పార్శీ వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పార్శీ వెంకటేశ్వర్లు ప్రముఖ కవి, తత్వవేత్త. ఆయన ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఆలోచనా విధానంతో భావ కవిత్వమే బాసటగా, సాహితీ వ్యాసంగమే లక్ష్యంగా ముందుకుసాగిన ప్రముఖ కవి.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని శివునిపల్లి గ్రామంలో పార్శీ రామయ్య, గోదాదేవి దంపతులకు 1936 జూలై 10న జన్మించారు. బాల్యం నుంచీ వెంకటేశ్వర్లులో పరోపకార గుణం మెండుగా ఉండేది. ఎవరైనా సాయం కోసం వస్తే లేదనకుండా సహాయం చేసేవారు. తరువాత ఆయన ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఆలోచనలకు ప్రభావితులైనారు. కృష్ణమూర్తి వద్ద కొంతకాలం శిష్యునిగా ఉన్నారు. తరువాత హిందీ చలన చిత్ర దర్శకుడైన మహేష్‌భట్ తో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే ప్రముఖ కవి వీ.ఆర్‌.విద్యార్థి, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, వేలూరి సదాశివరావు, బీ.సీ.రామమూర్తి, పీ.ఎల్‌.కాంతారావులతో పరిచయం ఏర్పడింది. గొప్పవారితో స్నేహంతో ఆయన జీవన శైలి, జీవిత లక్ష్యాలు మారాయి. ఆ ప్రభ్యావంతో తన స్వగృహంలో మేధావులు, సామాజికవేత్తలతో ఆయన తాత్విక చర్చలు నిర్వహించేవారు.[1]

1985 సంవత్సరంలో కొంతమంది మిత్రులతో కలసి ‘సాహితీ సుధ’ అనే సాహిత్య సంస్థను స్థాపించారు. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన నిర్వహించే సాహితీ చర్చాగోష్టులకు కాళోజీ రామేశ్వర్‌రావు, కాళోజీ నారాయణరావు, అనుముల కృష్ణమూర్తి, పొట్లపల్లి రామారావు తదితర సుప్రసిద్ధ సాహితీవేత్తలు హాజరయ్యేవారు. ఆయన ‘కవితా మయూరి’, ‘శబ్దం–నిశ్శబ్దం’ పేరిట కవితా సంపుటాలను వెలువరించారు. ‘నెలవంక’ అనే సాహితీ మాసపత్రికను ప్రచురించేవారు. సాహితీసుధ, సాహిత్య వికాస వేదిక ను స్థాపించి ఎందరో వర్థమాన కవులకు ఊతం ఇచ్చిన సాహితీ పోషకులు ఆయన. నెలవంక అనే సాహిత్య మాస పత్రికను శ్రీ నెల్లుట్ల రాధా కిషన్ రావు గారి సంపాదకత్వం లో ప్రారంభించి ఎందరో నవ యువ కవుల రచనలను అచ్చులో వేసి వెన్నుతట్టిన సాహిత్యకారుడాయన.

పురస్కారాలు, గౌరవాలు[మార్చు]

  • పాలకుర్తి సోమనాథ కళాపీఠం వారు ‘తత్వదర్శి’ బిరుదుతో గౌరవించారు.
  • మడికొండ పురజనులు వైశ్యరత్న బిరుదుతో సత్కరించారు.
  • వరంగల్‌ జిల్లా యంత్రాంగం ఉత్తమ సాహితీవేత్తగా సత్కరించింది.
  • 2012 సంవత్సరంలో అప్పటి కలెక్టర్‌ కిషన్‌ చేతులమీదుగా తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందుకున్నారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయనకు భార్య ఉమాదేవి, కుమారులు నవీన్, కమల్, కుమార్తెలు రమ,ప్రణతి ఉన్నారు. ఆయన ఆగస్టు 23, 2016 న మరణించారు.[2]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]