పర్వతనేని వీరయ్య చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పర్వతనేని వీరయ్య చౌదరి (1886 - 1970) స్వాతంత్ర్య సమర యోధుడు. సత్యాగ్రహి. కళాతపస్వి. వైణిక విద్వాంసుడు. పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమ నాయకుడు [1]. ఆంధ్ర శివాజీగా కీర్తి గడించాడు.

పర్వ తనేని వీరయ్యచౌదరి
ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి
జననం1886 అక్టోబరు 4
గుంటూరు జిల్లా,పెదనందిపాడు
మరణం1970 ఫిబ్రవరి 8
ప్రసిద్ధిపెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం
తల్లిదండ్రులులక్ష్మయ్య, అంకమ్మ

బాల్యం,విద్య[మార్చు]

పర్వ తనేని వీరయ్యచౌదరి గుంటూరు జిల్లా, పెదనందిపాడులో లక్ష్మయ్య, అంకమ్మ దంపతులకు 1886 అక్టోబరు 4న జన్మించారు. చిన్నతనంలోనే దక్షిణాదికి వెళ్లి సంగీతంలో శిక్షణను పొంది హరికథా విద్వాంసుడిగా గుర్తింపు పొందారు.[2]

పెదనంది పాడులో మిత్రుల సహకారంతో పోస్టాఫీసు, పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారు. కళాకారుడిగా హరిశ్చంద్ర వంటి నాటకాలలో నటించారు. త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన కురుక్షేత్ర సంగ్రామం నాటకంలో పర్వతనేని కృషుడి పాత్రలు ధరించగా ప్రతీహారి పాత్రను ఆచార్య రంగా పోషించారు. తుమ్మల సీతారామమూర్తి రాసిన పద్యాలకు బాణీలను కట్టి సభల్లో ఆలపించేవారు[2].

స్వాతంత్ర పోరాటం లో[మార్చు]

గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన పర్వతనేని స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలోని అన్ని ఘట్టాలలో కీలకపాత్ర వహించారు. 1921లో పన్నుల సహాయ నిరాకరణ ఉద్య మాన్ని పర్వతనేని నాయకత్వంలో పెదనందిపాడు ప్రాంతంలో నిర్వహిం చడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. పన్నులు వసూలు చేసే ప్రభుత్వోద్యోగులను సాంఘిక బహిష్కరణ చేయాలని పర్వతనేని పిలుపు నిచ్చారు. పెదనందిపాడు ప్రాంతంలో ఆరువేల మంది యువకులతో శాంతి సైనికులను తయారు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వానికి పన్నులు చెల్లించవద్దని గుర్రంపై తిరుగుతూ ఊరూరు తిరిగి విస్త్రుతంగా ప్రచారం చేసారు. గ్రామాలలో కచేరిలు, బుర్ర కథలు ఏర్పాటు చేసి ప్రజలలో దేశ భక్తిని రగిల్చారు.

1921 డిసెంబరు 12 న పాలపర్రు గ్రామంలో బ్రిటీష్ పాలకులకు వేతిరేకంగా రైతు సభను నిర్వహించారు. ఒక్క పైసా పన్నుకూడా ప్రభుత్వానికి చెల్లించకుండా ప్రజలను కట్టడి చేసారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన ఉద్యమాలలో ప్రధానమైనదిగా పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం గుర్తింపు పొందింది. ఉద్యమ నాయకునిగా చెరసాలకు వెళ్ళారు.[3]

పర్వతనేనిని ఆంధ్రా శివాజీ, దక్షిణ బార్టోలి నాయకుడిగా ప్రజలు కీర్తించారు.

మహాత్మాగాంధీ పెదనందిపాడును సందర్శించినప్పుడు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గాంధీ విజయం నాటకంలో ప్రముఖ పాత్రను పోషిం చారు. విదేశి వస్తు భహిష్కరణ, మద్యపాన వేతిరేక ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించారు.

చరమాంకం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులుగా వ్యవహరించిన పర్వత నేని హైదరాబాద్ రేడియో శ్రోతల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. పెదనదిపాడులో హైస్కూలు, గ్రంథాలయం ఏర్పాటులో కృషి చేసారు. దేశ భక్తి, వీరత్వంలో ఆంధ్ర శివాజీగా పేరుగాంచిన వీరయ్యచౌదరి గారు 1970 ఫిబ్రవరి 8న హైదరాబాదులో కన్నుమూశారు.

పర్వతనేని వీరయ్య చౌదరి త్యాగానికి గుర్తుగా వారి విగ్రహాన్ని పెదనదిపాడు ప్రధాన కూడలిలో ప్రతిష్ఠించారు[3].

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-07-12. Retrieved 2016-07-17.
  2. 2.0 2.1 శ్రీరాములు, రావినూతల (2019). ఆంధ్రశివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి. విజయవద: ఎమస్కో బుక్స్. ISBN 978-93-88492-46-1.
  3. 3.0 3.1 "సమర యోధుడు వీరయ్య చౌదరి". ఈనాడు దినపత్రిక. 15 August 2021.