కొప్పాక విశ్వేశ్వర రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొప్పాక విశ్వేశ్వర రావు (1925-1998) ప్రముఖ రసాయన శాస్త్ర ఆచార్యుడు, సాహిత్య అభిమాని. వారాలు చేసుకుని చదువుకున్న స్థాయి నుండి, అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం కోసం 9 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చే స్థాయికి ఎదిగిన వ్యక్తి కొప్పాక విశ్వేశ్వరరావు.

తొలి జీవితం[మార్చు]

కొప్పాక విశ్వేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా వసంతవాడలో 1925 వ సంవత్సరంలో కొప్పాక సీతాపతి, విజయలక్ష్మి దంపతులకు రెండవ కుమారుడుగా జన్మించాడు. విశ్వేశ్వరరావు వారాలు చేసుకొని చదువుకున్నాడు. ఇరవై మూడేళ్ళ వయసులో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి రసాయనశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకొని, తరవాత అమెరికాలో విస్కాన్‌సిన్ యూనివర్శిటీలో బయోకెమిస్ట్రీలో మరొక డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నారు. 1954లో ఆయన, భార్య సీతగారితో సహా – అమెరికాకి వలస వెళ్ళారు. అక్కడ ఫైజర్ (Pfizer) కంపెనీలో పరిశోధకుడిగా చేరారు. సహజంగా ప్రకృతిలో దొరికే పదార్థాలను కేన్సర్ నివారణకు ఔషధాలుగా ఉపయోగించడానికి ఆయన చేసిన పరిశోధన ఆయనకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఆయన కనిపెట్టిన మిత్రమైసీన్ Plicamycin అనే మందు ఇప్పటికీ కేన్సర్ నివారణకి వాడుతున్నారు.

తెలుగు అభిమానం[మార్చు]

విశ్వేశ్వరరావుకూ, భార్య సీతకూ ప్రాచీన తెలుగు సాహిత్యం అన్నా, సంగీతం అన్నా, అభిమాన మెక్కువ. ఆయన తిక్కన, పోతన పద్యాలను తన పిల్లలకీ ఆప్యాయంగా వినిపించేవారు. ఆయన జీవితం చివరి రెండు సంవత్సరాలలో, తెలుగు, సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల గురించి అమెరికాలో పెరుగుతున్న భారతీయులకీ, అమెరికనులకీ చెప్పవలసిన అవసరం ఉన్నదని గ్రహించి, ఆ పని చెయ్యడానికి విశ్వవిద్యాలయాలే తగిన స్థానాలని గుర్తించి అమెరికాలో ఏదయినా ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేయాలని స్థిరంగా నిశ్చయించుకున్నారు. కాని, అది ఆయన బతికి ఉండగా చెయ్యలేక పోయారు.

ఎమరీ యూనివర్సిటీ తెలుగు పీఠం[మార్చు]

ఆయన కోరిక తీర్చడానికి వారి సతీమణి సీత, పిల్లలు విజయలక్ష్మీరావు, వెంకట రామారావు, జయ రావు 2000 సంవత్సరంలో కొప్పాక ఫేమిలీ ఫౌండేషన్ స్థాపించారు. అట్లాంటాలో ప్రసిద్ధికెక్కిన ఎమరీ యూనివర్శిటీలో తెలుగు పీఠం ఏర్పాటు చెయ్యడానికి పదిహేను లక్షల డాలర్లు (సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు) కావాలి. అందులో సగం, అంటే 750,000 డాలర్లు (దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు) ఇచ్చి, మిగతా సగం ఎమరీ యూనివర్సిటీని ఇతర దాతల సహాయంతో కూడబెట్టుకోమని చెప్పారు. కాని గత ఐదు సంవత్సరాలలో, దేశవ్యాప్తంగా వున్న తెలుగు సాంస్కృతిక సంస్థలు, తెలుగు దేశపు ప్రభుత్వాధికారులు, ఇక్కడి తెలుగు ధనవంతులూ — ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో, ఈ ఆచార్య పదవి ఏర్పడదనే అనుమానం వచ్చింది. అప్పుడు, కొప్పాక ఫేమిలీ ఫౌండేషన్ వారే కల్పించుకొని, ఆ రెండవ భాగం కూడా తామే ఇస్తామని వాగ్దానం చేశారు.

విశ్వేశ్వర రావుగారి కోరిక తీర్చడానికి వారి పిల్లలు ముందుకు వచ్చి, మాటలతో కాకండా, చేతలద్వారా మార్గదర్శకత్వం వహించడం అందరు తెలుగువాళ్ళూ గర్వించదగ్గ విషయం. 2015 మార్చి 26 న ఎమరీ యూనివర్శిటీలో తెలుగు ఆచార్యపదవి నెలకొల్పబడబోతున్నదని ప్రకటన వెలువడింది. దాని పేరు ఆధికారికంగా The Visweswara Rao and Sita Koppaka Professorship in Telugu Culture, Literature, and History. అని ప్రకటించింది. ఒక్క తెలుగు కుటుంబ ధార్మిక సంస్థ పరదేశములో ఒక యూనివర్శిటీలో తెలుగు ఆచార్య పదవికై మూలధనం ఇవ్వడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న తెలుగు సాంస్కృతిక సంస్థలకీ, తెలుగు మీద నిజమయిన అభిమానం ఉన్న వ్యక్తులకీ, ఇది ప్రేరణ కాగలదు. ఇది కాక కొప్పాక ఫౌండేషన్ వారు, ఇంకా చాలా జనహిత కార్యక్రమాలకి అమెరికాలోను, తెలుగు రాష్ట్రములోను విరాళాలు ఇస్తున్నారు.

విశ్వేశ్వరరావుగారికి 1998లో గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఆయన వైద్యశాలలో ఉండగా, వారి పిల్లలకు – ఇద్దరు వైద్యులు -— వైద్య వ్యవస్థలో ఉన్న లోపం చాలా బాధ కలిగించింది. డాక్టర్లకీ, రోగులకీ, వారి కుటుంబ సభ్యులకీ మధ్యన అన్యోన్యత పెంపొందించడం చాలా అవసరమని, ప్రస్తుతం వైద్యవిద్యాలయాలలో పరిస్థితులు అందుకు అనుకూలంగా మారేటట్టు చెయ్యాలని వారు అనుకున్నారు. అందుకోసం ఇప్పటి వరకూ, పదిహేడు వైద్యవిద్యాలయాలలో ఇరవై ఆరు సందర్శకాచార్య పదవుల కోసం విరాళాలు ఇచ్చారు. వర్జీనియా వైద్యవిద్యాలయంలో ఉపన్యాసక పదవికి శాశ్వత నిధి నెలకొల్పారు. అంతే కాకండా, ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన విద్యార్థులకి ప్రత్యేక సహకారం కోసం కొప్పాక ఫౌండేషన్ నిధులు కేటాయించడానికి ప్రయత్నిస్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. http://www.andhrajyothy.com/Artical?SID=94832[permanent dead link]
  2. వేలూరి వేంకటేశ్వరరావు గారి వ్యాసము. ఆంధ్ర జ్యోతి వ్యాసం. 25 మార్చి 2015
  3. https://web.archive.org/web/20151201200035/http://eemaata.com/em/category/issues/201503