పెరటి తోటలు

వికీపీడియా నుండి
(ఇంటిపంట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఒక రైతు పెరట్లో పెంచిన కూరగాయ మొక్కలు. బొమ్మ ముందు భాగంలో కాకర పాదు, వెనుక చిక్కుడు పాదు, మధ్యలో గోంగూర మొక్కలు ఉన్నాయి.

ఎవరి ఇంటి నందు వారు స్వయంగా కూరగాయలు, ఆకుకూరలను పండించుకోవడాన్ని ఇంటిపంట అంటారు. పట్టణాలలోను, నగరాలలోను ఎవరికి కావాల్సిన కూరగాయలను, ఆకుకూరలను అవకాశమున్నంతవరకు వారి ఇంటి నందే పండించుకోవడం నేటి ధోరణి. పొలాల్లో పండించే ఆహారోత్పత్తి పరిమాణంతో పోల్చితే ఇంటిపంటల ఆహోరోత్పత్తి పరిమాణం కొంచెమే అయినా విష రసాయనాల అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరల కోసం పేద, మధ్య, ఉన్నత వర్గాలకు చెందిన అందరూ వీలైనంతగా ఇంటిపంటలు పండిస్తున్నారు.

మన ఇంటికి పెరడు, నీటి వసతి ఉంటే పెరట్లో కూరగాయలు, పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం వీలవుతుంది. పాలకూర, తోటకూర, బచ్చలికూర, అరటి, వంగ, బెండ, బీర, పొట్ల, దొండ, టమేటా వంటి కూరగాయలు, బొప్పాయి, జామ, అరటి, దానిమ్మ, సపోటా వంటి పండ్ల మొక్కలను పెరటి తోటలలో పెంచవచ్చును. ఇంట్లో వంటకి, స్నానానికి, బట్టలుతకడానికి వాడిన నీటిని బోదులు చేసి పెరటిలోని మొక్కలకు పెట్టవచ్చును. చెత్త చెదారం, పశువులుంటే వాటి పేడ దొడ్లో ఒక మూల గోతిలో రోజూ వేసి అది నిండాక మట్టితో కప్పితే దానినుండి మంచి ఎరువు తయారవుతుంది. ఈ ఎరువును పెరట్లో పెంచే మొక్కలకు వాడవచ్చును. పెరటి తోటలకు ఉపయోగించే భూమిని చదును చేసుకోవడం, శ్రేష్టమైన విత్తనాలు వాడడం, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వంటి విషయాలలో శ్రద్ధవహించాలి.

పెరటి మొక్కలతో ప్రయోజనాలెన్నో[మార్చు]

  • పెరటి తోటల వలన మంచి పోషకవిలువలు గల తాజా కూరలు, పండ్లు నిత్యం ఆహారంలో లభించి వారి ఆరోగ్యం, పిల్లల పెరుగుదల బాగుంటుంది.
  • ఇంటిలోని మురుగునీటిని, చెత్త చెదారాన్ని శాస్త్రీయంగాను, ప్రయోజనకరంగఅను పరష్కరించవచ్చును.
  • వ్యాయామం, మానసిక ఉల్లాసం కలుగుతాయి.

ఉసిరి : దీనిని సంస్కృత భాషలో అమ్లా అని ఆమ్లికా అని అంటారు. ఇంటింటా ఉసిర్ ఆరోగ్య సిరి. ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులోని " సి" విటమిన్ ఎంతో ఉపయుక్తమైనది. దీనిని షాంపూ లందు, త్రిఫల చూర్ణం తయారీ యందు ఆయుర్వేదం నందు దీనిని విరివిగా ఉపయోగిస్తారు.

  • తులసి : ఆకులు తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 10 నుంచి 15 మి.మీ ఈ ఆకురసాన్ని తెనేతో కలిపి సేవిస్తే మలేరియా, జ్వరం జలుబు దగ్గువంటి రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మరోగ నివారణకు కూడా ఈరసాన్ని వాడవచ్చు.
  • కలబంద: కలబంద గుజ్జును బెల్లంతో కలిపి నెలసరికి ముందు ఒక వారం పాటు రోజుకు రెండు సార్లు తీసుకుంటే ఆ సమయంలో వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది.
  • దానిమ్మ : రక్తవృద్ధి, శుద్ధి కోసం వాడుతారు. అతిసారం తగ్గిస్తుంది. పువ్వుల రసాన్ని ముఖానికి పట్టిస్తే మచ్చలు, మొటిమలు తగ్గి కాంతివంతంగా ఉంటుంది.
  • మందారం : మందార పువ్వులను మెత్తగా నూరి కొబ్బరి నూనెతో మరుగకాచి వడగట్టిన తైలాన్ని తలకు పట్టించిన రెండు గంటల తర్వాత శీకాయ చూర్ణంతో తలస్నానం చేస్తే తెల్ల వెంట్రుకల సమస్య పరిష్కారమవుతుంది.
  • పసుపు : వ్యాధినిరోదక శక్తిని పెంచుతుంది. చర్మవ్యాధులు, కామెర్లు తగ్గించడంలో ప్రధాన ఔషదంగా పనిచేస్తుంది. పది గ్రాములు పసుపు ముద్దను అరకప్పు ఆవుపెరుగుతో కలిపి పరిగడుపున తాగితే కామెర్లు తగ్గుతాయి.
  • గోరింటాకు : ఆకులను నమిలి మింగితే నోటి పూత తగ్గుతుంది. చెట్టు బెరడు పొడిని 1 నుంచి 2 గ్రాములు కొద్ది నీటితో కలిపి కషాయంగా చేసుకొని తాగితే చర్మ వ్యాధులు తగ్గుతాయి.
  • బొప్పాయి : కాయతో కూర చేసుకొని తింటే బాలింతల్లో పాలు వృద్ధి చెందుతాయి. పేను కొరుకుడు ఉన్నచోట దీని పువ్వును రుద్దితే తగ్గుముఖం పడుతుంది.
  • వేప : రోజూ సాయంత్రం వేపాకును మొత్తగా నూరి చర్మానికి రాసుకుంటే చర్మవ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • పుదీన : పచ్చి ఆకులను నలిపి వాసన చూస్తే తల తిరుగుడు తగ్గుతుంది. ఆకులు నమిలి మింగితే నోటి దుర్వాసన, చిగుళ్ల నొప్పులు తగ్గుతాయి.
  • ఆముదం , జిల్లేడుపువ్వు : ఆముదం ఆకును జిల్లెడు పువ్వును కలిపి దంచి గుళికలాగా చేసుకొని మింగాలి. పసిరికలు తగ్గుతాయి. కారణం: జిల్లెడు పువ్వులో మెర్కూరీ ఉంటుంది.ఈనాడు 17.8.2009

ప్రపంచ ఇంటిపంటల దినోత్సవం[మార్చు]

ప్రపంచ ఇంటిపంటల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలోని ఆఖరి ఆదివారం నాడు జరుపుకుంటారు.[1]

మూలాలు[మార్చు]

  1. సాక్షి, వంట-పంట (23 August 2014). "..ఇప్పటి ట్రెండ్!". Sakshi. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020.
  • సాక్షి దినపత్రిక - 23-08-2014 - (..ఇప్పటి ట్రెండ్! ఇంటిపంట - ఈ నెల 24న "అంతర్జాతీయ ఇంటిపంటల దినోత్సవం" సందర్భంగా..)