల్లో విస్తరించుకునేటట్లు తగిలించాలి. జాతీయపతాకాలను టేబుళ్ళు, వేదికలు, పోడియంలు, బిల్డింగుల మీద కప్పడానికి గానీ, రెయిలింగుల మీద అలంకరణ కోసంగానీ వాడకూడదు.

ఇతరదేశాల జాతీయపతాకాలతో[మార్చు]

మనదేశంలో బహిరంగప్రదేశాల్లో ఇతరదేశాల జాతీయపతాకాలతో కలిపి ఎగరేసేటప్పుడు ఇది కుడివైపు (చూసేవారి ఎడమచేతివైపు) మొట్టమొదటిదిగా ఉండాలి. మిగతా పతాకాలు ఇంగ్లీషులో ఆయాదేశాల పేర్లను బట్టి అక్షరక్రమంలో అమర్చాలి. అన్ని పతాకాలూ దాదాపు ఒకే పరిమాణంలో ఉండాలి. ఏ పతాకమూ ఈ పతాకం కంటే పెద్దదిగా ఉండకూడదు. అన్ని పతాకాలూ విడివిడిగా వేర్వేరు జెండాకర్రలమీద ఎగరెయ్యాలేగానీ ఏ ఒక్క జాతీయపతాకమూ మరొక జాతీయపతాకం మీద ఉండకూడదు.


అలాంటి సందర్భాల్లో పతాకాల వరస మొదట, చివర, అక్షరక్రమాన్ని బట్టి మధ్యలోనూ కూడా ఈ పతాకాన్ని ఎగరేయవచ్చు. పతాకాలను వృత్తాకారంలో ఎగరేసినప్పుడు ఈ పతాకం దగ్గరే వృత్తం మొదలై, సవ్యదిశలో తిరిగిరావాలి. ఈ పతాకాన్ని అన్నిటికంటే ముందు ఎగరేసి అన్నిటికంటే చివర అవనతం చెయ్యాలి.


X ఆకారంలో వాలుగా ఉంచిన కర్రలకు వేలాడదీసేటట్లైతే, పైన ఉన్న కర్ర మీదే ఈ జెండా ఉండాలి. అది కూడా కుడివైపున (చూసేవారికి ఎడమవైపున) ఉండాలి. ఒక్క ఐక్యరాజ్యసమితి జెండా మాత్రం ఎటువైపునైనా ఉండొచ్చు. వరసలో అన్నిటికంటే మొదట ఈ జెండాయే ఉండడం సంప్రదాయం.

జాతీయేతర పతాకాలతో[మార్చు]

జాతీయపతాకాలు కాని ఇతర పతకాలతో - కార్పొరేట్ పతాకాలు, అడ్వర్టైజింగ్ బానర్లు లాంటివాటితో - కలిపి ఎగరేసేటప్పుడు అన్నీ వేర్వేరు జెండాకర్రలమీదయలోనైనా ఉండాలి లేదా అన్నిటికంటే మొదట్లో - చూసేవారికి ఎడమవైపు చివరన వచ్చేటట్లు - ఉండాలి లేదా మిగతా పతాకాలన్నిటికంటే కనీసం ఒక జెండా వెడల్పు ఎత్తులో ఉండాలి. మిగతా జెండాలన్నీ దీనికి వెనుకే ఉండాలి. ఒకవేళ జెండాలన్నీ ఒకే కర్రమీద ఉన్నట్లైతే ఇదే అన్నిటికంటే పైన ఉండాలి. ఇతర జెండాలతో కలిపి ఊరేగింపులో తీసుకువెళ్ళేటప్పుడు ఇది ఊరేగింపు మొదట్లో ఉండాలి. జెండాలన్నిటినీ ఒకే వరసలో తీసుకెళ్ళేటప్పుడు ఇది కుడివైపున మొదటిదిగా ఉండాలి.

గదిలో పతాకాన్ని ప్రదర్శించడం[మార్చు]

పతాకాన్ని హాళ్ళలోగానీ, గదుల్లోగానీ నిర్వహించే సమావేశాల్లో వేదికల మీద ప్రదర్శించేటప్పుడు కుడివైపునే (చూసేవారికి ఎడమవైపున) ప్రదర్శించాలి - ఇది అధికారాన్ని సూచించే స్థానం కాబట్టి. వక్తలు ఉపన్యసించేచోటికి దగ్గరలో ఉన్నట్లైతే ఇది వారికి కుడిచేతి వైపునే ఉండాలి. వేరే ఎక్కడైనా ఉన్నట్లైతే సభికులకు కుడివైపున ఉండాలి.

కాషాయరంగు పైన ఉండేటట్లు పూర్తిగా విస్తరించి ప్రదర్శించాలి. నిలువుగా వేలాడదీసినట్లైతే కాషాయరంగు చూసేవారికి ఎడమచేతివైపున ఉండాలి.

కవాతులు, సంబరాల్లో[మార్చు]

ఊరేగింపుల్లోగానీ, పెరేడ్‌లలోగానీ, ఇతర జెండా(ల)తో కలిపి తీసుకువెళ్తున్నప్పుడు ఊరేగింపు ముందుభాగాన కుడివైపు మొదటిదిగా గానీ, మధ్యలో ఇదొక్కటే అన్నిటికంటే ముందుగానీ ఉండాలి. విగ్రహాలను, కట్టడాలను, శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్నప్పుడు ప్రత్యేక చిహ్నంగా జాతీయపతాకాన్ని వాడొచ్చు. కానీ వాటిని కప్పడానికి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. దేనికీ/ఎవరికీ గౌరవసూచకంగా దీనిని కిందికి దించరాదు. రెజిమెంట్ల పతాకాలను, వివిధ సంస్థల పతాకాలను మాత్రం దించవచ్చు.

పతాకావిష్కరణ జరుగుతున్నప్పుడు, పతాకాన్ని దించుతున్నప్పుడు, పెరేడ్‌లో పతాకాన్ని తీసుకువెళుతున్నప్పుడు, అక్కడున్నవాళ్ళందరూ పతాకం వైపు తిరిగి అటెన్షన్‌లో నిలబడాలి. యూనిఫాం లో ఉన్నవాళ్ళు తగినవిధంగా సెల్యూట్ చెయ్యాలి. పతాకవందనం అయిన తర్వాత జాతీయగీతం ఆలపించాలి.

వాహనాలపై ప్రదర్శన[మార్చు]

జాతీయపతాకాన్ని తమ వాహనాల మీద ఎగరేసే అధికారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, పార్లమెంటు, శాసనసభల సభ్యులు, లోక్‌సభ, శాసనసభల స్పీకర్లు, రాజ్యసభ, రాష్ట్రాల శాసనమండళ్ళ అధ్యక్షులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, సైనిక, నావికాదళ, వాయుసేనల్లోని ఉన్నతాధికారులకు మాత్రమే ఉంది.


వారికి అవసరమనిపించినపుడు తమ కార్ల మీద ఎగరేసుకోవచ్చు. కారు బాయ్‌నెట్ ముందు భాగంలో సరిగ్గా మధ్యలోగానీ, కుడివైపు చివరగానీ స్థిరంగా నిలబడిన కమ్మీకి తగిలించాలి. ఇతర దేశాల నాయకులు భారత ప్రభుత్వ వాహనంలో తిరుగుతున్నప్పుడు మన జాతీయపతాకం వాహనానికి కుడి వైపు చివరన, వారి జాతీయపతాకం ఎడమవైపు చివరన ఉండాలి.


రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు వారు ప్రయాణిస్తున్న విమానం మీద ఎగరేయాలి. దీనితోబాటు పర్యటిస్తున్న దేశపతాకం కూడా ఎగరేయాలి. ఐతే మధ్యదారిలో వేరే దేశంలో ఆగినట్లైతే పర్యటిస్తున్న దేశపతాకం స్థానంలో మర్యాదపూర్వకంగా ఆ దేశ పతాకాన్ని ఎగరేయాలి. రాష్ట్రపతి మనదేశంలోనే పర్యటిస్తున్నట్లైతే వారు ఏవైపునుంచి విమానంలోకి ఎక్కి దిగుతారో ఆ వైపున ఎగరేయాలి. ఒకవేళ వారు ప్రత్యేక రైల్లో ప్రయాణిస్తున్నట్లైతే రైలు బయలుదేరిన స్టేషను లోని ప్లాట్‌ఫారం వైపు కనిపించేటట్లు ఇంజన్ మీద ఎగరేయాలి. ఈ రైలు ఆగి ఉన్నప్పుడుగానీ, ఆగబోతున్న స్టేషను సమీపిస్తున్నప్పుడుగానీ మాత్రమే ఎగరేయాలి.

అవనతం[మార్చు]

రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం మాత్రమే సంతాపసూచకంగా పతాకాన్ని అవనతం (జెండా కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చెయ్యాలి. సంతాప కాల అవధి ఎంతో కూడా ఆ ఆదేశంలోనే పేర్కొనబడుతుంది. అవనతం చేసేటప్పుడు మొదట పతాకాన్ని పూర్తిగా ఎగరేసి తర్వాత నెమ్మదిగా కిందకు దించాలి. పతాకాన్ని తీసేసేముందు దాన్ని పూర్తి ఎత్తుకు ఎగరేసి తర్వాతనే కిందికి దించాలి. భారత జాతీయపతాకం ఒక్కదాన్నే అవనతం చెయ్యాలి. ఇతరదేశాల పతాకాలు మామూలుగానే ఎగురుతాయి.


రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల్లో ఎవరు మరణించినా దేశవ్యాప్తంగా అవనతం చేయబడుతుంది. లోక్‌సభ స్పీకరు లేక సుప్రీమ్‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరణిస్తే ఢిల్లీలోను, కేంద్ర క్యాబినెట్ మంత్రి మరణిస్తే ఢిల్లీ, రాష్ట్రాల రాజధానుల్లోను, సహాయమంత్రి మరణిస్తే ఢిల్లీలోను, రాష్ట్రాల లేక కేంద్రపాలితప్రాంతాల గవర్నరు/లెఫ్టినెంట్ గవర్నరు లేక ముఖ్యమంత్రి మరణిస్తే ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల్లోను అవనతం చేయబడుతుంది.


పైవారిలో ఎవరైనా చనిపోయినట్లు మధ్యాహ్నం తర్వాత సమాచారం తెలిసి, మరుసటిరోజు సూర్యోదయం లోపల అంత్యక్రియలు జరగకపోయినట్లైతే పైన పేర్కొన్నచోట్ల మరుసటిరోజు కూడా అవనతం చేసి ఉంచాలి. పైవారికి అంత్యక్రియలు జరిగేరోజు అవి జరిగేచోట కూడా అవనతం చేసి ఉంచాలి.


స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్రదినోత్సవం, గాంధీ జయంతి, జాతీయవారోత్సవాలప్పుడు (ఏప్రిల్ 6 నుంచి 13 వరకు), ఏదైనా రాష్ట్రావతరణం రోజు అవనతం చెయ్యవలసి వస్తే సదరు మృతదేహమున్న భవంతి మీద మాత్రమే అవనతం చేసి ఉంచాలి - అది కూడా మృతదేహాన్ని అక్కడినుంచి బయటకు తెచ్చేటంతవరకు మాత్రమే.


విదేశీ ప్రముఖులు చనిపోయినప్పుడు అవనతం చెయ్యడం హోం మంత్రిత్వశాఖ ఇచ్చే ప్రత్యేక సూచనలను బట్టి ఉంటుంది. ఐతే ఎవరైనా దేశనేత చనిపోయినప్పుడు ఆ దేశంలోని భారతకార్యాలయం అవనతం చెయ్యవచ్చు.


అధికార, సైనిక, పారామిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేటప్పుడు శవపేటిక మీద తలవైపు కాషాయరంగు వచ్చేటట్లు కప్పాలి. ఐతే దానిని ఖననం/దహనం చేసే ముందు తీసేయాలి. శవంతోబాతు గుంతలోకి దించడం, కాల్చడం చెయ్యరాదు.

విసర్జన[మార్చు]

పతాకం ఉపయోగించుకోలేని పరిస్థితికి చేరినపుడు దానిని సగౌరవంగా విసర్జించాలి. తగులబెట్టడం లేదా భూమిలో పాతిపెట్టడం చేయాలి.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. (2004) 2 SCC 510