ఎం.డి.వల్సమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.డి.వల్సమ్మ
వ్యక్తిగత సమాచారము
జాతీయతభారతీయురాలు
జననం (1960-10-21) 1960 అక్టోబరు 21 (వయసు 63)
ఒట్టత్తై, కన్నూర్, కేరళ
క్రీడ
దేశంభారతదేశం
క్రీడట్రాక్ అండ్ ఫీల్డ్
సంఘటన(లు)400 మీటర్ల హర్డిల్స్
విజయాలు, బిరుదులు
వ్యక్తిగత ఉత్తమ విజయాలు100 మీటర్ల హర్డిల్స్: 14.02 (జకార్తా 1985)
400 మీటర్ల హర్డిల్స్: 57.81 (1985)

మనత్తూర్ దేవసియా వల్సమ్మ (జననం 1960 అక్టోబరు 21) మాజీ భారతీయ క్రీడాకారిణి. ఆసియా క్రీడల్లో వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న రెండవ భారతీయ మహిళ ఆమె. భారత గడ్డపై దానిని గెలుచుకున్న మొదటి మహిళ కూడా.

ప్రారంభ జీవితం

[మార్చు]

వల్సమ్మ కేరళలోని కన్నూర్ జిల్లా ఒట్టతైలో 1960 అక్టోబరు 21న జన్మించింది. పాఠశాల రోజుల్లో తన అథ్లెటిక్స్ కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె తదుపరి చదువుల కోసం పాలక్కాడ్‌ లోని మెర్సీ కాలేజీలో చేరినప్పుడు మాత్రమే దానిని మరింత సీరియస్‌గా తీసుకుంది.[1] 1979 లో పూణేలో జరిగిన ఇంటర్-యూనివర్సిటీ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్, పెంటాథ్లాన్‌లో కేరళ తరపున ఆమె మొదటి పతకం సాధించింది.

ఆమె దక్షిణ రైల్వేలో చేరి, ఎ.కె.కుట్టి వద్ద శిక్షణ పొందింది. 1981 లో బెంగుళూరులో జరిగిన అంతర్రాష్ట్ర పోటీల్లో 400 మీటర్ల సాదా పరుగు, 100 మీటర్లు 400 మీటర్ల హర్డిల్స్, 400 మీ, 100 మీటర్ల రిలేలలో మొత్తం ఐదు బంగారు పతకాలు గెల్చుకుంది. ఆ ప్రదర్శనతో ఆమె రైల్వే, జాతీయ జట్లలో స్థానం సాధించుకుంది. 1982 లో ఆమె 400-మీటర్ల హర్డిల్స్‌ పోటీలో కొత్త రికార్డును నెలకొల్పి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఇది ఆసియా రికార్డు కంటే మెరుగైనది.

అథ్లెటిక్స్ కెరీర్

[మార్చు]

వల్సమ్మ 1982 ఆసియా క్రీడల్లో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో స్వదేశీ ప్రేక్షకుల ముందు 400 మీటర్ల హర్డిల్స్‌లో 58.47 సెకన్లలో పరుగెత్తి భారత ఆసియా రికార్డు సాధించి, బంగారు పతకం గెలుచుకుంది. కమల్‌జిత్ సంధు (400 మీటర్లు) తర్వాత భారత్ తరఫున ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన రెండో మహిళా అథ్లెట్‌గా వల్సమ్మ నిలిచింది. ఆ తర్వాత ఆమె, 4 X 400 మీటర్ల రిలే జట్టులో రజత పతకాన్ని గెలుచుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆమెకు 1982 లో అర్జున అవార్డు, 1983 లో పద్మశ్రీ పురస్కారాలు అందించగా, కేరళ ప్రభుత్వం జి.వి.రాజా నగదు పురస్కారాన్నిచ్చింది.

చరిత్రలో తొలిసారిగా, 1984లో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో భారత మహిళా జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించి ఏడో స్థానంలో నిలిచింది. వల్సమ్మ 100 మీటర్ల హర్డిల్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఆమె 1985లో జరిగిన మొదటి జాతీయ క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం గెలుచుకోవడమే కాకుండా జాతీయ రికార్డు కూడా సృష్టించింది.

వల్సమ్మ 1983 లో మాస్కోలో జరిగిన స్పార్టకియాడ్‌లో పాల్గొంది, ఇస్లామాబాద్‌లో జరిగిన సౌత్ ఏషియన్ ఫెడరేషన్ (SAF) గేమ్స్‌లో 100 మీటర్లలో కాంస్యం, పావుమైలులో ఒక రజతం, 4 x 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది.

దాదాపు 15 ఏళ్ల కెరీర్‌లో, MD వల్సమ్మ హవానా, టోక్యో, లండన్‌లో జరిగిన ప్రపంచ కప్ మీట్‌లు, 1982, 86, 90, 94 ఆసియా క్రీడల్లోను, అన్ని ఆసియా ట్రాక్ & ఫీల్డ్ పోటీల్లోను, SAF గేమ్స్‌లోనూ పాల్గొని, ప్రతి పోటీలోనూ తనకంటూ ఒక గుర్తింపును సాధించి పెట్టుకుంది.

మూలాలు

[మార్చు]