సత్యాగ్రహం
వికీపీడియా నుండి
సత్యాగ్రహం అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ మరియు ఉపవాసదీక్ష ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. మహాత్మా గాంధీ సెప్టెంబరు 11, 1906 న దక్షిణ ఆఫ్రికా లో దీనిని ప్రారంభించాడు. అంతేకాక స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఇది ప్రముఖ పాత్ర పోషించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పౌర హక్కుల ఉద్యమ కాలంలో ఈ ఉద్యమం మార్టిన్ లూథర్ కింగ్ ను కూడా ఈ ఉద్యమం బాగా ప్రభావితం చేసింది. గౌతమ బుద్ధుడు ప్రవచించిన "అహింసా పరమోధర్మ:" అన్న సూత్రం, యేసు క్రీస్తు అన్నట్టు, "ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమన్న" ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి. సత్యం కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం.
సాంప్రదాయ పద్దతిలో జరిగే హింసాయుత లేదా అహింసాయుత పోరాటంలో ప్రత్యర్థిని ఓడించడం, లేదా ప్రత్యర్థి తన లక్ష్యాన్ని చేరుకోకుండా నిరోధించడం, లేదా ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అన్నవి ముఖ్యాంశాలు. కానీ సత్యాగ్రహ విధానంలో తప్పు చేసే వారిని బలవంతంగా ఆపకుండా వారిలో మార్పును తీసుకురావడం ముఖ్య లక్షణం.