జన సాహితితో మా విభేదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జన సాహితితో మా విభేదాలు రంగనాయకమ్మ రచించిన విమర్శనాత్మకమైన పుస్తకము.

రచనా నేపథ్యం[మార్చు]

రంగనాయకమ్మ కొంత కాలం "జన సాహితి" అనే సాంస్కృతిక సంస్థలో పనిచేశారు. సైధ్ధాంతిక విభేదాల వల్ల ఆ సంస్థ నుంచి బయటకి వచ్చేశారు. ఆ సంస్థ వారు తమది భూస్వామ్య సామ్రాజ్యవాద వ్యతిరేక సంస్థ అని చెప్పుకున్నారు కానీ వారు వ్యక్తిగతంగా ఆచరించేది మాత్రం భూస్వామ్య సంస్కృతే. ఆ సంస్థ వారు ఒక వైపు భూస్వామ్య సంస్కృతిని విమర్శిస్తూనే మరో వైపు భూస్వామ్య సంస్కృతిలో భాగమైన కట్నం లాంటి ఆచారాలు పాటిస్తుంటారు.[1] వీరు రంగనాయకమ్మకి తెలియకుండా ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా చెడుగా మాట్లాడేవారు. రంగనాయకమ్మ తన మొదటి భర్తని విడిచిపెట్టి తన కంటే వయసులో పదేళ్ళు చిన్నవాడైన గాంధీతో సంప్రదాయ వివాహం లేకుండా కలిసి ఉండడం గురించి గుసగుసలాడుకునే వారు. రంగనాయకమ్మ భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా వ్రాసిన రామాయణ విషవృక్షం పుస్తకాన్ని కూడా విమర్శించారు. ప్రగతివాద సాహిత్యమైన చలం సాహిత్యాన్ని కూడా విమర్శించేవారు. వీరు చలం సాహిత్యంలోని పాజిటివ్ అంశాలని చూడలేకపోయేవారు.

జ్వాలాముఖి పై విమర్శలు[మార్చు]

నాస్తికులలో ఎక్కువ మందికి మార్క్సిస్ట్ గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రాలు తెలియవు. కనుక జన సాహితి సంస్థ సభ్యులు నాస్తిక హేతువాద సంఘాలకి దూరంగా ఉండాలని జనసాహితి సంస్థ తీర్మానించింది. మొదట జ్వాలాముఖి అందుకు అంగీకరించారు కానీ తరువాత జ్వాలాముఖి నాస్తిక హేతువాద కార్యక్రమాలకు వెళ్ళి నాస్తిక ఉద్యమాన్ని పొగడడం విమర్శలకి దారి తీసింది. నాస్తికత్వం, హేతువాదం, నవ్యమానవవాదాలని విమర్శిస్తూ వ్రాసిన పుస్తకంలో జ్వాలాముఖిని కూడా విమర్శిస్తూ వ్యాసం వ్రాసారు. ఈ ఉద్యమాలలో మార్క్సిస్ట్ వ్యతిరేక స్వభావం కూడా ఉందని రంగనాయకమ్మ వాదన. ఈ విమర్శలు కొంత మంది జన సాహితి నాయకులకి నచ్చలేదు. జ్వాలాముఖి మన సంస్థ సభ్యుడే కదా, అతను తప్పు చేస్తే మనమే అతన్ని విమర్శించాలా? అని రంగనాయకమ్మని ప్రశ్నించారు. అంతకు ముందు ఓల్గా (మరొక మార్క్సిస్ట్ రచయిత్రి) కూడా జ్వాలాముఖిని విమర్శించినప్పుడు జన సాహితి నాయకులు ఇలాగే అభ్యంతరం చెప్పారు. జన సాహితి సంస్థ నాయకులు చేసే తప్పుల్ని సమర్థించే వారిలో జ్వాలాముఖి ఒకరు కావడం వల్ల అతని పై విమర్శలని నాయకులు హర్షించలేకపోయేవారు.

ఈ పుస్తకం వ్రాసిన తరువాత[మార్చు]

ఈ పుస్తకం వ్రాసిన తరువాత రంగనాయకమ్మ "జన సాహితి" సంస్థకి రాజీనామా చేశారు. రంగనాయకమ్మా, ఆమె భర్త గాంధీ పోలీస్ ఇన్ఫార్మర్ లని అంటూ వారి పై దుష్ప్రచారం కూడా చేశారు. ఒ.పి.డి.ఆర్. అనే పౌర హక్కుల సంఘం వారు కూడా రంగనాయకమ్మకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు.

మూలాలు[మార్చు]