సోమశిల ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెప్టెంబరు 2018లో సోమశిల ఆనకట్ట

ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సోమశిల వద్ద పెన్నా నదిపై నిర్మించిన భారీ సాగునీటి ప్రాజెక్టు సోమశిల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1971లో ప్రారంభమైంది. ప్రస్తుతం దీనిలో 70 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించటం, అయితే ఇంకా కాలువల తవ్వకాలు, ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి సాగునీటిని, తాగునీటిని అందించేందుకు నాలుగు కాలువలు ఉన్నాయి. వీటిలో ఒకటైన కావలి కాలువ ద్వారా 31 చెరువులకు నీటి సౌకర్యం ఏర్పడింది. ఈ కాలువ నుంచి ఖరీఫ్‌లో 10,400 హెక్టార్లకు, రబీలో 20,890 హెక్టార్లకు సాగునీరు అందుతోంది. వీటిలో మరొకటైన కనుపూరు కాలువ ద్వారా ఖరీఫ్‌లో 7,080 హెక్టార్లకు, రబీలో 18,200 ఎకరాలకు సాగునీరు అందుతోంది.

మొదటగా 1951 లో "కృష్ణా-పెన్నా" ల పథకం ప్రతిపాదించారు. ఇందులో భాగంగా సోమశిల గ్రామం వద్ద ఒక జలాశయం నిర్మించవలెనని నిర్ణయించారు. 1968 లో ఏర్పడిన అంతర రాష్ట్ర జల వివాదంతో, సోమశిల ప్రాజక్టు మొదట పెన్నానదికే పరిమితమైనది. మూడు సంవత్సరాల తరువాత, 33.52 కోట్ల రూపాయలతో జలాశయం నిర్మాణానికి సిద్ధం చేసారు. 1973 నవంబరులో 17.2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదటి దశ నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. 1975 లో శంకుస్థాపన నిర్వహించారు. శ్రీ ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ ప్రాజక్టు స్వరూపమే మారిపోయింది. తెలుగు గంగ పథకం రూపకల్పనతో, జలాశయం అంతర రాష్ట్ర స్థాయిని సంతరించుకున్నది.

సోమశిల నదీ గర్భంలో, 200 అడుగుల వరకు రాతిపొర లేదు. అందు వలన మట్టి కట్ట నిర్మించవలయునని తలపెట్టినారు. రెండడుగుల మందం గల ప్లాస్టిక్ డయాఫ్రం గోడలను, 200 అడుగుల లోతు నుండి నిర్మించుకొని వచ్చారు. రెండు గోడల మధ్య సిమెంటు, ఇతర రసాయనాలతో గ్రౌటింగు చేసారు. 1,155 అడుగుల పొడవైన మట్టికట్ట, 1,455 అడుగుల పొడవైన కాంక్రీటును వినియోగించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రజలత్రాగునీటి అవసరాలతోపాటు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల భూములకు సాగునీటి అవసరాలు తీర్చే వరదాయినిగా, సోమశిల ప్రాజక్టు ఆవిర్భవించింది.

మూలాలు[మార్చు]

ఆధారం - ఈనాడు నెల్లూరు జిల్లా; 2020 నవంబరు 27, 1వ పేజీ.