మంగిపూడి రాధిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగిపూడి రాధిక చిత్రం

మంగిపూడి రాధిక రచయిత్రి, శతక కవయిత్రి, వక్త, వ్యాఖ్యాత, “శ్రీ సాంస్కృతిక కళాసారథి“ సింగపూర్[1] కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు, “గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం” సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు[2] [3]

నేపధ్యం[మార్చు]

మంగిపూడి రాధిక స్వస్థలం విజయనగరం. ఆమె తండ్రి కొటికలపూడి కూర్మనాధం 18 పుస్తకాలను ప్రచురించిన ప్రముఖ కవి, గేయ రచయిత, మహారాజా కళాశాల ఆంగ్ల అధ్యాపకులు. తల్లి శ్రీమతి మంగతాయారు గారు కూడా రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు.రాధిక ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి శంకరాద్వైతం ప్రత్యేక పాఠ్యాంశంగా తత్త్వశాస్త్రంలో 2002లో యమ్.ఏ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం తత్త్వశాస్త్రంలోనే పి హెచ్ డి పరిశోధన చేస్తున్నారు.

సాహిత్య రంగం[మార్చు]

2016లో సింగపూర్ లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సులో వక్తగా పత్ర సమర్పణ చేయడంతో ఆమె సాహితీ ప్రస్థానం మొదలైంది, వివిధ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన కవిసమ్మేళనాలలో కూడా పాల్గొన్నారు. వీరి కవితలు, కథలు వివిధ పత్రికలలో, అంతర్జాతీయ కథాసంకలనాలలో ప్రచురింపబడ్డాయి.[4] రాధిక మంగిపూడి రాసిన కథా సంపుటులను వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారు ప్రచురించగా, ‘భారతీయ తత్త్వ శతకము’ పుస్త‌కాన్ని ‘తటవర్తి గురుకులం’ ఆస్ట్రేలియా సంస్థ ప్ర‌చురించింది[2]

వివిధ విశ్వ విద్యాలయాలు & కళాశాలలు నిర్వహించిన 70 కి పైగా సదస్సులలో, కవి సమ్మేళనాలలో అతిధిగా పాల్గొన్నారు. నిర్వాహకురాలిగా సింగపూర్ నుండి జరిగిన "అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం 2020" "అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021" కార్యక్రమాల ప్రణాళికా రచనలో కీలక పాత్ర వహించారు. 7వ & 8వ ప్రపంచ తెలుగు సాహితి సదస్సులకు ప్రధాన నిర్వాహక వర్గ సభ్యురాలుగా సేవలందించారు. సుమారు 80 అంతర్జాతీయ కార్యక్రమాలకు సభానిర్వహణ గావించారు. "7వ ప్రపంచ తెలుగు సాహితి సదస్సు సభా విశేష సంచిక" సహా సంపాదకురాలిగా ఉన్నారు.[5] సింగపూర్ నుండి ప్రసారమైన రేడియో కార్యక్రమాలకు సమన్వయకర్తగా పనిచేశారు. వంశీ సంస్థ సంవత్సరకాలం పాటు నిర్వహించిన "ఘంటసాల స్వరరాగ మహాయాగం" కార్యక్రామానికి ప్రధాన సమన్వయకర్త.

"అలా సింగపురంలో" పేరుతో సింగపూర్ లో తెలుగు వారు కలిసి తీసిన లఘు చిత్రానికి, తెలుగు సంస్కృతిపై ఆధారితమైన కథ, సంభాషణలు అందించి పలువురు సినీ ప్రముఖుల మన్ననలు అందుకున్నారు. ఏ బి ఎన్, భారత్ టుడే, డి డి యాదగిరి, టీవీ షో లలో అతిధిగా పాల్గొన్నారు. వివిధ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు. వివిధ అవధానాలలో పృచ్చకురాలిగా పండితుల సరసన పాల్గొన్నారు. ఆమె ఇంటర్వ్యూలు పలు పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వివిధ టీవీ, యూట్యూబ్ చానళ్లలో ప్రసారం అయ్యాయి.

రచనలు[మార్చు]

  • 2019లో "భావ తరంగాలు" పేరుతో ఆమె వ్రాసిన తొలి కవితా సంపుటి ప్రచురితం అయ్యింది.
  • 2020లో "అలా సింగపురంలో" అనే కథా సంపుటి “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” వారిచే ప్రచురింపబడి, ప్రముఖ సినీ రచయిత భువన చంద్ర చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది.[6]
  • 2021లో “తటవర్తి గురుకులం” ఆస్ట్రేలియా ప్రచురణలో, ప్రాచీన భారతీయ తత్వశాస్త్ర సారాన్ని ఆటవెలది పద్యాల రూపంలో రచించి “భారతీయ తత్త్వ శతకము” అనే పుస్తకంగా ప్రచురించారు.
  • 2022లో “వంశీ ఆర్ట్ థియేటర్స్” స్వర్ణోత్సవ ప్రచురణగా “నవ కవితా కదంబం” కవితా సంపుటి భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులమీదుగా హైదరాబాద్ లో ఆవిష్కరించబడింది.
  • 2022లో “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” ప్రచురణగా “మరో మాయాబజార్” కథా సంపుటి న్యూజీల్యాండ్ దేశంలో ప్రముఖ కవి జొన్నవిత్తుల చేతులమీదుగా ఆవిష్కరించబడింది.

సాంఘిక సేవా రంగం[మార్చు]

ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం" ఫేస్బుక్ గ్రూపు ద్వారా 40 వేల మంది సభ్యులను ఒక వేదిక మీదకు చేర్చి విజయనగర సమాచారం అందుబాటులోకి తెస్తున్నారు, దీనికి అనుబంధంగా GHV ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు సేవా చేపడుతున్నారు,[7] వంశీ ఇంటర్నేషనల్, రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్, జనరంజని ముంబై, వీధి అరుగు నార్వే, నవసాహితి చెన్నై, అక్షరయాన్, మహారాష్ట్ర రచయితల సంఘం, మొదలైన సంస్థలలో గౌరవ సభ్యురాలిగా సేవలందిస్తున్నారు.

పురస్కారాలు & సత్కారాలు[మార్చు]

  • సింగపూర్ లో నివసించే తెలుగు రచయితలలో తొలి కథా సంకలనాన్ని వెలువరించిన రచయిత్రిగా "తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్"లో స్థానం సంపాదించుకున్నారు.
  • 2019లో "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" వారు నిర్వహించిన ఉగాది కథల పోటీ ప్రథమ బహుమతి నగదు పురస్కారం అందుకున్నారు.
  • 2020లో సింగపూర్లో తెలంగాణ ప్రభుత్వం, NRI కల్చరల్ సొసైటీ & PRAD సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "ఉమెన్ ఎక్సలెన్సీ పురస్కారం" అందుకున్నారు.
  • తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా "దక్షిణాఫ్రికా తెలుగు సంఘం" & "వీధి అరుగు" నార్వే సంయుక్త ఆధ్వర్యంలో “అంతర్జాతీయ ప్రవాస తెలుగు పురస్కారం – 2021” అందుకున్నారు.[8]
  • వంశీ స్వర్ణోత్సవాల సందర్భంగా “స్వర్ణ వంశీ శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారం 2022” అందుకున్నారు.
  • రక్షా ఇంటర్నేషనల్ పౌండేషన్ వారి “మాతృశ్రీ ఊటుకూరు రత్నసుందరి అంతర్జాతీయ సాహితీ పురస్కారం- 2022” అందుకున్నారు.
  • ముంబైలో తెలుగు కళా సమితి వారి సంక్రాంతి పురస్కారం అందుకున్నారు.
  • వ్యాఖ్యాతగా  సింగపూర్ లో  శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ముప్పవరపు వెంకయ్య నాయుడు, మాధవపెద్ది సురేష్,,  విశ్రాంత  డిజీపి  కరణం అరవింద్ రావు చేతుల మీదుగా వివిధ సభలలో సన్మానింపబడ్డారు.
  • విజయవాడలో ఐదవ ప్రపంచ రచయితల మహాసభలలో "ప్రపంచ రచయితల సంఘం" సత్కారం, హైదరాబాదులో రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ వారి మాతృ దినోత్సవ సత్కారం,  విజయనగరంలో "కౌముదీ పరిషత్తు" సత్కారం, "మహారాజా సంస్కృత కళాశాల" సత్కారం, సింగపూర్ లో "తెలుగు భాగవత ప్రచార సమితి" సత్కారం  మొదలైన సత్కారాలు అందుకున్నారు.

మూలాలు[మార్చు]

  1. "| Sri Samskrutika Kalasaradhi | Singapore |". www.ssks.sg. Retrieved 2022-08-28.
  2. 2.0 2.1 telugu, NT News (2021-12-12). "Radhika Mangipudi | రాధిక మంగిపూడి 'భారతీయ తత్త్వ శతకము' ఆవిష్క‌ర‌ణ‌". Namasthe Telangana. Retrieved 2022-08-25.
  3. "రాధిక మంగిపూడి 'భారతీయ తత్త్వ శతకము' ఆవిష్కరణ". EENADU. Retrieved 2022-08-25.
  4. "రచయిత్రి మంగిపూడి రాధికకు ప్రవాస తెలుగు పురస్కార ప్రదానం". m.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2021-08-29. Retrieved 2022-08-25.
  5. Vanguri Chitten Raju, Radhika Mangipudi and Sai Rachakonda | Authors | Home - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.
  6. MANGIPUDI, RADHIKA (2020-09-24). "FIRST TELUGU RESIDENT, OF SINGAPORE TO PUBLISH A BOOK OF TELUGU SHORT STORIES | telugu book" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-28.
  7. India, The Hans (2017-05-17). "Capitalising on the potential of Facebook for a constructive and altruistic cause". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-08-25.
  8. "Radhika Won Foreign Telugu Awards". SWARA MAGAZINE (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-08-26. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.