అశ్మక జనపదం

వికీపీడియా నుండి
(అస్సక నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సా.శ.పూ. 600 నాటి మహాజనపదాలు

సామాన్య శక పూర్వం 6వ శతాబ్దానికి చెందిన షోడశ (16) మహాజనపదాలలో అశ్మక జనపదం (Ashmaka Janapada) ఒకటి. షోడశ మహాజనపదాలలో దక్షిణాదిలోని ఏకైక జనపదంగా ప్రసిద్ధి చెందిన దీనిని "అస్సక" అనే పేరుతోనూ చరిత్రకారులు పిలుస్తారు. ప్రాచీన బౌద్ధగ్రంథం "అంగుత్తర నికయ"లో కూడా ఇది వర్ణించబడింది. గోదావరి-కృష్ణానదుల మధ్యలో నేటి తెలంగాణ లోని చాలా ప్రాంతం (ఆదిలాబాదు జిల్లా , తూర్పు తెలంగాణ మినహా), నేటి మహారాష్ట్రం లో కొంతభాగం ఈ జనపదంలో భాగంగా ఉండేది. మంజీరా నది పరీవాహక ప్రాంతంలో ఈ జనపదం ఉన్నతంగా వర్థిల్లింది. పోదన్ దీనికి రాజధానిగా ఉండేది. [1] పోదన్ లేదా పౌఢన్యాపురం గా పిలుబడిన నాటి రాజధానియే నేటి బోధన్ పట్టణంగా (ప్రస్తుతం నిజామాబాదు జిల్లాలో ఉంది) చరిత్రకారులు నిర్థారించారు.

వాయుపురాణంలో కూడా అస్మకరాజుల గురించి వివరించారు. బుద్ధుని సమకాలీనుడు సుజాతుడు పోదన్ పాలకుడిగా ఉన్నట్లుగా బౌద్ధవాఙ్మయం తెలియజేస్తుంది. బుద్ధుని కాలంలో కోసల వాసి అయిన బావరి అశ్మక జనపదానికి విచ్చేసి గోదావరి నది ద్వీపం (నేటి బాదనకుర్తి) లో నివసించినట్లు "సుత్తనిపాతం" గ్రంథం తెలియజేస్తుంది. మహాభారత కాలంలో ఆశ్మక జనపదం పాండవుల పక్షాన ఉన్నట్లుగా చరిత్రకారుడు నీలకంఠశాస్త్రి బయటపెట్టాడు. పాణిని రచించిన అష్టాధ్యాయి లోకూడా ఈ జనపదం వర్ణన ఉంది. అస్సక పాలకుడు బ్రహ్మదత్త గురించి బౌద్ధగ్రంథం "మహాగోవింద సుత్తాంత"లో వివరణలు ఉన్నాయి. [2] మత్స్యపురాణంలో అశ్మకకు చెందిన 25 పాలకుల పేర్లు ఇవ్వబడినవి. బౌద్ధ సాహిత్యాన్ని బట్టి దక్షిణ దేశ చరిత్రను సామాన్య శక పూర్వం 6వ శతాబ్దం నుండి ప్రారంభమైనట్లు అంచనా వేశారు.

కాలక్రమంలో మగధ జనపదం బలపడి అనేక జనపదాలను ఆక్రమించడంతో షోడశ మహాజనపదాలు అంతరించాయి. చివరకు ఈ ప్రాంతం రాష్ట్రకూటుల అధీనంలోకి వచ్చింది. శాతవాహన వంశం రూపొందిన విధానం గురించి కె.కె రంగనాధ చార్యులు ఇలా విశ్లేషిస్తున్నారు. కోసల దేశానికి సంబంధించిన బావరి అనే బ్రాహ్మణుడు దక్షిణాపథానికి వచ్చి గోదావరీ తీరంలో అస్సక జాతివారు నివసించే ప్రాంతంలో స్థిరపడ్డాడు. అతను తన శిష్యులతో బాటు ఊంఛ వృత్తితో జీవించే వాడు. క్రమంగా ఒక గ్రామం వెలసింది. ఒక మహాయజ్ఞం కూడా నిర్వహించాడు. ముసలి తనంలో తన శిష్యులను బుద్ధుడి దగ్గరకు పంపించి సందేహాలను తీర్చుకుని బౌద్ధుడయ్యాడు. బావరి దక్షిణానికి వచ్చిన తర్వాతనే దక్షిణదేశం ఆహారాన్ని సేకరించుకునే దశనుంచి అహోరోత్పత్తి చేసుకునే దశకు వచ్చివుండాలని చారిత్రకుల ఊహ. పైన పేర్కొన్న అస్సక జాతివారే తరువాత శాతవాహన వంశంగా రూపుదిద్దుకున్నారు. బావరి సాంప్రదాయంలో శాతవాహనులు బ్రాహ్మణులను గౌరవించి యజ్ఞాలు చేశారు. [3]


మూలాలు[మార్చు]

  1. తెలంగాణ చరిత్ర, రచన- సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 28
  2. Raychaudhuri, Hemchandra (1972) Political History of Ancient India, University of Calcutta, mumbai, p.80
  3. తెలుగు సాహిత్యం మరోచూపు, కె.కె.రంగనాద చార్యులు పేజి: 2)--కత్తిపద్మారావు (విశాలాంధ్ర 25.7.2010)