జి. పుల్లారెడ్డి
| జి.పుల్లారెడ్డి | |
|---|---|
| జననం | గుణంపల్లి పుల్లారెడ్డి ఆగష్టు 12,1920 కర్నూలు జిల్లా గోకవరం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
| మరణం | మే 7,2007 హైదరాబాద్ |
| నివాస ప్రాంతం | కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం |
| ఇతర పేర్లు | జి.పుల్లారెడ్డి |
| వృత్తి | వ్యాపారవేత్త, దాత,హిందూత్వ వాది |
| ప్రసిద్ధి | పుల్లారెడ్డి నేతి మిఠాయిలు దుకాణ సముదాయ వ్యవస్థాపకులు |
| మతం | హిందు |
| పిల్లలు | ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు |
| తండ్రి | హుస్సేన్ రెడ్డి |
| తల్లి | పుల్లమ్మ |
జి.పుల్లారెడ్డి (1920-2007) గా సుపరిచితులైన గుణంపల్లి పుల్లారెడ్డి పుల్లారెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయిల దుకాణాల వ్యవస్థాపకుడు, దాత, హిందూ జాతీయ వాది, విశ్వ హిందూ పరిషత్ మాజీ కోశాధికారి.
వ్యక్తిగత జీవితం
[మార్చు]గుణంపల్లి పుల్లారెడ్డి 1920 ఆగస్ట్ 12న కర్నూలు జిల్లా గోకవరం గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుల్లమ్మ హుస్సేన్ రెడ్డి దంపతులకు జన్మించారు. వీరి ధర్మపత్ని నారాయణమ్మ. పుల్లారెడ్డి దంపతులకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కలరు. చిన్నాన్న కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రోద్బలంతో పుల్లారెడ్డి మిఠాయిల వ్యాపారం లోనికి అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ లోనే పుల్లారెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయిల దుకాణాలను అగ్రగామిగా తీర్చిదిద్దాడు. 2007, మే 7 న పరమపదించాడు.[1]
వ్యాపారం
[మార్చు]తొలుత టీ దుకాణం, మజ్జిగ అమ్మడం, బట్టల దుకాణం వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసినా, చిన్నాన్న ప్రోత్సాహంతో కర్నూలులో 1948లో ప్రారంభించిన మిఠాయిల దుకాణం అయన జీవితాన్ని మార్చివేసింది. తన వ్యాపార దక్షతతో పుల్లారెడ్డి మిఠాయిలను స్వచ్ఛతకు, రుచికి మారుపేరుగా నిల్పాడు. అనతికాలంలోనే పుల్లారెడ్డి నేతి మిఠాయిలు ప్రాచుర్యంలోకి రావడంతోపాటు వ్యాపారం కూడా విస్తరించింది. తరువాత 1957వ సంవత్సరం హైదరాబాదు లోని అబిడ్స్ లో కూడా దుకాణాన్ని తెరిచారు. ఒక చిన్న దుకాణంగా ప్రారంభమైన అయన వ్యాపారం ఇప్పుడు వందల మంది పనివారితో విదేశాలకు సైతం మిఠాయిలు పంపేంతగా ఎదిగింది. పనివారిని సొంతమనుషుల్లా చూసుకుని వారికి ఇళ్లుకూడా కట్టించాడు.
స్ఫూర్తి వ్యాక్యలు, వ్యాపార సూత్రాలు
[మార్చు]పుల్లారెడ్డి వ్యాపార ప్రారంభ సమయంలో చిన్నాన్న వెంకటరెడ్డి చెప్పిన వ్యాపార సూత్రాలు జీవితాంతం ఆచరించాడు. అవి
1.నీవు తినేదే నీ పనివాళ్ళకు పెట్టు.
2.వ్యాపారానికి కావలసిన ముడిసరుకులు నీవే కొని తెచ్చుకో. ఇతరులను పంపించకు.
3.మిఠాయి చేసిన తరువాత రుచి చూసి బాగుంటేనే అమ్ము బాగాలేకపోతే అమ్మకు.
4.ధనికుడికైనా దరిద్రుడికైనా ఒకటే ధరకు అమ్ము.
5.తూకంలో ఒక తులం ఎక్కువైనా పరవాలేదు కాని తక్కువ కాకుండా చూసుకో.
6.పాకశుద్ధి ఎంత అవసరమో వాక్శుద్ధి కుడా అంతే అవసరం కనుక అబద్దం ఆడకు.
సామాజిక సేవలో పుల్లారెడ్డి ప్రస్థానం
[మార్చు]పుల్లారెడ్డి పరిస్థితుల ప్రభావం వాళ్ళ 5వ తరగతి వరకు మాత్రమే చదివారు, కానీ ఆయనకు చదువంటే అమితమైన అభిమానం. అది 1970 సంవత్సరం. పుల్లారెడ్డి వయస్సు యాభైపడిలో ఉంటుంది. అప్పుడాయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. తనను తాను ప్రశ్నించుకున్నారు. ఈ సమాజంలో నేనూ ఒక సభ్యుడినే. సమాజం చాలా ఇచ్చింది. నాకు కావలసిందంతా సమాజం కల్పించింది. నావంతుగా కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలి. ఈ ఆలోచనకు ప్రతిరూపమే దివిసీమలో ఆయన అందించిన సేవలు. కృష్ణాజిల్లా దివిసీమలో వరద తాకిడి గ్రామాలకు గ్రామాలే చెల్లా చెదరైపోయాయి. ఎందరో ప్రజలు గల్లంతైపోయారు. అటువంటి విప్రత్కర పరిస్థితో పుల్లారెడ్డి ఎంతో స్పందించారు. దివిసీమ బీభత్సాన్ని ఎదుర్కొటంలో తన వంతు కృషి చేశారు. 1970 సంవత్సరంలో కర్నూలులో అనాథశరణాలయాన్ని పుల్లారెడ్డి ప్రారంభించారు. 'విజ్ఞానపీఠం' పేరిట కొనసాగుతున్న ఈ ఆశ్రమంలో 250 మంది విద్యార్థులు ఆశ్రమ పొందుతున్నారు. వారికి నిత్యం ఆహారం, దుస్తులు అన్నిటినీ సరఫరాన్ని చేస్తున్నారు. వ్యాపారంలో ఎదిగిన కొద్దీ ప్రజలకు, సమాజానికి ఏమైనా చేయాలన్న తపనతో 1975వ సంవత్సరం హైదరాబాదు లో జి. పుల్లారెడ్డి ఛారిటీస్ ట్రస్ట్ ను ఏర్పరిచి దాని ద్వారా విద్యావ్యాప్తికై కృషిచేశాడు. శ్రీ స్వామీ వివేకానంద తెలిపిన మార్గంలో ఉత్తమ విద్యకు, సత్యశోధన జరిపే విద్యకోసం అనేక సంస్థలు స్థాపించారు. నిజమైన విద్య-శీలాన్ని, మనసుకు బలాన్ని, సునిశిత పరిశీలనను అందించాలని వివేకానంద బోధించేవారు. అటువంటి విలువలతో కూడిన విద్యనందించేందుకు పుల్లారెడ్డి విద్యా సంస్థల ద్వారా కృషి జరుగుతోంది. 1984-85 లో జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను, 1994 -95లో జి.పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలను, మహిళల కోసం 1997లో జి.నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించాడు. ట్రస్ట్ తరపున ఎందరో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తూ విద్యావ్యాప్తికి తనవంతు కృషి చేసాడు. కర్నూలు జిల్లాలోని పాఠశాలల అభివృద్ధికి సహాయం చేశాడు. అనాథ బాలురకోసం విజ్ఞాన పీఠం పేరుతొ విద్యాలయాన్ని స్థాపించి వారికి విద్యతో పాటు వసతి, భోజన ఏర్పాట్లను చూశాడు.
హిందూత్వ ప్రభావం
[మార్చు]పుల్లారెడ్డి పై భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలతో పాటు, హిందూ మత ప్రభావం ఉంది. తన దానధర్మాలలో భాగంగా అనేక దేవాలయాల పునరుద్ధరణకు, నిర్మాణాలకు భూరి విరాళాలు ఇచ్చాడు. కేవలం విద్య విషయంలో కాకుండా ఇతర సంస్థలలోనూ ఆయన ముఖ్యపాత్ర పోషించారు. ఆ క్రమంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.), విశ్వ హిందూ పరిషత్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆర్.ఎస్.ఎస్. లో 1974లో సర్ సంఘ్ చాలక్ అయ్యాడు. 1980లో విశ్వ హిందూ పరిషత్ హైదరాబాద్ శాఖకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. సంస్కృత భాషా ప్రచార సమితి అధ్యక్షునిగా, విశ్వ హిందూ పరిషత్ జాతీయ కోశాధికారిగా, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా అనేక బాధ్యతలు నిర్వర్తించాడు. భారతవికాస్ పరిషత్, రోటరీక్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సంస్కారభారతి, సరస్వతి శిశువిద్యా భాల భారతి శిక్షణ సమిలో పుల్లారెడ్డి ముఖ్యపాత్ర పోషించారు. వీరి మరణానంతరం వీరి కుమారుడు జి.రాఘవ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడయ్యాడు.
- "భగవంతుని మధురిమలను” లక్షలాది ప్రజలలో అందించడం ద్వారా శ్రీ పుల్లారెడ్డి విశిష్టులైనారు. ఇదే రీతిన ఆయన విజయశిఖరాల చేరాలి.
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారయణ చిన్న జియర్ స్వామి
- శ్రీ పుల్లారెడ్డి అనేక విద్యా, సాంస్కృతిక, కళా సంస్థలతో నిరంతర సంబంధాలు కలిగిఉండేవారు. అలుపెరుగని ఉత్సహంతో పనిచేసే సామాజిక కార్యకర్త ఆయన. దానగుణానికి ఆయన పేరు ప్రతి రూపం. జీవితంలోని అన్ని రంగాలకు చెందిన ఉన్నత విలువల పాటించే వారికి ఆయన పేరు స్ఫూర్తినిచ్చింది.
డా. నందమూరి తారక రామారావు
- వినిమయదారుని ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా శ్రేష్టమైన మిఠాయిలను సహేతుక ధరలకు అందించడం ద్వారా ఆయన విశ్వవిఖ్యాతినొందారు. ఇలా సాధించిన లాభాలను ఆయన ప్రజాసంక్షేమం కోసం విరాళాల రూపంలో వెచ్చించారు. సమాజశ్రేయస్సు ప్రతీ కలుగానిలిచే విద్యా సంస్థల అభివృద్ధితో ఆయన చేసిన కృషిని ముందు తరాలవారు సైతం ఆయనను గుర్తుపెట్టుకుంటారు.
డా. పెరుగు శివారెడ్డి, పద్మభూషణ గ్రహీత
- సచ్ఛీలత, నిజాయితీ, నాణ్యత సహేతుక ధరలతో వ్యాపారాన్ని నిర్వహించిన పుల్లారెడ్డి సమగ్రతకు నిండైన నిర్వచనం. ఆయన తన లాభాల్లో అధిక భాగాన్ని విరాశాలకు విద్యాసంస్థల అభివృద్ధికి వెచ్చించారు.
డా. సి. నారాయణరెడ్డి, పద్మభూషణ గ్రహీత
- శ్రీ పుల్లారెడ్డి మిఠాయి అంగడి రాష్ట్రంలోనే మన్నికైనది. నిజాయతీగల వ్యాపారవేత్తగా ఆయనకు గల పేరుకుఎదురులేదు. ఎంతో వ్యయ ప్రయాసలతో ఆయన ప్రజాసేవకి అంకితమైన వ్యక్తి.
న్యాయమూర్తి పి. జగన్మోహన్ రెడ్డి
- నాణ్యతగల మిఠాయిలకు, నిజాయితీతో కూడిన వ్యాపారానికీ శ్రీ పుల్లారెడ్డి దేశంలోనే ప్రఖ్యాతిగలవారు. విద్యారంగంలో సమాజానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం, ముఖ్యంగా హిందూ ధర్మానికి మతానికి ఆయన సేవలు అపూర్వం"
పి. వెంటేశ్వర్లు, టిటిడి మాజీఛైర్మన్
పురస్కారాలు
[మార్చు]1991లో ఉడుపి పెజావర్ పీఠం వారు దానగుణ భూషణ అనే బిరుదునిచ్చి సత్కరించారు. 1992లో జమ్నాలాల్ బజాజ్ అవార్డు పొందాడు
మూలాలు
[మార్చు]- ↑ http://www.youtube.com/watch?v=Jb5SyBrNLZc
- ↑ సుదర్శన్, ఎన్.బి. (2007). శ్రీ జి.పుల్లారెడ్డి జైత్రయాత్ర. హైదరాబాదు: లీడ్ ఇండియా. pp. 29, 30.