శ్రీనాథుడు

వికీపీడియా నుండి

(శ్రీనాధుడు నుండి దారిమార్పు చెందింది)

శ్రీనాథుడు కొండవీటి రెడ్డిరాజుల ఆస్థాన కవి. ఈతడు 15వ శతాబ్దమున జీవించినాడు. ఈతనికి కవిసార్వభౌముడ ను బిరుదము కలదు. శ్రీనాథుడు గొప్ప కవి. ఇతను ఎన్నో కావ్యాలు రచించినాడు. వాటిలో కొన్ని: భీమ ఖండము, కాశీ ఖండము, మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము మొదలగునవి. ఈయన వ్రాసిన చాటువులు ఆంధ్రదేశమంటా బహు ప్రశస్తి పొందినాయి. ఈయన పోతన కు సమకాలీనుడు, బంధువు.

విషయ సూచిక

[మార్చు] రచనలు


కాశీఖండమునందు చెప్పుకున్నట్టుగా

చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు
రచియించితి మరుత్తరాట్చరిత్ర.
నూనుగు మీసాల నూత్న యౌవనమున
శాలివాహన సప్తశతి నుడివితి.
సంతరించితి నిండు జవ్వనంబునయందు
హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని
యాడితి భీమనాయకుని మహిమ
ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మను మహాగ్రంథ మేను
తెనుఁగు జేసెదఁ గర్ణాటదేశ కటక
పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.

[మార్చు] శ్రీనాథుని జీవిత విశేషాలు తెలిపే కొన్ని పద్యాలు

దీనారటంకాల దీర్థమాడించితి
                దక్క్షిణాధీశు ముత్యాలశాల,
పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య
               నైషధగ్రంథ సందర్భమునకు,
పగులగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి
               గౌడడిండిమభట్టు కంచుఢక్క,
చంద్రభూష క్రియాశక్తి రాయలయొద్ద
               పాదుకొల్పితి సార్వభౌమ బిరుద,
మెటుల మెప్పించెదో నన్ను నింకమీద
రావు సింగ మహీపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సకలసద్గుణ నికురంబ! శారదాంబ!

కవిరాజుకంఠంబు కౌగిలించెనుగదా
                పురవీధినెదురెండ బొగడదండ,
సార్వభౌముని భుజాస్కంధ మెక్కెనుగదా
                నగరివాకిటనుండు నల్లగుండు,
ఆంధ్రనైషధకర్త యంఘ్రి యుగ్మంబున
                దగలియుండెనుగదా నిగళయుగము,
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత
                వియ్యమందెనుగదా వెదురుగొడియ,
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు?


కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి
                 రత్నాంబరంబు లే రాయడిచ్చు?
కైలాసగిరి బండె మైలారువిభుడేగె
                 దినవెచ్చ మేరాజు దీర్పగలడు?
రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు
                 కస్తూరి కేరాజు ప్రస్తుతింతు,
స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ
                 పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు?
భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె
కలియుగంబున నిక నుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.

[మార్చు] శ్రీనాథుని చాటువులు

శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ రెండుపద్యాలూ అవధరించండి.

కుల్లాయుంచితి, కోకసుట్టితి, మహాకూర్పాసమున్ బెట్టితిన్,
వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లాయంబలి ద్రావితిన్, రుచులు దోసంబంచు పోనాడితిన్,
తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్ .


కవితల్ సెప్పిన పాడనేర్చిన వృధాకష్టంబె, యీ భోగపుం
జవరాండ్రేగద భాగ్యశాలినులు, పుంస్త్వంబేటికే పోగాల్పనా ?
సవరంగాసొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టించుచో
యెవరేనిన్ మదిమెచ్చి ధనంబులిత్తురుగదా నీరేజపత్రేక్షణా!

నీలాలకా జాల ఫాల కస్తూరికా తిలకంబు నేమిట దిద్దువాడ నంగనాలింగనా నంగ సంగర ఘర్మ శీకరం బేమిట జిమ్మువాడ మత్తేభగామినీ వృత్తస్తనంబుల నెలవంక లేమిట నిల్పువాడ భామామణీ కచాభరణ శోభితమైన పాపట నేమిట బాపువాడ ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పరిచి కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి … అహహ పోయె నా గోరు తన చేతి పోరు మాని

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు