కాసం కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాసం కృష్ణమూర్తి
జననంకాసం కృష్ణమూర్తి
1921
India నీర్మాల, దేవరుప్పల మండలం, జనగాం జిల్లా, తెలంగాణ
మరణం2006, ఆగస్టు 1
వృత్తితెలంగాణ సాయుధ పోరాటయోధుడు
తండ్రిరామచంద్రయ్య
తల్లియశోదమ్మ

కాసం కృష్ణమూర్తి తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోరాటయోధుడు.[1] గెరిల్లా ఉద్యమంలో ''రాగన్న''గా పిలువబడ్డ కృష్ణమూర్తి గ్రామాల్లో ప్రజలను చైతన్యపర్చడం, అడవుల్లో దళాలు నడపడం, భూపోరాటం నిర్వహించడం, సంఘాన్ని విస్తరించడం, మిలటరీ క్యాంపులపై దాడి, ఆయుధాల సేకరణ మొదలైన కార్యకలాపాలతో ఉద్యమానికి నాయకత్వం వహించాడు. వ్యవసాయ కార్మిక సంఘం నిర్మాతగా, ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడుగా అనేక కూలీ, భూమి పోరాటాలలో పాల్గొన్నాడు. 10 వేల గ్రామాలకు విముక్తి కలిగించడంతోపాటు 10 లక్షల ఎకరాల సాగుభూమిని పేదలకు పంచడంలో కృషిచేశాడు.

జీవిత విషయాలు[మార్చు]

కృష్ణమూర్తి 1921లో రామచంద్రయ్య- యశోదమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జనగాం జిల్లా, దేవరుప్పల మండలం, నీర్మాల గ్రామంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. కృష్ణమూర్తి గారి తండ్రి ఆ గ్రామ దేశ్‌ముఖ్‌ వద్ద పోలీసు పటేల్‌గా ఉద్యోగం చేసేవాడు. 3వ తరగతి వరకు స్వగ్రామంలో చదివిన కృష్ణమూర్తి, 5వ తరగతి వరకు జనగాంలో చదివాడు. పార్శీ, ఉర్థూ భాషల్లో కవిత్వాలు కూడా రాశాడు.

ఉద్యమజీవితం[మార్చు]

ఆ కాలంలో ఫ్యూడల్‌ వ్యవస్థ, బానిస వ్యవస్థ ఉండేది. భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు గ్రామాల్లో పెత్తందారి తనం చెలాయించేవారు. దేశముఖ్‌ల విలాసాలకు అయ్యే ఖర్చు జనం నుండి బలవంతంగా వసూలు చేసేవారు. అదిచూసిన కృష్ణమూర్తి ఫ్యూడల్‌ రాచరిక పాలనకు, కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. సాయుధ పోరాటం ఆరంభంలో కృష్ణమూర్తి గారు జైలు నుంచి తప్పించుకొని పార్టీ పిలుపులో భాగంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తెలంగాణ పల్లెల్లోకి విస్తృతంగా తీసుకపోయాడు. ధాన్యాన్ని వసూలు చేయకుండా అడ్డుకోవడం, పటేల్‌, పట్వార్‌ల వద్ద గల రికార్డులను లాక్కోవడం, పన్ను వసూళ్ళు నిరాకరించడం, పన్నులు చెల్లించకుండా ఉండటం వంటి కార్యకక్రమాలలో పాల్గొన్నాడు. మోత్కూరు ప్రాంతంలో గడ్డం అమీన్‌ ఆగడాలు పెట్రేగిపోయి, రజాకారులతో కలిసి అనేక గ్రామాలపై దాడిచేశాడు. కృష్ణమూర్తి తన దళంతో అమ్మనబోలుకు చేరుకొని అక్కడి ధాన్యాన్ని బండ్లపై పోలీసులు తీసుకవెళ్తుంటే ప్రతిఘటించి ఆ ధాన్యాన్ని ప్రజలకు పంపిణీ చేశాడు. దాంతో మోత్కూరు సమీపంలో బొడ్డుగూడెం గ్రామానికి అర్మీ వచ్చి, కృష్ణమూర్తిపై నిఘా పెట్టింది.[2] ఆర్మీ నుండి కాపాడుకోవడానికి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి కృష్ణమూర్తి తన దళ సభ్యులకు వివరించాడు. ఉద్యమంలో పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి పనిచేశాడు. సుందరయ్య సూచనతో రక్షణ నిమిత్తం రాచకొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దళాలను సిద్ధం చేసి గ్రామాల్లోకి వెళ్ళి ప్రదర్శనలు చేశాడు. గ్రామీణ ప్రజలకు కమ్యూనిస్టుల గురించి తెలియజెప్పి, వారిలో చైతన్యాన్ని తీసుకువచ్చాడు.

మరణం[మార్చు]

కృష్ణమార్తి 2006, ఆగస్టు 1న మరణించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "అలుపెరుగని పోరాటయోధుడు కాసం కృష్ణమూర్తి". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2021-12-26. Retrieved 2021-12-25.
  2. 2.0 2.1 "చైతన్యమూర్తి కాసం కృష్ణమూర్తి | వేదిక | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2015-12-15. Retrieved 2021-12-26.