వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 06వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పంచవర్ష ప్రణాళికలు

1947 లో భారతదేశానికి ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మనదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘం ను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. పార్లమెంటులో ప్రణాళికల గురించి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య స్థాపనకు దోహదం చేస్తూ ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో ప్రగతిని సాధించడమే ఆర్థికప్రణాళికల ముఖ్యోద్దేశ్యం అని పేర్కొన్నాడు. ఇంతవరకు మనదేశంలో 10 పంచ వర్ష ప్రణాళికలు పూర్తి కాగా ప్రస్తుతం 11 వ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభ దశలో ఉంది.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934 లో రచించిన ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థకు దారిచూపింది. కాబట్టి అతనిని దేశ ప్రణాళిక వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణించవచ్చు. 1938 లో దేశంలో జాతీయ ప్రణాళిక కమిటీని స్థాపించారు. 1944 లో బాంబే ప్రణాళిక రూపకల్పన జర్గింది. జాతీయ నాయకులైన దాదాభాయి నౌరోజీ, ఎం.జి.రణడే, శ్రీమన్నారాయణ, ఎం.ఎన్.రాయ్ తదితరులు తమ రచనల ద్వారా, ఇతరేతర కృషి ద్వారాభారత ప్రణాళికా విధానం మూల భావాలను సమగ్రంగా రూపొందించారు. అయిననూ దీని ఒక నిర్దుష్ట రూపం ఇచ్చినది మాత్రం జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు. 1950 లో ఆర్థిక సంఘం స్థాపించబడింది. 1952 డిసెంబర్ లో మొదటి పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను పార్లమెంటు ఆమోదించింది.

1947 లో స్వాతంత్రం పొందిన మనదేశం ప్రతి అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేకుండా ప్రణాళిక బద్దంగా రూపొందిన లక్ష్యాల ఆధారంగా అభివృద్ధిని సాధించడం పంచవర్ష ప్రణాళికల విజయమేనని చెప్పవచ్చు. ప్రారంభంలో ఎన్ని ఆటంకాలు ఎదురైననూ అభివృద్ధిపథం వైపు పయనించడానికి ప్రణాళికలు కృషిచేశాయి. పంచవర్ష ప్రణాళికల వల్ల ఎన్నో విజయాలు సాధించిననూ అవి నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు చూస్తే ఎన్నో అపజయాలు, వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడతాయి. ఇంకా....పూర్తివ్యాసం పాతవి